అమృతగుళికలు : పుష్యరాగాలు
భాగవత పద్యపుష్యరాగాలు
పద్య సూచిక;-
పనుపక చేయుదు రధికులు ;
పరఁగన్ మా మగవార లందఱును ;
పరమపావన! విశ్వభావన! ;
పరుఁ జూచున్ వరుఁ జూచు ;
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు ;
పలుకులు మధురసధారలు ;
పల్లవ వైభవాస్పదములు ;
పాంచాలీ కబరీవికర్షణమహాపాప ;
పాఱఁడు లేచి దిక్కులకు ;
పావనములు దురితలతా ;
పిడుగు పడదు గాక ;
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ ;
పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ ;
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో ;
పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి ;
పున్నాగ కానవే! పున్నాగవందితు ;
పుష్కరం బందు ద్వారకాపురము నందు ;
పూతన యై యొక్క పొలఁతి ;
పెట్టిరి విషాన్న ;
పొడిచినఁ దిట్టినఁ గొట్టినఁ ;
పొలతుల వాలుచూపుల యంద ;
పోఁడను బ్రాహ్మణుండు ;
ప్రాప్తానందులు ;
బలములు గల మీనంబులు ;
(1)
9-558-క.
పనుపక చేయుదు రధికులు
పనిచిన మధ్యములు పొందుపఱతురు తండ్రుల్
పని చెప్పి కోరి పనిచిన
ననిశము మాఱాడు పుత్రు లధములు దండ్రీ!"
భావము:-
నాన్నగారు! యయాతి మహారాజా! ఉత్తములు తండ్రుల ఇంగితం తెలుసుకౌని చెప్పకుండానే పనులు చేసేస్తారు. మధ్యములు చెప్పిన పిమ్మట చేస్తారు. తండ్రులు చెప్పిన పనికి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు చెప్పి చెయ్యకుండా ఉండే కొడుకులు అధములు."
(2)
1-161-మ.
"పరఁగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోపసం
హరణాద్యాయుధవిద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి; పుత్త్రాకృతి నున్న ద్రోణుడవు; నీ చిత్తంబులో లేశముం
గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే?
భావము:-
“ఇంతకుముందు గురువర్యులు ద్రోణాచార్యులవారి సన్నిధిలోనే కదా మా మగవాళ్ళు అందరూ బాణాలు ప్రయోగించటం ఉపసంహరించటం మొదలైన యుద్ధవిద్యలు అన్నీ అభ్యసించారు. అశ్వత్థామా! నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణాచార్యుడవు కదా. అలాంటి నీకు హృదయంలో కనికరం అన్నది ఇసుమంతైనా లేకుండా ఇలా శిష్యుల సంతానాన్ని చంపడం న్యాయమా చెప్పు? నాయనా!
(3)
3-1053-త.
పరమపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా!
శరధిశోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా!
దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా!
ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా!
భావము:-
పరమపవిత్రా! విశ్వభావనా! సముద్రశోషణా! సత్యభాషణా! అపార కృపాగుణ భూషణా! దురితాలనుండి గట్టెక్కించేవాడా! సకల లోకాలను సృష్టించేవాడా! దుండగులను చీల్చి చెండాడేవాడా! ధరిత్రిని పాలించేవాడా! ధర్మాన్ని లాలించేవాడా! దైత్యులను నిర్మూలించేవాడా!
(4)
10.2-178-మ.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.
భావము:-
చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమలు ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కను లెఱ్ఱచేసి, వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది; మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది.
(5)
10.2-733-సీ.
పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు;
మృగపతిద్వితయంబు వృషభయుగము
పావకద్వయము దంతావళయుగళంబు;
దలపడు వీఁక నుద్దండలీలఁ
గదిసి యన్యోన్యభీకరగదాహతులను;
గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ
గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ;
ణములను సింహచంక్రమణములను
10.2-733.1-తే.
గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి
కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి
పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర
ఘనగదాఘట్టనధ్వని గగనమగల.
భావము:-
రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు.
(6)
8-309-క.
పలుకులు మధురసధారలు
దలఁపులు నానా ప్రకార దావానలముల్
చెలుములు సాలావృకములు
చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?
భావము:-
అందగత్తెల మాటలు తియ్యనైన తేనెలు జాలువారుతూ ఉంటాయి. వారి ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్ళవంటివి. అటువంటివారిని విశ్వశించడాలు అంగీకారమైనవి కావు.
(7)
10.1-1713-సీ.
"పల్లవ వైభవాస్పదములు పదములు;
కనకరంభాతిరస్కారు లూరు;
లరుణప్రభామనోహరములు గరములు;
కంబు సౌందర్య మంగళము గళము;
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు;
చక్షురుత్సవదాయి చన్నుదోయి;
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు;
జితమత్త మధుకరశ్రేణి వేణి;
10.1-1713.1-ఆ.
భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటికొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువ భాషణములు;
జలజనయన ముఖము చంద్రసఖము.
భావము:-
“ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎఱ్ఱటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.
(8)
1-177-శా.
పాంచాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్కులం
జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి
ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ జే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్.
భావము:-
నిండుసభలో ద్రౌపద్రిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందనులైన కౌరవుల ఆయుష్షులు క్షీణించాయి; వారందరినీ శ్రీకృష్ణుడు కరుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు; విజయభేరి మ్రోగించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు; ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు.
(9)
7-194-ఉ.
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు;"ఘోరకృత్య" మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు;"కావరే" యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.
భావము:-
ఆ రాక్షసులు ఎంత హింసిస్తున్నా ప్రహ్లాదుడు దూరంగా పారిపోడు; కొడుతుంటే చేతులు అయినా అడ్డం పెట్టుకోడు; చుట్టాల గుంపులోకి దూరి దాక్కోడు; ఇది “ఘోరం, అన్యాయం" అని తండ్రిని నిందించడు; స్నేహితులను సాయం రమ్మనడు; తన తల్లి, సవితి తల్లి మున్నగు తల్లులు నివాసం ఉండే బంగారు మేడల లోనికి పరుగెట్టి, “కాపాడండి" అని గోలపెట్టడు; అసలు బాధపడనే పడడు; వేదన చెందడు. తండ్రిని గానీ, బాధిస్తున్న రాక్షసులను కాని అసహాయంగా చూస్తున్న వారిని కానీ ఎవరినీ ద్వేషించడు; ఎంతటి విచిత్రం, ఇలాంటి పిల్లవాడు ఎక్కడైనా ఉంటాడా?
(10)
1-447-క.
పావనములు దురితలతా
లావనములు నిత్యమంగళప్రాభవ సం
జీవనములు లక్ష్మీ సం
భావనములు వాసుదేవు పదసేవనముల్.
భావము:-
విశ్వమంత ఆత్మగా వసించి ఉండే పరమాత్మ వసుదేవుని ఇంటి పంట, శ్రీకృష్ణుని పాదాల యందలి భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి; సమస్త పాపాలనే బంధనాలను కోసేసే కొడవళ్ళు; శాశ్వత శుభ వైభవాలను సమకూర్చే సాధనాలు; సిరిసంపదల సుప్రదానములు.
శౌనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని, భాగవతుల తోడి సాంగత్య ప్రభావాలను తెలిసిన మహా జ్ఞానులు. వారు హరిభక్తి విశిష్ఠతలను స్మరిస్తు, సూతునికి భాగవతోత్తము డైన పరీక్షిత్తు కథారూప మైన శ్రీమద్భాగవతాన్ని ఉపన్యసించ మని విన్నవించారు.
(11)
10.1-414-తే.
పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు;
ఖండితంబు లగుట గానరాదు;
బాలుఁ డితఁడు; పట్టి పడఁ ద్రోయఁజాలఁడు;
తరువు లేల గూలె ధరణిమీఁద
భావము:-
అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?"
(12)
1-7-శా.
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
భావము:-
అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}
(13)
10.1-536-క.
"పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ;
బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం;
బిట్టివి నూతన సృష్టులు
పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్."
భావము:-
“ఏనాడో పుట్టాను. పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడచిపోయింది. ఇంతవరకూ ఇలా క్రొత్త సృష్టులు పుట్టడం ఎప్పుడూ ఎరుగను. ఔరా! నేను పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా?"
(14)
8-619-ఆ.
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.
భావము:-
ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టేకా నేర్చుకున్నాడా? పుట్టకముందే నేర్చుకున్నాడా? ఇతని పొట్ట నిండా మాయలే అంటు నవ్వి సంతోషంగా భూదానం యిచ్చాడు.
(15)
10.1-310-మత్త.
పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ!
భావము:-
ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు.
(16)
10.1-1010-సీ.
పున్నాగ కానవే! పున్నాగవందితుఁ;
దిలకంబ! కానవే తిలకనిటలు;
ఘనసార! కానవే ఘనసారశోభితు;
బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే మన్మథాకారుని;
వంశంబ! కానవే వంశధరునిఁ;
జందన! కానవే చందనశీతలుఁ;
గుందంబ! కానవే కుందరదను;
10.1-1010.1-తే.
నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ;
గువల వృక్షమ! కానవే కువలయేశుఁ;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;"
ననుచుఁ గృష్ణుని వెదకి ర య్యబ్జముఖులు.
భావము:-
"గజేంద్రునిచే స్తుతింపబడ్డాడు వానిని చూసావా? ఓ పున్నాగ చెట్టు!నుదుట బొట్టు చక్కగా పెట్టుకొనే అతనిని చూసవా? ఓ బొట్టుగ చెట్టు! గొప్ప బలంతో భాసిల్లే వానిని చూసావా? ఓ కర్పూరపు అరటిచెట్టు! చుట్టాలకు చెలికాడైన వానిని చూసావా? ఓ మంకెన చెట్టు! మన్మథుని వంటి చక్కదనం గల వానిని చూసావా? ఓ వెలగ చెట్టు! వేణువు పట్టుకొని వాయిస్తుంటాడు వానిని చూసావా? ఓ వెదురుపొదా! మంచిగంధంలా చల్లటి వానిని చూసావా? ఓ చందనం చెట్టు! మొల్లమొగ్గల్లాంటి పళ్ళు కల అతనిని చూసావా? ఓ మొల్ల చెట్టు! దేవేంద్ర వైభవంతో వెలిగిపోయే వానిని చూసావా? ఓ మరువం చెట్టు! అతడే భూమండలానికే అధినాథుడు వానిని చూసావా? ఓ రేగుచెట్టు! మనోహర మైన విహారాలు కల వానిని చూసావా? ఓ కడప వృక్షమా! అంటు" ఆ గుండ్రని మోముల గొల్లభామలు ఆ అందాల కృష్ణుని వెతుకసాగారు.
శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు సమస్త చరాచర జగత్తు అంతట వసించి ఉండే వాసుదేవుణ్ణి అందాల గోపభామినులు యమునాతీరంలో ప్రేమతో వివశులై పాడుతు వెదుకుతున్న దృశ్యం వర్ణించిన తీరు ఇది
(17)
12-46-తే.
పుష్కరం బందు ద్వారకాపురము నందు
మథుర యందును రవిదిన మందు నెవఁడు
పఠన సేయును రమణతో భాగవతము
వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.
భావము:-
పుష్కరతీర్థంలో కానీ, ద్వారకాపట్టణంలో కానీ, మధురానగరంలోకానీ ఆదివారంనాడు ఆసక్తి పూర్వకంగా భాగవతాన్ని చదివిన భక్తుడు వెంటనే సంసార సాగరాన్ని తరిస్తాడు.
(18)
10.1-1021-సీ.
పూతన యై యొక్క పొలఁతి చరింపంగ;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నే నను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి నని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
10.1-1021.1-ఆ.
నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!
భావము:-
ఓ భరతవంశ ప్రముఖుడైన పరీక్షిన్మహారాజా! ఒక గోపిక పూతన వలె నటిస్తుంటే, కృష్ణునిలా అభినయిస్తున్న ఇంకొక గోపిక స్తన్యం తాగింది. మరొకామె పసిపిల్లాడిలా భావించుకొని పాలకేడుస్తూ, శకటాసురుడిని అని మెలగుతున్న ఇంకో గోపికను కాలితో తన్నింది. మరింకొకామె నేను కృష్ణుణ్ణి అంటు ఉన్నామెను తృణావర్తుడిలా ఎగరేసుకుపోయింది. ఇంకొకర్తె బకాసురుణ్ణి నేను అని విజృంభించగా, ఆమెను మరొకర్తె నేను వాసుదేవుణ్ణి అంటు పరాభవించింది. ఇంతలో ఇద్దరు ఇంతులు బలరామ కృష్ణులు కాగా, మరికొందరు మగువలు గోపకులు, దూడలు అయ్యారు. పసువులం మేం అంటున్న పడతులను పద్మాక్షుడను అనే ఆమె పిలిచింది.
(19)
3-13-క.
పెట్టిరి విషాన్న; మంటం
గట్టిరి ఘనపాశములను; గంగానదిలో
నెట్టిరి; రాజ్యము వెడలం
గొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై.
భావము:-
ధర్మదూరులు కుటిల బుద్ధులు అయి విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు, గంగానదిలోకి నెట్టారు. రాజ్యంనుండి వెళ్ళ గొట్టారు.,
శుకుడు పరీక్షిత్తునకు అసూయా మగ్ను లైన కౌరవులు పాండవుల యెడ చూపిన దుష్టత్వం సూచిస్తున్నాడు
(20)
1-487-క.
పొడిచినఁ దిట్టినఁ గొట్టినఁ
బడుచుందురు గాని పరమభాగవతులు దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ
గొడుకా విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్.
భావము:-
కుమార! కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు, పరమభాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. నీ శాపానికి మన మహారాజు ప్రతిశాపం ఇవ్వడు.
శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. పరమభాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్య మిది.
(21)
9-335-సీ.
పొలతుల వాలుచూపుల యంద చాంచల్య;
మబలల నడుముల యంద లేమి;
కాంతాలకములంద కౌటిల్యసంచార;
మతివల నడపుల యంద జడిమ;
ముగుదల పరిరంభముల యంద పీడన;
మంగనాకుచముల యంద పోరు;
పడతుల రతులంద బంధసద్భావంబు;
సతులఁబాయుటలంద సంజ్వరంబు;
9-335.1-తే.
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం దక్రమంబు;
రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.
భావము:-
శ్రీరాముని పాలనలో ఉన్న రాజ్యం రామరాజ్యం. ఆ రామరాజ్యం అంతా ఎంత ధర్మ బద్ధంగా సాగింది అంటే; స్త్రీల వాలుచూపులలో మాత్రమే చాంచల్యం కనిపించేది; వనితల నడుములలో మాత్రమే పేదరికం ఉండేది; నెలతల తలవెంట్రుకలలో మాత్రమే కౌటిల్యం ఉండేది; తరుణుల నడకలలో మాత్రమే మాంద్యం ఉండేది; నెలతల కౌగలింతలలో మాత్రమే పీడన ఉండేది; కామినుల స్తనాల్లో మాత్రమే ఘర్షణ ఉండేది; సతులతో కలయికల్లో మాత్రమే బంధాలు ఉండేవి; కాంతల ఎడబాటులలో మాత్రమే సంతాపం ఉండేది; ఎవరి ప్రియురాండ్ర మనసు వారు తెలిసి దొంగిలించుటలో మాత్రమే దొంగతనాలు ఉండేవి; ప్రియభార్యలను భర్తలు అడ్డగించి జడలుపట్టుకొని లాగటంలో మాత్రమే అక్రమాలు ఉండేవి;
(22)
10.1-1729-ఉ.
"పోఁ"డను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
రాఁ" డను;"నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్
లేఁ" డను;"రుక్మికిం దగవు లేదిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" డను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.
భావము:-
“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకు వచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు" అని రకరకాలుగా మథనపడుతోంది.
(23)
1-515-శా.
ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణు లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు మీర లార్యులు దయాళుత్వాభిరాముల్ మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా?
సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం జర్చించి భాషింపరే."
భావము:-
మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన బోధనా పారీణులు, ఆత్మతత్వ మెరిగి అవిద్య తొలగిన వారు, సకలము తెలిసిన విజ్ఞులు, దయార్థ్ర హృదయులు, లోకంలోని సమస్త విషయాలను మనోనేత్రాలతో దర్శించగలవారు. మీరు విచారించి ఏడురోజులలో మోక్షంపొందే మార్గం నాకు చెప్పండి. అని గంగానది వద్ద ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తు వచ్చిన ఋషులు సంయమీంద్రులు అందరిని అడుగుతున్నాడు.
(24)
1-379-క.
బలములు గల మీనంబులు
బలవిరహితమీనములను భక్షించు క్రియన్
బలవంతు లయిన యదువులు
బలరహితులఁ జంపి రహితభావముల నృపా!
భావము:-
పెద్దచేపలు అనేక చిన్నచేపలను గుట్టుక్కున మింగుతాయి. అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమకంటే బలహీను లందరిని పగబట్టినట్లు చంపేసారు. అవును జీవులు జీవుల వలననే పుట్టింపబడతారు; పోషింపబడతారు; అంతరింపబడతారు కదా! (ఆవిధంగా అనితరసాధ్యు లైన యాదవులు తుడుచుపెట్టుకుపోయా రని ద్వారకనుండి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నగారికి తెలిపాడు.)