అమృతగుళికలు : పచ్చలు
భాగవత పద్యపచ్చలు
పద్య సూచిక;-
సర్వేశుఁడు సర్వాత్ముఁడు< ;
సాలావృక కపి భల్లుక ;
సూనృతంబుఁ గాని సుడియదు ;
సూరిజనగేయ మగు ;
స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక ;
హంతవ్యుఁడు రక్షింపను ;
హంసతురంగముం బరమహంసము ;
హరికిం బట్టపుదేవి, ;
హరి చరణాంబుజ మకరంద ;
హరినామస్తుతి సేయు ;
హరియుం దన మాయాగతిఁ ;
హరి సర్వాకృతులం గలం డనుఁచుఁ ;
హల కులిశాంకుశ ;
హవరూపివి హవనేతవు ;
(1)
6-220-క.
సర్వేశుఁడు సర్వాత్ముఁడు
సర్వగతుం డచ్యుతుండు సర్వమయుండై
సర్వంబుఁ జేరి కొలువఁగ
సర్వగుఁడై దక్షునకుఁ బ్రసన్నుం డయ్యెన్.
భావము:-
సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, సర్వమయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు.
(2)
1-122-క.
సాలావృక కపి భల్లుక
కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్
భావము:-
తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.
(3)
8-643-ఆ.
సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!
భావము:-
ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా!
మూడడుగులు దానంగా గ్రహించిన, వామనుడు త్రివిక్రమావతారం ధరించి రెండు అడుగులలో మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు, సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి ‘నీ పాదం నా తలమీద పెట్టు పరమేశా!’ అని ఇలా సమాధానం చెప్తున్నాడు
(4)
3-15-తే.
సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ
విలస దవభృథస్నాన పవిత్రమైన
దౌపదీ చారు వేణీభరంబు పట్టి
కొలువులోపల నీడ్చిరి కుత్సితమున.
భావము:-
పండితవరేణ్యుల ప్రశంసలు అందుకొనెడి రాజసూయ యాగంలో పుణ్యవంత మైన అవభృథస్నానంతో పరమ పవిత్రమై ఒప్పారుతున్న ద్రుపదమహారాజు పుత్రిక పాంచాలి కొప్పు పట్టుకొని పరమ నీచంగా నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు.
(5)
8-195-మత్త.
స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కఁబట్టి మథింపఁగాఁ
బుచ్ఛ మేటికి మాకుఁ బట్టఁగఁ? బూరుషత్వము గల్గి మే
మచ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికి? నిండు మాకు ఫణాగ్రముల్ .
భావము:-
“మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుని చిలుకుతారా? మేము తుచ్ఛమైన తోక పట్టుకోవాలా? ఇది మాకు చాల అవమానకరం, మేము గొప్ప పౌరుషమూ, తపస్సూ, విద్యలూ, బలమూ కలవారము. మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి" అని రాక్షసులు వాదించారు
(6)
7-189-క.
హంతవ్యుఁడు రక్షింపను
మంతవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంతవ్యుఁడు వధమున కుప
రంతవ్యుం డనక చంపి రం డీ పడుచున్."
భావము:-
ఇతడు చంపదగినవాడు. ఏ మాత్రం క్షమించదగినవాడు కాడు. ప్రహ్లాదుడు తక్షణం యమపురికి పంపదగినవాడు. తప్పులు మన్నించకండి. జాలి పడి విడిచిపెట్టకుండా వధించి రండి."
(7)
6-3-ఉ.
హంసతురంగముం బరమహంసము నంచితదేవతా కులో
త్తంసము నాగమాంత విదితధ్రువపుణ్యరమావతంసమున్
కంసజిఘాంసు నంశమును గర్బురసూత్ర సమావృతాంసమున్
హింస నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్.
భావము:-
హంస వాహనుడు, పరమహంస ఐనవాడు, దేవతలలో ఉత్తముడు, వేదాంతంలో నిక్షిప్తమైన పుణ్యపు శోభ కలవాడు, కంసమర్దనుడైన వాసుదేవుని అంశావతార మైనవాడు, బంగారపు యజ్ఞోపవీతం కలిగిన భుజాగ్రం కలవాడు, హింసను అణచివేసేవాడు అయిన బహ్మదేవుణ్ణి గొప్ప శుభాలకోసం భజిస్తాను.
(8)
1-11-మ.
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
భావము:-
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక.
(9)
5.1-5-క.
"హరి చరణాంబుజ మకరం
ద రసావేశిత మనః ప్రధానుండగు స
త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ
బొరసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్
భావము:-
“విష్ణుమూర్తి పాదపద్మాల మకరంద రసపానంలో లీనమై పరవశించిన మనస్సు కలిగిన మంచి మనుష్యుడు ఒకవేళ ఆటంకాలు అడ్డు తగిలినా తన పూర్వ మార్గాన్ని వదలి పెట్టడు.
(10)
1-96-మ.
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ
కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.
భావము:-
పరాశర పుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ దుర్గందాలతో, కాకోలవిషాలతో కూడిన బురదగుంట లాగ ఉంటుంది. అది శోభంకరం కాదు.
(11)
3-226-క.
హరియుం దన మాయాగతిఁ
బరికించియుఁ గానడయ్యె బరిమితి లేమిన్
మఱి మాయా వినిమోహిత
చరితముఁ గనుఁగొందు రెట్లు చతురాస్యాదుల్.
భావము:-
ఓ మహానుభావా! విదురా! ఆ హరికూడా అనంతమైన తన మాయావ్యవహారాన్ని అవగాహనం చేసుకోలేక పోయాడంటే మాయావిని అయిన ఆ మహామోహుని ప్రభావం బ్రహ్మాదులకు మాత్రం ఎలా అంతుపట్టుతుంది.
(12)
7-277-మ.
"హరి సర్వాకృతులం గలం" డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై "యెందును లేఁడు లేఁ" డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్.
భావము:-
ఈ విధంగా ప్రహ్లాదుడు "భగవంతుడు సర్వ నామ రూపధారులందు అంతట ఉన్నాడు." అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు "ఎక్కడా లేడు" అంటూ బెదిరిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.
భక్తాగ్రేసర కృషీవలుడు అందించిన మధుర మైన పంటలలో ముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి అతను ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాద చరిత్రలో కథ చాలా బలమైంది, కవిత్వం మిక్కిలి ఉన్నత మైంది, సాహిత్యం ఉత్కృష్ట మైంది, విలువలు అపార మైనవి. కథానాయకుడు కొడుకు ప్రహ్లాదుడు {ప్రహ్లాదుడు – ప్ర (విశిష్ట మైన) హ్లాదుడు (ఆనందము కల వాడు), విష్ణుభక్తుడు} పరమ భక్తుడు సాత్వికుడు ఓర్పు శ్రద్ధలకు మారు పేరు. ప్రతినాయకుడు తండ్రి హిరణ్యకశిపుడు {హిరణ్యకశిపుడు – హిరణ్యము (బంగారము, అగ్నిదేవుని సప్త జిహ్వలలో ఒకటి) కశిపుడు (పరపు, విరివి కల వాడు), దానవుడు} పరమ బలాఢ్యు డైన రాక్షసుడు తమోగుణ పరాకాష్ఠ. మరి కథలో బలానికి లోటే ముంటుంది. చదివించిరి, దిక్కులు గెలిచితి, కల డంభోధి, ఇందు గల డందు లాంటి పద్యాలలోని కవిత్వ సాహిత్య సౌరభాలే కదా వాటిని పండిత జనసామాన్య నాలుకలపై నానేలా చేసినవి. ఎన్ని కష్టా లెదురైనా చెక్కు చెదరని భక్తుల ప్రపత్తి నిబద్ధతతో కూడిన భక్తుల విలువలు. నారసింహ తత్వపు భక్తుని ఎడ భగవంతుడు చూపే అత్యద్భుత మైన వాత్యల్య విలువలు తిరుగు లేనివి. ఎంతటి భయంకర మైన పరిస్థితులలో ఉన్నా ఈ పద్యం మననం చేస్తు ఉంటే ఎట్టి పరిస్థితులలో మేలే తప్ప కీడు జరగదు అన్నది జగద్వితమే.
ఓం నరసింహ వషట్కారాయః నమః
(13)
3-929-సీ.
హల కులిశాంకుశ జలజధ్వజచ్ఛత్ర;
లాలిత లక్షణలక్షితములు
సలలిత నఖచంద్రచంద్రికా నిర్ధూత;
భక్తమానస తమఃపటలములును
సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ;
మండిత హరజటామండలములు
సంచిత ధ్యానపారాయణజన భూరి;
కలుష పర్వత దీపకులిశములును
3-929.1-తే.
దాసలోక మనోరథదాయకములు
జారుయోగి మనఃపద్మ షట్పదములు
ననగఁ దనరిన హరిచరణాబ్జములను
నిరుపమధ్యానమున మది నిలుపవలయు.
భావము:-
హలం, వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం, ఛత్రం మొదలైన మంగళకరమైన రేఖలు కలవీ, చంద్రుని వెన్నెల వెలుగులవంటి గోళ్ళకాంతులతో భక్తుల మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని దూరం చేసేవీ, మనోజ్ఞమైన కాలి బొటనవ్రేలినుండి పుట్టిన గంగాతీర్థంచే శివుని జటాజూటాన్ని అలంకరించేవీ, భక్తితో ఆసక్తితో ధ్యానించే భక్తుల పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలా పటాపంచలు చేసేవీ, దాసుల కోర్కెలు తీర్చేవీ, యోగుల హృదయాలనే పద్మాలలో విహరించే తుమ్మెదల వంటివీ అయిన హరి పాదపద్మాలను నిరంతరం హృదయాలలో స్మరిస్తూ ఉండాలి.
(14)
3-427-క.
హవరూపివి హవనేతవు
హవభోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
హవరక్షకుఁడవు నగు నీ
కవితథముగ నుతులొనర్తు మయ్య; ముకుందా!
భావము:-
భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. వరహావతారుడా! నీవు యజ్ఞ స్వరూపుడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, యజ్ఞఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవు, ముకుందుడవు; సమస్తము నీవే; నీకు హృదయ పూర్వకంగా కీర్తిస్తున్నాము.