శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణీ జననంబు
7
"వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం
డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం
డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై
మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.
భావము:-
“విను. విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.
8
బాలేందురేఖ దోఁచిన
లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ
పాలుని గేహము మెఱసెను
బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.
భావము:-
ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.
{ఆమె కుటుంబంలో జన్మించింది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన అంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?}
9
మఱియును దినదినప్రవర్ధమాన యై.
భావము:-
అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.
10
పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు;
నబలలతోడ వియ్యంబు లందు;
గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి;
చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;
రమణీయ మందిరారామ దేశంబులఁ;
బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;
సదమల మణిమయ సౌధభాగంబుల;
లీలతో భర్మడోలికల నూఁగు;
బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;
శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు;
బర్హి సంఘములకు మురిపములు గఱపు;;
మదమరాళంబులకుఁ జూపు మందగతులు.
భావము:-
బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆటలాడుతోంది. గుజ్జెన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది
11
అంత.
భావము:-
అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు.
12
దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ;
వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ;
గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ;
గాంతి నింతికి ముఖకమల మొప్పె;
మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ;
బొలఁతికి జనుదోయి పొడవు జూపె;
శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ;
జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె;
హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ, గేశ
బంధ మధిక మగుచు బాలకమరెఁ;
బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార
నెలఁత యౌవనంబు నిండి యుండె.
భావము:-
కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిస లాడుతోంది.
ప్రజల నాలుకలపై నానుతుండే ఒక వృత్తాంతము చూద్దాము. పోతన గారు ఈ పద్యం వ్రాస్తూ, “బాల కమరె” వరకు వ్రాసారుట. అదే సమయంలో వారి , ఇంట్లో ఆడుకుంటున్న చిన్నపిల్ల, నిప్పులపై పడిందిట. జుట్టు కాలుతుందని అందరూ కంగారు పడుతున్నారట. (కమరె అంటే కాలు అనే అర్థం ఉంది కదా.) ఇంతలో, ఇదేమీ తెలియని పోతనగారు తన సహజధోరణిలో “బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార నెలఁత యౌవనంబు నిండి యుండె”. అని పూరించగానే ఏ ఇబ్బంది లేకుండ పిల్ల నిప్పులనుంచి బయటపడిందట.
13
ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున.
భావము:-
ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.
14
తన తండ్రి గేహమునకుం
జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ
ష్ణుని రూప బల గుణాదులు
విని, "కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ"డని తలఁచెన్.
భావము:-
తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.
15
ఆ లలన రూపు, బుద్ధియు,
శీలము, లక్షణము, గుణముఁ జింతించి తగన్
"బాలారత్నముఁ దన కి
ల్లాలుగఁ జేకొందు" ననుచు హరియుం దలఁచెన్.
భావము:-
ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ధి, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందా మనుకొన్నాడు.
16
అంత.
భావము:-
అలా రుక్మిణి యౌవనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో
17
బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద" మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున" కంచుఁ దలంచె నంధుఁడై.
భావము:-
రుక్మిణిని బంధువు లంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.