ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట
- ఉపకరణాలు:
దిక్కుల రాజుల నెల్లను
మక్కించి ధనంబు గొనుట, మయకృతసభ ము
న్నెక్కుట, జన్నము సేయుట,
నిక్కము హరి మనకు దండ నిలిచినఁ గాదే?
టీకా:
దిక్కుల = దిక్కుల కల; రాజులను = రాజులను; ఎల్లను = అందరిని; మక్కించి = గెలిచి; ధనంబున్ = ధనమును; కొనుట = తీసుకొనుట; మయ = మయునిచేత; కృత = కట్టబడిన; సభ = సభా భవనమును; మున్ను = ముందు; ఎక్కుట = అధిరోహించుట; జన్నము = యజ్ఞము; సేయుట = చేయుట; నిక్కమున్ = నిజమునకు; హరి = కృష్ణుడు; మన = మన; కున్ = కు; దండన్ = ప్రాపుగ; నిలిచినన్ = నిలబడుటవలననే; కాదే = కాదా.
భావము:
నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాసులను కైవసం చేసుకొన్నదీ, మయసభను అందుకొన్నదీ, రాజసూయ మహాయాగం నిర్వర్తించిందీ నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిల్చినందువల్లనే కదా!