అమృతగుళికలు : మరకతాలు
భాగవత పద్యమరకతాలు
పద్య సూచిక;-
మన్నాఁడవు చిరకాలము ; ఆ రాజకన్య ప్రియమున ; ఆడం జని ; ఆతత సేవఁ జేసెద ; ఆ తేరా రథికుండు ; ఆదిదేవుఁడైన యా రామచంద్రు ; ఆ యెలనాగ నీకుఁ దగు ; ఆరాటము మది నెఱుఁగము ; ఇందిందిరాతిసుందరి ; ఇందీవరశ్యాము, ; ఇచ్చెలువఁ జూచి ; ఇమ్మగువ దన్ను వాకిటఁ ; ఈ హేమంతము రాకఁ జూచి ; ఈ రీతి శ్రీకృష్ణుఁ డేపార ; ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ ; ఈ సౌకుమార్య ; ఉద్రేకంబున రారు ; ఉన్నారము సౌఖ్యంబున ; ఎంత కాలము గృష్ణుఁ ; ఎట్టెట్రా? మనుజేంద్రు చేలములు ; ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; ; ఎల్లప్పుడు మా యిండ్లను ; ఏ కీడు నాచరింపము ; ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు ;
(1) 1-43-క.
మన్నాఁడవు చిరకాలము
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.
భావము:- చక్కటి గోష్ఠులలో, మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు.
(2) 10.2-128-క.
ఆ రాజకన్య ప్రియమున
నారాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో
కారాధితు మాధవుఁ దన
కారాధ్యుండైన నాథుఁ డని కోరె నృపా!
భావము:- రాజకుమార్తె నాగ్నజితి ఆరాధనా భావంతో మోహనకారుడూ, పద్మనేత్రుడూ, త్రిలోకపూజితుడూ, ఐన మాధవుడే తనకు భర్త కావాలని భావించింది.
(3) 10.1-311-క.
ఆడంజని వీరల పెరు
గోడక నీ సుతుఁడు ద్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
భావము:- లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది.
(4) 1-3-ఉ.
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
భావము:- చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చు వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను.
(5) 1-376-శా.
ఆతేరా రథికుండు నా హయము లా యస్త్రాసనం బా శర
వ్రాతంబన్యులఁ దొల్లి జంపును దుదిన్ వ్యర్థంబు లైపోయె మ
చ్చేతోధీశుఁడు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా
యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్.
భావము:- (అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణానంతంరం వెనుకకు హస్తిన చేరి అన్నగారు ధర్మరాజువద్ద వాపోతున్నాడు.) ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ గుఱ్ఱాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్ని ఇదివరకటివే అయినా నిరుపయోగ మైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటిపఱ్ఱ ఐన పొలంలో చల్లిన విత్తనాల్లా అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి.
(6) 9-359-ఆ.
ఆదిదేవుఁడైన యారామచంద్రుని
కబ్ధి గట్టు టెంత యసురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.
భావము:- దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి, ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంతపని? రాక్షససంహారం అనగా ఎంతపని? ఆయనకు వానరులు తోడా అది ఏపాటిదనవచ్చు?
(7) 10.1-1714-ఉ.
ఆయెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యములేల? నీవు నీ
తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."
భావము:- ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము."
(8) 1-252-క.
ఆరాటము మది నెఱుఁగము
పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ
జోరాటన మెగయదు నీ
దూరాటన మోర్వలేము తోయజనేత్రా!
భావము:- కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు దూరప్రాతాంలకు వెళ్ళి నప్పుడు నీ వియోగాన్ని సహించలే మయ్యా.
(9) 9-603-క.
ఇందిందిరాతిసుందరి
యిందిందిరచికుర యున్న దిందింద; శుభం
బిం దిందువంశ; యను క్రియ
నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్.
భావము:- “ఓ చంద్రవంశోద్ధారకా! లక్ష్మీదేవికంటె అందగత్తె, తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. ఇక్కడ నీకు శుభం కలుగుతుంది." అన్నట్లుగా కలువపూలల్లో తిరుగుచున్న తుమ్మెదలు ఝంకారాలు చేశాయి.
(10) 10.2-979-సీ.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ;
గరుణాలవాలు, భాసురకపోలుఁ
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు;
సురచిరలావణ్యు, సుర శరణ్యు
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు;
ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,
ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ;
బన్నగశయను, నబ్జాతనయను,
10.2-979.1-తే.
మకరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు
భావము:- నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ; దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు,
(11) 10.1-317-క.
ఇచ్చెలువఁ జూచి "మ్రుచ్చిలి
యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద; నాతో
వచ్చెదవా?" యని యనినాఁ
డిచ్చిఱుతఁడు; సుదతి! చిత్ర మిట్టిది గలదే?
భావము:- ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా" అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు.
(12) 10.1-315-క.
ఇమ్మగువ దన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మోవిఁ గఱచి వడిఁ జనె
నమ్మా!యీ ముద్దుగుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.
భావము:- ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా.
(13) 10.1-806-శా.
ఈహేమంతము రాకఁ జూచి రమణీహేలాపరీరంభ స
త్సాహాయ్యంబునఁగాని దీని గెలువన్ శక్యంబుగా దంచుఁ దా
రూహాపోహవిధిం ద్రిమూర్తులు సతీయుక్తాంగు లైనారు గా
కోహో!వారలదేమి సంతత వధూయోగంబు రాఁ గందురే?
భావము:- హేమంత ఋతువు రావటం చూసి కామినుల విలాసవంతమైన బిగికౌగిళ్ళ తోడ్పాటుతో కాని దీని చలిని జయించటం వీలుపడ దని ఊహించుకొన్నట్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు సరస్వతీ, లక్ష్మీ, పార్వతులను ముగ్గురిని తమ తమ దేహాల యందే ధరించారు. ఔనౌను, ఇదే కారణం లేకపోతే ఆ త్రిమూర్తులు స్త్రీమూర్తుల సదా సాంగత్యం కలిగి ఉండరు కదా.
(14) 11-7-సీ.
ఈరీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా;
శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేనుప్రలంబక;
దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి;
యటమీఁదఁ గురుబలం బణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన;
నతఁడు భూపాలనం బమరఁ జేసె
11-7.1-తే.
భక్తులగు యాదవేంద్రులఁ బరఁగఁ జూచి
"యన్యపరిభవ మెఱుఁగ రీ యదువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు. "
భావము:- ఇలాగ, మహానుభావుడైన శ్రీకృష్ణుడు అతిశయించి; పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు మున్నగు రాక్షసులను; చాణూర, ముష్టికులను; కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతవక్త్రులను సంహరించాడు. అంతేకాక కౌరవసైన్యాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరుల వలన ఓటమి లేని వారు. వీరిని సంహరించడానికి నేను తప్ప మరొక దైవం ముల్లోకాల యందు లేడు" అని ఆలోచించాడు
(15) 1-213-ఆ.
ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
నతనిమాయలకు మహాత్ములు విద్వాంసు
లడఁగి మెలగుచుందు రంధు లగుచు.
భావము:- పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు. ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియనివారై, లోబడి అణిగి మణిగి ఉంటారు.
(16) 3-728-క.
“ఈ సౌకుమార్య మీ వయ
సీసౌందర్యక్రమంబు నీధైర్యంబు
న్నీ సౌభాగ్యవిశేషము
నేసతులకుఁ గలదు చూడనిది చిత్ర మగున్."
భావము:- “ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది".
(17) 1-163-శా.
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటానీచేతు లెట్లాడెనో?
భావము:- ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే; లవలేకం కూడా నీకు అపకారం చేయలేదే; అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?
(18) 1-251-క.
ఉన్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్
మన్నారము ధనికులమై
కన్నారము తావకాంఘ్రికమలములు హరీ!
భావము:- కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.
(19) 1-328-మత్త.
ఎంతకాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు మీ
రంతకాలము నుండుఁ డందఱుఁ నవ్వలం బనిలేదు, వి
భ్రాంతిమానుము కాలముం గడవంగ నెవ్వరు నోప రీ
చింతయేల నరేంద్రసత్తమ! చెప్పెదన్ విను మంతయున్.
భావము:- (నారదుడు ధృతరాష్ట్రాదుల గురించి కలత చెందిన ధర్మరాజుకి కాలసూచన చేస్తున్నాడు.) “మహారాజా! కలవరపాటు వదలిపెట్టు. శ్రీకృష్ణ భగవానుడు ఎంత వరకు ఈ భూమ్మీద ఉంటాడో, అప్పటి దాకా మీ పాండవులు అందరు కూడ ఉండండి. ఆయన అవతారం చాలించిన పిమ్మట మీరు ఉండనక్కర్లేదు; ఎంతటి వారైనా సరే కాల ప్రభావానికి తలవంచాల్సిందే. ధృతరాష్ట్రాదులకు ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తా. విను; ఇంకా దుఃఖించటం అనవసరం.
(20) 10.1-1260-శా.
"ఎట్టెట్రా? మనుజేంద్రు చేలములు మీ కీఁబాడియే? మీరలుం
గట్టంబోలుదురే? పయో ఘృత దధి గ్రాసంబులన్ మత్తులై
యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కెబ్బంగి నోరాడెడిన్;
గట్టా!ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్ బాలకా!
భావము:- ఎలాగెలారా? ఒరే కుఱ్ఱాడా! మహారాజు బట్టలా? మీకివ్వచ్చుట్రా? ఇలాంటి బట్టలు మీరు కట్టగలరుట్రా? పాలు నెయ్యి పెరుగులు మెక్కి తలకొవ్వెక్కి ఇలా కూశారుగాని. లేకపోతే గొల్లపిల్లలకు మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యబాబోయ్! కంసమహారాజు గారి ఆవేశానికి ప్రాణాలు పోగొట్టుకుంటారురోయ్!
(21) 8-596-మత్త.
ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్త మొల్లదు సత్తమా! "
భావము:- మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముందు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."
(22) 1-275-క.
ఎల్లప్పుడు మా యిండ్లను
వల్లభుఁడు వసించు; నేమ వల్లభలము శ్రీ
వల్లభున కనుచు గోపీ
వల్లభుచే సతులు మమతవలఁ బడి రనఘా!"
భావము:- పుణ్యవంతుడైన శౌనక! మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడు వదలిపెట్టడు, రమావల్లభు డైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తు ఆ భామ లందరు యశోదానందనుని వలపుల వలలో చిక్కుకొన్నారు."
(23) 1-479-క.
"ఏ కీడు నాచరింపము
లోకులకున్ మనము సర్వలోక సములమున్
శోకింప నేల పుత్రక
కాకోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్."
భావము:- "నాయనా! మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా. మనం, లోకంలో అందరిని సమానంగానే చూస్తాం కదా. అయినా, నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?"
అని తండ్రి యైన శమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు.
(24) 10.1-1704-సీ.
ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక;
దేహతాపంబులు దీఱిపోవు
నేనీ శుభాకార మీక్షింపఁ గన్నుల;
కఖిలార్థలాభంబు గలుగుచుండు
నేనీ చరణసేవ యేప్రొద్దు చేసిన;
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నేనీ లసన్నామ మేప్రొద్దు భక్తితోఁ;
దడవిన బంధసంతతులు వాయు
10.1-1704.1-తే.
నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
భావము:- శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచ లౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.