పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భూమ్యుద్ధరణంబు

  •  
  •  
  •  

3-421-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలశీతాంశురేఖా విభాసమాన
వళ దంష్ట్రాగ్రమున నున్న రణి యొప్పె
రికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ.

టీకా:

బాల = లేత; శీతాంశు = జాబిల్లి {శీతాంశుడు - చల్లటి అంశ కలవాడు, చంద్రుడు}; రేఖా = వంక వలె; విభాసమాన = ప్రకాశిస్తున్న; ధవళ = తెల్లని; దంష్ట్రా = కోరల; అగ్రమునన్ = కొన లందున; ఉన్న = ఉన్నట్టి; ధరణి = భూమి; ఒప్పెన్ = చక్కగా సరిపోయినది; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడూ; అనపాయని = అసలు విడువకుండునది; ఐన = అయినట్టి; లక్ష్మి = లక్ష్మీదేవి; నెఱయన్ = నిండుగా; పూసిన = పూసినట్టి; కస్తూరి = కస్తూరి అను సుగంధ ద్రవ్యము; నికరము = ముద్ద; అనగన్ = అన్నట్లు.

భావము:

పాడ్యమి నాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న వరహావతారుడి తెల్లని కోరకొనపై నున్న ఆ భూమి, స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి పంకంలా, కనిపించింది.