శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణీకల్యాణ కథారంభము
1
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
భావము:-
శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.
2
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
భావము:-
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించి నట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజు లందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.
3
అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; అదియునుం గాక.
^ అష్టవిధ వివాహములు
భావము:-
అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. .
4
కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై
కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.
భావము:-
శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. వాటిని విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా. రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు.
5
భూషణములు చెవులకు బుధ
తోషణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."
భావము:-
గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."
6
అని రా జడిగిన శుకుం డిట్లనియె.
భావము:-
ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.