శ్రీరామ

up-arrow

ఓం నమో భగవతే వాసుదేవాయ
తెలుగు భాగవతములోని పేర్ల కోశము
(నిర్మాణంలో ఉంది - సవరణలు సూచనలు అందించండి)


  1) తక్కరి- ( ){జాతి}[మానవ యోని]:- తక్కరి అంటే టక్కులమారి. జంటమద్దులను కూల్చడానిక రోలీడ్చుకుని వెళ్తున్న కృష్ణుని తక్కరిబిడ్డడు అని వర్ణించారు పోతన.
గోపకులనుగోవులను దాచిన బ్రహ్మదేవుడు మరల వచ్చి చూసి ఆశ్చర్యపోవునప్పుడు, బ్రహ్మదేవుని తక్కరిగొంటు అన్నారు పోతన - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-400-క.

  2) తక్కోల - ( ){జాతి}[వృక్ష]:- తక్కోలము - ఒక జాతి వృక్షము. ఇవి చతుర్థ స్కంధములోని కైలాస పర్వత వర్ణనలోనూ; అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములోనూ .... వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క., 10.1-677-వ.

  3) తక్రము- ( ){జాతి}[ఆహారం]:- తక్రము అంటే మజ్జిగ. పృథుమహారాజు రాజ్యంలో "మఱియుఁ దరువులు ఘనతరాకారంబులు గలిగి మకరంద స్రావు లగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర పానకాదికంబులును వర్షింప నవి యెల్ల నదులు వహించె;" నట - వంశం - ఆహారం; పద్య సం.(లు) - 4-510-వ.

  4) తక్షకుడు-1 (పురుష){సంజ్ఞా}[నాగుడు]:- ఇతడు జ్యేష్ఠ (శుక్ర) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో మిత్రుడు అను పేరుతో, మేనక, అత్రి, తక్షకుడు, పౌరుషేయుడు, హాహా, రథస్వనుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - నాగుడు; పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

  5) తక్షకుడు-2 (పురుష){సంజ్ఞా}[నాగ యోని]:- పరీక్షిత్తును కాటేసిన ఒక సాటిలేనిమేటి సర్పము, మహాతలంలో కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సాటిలేని మేటిరూపం కల సర్ప ముఖ్యు లున్నారు. మహాతలంలో కద్రువ కొడుకులైన కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలైన సర్ప ముఖ్యులు గరుత్మంతుని వల్ల భయంతో కలవరపడుతూ ఉంటారు.
పరీక్షిత్తు జన్మించినప్పుడు బ్రాహ్మణులు అతని భవిష్యత్తు చెప్తూ, ఇతను తక్షకుని విషాగ్నికి మరణం అని తెలుకుని సర్వసంగపరిత్యాగి యై పుణ్యలోకాలకు చేరుకుంటాడు అని చెప్పారు.
శమీకముని కుమారుడైన శృంగి, తపస్సులో ఉన్న తన తండ్రి మెడలో చచ్చిన పాము వేసాడని కోపంతో పరీక్షిత్తును ఏడు (7) దినములలో తక్షకుని విషాగ్నికి మరణించుగాక అని శపించాడు. అది వినిన శమీకుడు తప్పుచేసావు అని కొడుకును నిందించి. మహారాజు పరీక్షిత్తుకు విషయం తెలియజేసాడు. అంతట పరీక్షిత్తు సర్వసంగ పరిత్యాగంచేసి, గంగ ఒడ్డున ఉండగా మునులు, ఋషులు వచ్చారు. పిమ్మట శుకబ్రహ్మ వచ్చి మోక్షమార్గం చెప్పమనిన పరీక్షిత్తునకు భాగవతం చెప్పాడు. కనుక దీనికి పారిక్షితమను నామాతరం కలదు.
భూదేవి పృథుమహారాజుకి చెప్పిన సలహా ప్రకారం అహి దందశూక సర్ప నాగాలు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని పితికాయట. - వంశం - నాగ యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - కద్రువ; పద్య సం.(లు) - 5.2-119-వ., 1-296-వ., 1-439-వ., 1-473-ఉ., నుండి 1-507-క.. 4-502-వ., 9-678-ఆ.,12.26-వ.

  6) తగళ్ళు- (స్త్రీ){జాతి}[జంతు]:- తగళ్ళు అంటే పొట్టేళ్ళు. ఊర్వశి పురురవునకు పెట్టిన రెండు నిబంధనలలో ఒకటి తన పెంపుడు తగళ్ళను కాపాడాలని. - వంశం - జంతు; పద్య సం.(లు) - 9-364-మ.

  7) తట - ( ){జాతి}[ప్రదేశము]:- కొండ చరియలు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  8) తటి- ( ){జాతి}[ప్రదేశము]:- ఒడ్డు, గట్టు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-51-సీ.,

  9) తత్త్వదర్శుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- రాబోయే కాలంలో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో విష్ణువు దేవహోతకూ బృహతికీ యోగవిభుడు అనే పేరుతో పుడతాడు. నిర్మోహుడూ, తత్త్వదర్శుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-425-వ.,

  10) తపతి- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ఛాయాదేవి భర్త సూర్యుని వలన కొడుకులు సావర్ణి, శనైశ్చరులను, కూతురు తపతిని పొందింది. ఆ తపతి సంవరణుని వివాహమయ్యెను. వారికి కురువు జన్మించెను. అతనిపేరనే కురుక్షేత్రం ఏర్పడెను. - వంశం - దేవయోని; తండ్రి - సూర్యుడు; తల్లి - ఛాయాదేవి; భర్త - సంవరణుడు; కొడుకు(లు) - కురువు; పద్య సం.(లు) - 6-258-వ., 8-413-సీ., 9-659-వ.,

  11) తపనీయాద్రి- ( ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతానికి మరొక పేరు - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-39-క.,

  12) తపసులు- (పురుష){జాతి}[ఋషి]:- తపసులు తపస్సు చేయువారు, భాగవతంలో చాలా చార్లు ఈ పదం వస్తుంది. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-83-సీ., ....

  13) తపస్యమాసము- ( ){సంజ్ఞా}[కాలము]:- తపస్యమాసము అంటే ఫాల్గుణ మాసము; 12) ఫాల్గుణమాసంలో సూర్యుడు క్రతువు అనే పేరుతో విరాజిల్లుతాడు. సహస్రకిరణుడు, చాతుర్యకళా లోలుడు అయి బుద్ధిమంతులు ప్రశంసించేలా కాలాన్ని పరిపాలిస్తాడు. ఈ నెలలో అతనికి వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు, అనేవారు పరిచరులుగా చేరి సంచరిస్తుంటారు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 12-44-క., 12-45-వ.

  14) తపస్వి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పన్నెండవదైన భద్రసావర్ణి మన్వంతరంలో తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-423-వ.,

  15) తపస్సు- ( ){జాతి}[విద్య]:- తపస్సు పదం అనేకమార్లు వస్తుంది. ఆ పద్యసంఖ్యలు ఇవ్వటంలేదు.
ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన స్థానలలో ఒకటి. రుద్రుడు కాలుడు నామం కలిగి భార్య ఇరావతితో, తపస్సు స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-369-క.,., 3-370-వ.,

  16) తపోమూర్తి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- పన్నెండవదైన భద్రసావర్ణి మన్వంతరంలో తపోమూర్తి, తపస్వి, అగ్నీధ్రకుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-423-వ.,

  17) తపోలోకము- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- చతుర్దశలోకాలలో ఏడు ఊర్ధ్వలోకాలు. వాటిలో ఐదవది తపోలోకము. ఇది విష్ణుమూర్తి లలాటము (నుదురు).
పాఠ్యంతరంలో తపోలోకము విష్ణుమూర్తి స్తనద్వయము.
వరాహమూర్తి కావించిన ఘూర్జురావమునకు బ్రహ్మాండభాండం అంతా దధ్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలలోని మంత్రాలతో, ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు.
ఆదివరాహమూర్తి పాతాళంనుండి బయటికి వస్తూ సముద్రజలాలతో తడిచిన తన శరీరాన్ని విదిలించగా మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా చిందాయి. పరమపవిత్రాలయిన ఆ జలబిందువులలో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో, నివసించే వారంతా ఎంతగానో పరిశుద్ధులయ్యారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-16-వ., 2-89-వ., 3-435-చ.,

  18) తప్తోర్మి- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
అన్యాయంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని, రత్నాలను, విలువైన వస్తువులను దొంగిలిచినవానికి అగ్నితప్తం అనే నరకం. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-136-వ., నుండి 5.2-164-వ.,

  19) తమాల - ( ){జాతి}[వృక్ష]:- తమాల వృక్షములు అంటే చీకటిమానులు - ఇవి ప్రథమాది స్కంధాలలో చెప్పబడినవి. ప్రథమ స్కంధములో తమాల వృక్షం తీవెను ధరించినంత సులువుగా పోతనకు ప్రత్యక్షమైన శ్రీరాముడు బలువిల్లును ధరించాడని వర్ణించబడింది. చతుర్థ స్కంధములో వెండికొండ వర్ణనలో చెప్పబడింది. అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-16-సీ., 3-42-చ., 4-135-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  20) తమ్మిచూలి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తమ్మిచూలి అంటే పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు.
ఆ తమ్మిచూలి సైతం భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నా అని చెప్పలేరు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-19-ఆ., 7-384-వ., 8-707-వ., 10.1-18-వ.

  21) తరంగిణీ - ( ){జాతి}[ప్రదేశము]:- తరంగిణి అంటే సెలయేరు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో మున్నగుచోట్ల వర్ణించబడ్డాయి. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-439-వ., 1-508-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  22) తరక్షు- (స్త్రీ){జాతి}[జంతు]:- తరక్షు అంటే సివంగి. పరీక్షిత్తు వేటలో తరక్షులను కూడా వేటాడేడు. - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-456-క.,

  23) తరణి-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తరణి అంటే సూర్యుడు (చీకటి నుండి తరింపజేయువాడు) - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-338-సీ., 3-750-సీ., 3-755-మ.,

  24) తరణి-2 ( ){జాతి}[పరికరము]:- తరణి అంటే తెప్ప (నదిని లేదా సాగరాన్ని తరించు దాటించునది) - వంశం - పరికరము; పద్య సం.(లు) - 4-630-మ., 6-415-తే.,

  25) తరణి-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- తరణి ఒక ఋషి. చిత్రకేతోపాఖ్యానంలో అలవిమాలిన పుత్రశోకంతో నున్న చిత్రకేతుని వద్దకు వచ్చిన అంగిరస మహర్షిని మీరెవరంటూ సనకాదులా, నారదులా, ఋషభులా, ... ఇలా 28 మంది మహర్షుల పేర్లు తలుస్తూ తరణి మహర్షి పేరు కూడా తలుస్తాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 6-458-సీ.

  26) తరలము- ( ){జాతి}[భాష]:- తరలము ఒక ఛందస్సు పేరు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ తరలము. వీటిని గ్రంథములో 23 పద్యాలకు ఉపయోగించారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 1-60-త., ....

  27) తరుణి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- తరుణి అంటే స్త్రీ. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-238మ., 2-189-మ.,

  28) తరువు- ( ){జాతి}[వృక్ష]:- తరువు అంటే చెట్టు, ఈ పదం భాగవతంలో చాలా మార్లు వచ్చింది.. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-22-మ., 1-136-వ., 2-26-వ., 8-51-సీ.,...

  29) తర్కవాది- (పురుష){జాతి}[మానవ యోని]:- తర్కవాది అంటే తర్కశాస్త్రంలో పండితుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-70-చ.

  30) తర్షుడు- (పురుష){సంజ్ఞా}[బ్రహ్మణ]:- దక్షుని అరవై మంది కుమార్తెలలో ఒకరైన వాసన యందు ఆమె భర్త అర్కునికి తర్షుడు మొదలగువారు పుట్టిరి. - వంశం - బ్రహ్మణ; తండ్రి - అర్కుడు ; తల్లి - వాసన; పద్య సం.(లు) - 6-254-వ.

  31) తలాతలం- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- చతుర్దశలోకాలలోని సప్తయధోలోకాలలో నాలుగవది. విరాట్స్వరూపము వర్ణనలో జంఘలు తలాతలం అని చెప్పబడింది.
సప్త పాతాళ లోకాలలో నాలుగవది . ఈ ఏడు భూమండలం క్రింద ఒకదాని క్రింద ఒకటిగా ఉంటాయి. ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి క్రింద ఉన్నా స్వర్గం వంటివే. ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవయోనికి చెందినవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు.
సుతలానికి క్రింది తలాతలాన్ని మయుడు పాలిస్తుంటాడు.
శివునిచేత త్రిపురాలు బూడిద అయినపుడు, తనను శరణుజొచ్చిన మయుణ్ణి విష్ణువు తలాతలానికి రాజుగా చేశాడు. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 2-16-వ., 2-89-వ., 5.2-106-సీ., 5.2-116-క., 5.2-117-చ.,

  32) తాటకి- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- తాటకి మహారాక్షసి, ఈమెను దండకారణ్యంలో శ్రీరాముడు సంహరించెను. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-306-సీ., 9-260-మ.,

  33) తానకములు- ( ){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
తానకములు అంటే నటించుచు నిలబడు వేయు విధములు. శ్రీకృష్ణుడు గోపికలతో రాసక్రీడ ఆడుతూ ఏకపాదతానకము {ఒంటికాలితో అడుగులు వేయుట}; సమపాదతానకము {రెండు కాళ్ళు సమముగా ఉంచి నటించుట}; వినివర్తితతానకము {పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట}; గతాగతతానకము {తాళమానమును మీరక పోకరాకలు చేయుచు నటించుట}; వలితతానకము {ఇరుపార్శ్వములకు మొగ్గ వాలినట్లు దేహమును వాల్చుచు నటించుట}; వైశాఖతానకము {కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట; మండలతానకము {నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట}; త్రిభంగితానకము {మువ్వంకల దేహము వంచి నటనము చేయుట} మొదలగు నిలబడుటలులోని తానకములతో వారిని తనుపుతున్నాడు. - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  34) తాపి- ( ){సంజ్ఞా}[నది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  35) తామరకంటి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తామరకంటి అంటే పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు. "కంటిగంటి భవాబ్ది దాటఁగ గంటి.." అంటూ ఉప్పొంగిపోతూ శ్రీకృష్ణ నిర్యాణ సమయం ఆసన్నమైనప్పుడు కృష్ణుని కనుగొనిన ఉద్దవుడు "తామరకంటి" అంటూ స్మరించుకున్నాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-146-మత్త.,

  36) తామరచూలి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తామరచూలి అంటే బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుని సంతతికి చదువుచెప్పడానికి గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ తామరచూలి యైన బ్రహ్మకైనా, శూలి ఐన పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా. అన్నారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-278-తే., 10.2-1152-మత్త.,

  37) తామరసగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తామరసగర్భుడు అంటే బ్రహ్మదేవుడు. సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి. అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి. విష్ణుధ్యానము అనే అంజనం ఉంటే వాటిని కనుగొనగలం. విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కాని ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆఖరుకి ఆ బహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-171-సీ.

  38) తామరసభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తామరసభవుడు అంటే బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-325-క.,

  39) తామస మనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- తామసుడు పద్నాలుగురు మనువులలో నాలుగవ వాడు. ఇతడు ఉత్తముడి తమ్ముడు. తండ్రి ప్రియవ్రతుడు. అతని కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. వారు బలవంతులైన రాజులు. ఆ మన్వంతరంలో సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు దేవతలు. త్రిశిఖుడు అనేవాడు దేవేంద్రుడు. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులు. విష్ణుమూర్తి హరిమేధునకు పురంధ్రి అయిన హరిణికి ‘హరి’ అనే పేరుతో అవతరించాడు. గజేంద్రమోక్షణ కథా కాలం ఈ మన్వంతరము. - వంశం - మనువు వంశం; తండ్రి - ప్రియవ్రతుడు; కొడుకు(లు) - కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది.; పద్య సం.(లు) - 8-18-సీ.,

  40) తామసభక్తి- (){జాతి}[విద్య]:- తామసభక్తి అంటే తమోగుణంతో కూడిన వారి భక్తి. కపిలుడు తల్లి దేవహూతికి భక్తియోగంలో ఇలా వివరించాడు హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేవాడు తామసుడు. అట్టి వానిది తామసభక్తి. - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-952-వ., 3-953-తే.,

  41) తామసమన్వంతరం- ( ){సంజ్ఞా}[కాలము]:- తామసమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో నాలుగవది. - వంశం - కాలము; పద్య సం.(లు) - 8-18-సీ.,

  42) తామససర్గం- ( ){సంజ్ఞా}[సృష్టి]:- తామససర్గము (సృష్టి) నవవిధసర్గలలో ఆరవది.
సర్గము (సృష్టి) తొమ్మిది విధములు; మహత్, అహంకార, భూత, ఇంద్రియ, దేవగణ, తామసగణ, స్థావర, తిర్యక్ మఱియి ఆర్వాక్ స్రోత (నరులు) - వంశం - సృష్టి; పద్య సం.(లు) - 3-344-వ.

  43) తామిస్రం- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు.
పరపుత్రకళత్రాలను బాధించిన వారికి తామిస్రం అనే నరకంలో పడేస్తారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-136-వ., నుండి 5.2-164-వ.,

  44) తామ్ర- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- కశ్యపుని పదముగ్గురు భార్యలలో తామ్ర ఒకరు. కశ్యపునికి భార్య తామ్ర యందు డేగలు (శ్యేన), గ్రద్దలు (గృధ) జనించాయి. ఈమె దక్షునికి అసిక్నియందు పుట్టిన కుమార్తెలలో ఒకర్తె. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - డేగలు, గద్దలు; పద్య సం.(లు) - 6-256-త., 6-257-సీ.,

  45) తామ్రపర్ణి- ( ){సంజ్ఞా}[మహానది]:- ద్రవిడదేశపు పాండ్యరాజైన మలయధ్వజుడు. విదర్భరాకుమారిని పెళ్ళాడాడు. వారికి ఒక కుమార్తె, ఏడుగురు కొడుకులు. ఆ మలయధ్వజుడు వానప్రస్థముచేపట్టి భార్యతో వెళ్ళి చంద్రమసా, తామ్రపర్ణి, నవోదక అను నదులందు అవగాహనచేసాడు.
భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది.
బలరాముడు యాత్రకు వెళ్ళినపుడు, రామేశ్వరం పిమ్మట తామ్రపర్ణి దర్శించి పిమ్మట మలయాచలం వెళ్ళాడు.
ద్రావిడదేశంలోని తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 4-834-వ., 5.2-55-వ., 10.2-953-వ., 11-78-తే., 11-280-తే.,

  46) తామ్రము- ( ){జాతి}[పరికరము]:- తామ్రము అంటే రాగి అనే లోహము - వంశం - పరికరము; పద్య సం.(లు) - 7-102-శా.,

  47) తామ్రుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ తామ్రుడు కృష్ణుని చేతిలో నరకాసుర వధ సందర్భంలో మరణించిన వారు మురాసురుని పెద్ద పుత్రుడు, మురాసురునికి తామ్రుడు, అంతరిక్షుండు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు. అని ఏడుగురు కొడుకులు - వంశం - రాక్షస యోని; తండ్రి - మురాసురుడు; పద్య సం.(లు) - 10.2-165-వ.,

  48) తార- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- తార బృహస్పతి భార్య. బుధుని కన్నతల్లి. ఈమెను చంద్రుడు తీసుకుపోయాడు. బృహస్పతి తండ్రి అంగిరసుని కోరికపై బ్రహ్మదేవుడు ఈమెను బృహస్పతికి ఇప్పించాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె ఒక అందమైన బాలుని కన్నది. బృహస్పతి, చంద్రుడు నా కొడుకు నాకొడుకు అంటుంటే, బ్రహ్మదేవుడు వచ్చి తారతో సంప్రదించి చంద్రుని కొడుకు అని నిర్ణయించి బుధుడు అని పేరుపెట్టి చంద్రునికి ఇప్పించాడు. - వంశం - దేవయోని; భర్త - బృహస్పతి; కొడుకు(లు) - బుధుడు; పద్య సం.(లు) - 9-375-ఆ., 9-386-ఆ.

  49) తారకలు- ( ){జాతి}[నక్షత్ర]:- తారక అంటే అశ్వినీ మున్నగు నక్షత్రాలు యందలి జ్యోతిర్మయగోళములు.
ధృవునికి సర్వోన్నతమైన ధ్రువక్షితి అనుగ్రహిస్తున్నాను అని చెప్పేటప్పుడు విష్ణుమూర్తి జ్యోతిశ్చక్రంలోని ధర్మ, అగ్ని, కశ్యప, శక్రు, సప్తర్షులును, తారకలు అను నక్షత్రాలను పేర్కొన్నాడు. - వంశం - నక్షత్ర; పద్య సం.(లు) - 1-244-మ., 1-256-వ., 3-346-వ., 4-290-వ.,

  50) తారకాధిపుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తారకాధిపుడు చంద్రుడు. దక్షుడు తన పుత్రికలు 60 మది లోను అశ్వనీ భరణి మున్నగు నక్షత్రాలు ఇరవై ఏడుగురుని చంద్రునికి ఇచ్చాడు. ఈ తారకలకు భర్త కనుక చంద్రుడు తారకాధిపతి అయ్యాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-223-సీ.

  51) తారకుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 12-18-వ.,

  52) తారకుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షసయోని]:- సాగరమథనం కోసం ఇంద్రాదులు బలి సైనానులైన నముచి, తారకుడు, బాణుడు మున్నగు దానవ దైత్యులతో మిత్రత్వం నెరపారు.
ఈ తారకుడు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. ఈ యుద్ధంలో తారకునితో గుహుడు తలబడ్డాడు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-182-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

  53) తార్క్షనందనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తార్క్షనందనుడు అంటే తార్క్షుడను నామాతంరం గల కశ్యపుని కొడుకు, గరుత్మంతుడు. త్రివిక్రమావతారం పిమ్మట బలిని హరిహృదయం ఎరిగి వారుణపాశములతో బంధించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-638-వ.

  54) తార్క్షుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- తార్క్షుడు అను నామాంతరం గల కశ్యపునికి, దక్షుడు తనకు అసిక్ని యందు కలిగిన అరవైమంది పుత్రికలలో చివరి నలుగురిని ఇచ్చాడు. వారు వినత, కద్రువ, పతంగి, యామిని. వారిలో పతంగికి పక్షులు పుట్టాయి. యామినుకి శలభములు కలిగాయి., వినతకు విష్ణువునకు వాహనమైన గరుడుడు, సూర్యునికి సారథియైన అనూరుడు పుట్టారు. కద్రువకు అనేక రకములైన సర్పములు పుట్టారు, - వంశం - ఋషి; భార్య - వినత; కద్రువ; పతంగి; యామిని ; కొడుకు(లు) - అనూరుడు సూర్యుని సారథి; గరుత్మంతుడు విష్ణువు వాహనం; నానావిధాలైన నాగులు; పతంగులు; మిడుతలు మొదలైన కీటకాలు; పద్య సం.(లు) - 6-252-వ., 6-254-వ.

  55) తార్క్ష్యుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు.
ఇతడు విష్ణుమూర్తి వాహనము.
ఇతడు విష్ణుమూర్తి పరిచరులలో ముఖ్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-683-చ., 6-218-సీ., 8-345-ఆ., 8-634-వ.

  56) తార్క్ష్యుడు-2 (పురుష){సంజ్ఞా}[యక్షుడు]:- ఇతడు మార్గశీర్ష (సహో) మాసంలో సూర్యుని అనుచరులలోని యక్షుడు.
సూర్యుడు ఈ మాసంలో అర్యమ (మూలం అంశువు) అను పేరుతో, ఊర్వశి, కశ్యపుడు, మహాశంఖుడ, విద్యుచ్ఛత్రుడు, ఋతసేనుడు, తార్క్ష్యుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - యక్షుడు; పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

  57) తార్క్ష్యులు- (పురుష){జాతి}[దేవయోని]:- తార్క్ష్యులు అంటే గరుడులు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-508-శా.,

  58) తాల - ( ){జాతి}[వృక్ష]:- తాడి - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  59) తాలంకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- తాలంకుడు అంటే తాడిచెట్టు జండా గలవాడు, బలరాముడు - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - రోహిణి; పద్య సం.(లు) - 10.2-291-క., 10.2-553-క., 10.2-588-వ., 10.2-670-క., 10.2-929-వ., 10.2-940-మస్ర.

  60) తాళజంఘుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- తాళజంఘాదులను గుండుగీయించి, వివస్త్రలును చేయించి, తండ్రి పగతీర్చుట కోసం తీవ్రంగా యుద్ధాలు చేసి, హైహయులు, బర్బరులు మున్నగువారిని సంహరించిన, సగరుడు, ఆ తాళజంఘాదులను కురూపులుగా చేసాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 9-203-శా.

  61) తాళజంఘుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- కార్తవీర్యార్జుని వెయ్యిమంది కుమారులలో పరశురాముని దెబ్బ తప్పించుకొని జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు మాత్రమే బతికిబట్టకట్టారు. వారిలో జయద్వజునకు తాళజంఘుడు; తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన వందమంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు; - వంశం - చంద్రవంశం; తండ్రి - జయధ్వజుడు; కొడుకు(లు) - వంద మంది, ఔర్వముని వలన ప్రథముడు వీతిహోత్రుడు; పద్య సం.(లు) - 9-703-వ.,

  62) తాళము- ( ){జాతి}[పరికరము]:- తాళము అంటే, తాళవృంతము, విసనకఱ్ఱ - వంశం - పరికరము; పద్య సం.(లు) - 8-39-సీ.,

  63) తిక్కన- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- బమ్మెఱ పోతనామాత్యులు ఇలా తలచారు. సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-21-మ.

  64) తిక్కమనీషి- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- బమ్మెఱ పోతనామాత్యులవారు భాగవత గ్రంథారంభలో కవిసన్నుతి చేస్తూ తిక్కమనీషి అని తిక్కన మహాకవిని నుతించారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-12-వ.

  65) తితిక్ష-1 (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- ఈ తితిక్ష దక్షపుత్రి. దక్షునికి భార్య ప్రసూతి యందు కలిగిన పదహారు పుత్రికలలో పదనొకండవ పుత్రిక. దక్షుడు వీరిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనువారలను పదుముగ్గుర్ని ధర్మరాజున కిచ్చెను. తితిక్ష వలన ధర్మునికి క్షేమము సంభవించెను. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - ప్రసూతి ; భర్త - ధర్ముడు; కొడుకు(లు) - క్షేమము; పద్య సం.(లు) - 4-27-క., 4-28-వ.

  66) తితిక్ష-2 ( ){జాతి}[లక్షణము]:- తితిక్ష అంటే క్షాంతి, ఓర్పు - వంశం - లక్షణము; పద్య సం.(లు) - 4-355-వ., 5.1-69-వ., 5.1-76-సీ., 10.1-168-మ., ...

  67) తితిక్షువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- మహామనసునకు సుశీనరుడు, తితిక్షువు అని ఇద్దరు పుట్టారు. వారిలో సుశీనరునకు శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అని నలుగురు కలిగారు. శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని నలుగురు జన్మించారు. తితిక్షువునకు రుశద్రథుడు; రుశద్రథునకు హేముండు; హేమునకు సుతపుడు; సుతపునకు బలి జన్మించారు - వంశం - చంద్రవంశం; తండ్రి - మహా మనసుడు; కొడుకు(లు) - రుశద్రథుడు; పద్య సం.(లు) - 9-683-వ.,

  68) తిత్తిరి-1 ( ){జాతి}[గగనచర]:- తిత్తిరి అంటే తీతువు పక్షులు అని తిత్తిరి మహర్షి అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} కు ఉపమాన పదంగా వాడబడింది.
ఇంద్రుడు కోపాన్ని ఆపుకోలేక విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే తల (కపిజలంబు) కౌజుపిట్టగా మారిపోయింది. సురాపానం చేసే తల (కలవింక) ఊరబిచ్చుక అయింది. అన్నం భక్షించే తల (తిత్తిరి) తీతువుపిట్ట అయింది. ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకం మూడు విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధించసాగాయి.
వైశంపాయనుని శిష్యులలో ఒకడు యాజ్ఞవల్క్యుడు. అతడు గురువుపట్ల అపరాధం చెయ్యడం మూలంగా, నేర్చుకున్న వేదములను తనకు ఇచ్చి పొమ్మని కోపగ్రస్తుడై వైశంపాయనుడు అనగా యజుస్సంహితలను యజ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్నవాటిని నేర్చుకున్న క్రమంలోనే వమనం చేసాడు. అవి రక్తసిక్తమైన రూపు దాల్చాయి. అంతట యజుర్మంత్ర గణముల అధిష్టానదేవతలు తిత్తిరిపక్షుల రూపంలో వచ్చివాటిని తినేశారు. అందువల్లనే ఆ శాఖలకు తైత్తిరీయశాఖలు అనే పేరు వచ్చింది. - వంశం - గగనచర; పద్య సం.(లు) - 1-39-వ., 3-507-వ., 6-316-వ., 12-30-వ.

  69) తిత్తిరి-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- తిత్తిరి అంటే తిత్తిరి మహర్షి అని తీతువు పక్షులు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-39-వ.,

  70) తిప్పన- (పురుష){సంజ్ఞా}[బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం]:- తిప్పన బమ్మెఱపోతన అన్నగారు. ఈయన బమ్మెఱ వంశంలో కేసన లక్కమాంబల పెద్దకుమారుడు. రెండవకుమారుడు తెలుగులో భాగవతం చేసిన మహానుభావుడు పోతనామాత్యులవారు. - వంశం - బమ్మెర వంశం; కౌండిన్య గోత్రం; ఆపస్తంభ సూత్రం; తండ్రి - కేతన / కేసయ; తల్లి - లక్కమాంబ; పద్య సం.(లు) - 1-27-క.,

  71) తిమి-1 (స్త్రీ){జాతి}[జలచర]:- తిమి అంటే తిమింగలములను మింగు జలచరము. బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - వంశం - జలచర; పద్య సం.(లు) - 2-167-మ., 6-326-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

  72) తిమి-2 (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- దక్షునికి అసిక్నియందు అరవైమంది కుమార్తెలు కలిగారు. అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమ అనే పదముగ్గురుని కశ్యపునికు భార్యలుగా దక్షుడు ఇచ్చాడు.వారి సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. ఆ తిమికి జలచరములు పుట్టెను. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - కశ్యపుడు ; కొడుకు(లు) - తిమింగిలాది జలచరాలు; పద్య సం.(లు) - 6-256-త., 6-257-సీ.,

  73) తిమి-3 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- మత్యావతారాన్ని నవవికచ .. పద్యంలో తిమి అమి సూచించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 11-72-ససీ.

  74) తిమింగిలము- (స్త్రీ){జాతి}[జలచర]:- తిమింగలములను జలచరములను బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వాహనాలుగా వాడారు. - వంశం - జలచర; పద్య సం.(లు) - 2-167-మ., 6-326-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు, 10.2-682-చ,

  75) తియ్యవిలుకాడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తియ్యవిలుకాడు అంటే మన్మథుడు, తియ్యనిదైన చెరకుగడ విల్లుగా కలవాడు కనుక మన్మథుడు.గోపికల విరహపు మొరలు సందేర్భములో తియ్యవిలుకాడు అవి మన్మథుని వర్ణించారు.. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1040-ఆ.

  76) తిరోధాన- (స్త్రీ){సంజ్ఞా}[విద్య]:- బ్రహ్మదేవుడు తిరోధానశక్తి వల్ల నరులను, సిద్ధులను,విద్యాధరులను పుట్టించి వారికి తిరోధానం అనే పేరుగల ఆ దేహాన్ని ఇచ్చాడు - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-719-సీ.,

  77) తిర్యక్కులు- (స్త్రీ){జాతి}[జంతు]:- తిర్యక్కులు అంటే తిరగగలిగేవి ఐన జంతువులు - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-61-సీ., ...

  78) తిర్యక్సర్గ- (స్త్రీ){జాతి}[జంతు]:- నవవిధ సర్గ (సృష్టి)లో ఎనిమిదవది తిర్యక్సర్గ అను సృష్టి. ఎమిమిదవ సృష్టితో ఇరవై ఎనిమిది రకాల భేదాలు ఉన్నాయి. రేపు అనే జ్ఞానం లేనివై, ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవై, వాసన చూసి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ, మనస్సులో పెద్దగా ఆలోచన చేయలేనివై, చీలిన గిట్టలు కలవైన ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు ఈ తొమ్మిది; చీలని గిట్టలు గలవైన గాడిద, గుఱ్ఱం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీమృగం ఈ ఆరూ; అయిదు గోళ్ళు గలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు పంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ పన్నెండు (ఇవన్నీ భూచరాలు) మొసలి మొదలైన జలచరాలూ, రాబందు, గ్రద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురు పక్షి, జక్కవ పిట్ట, కాకి, గుడ్లగూబ, మొదలైన ఆకాశాన సంచరించేవి తిర్యక్కుల సృష్టి - వంశం - జంతు; పద్య సం.(లు) - 3-344-వ.

  79) తిలకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- భవిష్యత్తులో రాబోవు అరిష్టకర్మ అను రాజు కొడుకు తిలకుడుపుడతాడు. అతని కొడుకు పురీషసేతుడు అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.. అటుపిమ్మట, కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 12-8-వ.,

  80) తిలోత్తమ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- తిలోత్తమ ప్రముఖ అప్సరసలలో ఒకరు. బలి ప్రవేశించే అమరావతీ పట్టణ వర్ణనలో సరస తిలోత్తమంబు అనివర్ణించబడింది.
ఈమె ఆశ్వయుజ (ఇషము) మాసంలో సూర్యుని అనుచరులలోని అప్సరస.
సూర్యుడు ఈ మాసంలో త్వష్ట అను పేరుతో, తిలోత్తమ, ఋచీకతనయ (జమదగ్ని), కంబళాశ్వుడు, బ్రహ్మపేతుడు,, ధృతరాష్ట్రుడు, శతజిత్తు, ఇషంబరుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-448-క., 12-43-వ.

  81) తీర్థపాదుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తీర్థపాదుడు అంటే విష్ణువు, అతని పాదములవద్ద ఆకాశగంపుట్టింది కనుక తీర్థపాదుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-131-ఆ., 2-89-వ. 3-824-వ., 4-135-వ., 4-382-సీ., 8-483-సీ., 9-142-మ.,

  82) తీర్థవతి- ( ){సంజ్ఞా}[నది]:- క్రౌంచద్వీపంలోని సుదామ వర్షంలో ఉపబర్హణం అను పర్వతము, తీర్థపతి అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  83) తుంగభద్ర- ( ){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ., 9-230-వ.

  84) తుంబురుడు- (పురుష){సంజ్ఞా}[గంధర్వుడు]:- తుంబురుడు గానగంథర్వుడు, నారదుని మిత్రుడు. విష్ణుభక్తిలో అగ్రగణ్యుడు.
కపోతరోమునికి తుంబురుని స్నేహితుడైన అనువు; అనువునకు దుందుభి; దుందుభికి దవిద్యోతుడు; దవిద్యోతునకు పునర్వసువు; అతనికి ఆహుకుడు అని కుమారుడు, ఆహుకి అని కుమార్తె పుట్టారు. ఆ ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనెడి ఇద్దరు పుట్టారు
ఇతడు చైత్ర (మధు) మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో ధాత అను పేరుతో, కృతస్థలి, పులస్త్యుడు, వాసుకి, హేతి, తుంబురుడు, రథకృత్తు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 1-324-వ., 1-332-వ., 5.2-125., 7-102-శా., 9-712-వ., 12-41-వ., నుండి 12-45-వ., వరకు

  85) తురంగము- (స్త్రీ){జాతి}[భూచర]:- తురంగము అంటే వాహనము అనే అర్థంలో షష్ఠస్కంధారంభంలో బ్రహ్మదేవుని హంసతురంగము అన్నారు సింగన గారు. - వంశం - భూచర; పద్య సం.(లు) - 6-3-ఉ.

  86) తురంగమేధము- ( ){జాతి}[విద్య]:- తురంగమేధము అంటే అశ్వమేధ యాగము. ధర్మరాజుచేత కృష్ణుడు మూడు అశ్వమేధయాగములు చేయించెను. - వంశం - విద్య; పద్య సం.(లు) - 1-177-శా., 1-204-వ., 1-130-వ.

  87) తురగము- (స్త్రీ){జాతి}[భూచర]:- తురములు అంటే గుఱ్ఱములు అనే జంతువులు.
క్షీరసాగర మథనంలో ఉచ్ఛైశ్రవము అను తురగము పుట్టింది. దానిని బలి తీసుకున్నాడు.
బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు వీటిని వాహనాలుగా వాడారు. - వంశం - భూచర; పద్య సం.(లు) - 1-466-క., 3-605-క., 5.2-82-సీ., 8-255-క., 8-327-క., నుండి 8-334-వ., వరకు, 10.1-1532-వ.,10.2-90-చ., 10.2-193-మ., 10.2-880-చ.,

  88) తుర్వసుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శుక్రుడు యయాతికి దేవయానిని ఇచ్చి వివాహం చేసాడు. అంతకు ముందు, శర్మిష్ట చేత నూతిలోకి త్రోయబడిన దేవయానిని అనుకోకుండా అక్కడకు వచ్చిన యయాతి చేయందిచ్చి బయటకు తీసి రక్షించాడు. అంత దేవయాని అతనిని వరించింది. తన భార్య దేవయాని యందు యయాతికి యదువు, తుర్వసుడు అను పుత్రులు ఇద్దరు పుట్టారు. శర్మిష్ఠ యందు యయాతికి ద్రుహ్యుడు, అనువు, పూరువు అని ముగ్గురు కొడుకులు కలిగీరు. యయాతికి శుక్రశాపం వలన కలిగిన ముసలితనం కొంతకాలం తీసుకుని వారి యౌవనం ఇమ్మని పెద్దకొడుకులు యదువు, తుర్వసులను అడుగగా వారు తిరస్కరించారు. కడగొట్టు కుమారుడు ఐన పూరువు అంగీకరించి తీసుకున్నాడు.
వానప్రస్థానికి వెళ్తున్న యయాతి రాజ్యాన్ని విభజించి ద్రుహ్యునకు తూర్పు భాగం, యదువునకు దక్షిణ భాగం, తుర్వసునకు పడమర భాగం, అనువుకు ఉత్తర భాగం పాలించుకోమని ఇచ్చేసాడు. వారి సమక్షలో..,, పూరుడిని పట్టాభిషిక్తునిగా చేసి, పరిపాలించుకో అన్నాడు
ఆ తృహ్యునికి వహ్ని పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - యయాతి; తల్లి - దేవయాని; కొడుకు(లు) - వహ్ని; పద్య సం.(లు) - 9-540-వ., 9-552-వ. నుండి 9-585-క. వరకు, 9-699-వ.

  89) తులసీదళదాముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తులసీదళదాముడు అంటే విష్ణువు. కశ్యపుడు తన కొడుకులు ఇద్దరూ దుర్మార్గులు అవుతారు అని బాధపడుతున్న భార్య దితికి వారిలో ఒకని హిరణ్యకశిపుని కొడుకు (ప్రహ్లాదుడు) గొప్ప విష్ణుభక్తుడు అవుతాడు అని ఊరడిస్తూ విష్ణుమూర్తిని తులసీదళదాముడు అని స్మరించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-490-ఉ., 4-264-ఉ.,

  90) తులసీదాముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తులసీదాముడు విష్ణువు. నారదుడు ధ్రువునికి విష్ణుమూర్తిని ఎతా పూజించాలో చెప్తూ ఇలా అన్నాడు. తులసీ దళంబులఁ దులసికా దాముని పూజించాలి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-254సీ.,

  91) తులారాశి- ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో సంచరిస్తుంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి తగ్గుతూ వస్తుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి పెరుగుతుంది. పగలుతగ్గిపోతుంది. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-79-ఆ., 5.2-80-ఆ.,

  92) తుషిత- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- స్వారోచిషమన్వంతరంలో భార్య తుషిత యందు వేదశిరుడు అను బ్రాహ్మణునికి విష్ణువు విభుడు అను పేర అవతరించాడు. - వంశం - దేవయోని; భర్త - వేదశిరుడు; కొడుకు(లు) - విభుడు; పద్య సం.(లు) - 8-14-సీ.,

  93) తుషితులు- (పురుష){జాతి}[దేవయోని]:- స్వాయంభువమన్వంతరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అంశతో అవతరించిన యజ్ఞుడు, దక్షిణలకు 'యామ' అను దేవతలు కలిగారు. వారు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని పన్నెండుమంది. వీరిని తుషితులు అనికూడా అంటారు. స్వాయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. - వంశం - దేవయోని; తండ్రి - యజ్ఞుడు ; తల్లి - దక్షిణ ; పద్య సం.(లు) - 4-3-సీ., 4-6-క., 4-6-వ.

  94) తుష్టి.- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- తుష్టి దక్షుడు ప్రసూతిల పదహారుమంది పుత్రికలలో ఐదవయామె. బ్రహ్మదేవుని కొడుకైన దక్షునికి స్వాయంభవమనువు పుత్రికయైన ప్రసూతి యనుభార్య యందు జన్మించిన తన పదహారుమంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్ముని కిచ్చి వివాహం చేసాడు. ఒక కుమార్తెను అగ్నిదేవునికి, ఒక కుమార్తెను పితృదేవతకు, మరొక కుమార్తెను జనన మరణాలు లేని శివునికి ఇచ్చాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శ్రుతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియ వలన యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే ఇద్దరు ఋషులు జన్మించారు. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - ప్రసూతి ; భర్త - ధర్ముడు; కొడుకు(లు) - ముదము; పద్య సం.(లు) - 4-28-వ.

  95) తుష్టిమంతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కంసుని తమ్ముళ్ళు న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనెడి ఎనమిది మందిలో చిన్నవాడు. ఉగ్రసేనుని కొడుకులలో తొమ్మిదవవాడు. వీరికి కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనెడి నలుగురు సోదరీమణులు కలిగారు. కంస వధానంతరం, బలరామ కృష్ణుల చేతిలో చనిపోయాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఉగ్రసేనుడు; పద్య సం.(లు) - 9-714-వ.,., 10.1-1382-శా.,

  96) తుహినకరకాంత - ( ){జాతి}[మణులు]:- చంద్రకాంతశిలలను చంద్రుడు తుహినకరుడు కనుక తుహినకరకాంత ఆయెను - చంద్రకాంత శిలలు ఇలా అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - మణులు; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  97) తుహినకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తుహినకరుడు అంటే చంద్రుడు. విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ; చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-902-క.

  98) తుహినకిరణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తుహినకిరణుడు అంటే చల్లని కిరణముల వాడైన చంద్రుడు. హేమంత వర్ణనలో "ఆకాశంలో ఉండి చలివెలుగు ఇచ్చే చంద్రుడు సహింపరాని వాడయ్యాడ" అని వర్ణించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-800-క.

  99) తుహినధాముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తుహినధాముడు అంటే తుహిన (మంచువంటి చల్లదనమునకు) ధాముడు (నివాసమైనవాడు), చంద్రుడు. పోతన రామాయణంలో కమలములకు మిత్రుడు సూర్యుడు. శత్రువు చంద్రుడు, చంద్రుని రాకతో కమలములు ముడుచుకుంటాయి, కనుక శ్రీరాముడిని రావణుని ముఖములనే కమలములకు చంద్రునివంటివాడు అన్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-265-క., 10.1-1270-క.

  100) తుహినమయూఖశేఖరుఁడు - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తుహిన మయూఖ శేఖరుడు అంటే శివుడు, చల్లని కిరణములు కలవాడైన చంద్రుడు శిఖ యందు కలిగినవాడు కనుక శివుడు. భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించు సందర్భములో శంకరుని ఇలా వర్ణించారు.. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1271-చ.

  101) తుహినాంశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- తుహినాంశుడు అంటే చంద్రుడు. కశ్యపుడు భార్య దితి చేసిన బలవంతానికి లొంగి అసురసంధ్యవేళ కలిసాడు. పిమ్మట ఆ అకృత్యానికి చింతిస్తూ కాంతామోహం ఎంతో బలమైనది ఎట్టివారైనా లొంగిపోతారు అంటూ బాధపడుతున్న సందర్భంలో స్త్రీలవి తుహినాంశకళలతో తులతూగు చెయ్వులు అనగా చంద్రకళల వంటి చేష్టలు అన్నాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-519-సీ.,

  102) తూణము- (స్త్రీ){జాతి}[పరికరములు]:- తూణము, తూణీరము అంటే బాణములను ఉంచు అమ్ములపొది. సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు వీటిని వాడినట్లు వర్ణించబడింది. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క., 8-439-సీ., 8-441-క., వరకు

  103) తూణీరణము- (స్త్రీ){జాతి}[పరికరములు]:- తూణీరము, తూణము అంటే అమ్ములపొది.. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 4-513-క., 4-771-సీ., ...

  104) తృణజలూక- ( ){జాతి}[క్రిమి]:- తృణజలూక అంటే తృణములయందు సంచరించెడు ౙలగవంటి యొక దినుసు పురుగు, గొంగళీపురుగు - వంశం - క్రిమి; పద్య సం.(లు) - 4-890-సీ., 10.1-29-సీ.,

  105) తృణబిందువు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- సూర్యవంశానికి చెందిన వేదవంతునికి బంధుడు; బంధునికి తృణబిందువు పుట్టారు. అంతట.... అప్సరస అలంబుస తృణబిందుని వరించింది. వారికి ఇలబిల అని కూతురు పుట్టింది. ఆ ఇలబిల యందు ఆమెభర్త విశ్రవసునికి కుబోరుడు పట్టాడు. కనుకనే కుబేరుని ఐలబిలుడు అంటారు. ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధృమ్రకేతుడు అని ముగ్గురు (3) పుత్రులు పుట్టారు. వారిలో విశాలుడు వంశస్థాపకుడు అయ్యి, వైశాలి అనె పట్టణమును కట్టాడు. వైశాలురు అనురాజులు ఈ తృణబిందుని వంశీయులే.
రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు - వంశం - సూర్యవంశం; తండ్రి - బంధుడు; భార్య - అలంబుస; కొడుకు(లు) - విశాలుడు, శూన్యుడు, ధూమ్రకేతుడు.; కూతురు(లు)- ఇలబిల; పద్య సం.(లు) - 9-46-వ., 9-17-క., 9-18-వ., 9-50-వ., 12-18-వ.

  106) తృణములు- ( ){జాతి}[ఆహారం]:- తృణములు అంటే విత్తనమునాటక పండెడి గడ్డి చేమ తాడి కొబ్బరి, ధాన్యము, గోధుమలు, రాగులు, గంట్లు, జొన్నలు వంటి తృణధాన్యములు మున్నగునవి - వంశం - ఆహారం; పద్య సం.(లు) - 8-175-సీ., ...

  107) తృణావర్తుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- షష్ఠ్యంతములలో జక్రసమీరదైత్య(తృణావర్తుడు) సంహారి అని స్తుతించారు పోతనామాత్యులవారు.
కంసుడు, నారదుని వలన నందుడు, వసుదేవుడు మున్నగువారందరు దేవతలు తాను రాక్షసుడను మున్నగునవి వినిన పిమ్మట, బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మున్నగు రాక్షసులను కూడి యుద్ధాలు చేసి యాదవులను అందరిని ఓడించి తానే ఏలసాగాడు,
యశోద తొడలమీది కొడుకు బరువెక్కిపోతుంటే, ఇంత బరువుగా ఉన్న కొడుకును మోయలేక నేలమీద పడుకోబెడుతుంది. అప్పుడు కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు అకస్మాత్తు సుడిగాలి రూపంలో వచ్చి, ఒక్క విసురుతో కృష్ణబాలకుని పైకి ఎత్తుకుపోతాడు. యశోదాదులు ఎంతగానో దుఃఖిస్తుంటారు. కృష్ణబాలకుడు ఇంకా అధికంగా బరువెక్కిపోతూ వాడి మెడపట్టుకుని వేళ్ళాడతాడు. తృణావర్తుడు కృష్ణుని బరువుమోయలేక ఊపిరి ఆడక బండరాళ్ళమీద పడి చస్తాడు. కృష్ణుడు బరువంతా వదిలేసి మామూలుగా ఐపోయి వానిపై ఆడుకుంటుంటే గోపికలు తీసుకెళ్ళి యశోదకు ఇస్తారు.
ప్రలంబాసురుడు తృణావర్తుని తమ్ముడు. అతడు గోపాలకుని వేషంలో వచ్చి పూర్వం కృష్ణుడు తృణావర్తుని చంపాడు. కనుక ఆటలలో కృష్ణుని మోయలేను అనుకుని, బలరాముని మోసుకుపోతూ ఉంటాడు. బలరాముడు విషయం గ్రహించి పిడికిటి పోటుతో వాని తల వ్రక్కలుచేస్తాడు.
గోవర్థనగిరి ధారణ పిమ్మట వ్రేపల్లెకు చేరాక, గోపకులు వసుదేవునితో కృష్ణునికథలు చెప్తూ పిల్లవాడిగా ఉండగా తృణావర్తుని కూల్చాడు అని కూడా చెప్తారు.
కృష్ణుడు అదృశ్యం కావడంతో గోపికలు తాదాన్మత్యతతో వర్తిస్తారు. అప్పుడు ఒకామె నేను కృష్ణుణ్ణి అంటు ఉన్నామెను తృణావర్తుడిలా ఎగరేసుకుపోతుంది.
కువలయాపీడం సంహారం తరువాత మల్లరంగంలో విహరిస్తున్న బలరామకృష్ణులను చూస్తున్న జనులు. కృష్ణుడు తృణావర్తుడిని హతమార్చాడు కదా అని కూడా తలుస్తారు.
జరాసంధుడు దండెత్తి వచ్చినప్పుడు ఒకసారి గాలిని (తృణాసురుడు) నిర్బంధించుట అంత తేలికకాదు నాతో యుద్దం అంటూ కూడా నిందాస్తుతి చేస్తాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 1-26-ఉ., 10.1-56-వ., 10.1-262-క., నుండి 10.1-278-మ., 10.1-732-మ., 10.1-931-సీ., 10.1-1021-సీ.,10.1-1331-సీ., 10.1-1545-మ., 10.1-1545-మ., 11-7-సీ.,

  108) తృప్తిరూప- ( ){సంజ్ఞా}[నది]:- క్రౌంచద్వీపంలోని ఋషిజ్య వర్షంలో ఆనందం అను పర్వతము, తృప్తిరూప అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  109) తెలగయ- (పురుష){సంజ్ఞా}[ఏర్చూరి]:- తెలగయ మంత్రి భాగవతం తెలుగీకరించిన సింగయ తమ్ముడు. శ్రీవత్సగోత్రం ఏర్చూరు వంశమునందు కసువనమంత్రికి ధర్మపత్ని ముమ్మడమ్మ యందు సింగయ, తెలగయ అను పుత్రులు పుట్టారు. - వంశం - ఏర్చూరి; తండ్రి - కసువన; తల్లి - ముమ్మడమ్మ; పద్య సం.(లు) - 6-29-క.

  110) తేజస్సు- ( ){జాతి}[పరికరము]:- తేజస్సు అంట్ పంచభూతములలోని అగ్ని - వంశం - పరికరము; పద్య సం.(లు) - 7-427-వ.

  111) తేటగీతి- ( ){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఉపజాతి ఛందోరీతి తేటగీతి. వీటిని గ్రంధములో విడిగా 290 పద్యాలకు ఉపయోగించారు. అదే సీసపద్యం క్రింద ఉపపద్యంగా 771 పద్యాలకు ఉపయోగించారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 1-14-తే., . . . .

  112) తేటి- (స్త్రీ){జాతి}[కీటకము]:- ఆడ తుమ్మెద - వంశం - కీటకము; పద్య సం.(లు) - 8-31-క.,

  113) తైత్తిరేయము- ( ){జాతి}[వేదం]:- యజుర్వేద ఉపదేశం పొందిన వైశంపాయన మహర్షి ఆయన శిష్యులలో ఒకడు యాజ్ఞవల్క్యుడు. అతడు గురువుపట్ల అపరాధం చెయ్యడం మూలంగా, నేర్చుకున్న వేదములను తనకు ఇచ్చి పొమ్మని కోపగ్రస్తుడై వైశంపాయనుడు అనగా యజుస్సంహితలను యజ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్నవాటిని నేర్చుకున్న క్రమంలోనే వమనం చేసాడు. అవి రక్తసిక్తమైన రూపు దాల్చాయి. అంతట యజుర్మంత్ర గణముల అధిష్టానదేవతలు తిత్తిరిపక్షుల రూపంలో వచ్చివాటిని తినేశారు. అందువల్లనే ఆ శాఖలకు తైత్తిరీయశాఖలు అనే పేరు వచ్చింది. తను నేర్చిన యజుర్వేద విద్యపోవడంచేత యజ్ఞవల్క్య మహర్షి నిర్వేది అయ్యాడు. అందువల్ల బాగా నిర్వేదం పొంది తీవ్రతపస్సు చేసి సూర్యుని సంతృప్తిని చేసాడు. సూర్యుడు యజుర్మంత్ర సంహితలను అశ్వరూపం ధరించి అతనికి బోధించాడు. అందువల్లనే వాటికి వాజసనేయశాఖ అన్నపేరు కలిగింది. - వంశం - వేదం; పద్య సం.(లు) - 12-30-వ.,

  114) తొండము- ( ){జాతి}[అవయవము]:- ఏనుగు తొండము - వంశం - అవయవము; పద్య సం.(లు) - 8-35-మ., 8-36-క., 8-39-సీ.,

  115) తోటకము- ( ){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఒక ఛందోరీతి వృత్తము ఈ తోటకము.
గ్రంథములో ఈ ఛందస్సు ఒక్క పద్యమునకు మాత్రమే వాడారు. - వంశం - భాష; పద్య సం.(లు) - 6-531-తో.,

  116) తోమరములు- (){జాతి}[పరికరములు]:- తోమరములు అంటే చర్నాకోలలు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 4-327-ఉ., 4-343-మ., 6-364-చ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

  117) తోయజగంధము- ( ){జాతి}[పరికరములు]:- తామరల సువాసన - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-44-సీ.,

  118) తోషుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- స్వాయంభువమన్వంతరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అంశతో అవతరించిన యజ్ఞుడు, దక్షిణలకు 'యామ' అను దేవతలు కలిగారు. వారు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అని పన్నెండుమంది. వీరిని తుషితులు అనికూడా అంటారు. స్వాయంభువ మన్వంతరంలో తుషితులు దేవగణాలయ్యారు. - వంశం - మనువు వంశం; తండ్రి - యజ్ఞుడు ; తల్లి - దక్షిణ ; పద్య సం.(లు) - 4-6-వ.,

  119) త్రయారుణి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఉరుక్షయుని పుత్రుడు. మహావీర్యునికి ఉరుక్షయుడు; ఉరుక్షయునకు త్రయారుణి, కవి, పుష్కరారుణి అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు విప్రులైపోయారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఉరుక్షయుడు; పద్య సం.(లు) - 9-653-వ.,

  120) త్రయ్యారుణి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హరీతుడు అనే ఆరుగురు రోమహర్షణుని నుండి పురాణాలు నేర్చుకుని, పురాణ ప్రవక్తలుగా ప్రసిద్ధులు అయ్యారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  121) త్రసదస్యుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ త్రసదస్యుడు సూర్యవంశంలోని పురుక్సుతుని కొడుకు. మాంధాత (త్రసదస్యుడు) పెద్దకొడుకైన అంబరీషుని తాత యవనాశ్వుడు దత్తత తీసుకున్నాడు. అంబరీషునికి యౌవనాశ్వుడు. అతనికి హారితుడు పుట్టిరి. అందుచేతనే అంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాత గోత్రానికి ముఖ్యపురుషులు అయ్యారు. మాధాత రెండవ (2) పుత్రుడు పురుక్సుతుడు అతనిని నాగలోకమునకు తీసుకు వెళ్ళి నాగయువకులు తమ సోదరి నర్మదను ఇచ్చి పెండ్లి చేసారు. పురుక్సుతుడు అక్కడ చాలామంది గంధర్వులను సంహరించి, తన నాగలోకసంచారం మననం చేసేవారికి సర్ప భయం లేకుండేలా వరం పొందాడు. పిమ్మట వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ రెండవకొడుకు పురుక్సుతునికి త్రసదస్యుడు పుట్టాడు. త్రసదస్యునికి అనరణ్యుడు. ఆ అనరణ్యునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి అరుణుడు. అరుణునికి త్రిబంధనుడు. త్రిబంధనునికి సత్యవ్రతుడు. పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధుడయ్యేడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - పురుక్సుతుడు; తల్లి - నర్మద; కొడుకు(లు) - అనరణ్యుడు; పద్య సం.(లు) - 9-191-వ.

  122) త్రసదస్యుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- త్రసదస్యుడు అన్నది మాంధాతకు మరొక పేరు. సూర్యవంశలోని సేనజిత్తుని కొడుకైన యవనాశ్వుడు కొడుకులులేక చేస్తున్న ఐంద్రయాగం నందు పొరపాటున మంత్రజలం త్రాగాడు. అంత, అతని కడుపు చీల్చుకుని కుమారుడు పుట్టాడు. తల్లిలేని ఆ పిల్లాడు ఆకలికి ఏడుస్తుంటే, వానినోట ఇంద్రుడు వ్రేలిని పెట్టాడు. అందుచేత, "మాంధాత" అని పేరు వచ్చింది. పెద్దయ్యాక, రావణాది శత్రురాజులను సంహరించుటచే మాంధాతకు, "త్రసదస్యుడు" అని మరొక పేరు వచ్చింది. ఇతను అనేక యజ్ఞాదులు చేసాడు. ఇతను శతబిందుని పుత్రిక బిందుమతిని వివాహమాడాడు. ఆమె యందు అతనికి పురుక్సుతుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని ముగ్గురు (3) పుత్రులు, ఏభైమంది (50) పుత్రికలు పుట్టారు. వారుం అందరూ సౌభరి అనే మునీశ్వరుని వివాహమాడాడు.
మాంధాత (త్రసదస్యుడు) పెద్దకొడుకైన అంబరీషుని తాత యవనాశ్వుడు దత్తత తీసుకున్నాడు. రెండవకొడుకు పురుక్సుతునికి త్రసదస్యుడు పుట్టాడు. త్రసదస్యునికి అనరణ్యుడు. ఆ అనరణ్యునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి అరుణుడు. అరుణునికి త్రిబంధనుడు. త్రిబంధనునికి సత్యవ్రతుడు. పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధుడయ్యేడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - యవనాశ్వుడు; భార్య - బిందుమతి; కొడుకు(లు) - అంబరీషుడు, పురుక్సుతుడు, ముచుకుందుడు; కూతురు(లు)- ఏభైమంది (50) పుత్రికలు; పద్య సం.(లు) - 9-165-వ., నుండి 9-178-వ, వరకు, 9-191-వ.

  123) త్రసరేణువు- ( ){జాతి}[కాలం]:- త్రసరేణువు అంటే కిటిరీలోంచి పడే సూర్య కిరణంలో కనబడే చిన్న రేణువు. దానిలో ఆరవ వంతు భాగానికి అణువు అని పేరు. మన కాలమానం ప్రకారం, రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. నూరు త్రుటులు వేధ, మూడు వేధలు ఒక లవం, మూడు లవాలు ఒక నిమేషం. (ఇది ఇప్పుడు మనం వాడే నిమిషం కాదని గమనించండి) - వంశం - కాలం; పద్య సం.(లు) - 3-345-సీ., 3-346-వ.

  124) త్రికకుత్తు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- త్రికకుత్తు బ్రహ్మకు సారథి. ఇతను చంద్రవంశంవాడు. అనేసునికి శుద్ధుడు; శుద్దునకు శుచి; శుచికి బ్రహ్మదేవుడి రథసారథి అయిన త్రికకుత్తు పుట్టారు. అతనికి శాంతరజుడు పుట్టాడు. అతడు మంచిజ్ఞాని ధన్యుడు, విరక్తుడు, అయ్యాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శుచి; కొడుకు(లు) - శాంతరజుడు; పద్య సం.(లు) - 9-503-వ.,

  125) త్రికవ్యుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-766-సీ.,

  126) త్రికూట పర్వతం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-30-వ.,

  127) త్రికూటం-1 ( ){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. భారతవర్షంలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు. ఆ పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవా, శిలా, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృథ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనేవి నదాలు. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  128) త్రికూటం-2 ( ){సంజ్ఞా}[పర్వతం]:- త్రికూటము అను పర్వతము గజేంద్రమోక్షణలోని గజేంద్రుడు ఈ పర్వత ప్రాంతం వాడు - అష్టమ స్కంధములోని త్రికూట పర్వతము వర్ణించబడింది. పాలసముద్రంలో త్రికూట మనే పర్వతం ఉంది. దాని ఎత్తు, వెడల్పు ఒక్కొక యోజనము (4 కోసులు అంటే సుమారు 14 కిలో మీటర్లు). దానికి బంగారం వెండి ఇనుప శిఖరాలు మూడు (3) ఉన్నాయి. కొండ సానువుల లోను శిఖరాలలోను యున్నట్టి రత్నాలు ధాతువులు వలన దిక్కులు భూమి ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద చెట్లు తీగలు పొదలు గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటుపడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చరియ లందు కిన్నరలు విహరిస్తుంటారు. అనేక జంతువులు, పక్షులు, ఫలపుష్పాదులు, వనచరులతో అలరారుతూ ఉంటుంది. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  129) త్రిగర్త- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- త్రిగర్త భారతదేశంలోని ఒక దేశం. ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కనుగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

  130) త్రితుడు-1 (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య నడ్వల యందు కలిగిన కొడుకులు పన్నెండుగురులో ఒకడు. వారు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - నడ్వల; పద్య సం.(లు) - 4-390-వ.,

  131) త్రితుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. అలా ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం విచ్చేసారు. వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని, శ్యమంతపంచకతీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు పద్దెనిమిది మందితో సమేతంగా యాగం చేసాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-సీ., 10.2-1129-వ.,

  132) త్రిదశులు- ( ){జాతి}[దేవయోని]:- త్రిదశులు అనగా దేవతలు {త్రిదశుడు - వ్యు. త్రిస్యః దశాః అస్య,, బ.వ్రీ., త్రిదశపరిమాణ వయస్కుడు, బాల్య కౌమార యౌవన వార్ధకములనెడి నాల్గు వయోదశలలో మూఁడవ దశలోనే ఉండువాడు., వేల్పు, దేవత}. అంగమహారాజు అపుత్రకుడు కనుక అతని యాగానికి దేవతలు హవిర్భాగాలు అందుకొనరాలేదు అని విజ్ఞలు తెలిపారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-394-సీ.,

  133) త్రిదివము- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- త్రిదివము అంటే స్వర్గము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-558-వ.,

  134) త్రినయనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రినయనుడు అంటే విష్ణువు. వృత్రాసుర భయంతో దేవతలు విష్ణువు శరణ వేడుతూ త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-434-వ.,

  135) త్రినాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రినాభుడు అంటే ముల్లోకములు నాభి యందు కల ఆ వామన దేవుడు. అదితి గర్భంలో ఉన్న వామనుని బ్రహ్మదేవుడు "..త్రివిక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ! ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! .." అంటూ స్తుతించాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-503-సీ.

  136) త్రిపురఘస్మరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురఘస్మరుడు అంటే మహాశివుడు. పృథుచక్రవర్తి పంటలు సరిగా పండటంలేదని కోపంతో భూదేవిపై బాణం సంధించిన సందర్భంలో, అతను త్రిపురఘస్మరుడైన పరమశివునిలా రౌద్రమూర్తి అయ్యాడని వర్ణించబడింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-471-క,,

  137) త్రిపురములు- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- త్రిపురములు నిర్మించి మయుడు, ఓడి తన దండ జేరిన దానవులకు ఇచ్చాడు. వానిలో వారు ప్రవేశించి యదేచ్ఛగా తిరిగేవారు,
పరమశివుడు ఆ త్రిపురాలపై బాణాగ్ని కురిపించగా దందహ్యమానులైన దానవులను యయుడు సిద్దరసకూపంలో వేసి పునరుజ్జీవితులను చేసాడు.
విష్ణుమూర్తి పాడియావుగా, బ్రహ్మదేవుడు దూడగా వెళ్ళి ఆ కూపంలోని సిద్ధరసం అంతా తాగేస్తారు అటుపిమ్మట విష్ణువు రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధసామగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు. వాటితో వెళ్ళి శివుడు త్రిపురాలను కూలగొట్టాడు - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 7-192-వ., 7-397-వ., 7-401-వ., నుండి 7-406-ఆ, వరకు

  138) త్రిపురవైరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురవైరి అనగా శివుడు. రంభాదులు వచ్చినప్పుడు నరనారాయణులు చలించలేదు. ఆ సందర్భంలో "మన్మథుడిని ఓడించి కామాన్ని జయించవచ్చు. యముని ధిక్కరించి, మృత్యుంజయుడై ప్రకాశించవచ్చు. కానీ, ఆడవారి వాలుచూపుల వాడిబాణాలను గెలవడం త్రిపురవైరి ఐన ఆ మహాశివుడికైనా సాధ్యంకాదు." అని వర్ణించబడింది - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-405-ఆ.,

  139) త్రిపురశాసనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురశాసనుడు అంటే పరమ శివుడు. అత్రి, పుత్రుని కోసం తపస్సు చేయగా త్రిమూర్తులు దర్శనం ఇచ్చి అనుగ్రహించిన సందర్భంలో శివుని త్రిపురశాసను డని పలికారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-14-చ.,

  140) త్రిపురాతంకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురాంతకుడు అంటే పరమశివుడు. వరమిచ్చిన బాణాసురుడు ఉషానిరుద్దులను సగౌరవంగా అప్పజెప్పాక, మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమ శివుని వద్ద సెలవు తీసుకున్నాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-448-ఉ.,

  141) త్రిపురాధిపుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- త్రిపురాధిపుడు మయుని త్రిపురాలకు అధిపతియైన దానవుడు. అ బలిచక్రవర్తి ఇంద్రునితో చేసిన యుద్ధంలో అతని తరఫున నిలబడిన వారిలో ఒకడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-331-వ.,

  142) త్రిపురాలయులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- త్రిపురాలయులు అనగా త్రిపురాలలో ఉండే దానవులు. ఆ త్రిపురములను మయుడు, ఓడి తన దండ జేరిన దానవులకు నిర్మించి ఇచ్చాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-395-క.,

  143) త్రిపురాసురసంహారకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురాసురసంహారకుడు అంటే పరమశివుడు. సంతానార్థం దితి అసురసంధ్యవేళ భర్త కశ్యపుని చేరింది. అంత కశ్యపుడు ఇది కలియుటకు తగిన సమయం కాదని వారిస్తూ రుద్ర స్తోత్రం చేస్తాడు. అందు "ఎవరైతే దేవదేవుని, త్రిపురాసుర సంహారుని, హరుని, అస్ధిమాలాధరునీ, ఆది భిక్షువుని, బూడిద పూసుకునేవాడనీ, శ్మశానవాసి అనీ, అపహాస్యం చేసేవారు పరమ నిర్భాగ్యులు." అని కూడా అంటాడు.
దక్షయధ్వర ధ్వంసం కోసం వీరభద్రుడు వస్తుంటే. రేగిన దుమ్మూధూళి చూసి, సభలోని బ్రాహ్మణ స్త్రీలు అంతటి మహాశివునికి కోపం తెప్పించిన ఈ దక్షుడు అనుభవిస్తాడు అంటూ శివుని త్రిపురాసుర సంహారకు డని అంటారు.
దక్షాధ్వరధ్వంసంలో గాయపడిన దేవతలను ఊరడిస్తూ బ్రహ్మదేవుడు త్రిపురాసురసంహారుడైన శివుడు దయామయుడు అతనిని శరణువేడండి అని చేప్తాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-467-సీ., 4-117-సీ., 4-1311-సీ., 6-178-సీ., 10.2-319-తే.,

  144) త్రిపురాసురులు- (పురుష){జాతి}[రాక్షసయోని]:- త్రిపురాసురులు అంటే మయనిర్మితమైన త్రిపురములలో ఉండే దానవులు. విష్ణువు రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధసామగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు. వాటితో వెళ్ళి శివుడు త్రిపురాలను మిట్టమధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కూలగొట్టాడు, అలా త్రిపురాసుర సంహారం జరిగింది.
త్రిపురాసులు మున్నగు రాక్షసవీరులు సురాసుర యుద్ధములో బలి పక్షమున పోరాడాడు. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 7-405-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు

  145) త్రిపురుషాధీశ్వరుడు - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపురుషాధీశ్వరుడు అంటే త్రిపురుష (1క్షరపురుషుడైన వ్యక్తి 2అక్షర పురుషుడైన జీవుడు 3అంతర్యామియైన పురుషోత్తముడు) తానే అయిన ప్రభువు అయిన విష్ణువు. ప్రచేతసులకు దర్శనమిచ్చిన విష్ణువు సరసుడు, త్రిపురాధీశ్వరుడు, బ్రహ్మభూతుడు ఐన తనను కొలిచేవారికి ఘన శోక, మోహ, మోదములు కలుగవు అని చెప్పాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-915-క.,

  146) త్రిపృష్టుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిపృష్టుడు అంటే మూడడుగులు అడిగిన ఆ వామన దేవుడు. అదితి గర్భంలో ఉన్న వామనుని బ్రహ్మదేవుడు "..త్రివిక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ! ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! .." అంటూ స్తుతించాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-503-సీ.

  147) త్రిపృష్టుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- త్రిపృష్ఠుడు వసుదేవునికి ధృతదేవ కడుపున పుట్టినవాడు. వసుదేవాదుల వంశం వర్ణిస్తూ చెప్పబడింది. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - ధృతదేవి; పద్య సం.(లు) - 9-722-వ.,

  148) త్రిబంధనుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- త్రిబంధనుడు మాంధాత తరువాతి తరాలలోని అరుణుని కొడుకు, త్రిశంకుని తండ్రి. మాధాత రెండవ (2) పుత్రుడు పురుక్సుతునికి త్రసదస్యుడు. త్రసదస్యునికి అనరణ్యుడు. ఆ అనరణ్యునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి అరుణుడు. అరుణునికి త్రిబంధనుడు. త్రిబంధనునికి సత్యవ్రతుడు. పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధుడయ్యేడు అతడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - అరుణుడు; కొడుకు(లు) - సత్యవ్రతుడు (త్రిశంకుడు, హరిశ్చంద్రుడు); పద్య సం.(లు) - 9-191-వ.,

  149) త్రిభంగి- ( ){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - మువ్వంకల భంగిమ,మూడు వంకరల భంగిమ (1 కుడికాలు మీద ఎడమకాలు వంకరగా బొటకనవేలు నేలను తాకునట్లు పెట్టుటచేనగు వంకర 2 తల ఎడమపక్కకు వాల్చుటచేనగు వంకర 3 కుడి చేతిని వంచి వేణువురంధ్రవులందు వేళ్ళూనుట యందలి వంకర అనెడి మూడు వంకరలు, కలుగునట్లు వేణుమాధవుడు నిలబడెడి భంగిమ) శరత్కాలంలో శ్రకృష్ణుడు త్రిభంగియై వేణువు ఊదాడు - రాసక్రీడ - నృత్తము వర్ణించబడింది, - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 3-1181-సీ., 10.1-1084-వ.,

  150) త్రిభంగితానకము- ( ){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
మువ్వంకల దేహము వంచి నటనము చేయుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  151) త్రిభువనగురుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిభువనగురుడు అంటే బ్రహ్మదేవుడు. "ఈశ్వర కల్పితాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని దక్కించుకో” అని బ్రహ్మదేవుడు అన్నాడు. "ప్రియవ్రతుండు త్రిభువన గురుండయిన చతురానను వాక్యంబు లవనతమస్తకుం డై బహుమాన పూర్వకంబుగ నంగీకరించె; " - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-434-వ.,

  152) త్రిభువనజయరూఢుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిభువనజయరూఢుడు ముల్లోకములను జయించుట నిశ్చయముగాగలవాడు, విష్ణువు; అదితి గర్బంలో ఉన్న వామనుని త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ!.. అంటూ స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-503-సీ.,

  153) త్రిభువనాత్మభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిభువనాత్మభవుడు విష్ణువు. వృత్రాసుర భయంతో దేవతలు విష్ణువు వేడుకుంటూ త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-434-వ.,

  154) త్రిమస్తకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- హిరణ్యకశిపుని వద్ద రాక్షసవీరుడు. హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి సంహరించాడని హరిమీద శత్భభావం పెండుకున్నాడు. "త్రిమస్తకుడు", త్రిలోచనుడు, శకుని, శతబాహువు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మున్నగు రాక్షసులతో ఇలా అన్నాడు. "మనం హరికి లొంగకుండా వాడిని లొంగదీసుకుందాం, హరి తల నరికి, ఆ రక్తంతో మాతమ్ముడికి తర్పణం వదులుతాను. విష్ణువు అంటూ వేరే ఎవడూ లేడు; యజ్ఞాదులు విప్రులు అతని రూపు. కనుక బ్రాహ్మణులను, ఋషులను. యజ్ఞాలనూ నాశనం చేయండి. బయలుదేరండి." - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-29-వ. నుండి 7-34-శా.,

  155) త్రిలోకపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోకపతి నారాయణుడు. అని హరి షష్ఠస్కంధం షష్ఠ్యంతాలలో స్తుతించబడ్డాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-32-క.,

  156) త్రిలోకమనోహరానుభావుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోకమనోహరానుభావుడు విష్ణువు. వృత్రాసుర భయంతో దేవతలు విష్ణువు వేడుకుంటూ త్రిభువనాత్మభవ! త్రివిక్రమ! త్రినయన! త్రిలోక మనోహరానుభావ! అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-434-వ.,

  157) త్రిలోకశరణ్యుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోకశరణ్యుడు శివుడు. బాణాసురుడు సంపాదించిన తన బహు బాహుబలం అంతా వాడి ఝంజ వాయించి, మఱియూ ఇంకా అనేక రకాలుగా ఆ త్రిలోకశరణ్యుడైన పరమేశ్వరుడిని మెప్పించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-314-ఉ.,

  158) త్రిలోకశరణ్యుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోకశరణ్యుడు కృష్ణుడు. జరాసంధుని కారాగారంలో మ్రగ్గుతున్న రాజులు కృష్ణుని కాపాడమని సందేశం పంపినప్పుడు, కృష్ణుని త్రిలోకశరణ్యుడు అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-752-చ.,

  159) త్రిలోకారాధితుడు - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోకారాధితుడు కృష్ణుడు. నాగ్నజితి మోహనకారుడూ, పద్మనేత్రుడూ, త్రిలోకారాధితుడూ, ఐన మాధవుడే తనకు భర్త కావాలని భావించింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-128-క.,

  160) త్రిలోచనుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిలోచనుడు అంటే ముక్కంటి, శివుడు. ప్రచేతసులు కొలనునుండి వెలువడిన త్రిలోచనుని చూసారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-695-మ.,

  161) త్రిలోచనుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- త్రిలోచనుడు మున్నగు రాక్షసులను సోదరుని మృతికి కక్షగట్టిన హిరణ్యకశిపుడు చూసి "… ఈ వాడి బల్లెంతో విష్ణువు తల నరికేస్తాను. ఆ వేడి నెత్తురుతో మా తమ్ముడికి తర్పణం వదులుతాను.... మీరు వెళ్ళి బ్రాహ్మణులను, ఋషులను, యజ్ఞాలను నాశనం చేయండి." అన్నాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-29-వ. నుండి 7-34-శా.,

  162) త్రివక్ర- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- కుబ్జకు త్రివక్ర అని పేరు. దొడ్డికాళ్ళు, గూని, వంకరమెడలనే మూడువంకరల వలన త్రివక్ర అని పేరువచ్చింది. ఈమె కంసుని ఇష్ట లేపనవిద్యగత్తె. కృష్ణుడు మధురకు వచ్చినప్పడు, అతనికి మంచి లేపనములు ఇచ్చింది. కృష్ణుడు ఆమె కాళ్ళపై తొక్కి రెండువేళ్ళు గెడ్డంక్రింద పెట్టి లేపాడు. సకల వంకరలు తొలగి గొప్ప అందగత్తెగా మారింది. ఆ సంతోషంలోనూ, కృష్ణుని అందానికి మరలుగొని ఆహ్వానించింది. కంసవధ తరువాత, వెళ్ళి ఆమె కోరిక తీర్చాడు. వీరికి ఉపశ్లోకుడు అని పుత్రుడు కలిగాడు. - వంశం - చంద్రవంశం; కొడుకు(లు) - కృష్ణుని వలన ఉపశ్లోకుడు; పద్య సం.(లు) - 10.1-1274-క. నుండి 10.1-1283-వ., 10.2-1330-వ.

  163) త్రివర్గము- ( ){జాతి}[ధర్మము]:- త్రివర్గము అంటే ధర్మము అర్థము కామము {త్రివర్గ - ధర్మము అర్థము కామము అనెడి మూడు (3) వర్గములు - వంశం - ధర్మము; పద్య సం.(లు) - 4-368-వ.,

  164) త్రివిక్రమదేవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వీరు భయంకర స్థలాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-300-చ., నుండి 6-307-వ.,

  165) త్రివిక్రముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రివిక్రమ ముల్లోకాలనూ ఆక్రమించిన వాడు.
వీరు ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి.
త్రివిక్రముడు అంటే మూడడుగులుతో ముజ్జగాలు ఆక్రమించిన ఆ వామన దేవుడు. అదితి గర్భంలో ఉన్న వామనుని బ్రహ్మదేవుడు "..త్రివిక్రమ! పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ! ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! .." అంటూ స్తుతించాడు. వామనుడుగా అవతరించిన విష్ణువు, బలిచక్రవర్తినుండి మూడడుగుల నేల దానం గ్రహించాడు. ఆ పొట్టివాడు ఇంతింతై.. అంటూ పెరిగి పెరిగి ముల్లోకాలను రెండడగులకే ఆక్రమించి, త్రివిక్రముడయ్యాడు. అప్పుడ అతని కాలి బొటకనవేలు గోరు తగిలి, బయటి జలం కారి విష్ణుపాది నది. బ్రహ్మదేవుడు వచ్చి ఆ పాదానికి పూజచేసి కడిగిన నీరే గంగానదిగా ముల్లోకాలలోనూ పారుతోంది. దీనిని బట్టే "బ్రహ్మకడిగినపాదమూ" అని అన్నమయ్య కీర్తించాడు. ఆ మహానుభావుడు మూడవ అడుగు ఎక్కడపెట్టమన్నావు అంటే, బలి నాకు అబద్దంలేదని తన తలపై పెట్టమన్నాడు. పిమ్మట అతనిని వచ్చే సావర్ణి మన్వంతరంలో ఇంద్రపదవి ఇస్తాను అని చెప్పి సుతలానికి పంపి గదాధరుడై కాపాలా ఉంటాననన్నాడు. ఫలశ్రుతిలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తుంటారో, వారు ఎప్పుడూ సర్వ సుఖాలూ పొందుతూ ఉంటారు అని తెలుపబడింది.
పూతన పీనుగపై ఆడుతున్న కృష్ణశిశువును ఎత్తుకుని తెచ్చాకా, గోపకాంతలు, పీడాహరణార్థం దిష్టి తీస్తూ, ముఖమును త్రివిక్రముడు రక్షించుగాక అనిరి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-200-చ., 5-2-112-సీ., 6-300-చ., నుండి 6-307-వ., 8-503-సీ., 6-343-వ., 8-503., 8-586-మ., 8-626-ఆ., 8-628-ఆ., 8-632-సీ., 8-687-తే., 8-689-తే., 8-690-మ., 10.1-236-వ.,

  166) త్రివిష్టము- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- త్రివిష్టము అనగా స్వర్గలోకము. భూర్భువసువః అను ముల్లోకాలలో మూడవది కనుక త్రివిష్టపము. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 4-277-వ., 4-376-వ., 8-458-వ.,

  167) త్రివృత్ప్రాణాయామములు- ( ){జాతి}[యోగం]:- త్రివృత్ప్రాణాయామములు అనగా పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయాములు. - వంశం - యోగం; పద్య సం.(లు) - 4-248-వ.,

  168) త్రిశంఖుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- త్రిశంకుడు అని ప్రసిద్దుడైన రాజు సత్యవ్రతుడు. మాంధాత వంశంలోని అరుణునికి త్రిబంధనుడు. వానికి సత్యవ్రతుడు. పుట్టారు. అతను విశ్వామిత్రునిచే బొందితో స్వర్గానికి పంపబడి, వారు తోసివేయగా తలక్రిందులుగా పడిపోతుంటే, విశ్వామిత్రుడు ఆపి అతనికోసం త్రిశంకు స్వర్గం నిర్మించాడు. త్రిశంకని కొడుకు హరిశ్చంద్రుడు యాగదక్షిణ అనె వంకతో అతని సమస్త సంపదలను విశ్వామిత్రుడు కొల్లగొట్టి, నీచ సేవన చేయించి, ఎన్నో ఇక్కట్లు పెట్టాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్దమాడకుండ ఎంత కష్ఠాన్ని అయినా భరించాడు. వరుణునికి పుత్రుడు కలిగితే తనకి బలిస్తానని మ్రొక్కి, రోహితుడు అని కొడుకు పుట్టాక, వాయిదాలు వేయసాగాడు. ఇది చూసిన రోహితుడు ఇల్లు విడిచి అడవికపోయాడు. వెనక్కి వస్తూ, యాగపశువుగా శునశ్శేపుని తెచ్చాడు. తండ్రి యాగం పూర్తేచేసాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - త్రిబంధనుడు; కొడుకు(లు) - హరిశ్చంద్రుడు; పద్య సం.(లు) - 9-191-వ. నుండి, 9-200-సీ.,

  169) త్రిశిఖుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నాలుగవదైన తామస మన్వంతరంలో త్రిశిఖుడు దేవేంద్రుడు. సత్యకులు, హరులు, వీరులు దేవతలు. తామసమనువు కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తఋషులు. విష్ణుమూర్తి హరి అమే పేరుతో అవతరించాడు. తామసమన్వంతరం లోనే గజేంద్రమోక్షణ కథ జరిగింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-18-సీ.,

  170) త్రిశూలము- ( ){జాతి}[పరికరం]:- త్రిశూలము మూడు కొనలుండు ఆయుధము, శివుని ఆయుధము. - వంశం - పరికరం; పద్య సం.(లు) - 4-116--సీ., 4-343-మ., 5.1-147-సీ.,

  171) త్రిశృంగ పర్వతము- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- మేరుపర్వతమునకు ఉత్తరంవైపున "త్రిశృంగ", మకరరము లను పర్వతము ఉన్నాయి. దక్షిణమున కైలాస, కరవీరము లను పర్వతములూ; తూర్పున జఠర, దేవకూటము లను పర్వతములూ; పడమర పవన, పారియాత్రము లను పర్వతములూ ఉన్నాయి - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 5.2-30-వ.,

  172) త్రిషవనస్నానములు- ( ){జాతి}[యాగం]:- త్రిషవనస్నానములు అనగా మూడుపూటలా చేయు స్నానములు. దేవహూతి కపిలోపదేశం పిమ్మట తన తపస్సులో త్రిషవన స్నానాలు చేసెను.
భరతుడు హరిసేవలో నిమగ్నుడై త్రిషవన సేవచేసేవాడు. - వంశం - యాగం; పద్య సం.(లు) - 3-1047-వ., 5.1-99-వ.,

  173) త్రిష్టుప్-1 ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుని రథానికి పూన్చిన సప్తాశ్వాలులో ఒకటి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-82-సీ.,

  174) త్రిష్టుప్-2 ( ){సంజ్ఞా}[భాష]:- శ్రీమహావిష్ణువునకు రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణాలు అనే ఇవి ఏడు ధాతువులని వర్ణిస్తారు. వాటిలో రోమాలు ఉష్ణికం ఛందస్సనీ, చర్మం ధాత్రీఛందస్సనీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువు "అనుష్టుప్" ఛందస్సనీ, శల్యం జగతీఛందస్సనీ, మజ్జ పంక్తిచ్ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు.
మైత్రేయుడు విదురునితో విష్ణుమూర్తి రోమాలనుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రీ ఛందస్సు, మాంసం వలన "త్రిష్టుప్" ఛందస్సు, కీళ్ళువల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముకలనుండి జగతీ ఛందస్సు, మజ్జవల్ల పంక్తి ఛ్చందస్సు, ప్రాణంవల్ల బృహతీ ఛందస్సు పుట్టాయి అని చెప్పాడు. - వంశం - భాష; పద్య సం.(లు) - 2-89-వ., 3-388-వ.,

  175) త్రిసంధ్యలు- ( ){జాతి}[కాలము]:- త్రిసంధ్యలు అనగా త్రి (మూడు, ఉదయ మద్యాహ్న సాయంకాల) సంధ్యలు. బ్రహ్మచర్య లక్షణాలు వర్ణిస్తూ త్రిసంధ్యలూ బ్రహ్మగాయత్రిని జపించాలి అని కూడా చెప్పబడింది - వంశం - కాలము; పద్య సం.(లు) - 7-421-వ.,

  176) త్రిసమ- ( ){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన అనేక మహానదులలో ఒక నది. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  177) త్రిసవనపాదుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్రిసవనపాదుడు అనగా ప్రాతః, మధ్యాహ్న, సాయంత్ర మనే కాలత్రయంలో, మూడు యాగములందు చరించువాడైన వరాహస్వామి. హిరణ్యాక్షసంహార ఘట్టంలో వరహావతారుడు ఇలా వర్ణించబడ్డాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-693-క.

  178) త్రిసానువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రుహ్యానుతుర్వసుల వంశంలో భర్గుని కొడుకైన భానుమంతుని కొడుకు త్రిసానువు; త్రిసానువు కుమారుడు కరంధముడు; కరంధముని కొడుకు మరుత్తుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భానుమంతుడు; కొడుకు(లు) - కరంధముడు; పద్య సం.(లు) - 9-699-వ.,

  179) త్రేతాయుగము- ( ){సంజ్ఞా}[కాలము]:- త్రేతాయుగము చతుర్యుగములు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు నాలుగింటిలో (మహాయుగంలో) రెండవ యుగము - వంశం - కాలము; పద్య సం.(లు) - 1-430-వ., 3-349-సీ., 7-384-వ., 11-77-వ.,

  180) త్రైవర్గికపురుషులు- ( ){జాతి}[మానవ యోని]:- కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ, హరిపరాఙ్ముఖులై, ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-1022-వ.,

  181) త్వష్ట-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- త్వష్ట ద్వాదశ ఆదిత్యులలో నాలుగవవాడు. త్వష్ట తల్లిదండ్రులు అదితి కశ్యపులు, భార్యరచన, కొడుకు విశ్వరూపుడు. పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో త్వష్ట, రథం ఇచ్చెను. కశ్యపునికి భార్యయైన దక్షపుత్రి అదితి యందు ద్వాదశాదిత్యులు పుట్టారు. వారు 1వివస్వతుడు 2అర్యముడు 3పూషుడు 4త్వష్ట 5సవిత 6భగుడు 7ధాత 8విధాత 9వరుణుడు 10మిత్రుడు 11శుక్రుడు 12ఉరుక్రముడు అనెడు పన్నెడుమంది అదితి పుత్రులు. దైత్యుల సోదరి అగు రచన యందు త్వష్టకు విశ్వరూపుడు పుట్టాడు.
సూర్యుడు ఆశ్వయుజ (ఇషము) మాసంలో త్వష్ట అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస తిలోత్తమ; ఋషి ఋచీకతనయ (జమదగ్ని); నాగుడు కంబళాశ్వుడు; రాక్షసుడు బ్రహ్మపేతుడు,; గంధర్వుడు ధృతరాష్ట్రుడు; యక్షుడు శతజిత్తు, ఇషంబరుడు మున్నగువారు అనుచరులై ఉంటారు.
బృహస్పతి దూరమైనప్పుడు ఇంద్రాది దేవతలకు త్వష్ట కుమారుడైన విశ్వరూపుడు గురువుగా ఉన్నాడు. అతడు హవిర్భాగాలు దైత్యులకు రహస్యంగా ఇస్తున్నాడని తెలిసి ఇంద్రుడు సంహరించాడు
కొడుకు విశ్వరూపుని చంపినందుకు పగతో త్వష్ట చేసిన యాగంలో వృత్రాసురుడు పుట్టాడు. ఘోరమైన యుద్ధంలో ఇంద్రుని చేతిలో అతడు మరణించాడు.
సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో త్వష్ట, శంబరాసురునితో యుద్ధం చేసాడు. - వంశం - దేవయోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - అదితి ; భార్య - రచన; కొడుకు(లు) - వృత్రాసురుడు; విశ్వరూపుడు; పద్య సం.(లు) - 4-442-సీ.,., 4-443-సీ., 6-258-వ., 6-282-వ., 6-317-మ., 6-347-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు,12-41-వ., నుండి 12-45-వ., వరకు

  182) త్వష్ట-2 (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు భువనుడు దోషల కొడుకు, భార్య విరోచన, కొడుకు విరజుడు. విరజుడు ప్రియవ్రతుని వంశంలో చివరి రాజు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - భువనుడు; తల్లి - దోష; భార్య - విరోచన; కొడుకు(లు) - విరజుడు; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  1) దండకము-1 ( ){జాతి}[భాష]:- ఛందస్సు, తెలుగు భాగవతములో ఉపయోగించిన ఛందోరీతులలో ఒకటి ఈ దండకము.
తెలుగు భాగవతములో "శ్రీనాథనాథా" అని "శ్రీమానినీచిత్తచోరా" అని రెండు దండకములు ఉన్నాయి. - వంశం - భాష; పద్య సం.(లు) - 3-203-దం.,., 10.1-1236-దం.,

  2) దండకము-2 (){జాతి}[పరికరం]:- దండము అంటే దుడ్డుకఱ్ఱ, దండాయుధము, దండకము చిన్నది. లేగదూడలను మేపడానికి వెళ్తున్న కృష్ణుని చేతిలో వేత్ర దండకము ఉందని వర్ణంచబడింది. అలాగే బ్రహ్మదేవుడు వత్సబాలకులను దాచినప్పుడు. ఆ వత్సబాలకుల రూపాలు బాలకుల దండకాలుతో సహా అన్నీ తానే ధరించి చరించాడు. - వంశం - పరికరం; పద్య సం.(లు) - 10.1-502-శా., 10.1-511-మ., 10.1-1334-మ.,

  3) దండకాటవి- (){సంజ్ఞా}[ప్రదేశం]:- దండకాటవి అంటే దండకారణ్యం. రామావతార వర్ణనలో రాముడు ప్రవేశించాడని తెలుపబడింది.. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 2-162-చ.,

  4) దండకారణ్యము- (){సంజ్ఞా}[ప్రదేశం]:- దండకారణ్యం గోదావరి, కష్ణ, కావేరీ నదుల పరీవాహక ప్రదేశంలో ఉంది. తాపసోత్తములకు అలవాలము. ఆ విశిష్టమైన దండకారణ్యంలోకి శ్రీరాముడు వనవాసం గడిపాడు.
దండకారణ్యం : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) : దక్షిణ భారతంలో ఒకప్పుడు మహారణ్యం. రామాయణంలో ప్రాముఖ్యం వహించిన ప్రదేశం; పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ఇక్ష్వాకు పుత్రుఁడు అగు దండుఁడు అసురకృత్యములచే జననిందితుఁడు అగుటవలన తండ్రిచే వింధ్యశైలమునకు పంపఁబడి అందు మధుమంతము అను పట్టణము ఒకటి నిర్మాణము చేసికొని అసురులతో కలిసి అసురగురువైన శుక్రాచార్యులకు శిష్యుఁడు అయి ఆపురమును ఏలుచు ఉండెను. ఒకనాడు అతఁడు శుక్రాచార్యుని ఆశ్రమమునకు పోయి అచట తపము ఆచరించుచు ఉన్న అతని పెద్దకొమార్తె అగు అరజ అను దానిని కని మోహించి అది అయుక్తము అని ఆమె ఎంత చెప్పినను వినక బలాత్కారముగా ఆమెను కూడి వెడలిపోయెను. అంతట శుక్రుఁడు మిగుల ఆగ్రహించి ఆదండుఁడు సపరివారముగ నేలపాలు అగునట్లును, ఆ మధుమంతముచుట్టు ఏఁడుదినములు మట్టి వాన కురియునట్లును జనశూన్యము అగునట్లును శాపము ఇచ్చెను. (రామాయణం ఉత్తరాకండ, 662-14నుండి22వరకు) - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 9-268-ఉ.,

  5) దండకావనము- (){సంజ్ఞా}[ప్రదేశం]:- దండకావనం అంటే దండకారణ్యము. బలరాముడు యాత్రలకు వెళ్ళినప్పుడు దండకావనం కూడా వెళ్ళాడు. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.2-953-వ.,

  6) దండకుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దండకుడు సూర్యవంశంవాడు, తండ్రి ఇక్ష్వాకుడు. ఇతను ఇక్ష్వాకుని వందమది కొడుకులలో మూడవవాడు. వికుక్షి, నిమి అన్నలు. వీరు ముగ్గురు (3) ఆర్యావర్తంలోని హిమాచలమునకున్ వింధ్యపర్వతముల నడుమ భూభాగాన్ని పాలించారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఇక్ష్వాకుడు; పద్య సం.(లు) - 9-156-సీ.,

  7) దండధరకింకరులు- (పురుష){జాతి}[దేవయోని]:- దండధరకింకరులు అంటే యమభటులు. కాలం అయినప్పుడు, యమభటులు తోలుకుపోతుంటే, అతను అయ్యో. నేను పుణ్యం చేయలేదే, పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-47-సీ., 10.2-474-వ., 11-30-వ.,

  8) దండధరపురి- (){సంజ్ఞా}[ ప్రదేశం]:- దంఢధరపురి అంటే యమపురి - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.1-1424-క.,

  9) దండధరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దండధరుడు అంటే యముడు. ముసలం కారణంగా యాదవనాశనం జరిగింది. విదురుడు శాపగ్రస్తుడైన యముడు కనుక తన స్వస్థానానికి వెళ్ళాడు.
మునులు నైమిశంలో సత్రయాగం చేస్తుండగా సూతమహర్షిని భాగవతం చెప్పిమని అడిగారు. ఆ యాగం చూడడానికి యముడు వచ్చి విష్ణుకథలు వింటూ యాగం అయ్యేవరకూ ఎవరినీ చంపలేదట
దండధరుడు (యముడు) సాగరమథనం తరువాత జరిగిన యుద్ధంలో ఇంద్రుని వైపు ఉండి యుద్ధము చేసాడు. యముడు కాలనాభుడితో తలపడ్డాడు.
ప్రభావాన్ని సంపాదించిన ధ్రువుడు యమధర్మరాజును ఎడమకాలితో తన్ని ఈ లోకంలోనూ, పర లోకంలోనూ కూడా ప్రసిద్ధికెక్కి ఉన్నతపదాన్ని అందుకున్నాడు.
అజామిళుని విష్ణుభటులు విడిపించాక, యమభటులు వెళ్ళి యమునితో ఇలా అన్నారు - దండించే అధికారం లోకంలో నీకు గాక మరెవ్వరి కున్నది? నీవు దండింప దగినవారిని ఉద్దండంగా దండిస్తావు. అందుకే అందరు నిన్ను దండధరుడని స్తుతిస్తారు.
నరసింహ అవతారాన్ని నిష్ఠతో ఉపాసించే వారు యముని వలన బాధలు బడరు; మృత్యుభయంపొందరు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-389-వ., 1-394-సీ., 1-394-ఆ., 2-16-సీ., 2-26-వ., 3-449-తే., 4-173-సీ., 6-166-క., 7-381-సీ., 8-327-క., నుండి 8-334-వ., వరకు, 10.1-668-వ., 10.1-1593-ఆ., 10.2-21-క.,

  10) దండపాణి-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దండపాణిది చంద్రవంశం. పరీక్షిత్తుకు భవిష్యత్తు కాలంవారిని వర్ణిస్తూ శుకుడు పరీక్షిత్తునకు ఇతనిగురించి చెప్పాడు. ఈ దండపాణి తండ్రి పేరు విహీనరుడు, కొడుకు పేరు మిత్రుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - విహీనరుడు; కొడుకు(లు) - మితుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  11) దండపాణి-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దండపాణి అంటే యముడు, దక్షిణదిక్పతి. ధర్మరాజు యాగానికి అష్టదిక్పాలకులు కూడా విచ్చేసారని వర్ణిస్తూ. ఇంద్రుడు {తూర్పు దిక్పతి}; శిఖి {ఆగ్నేయ దిక్పతి}; దండపాణి {దక్షిణ దిక్పతి}; నికషాత్మజ (నైరృత దిక్పతి}; పాశి {వరుణుడు, పడమటి దిక్పతి}; సమీర {వాయవ్య దిక్పతి}; గుహ్యకేశ్వర {కుబేరుడు, ఉత్తర దిక్పతి}; శశిమౌళి = {ఈశానుడు, ఈశాన్య దిక్పతి}; అని వర్ణించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-773-చ., 10.2-1299-క.,

  12) దండభృత్- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దండభృత్ అంటే యమధర్మరాజు. శుకబ్రహ్మ పరీక్షిత్తుకి భాగవత తత్వం చెప్పి, విష్ణుభక్తిలేనివానికి యమభటుల గదలచేత వక్షస్థలం మొత్తించుకోవడం, యమలోకం ముందు వైతరిణీ నదిలో పడడం తప్పవు. . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-24-మ.,

  13) దండమానుడు- (పురుష){సంజ్ఞా}[ఆంధ్వ జాతీయుడు]:- దండమానుడు పరీక్షిత్తునకు భవిష్యకాలపు రాజు. ఆంధ్రజాతీయుడైన మేఘస్వాతికి పుత్రుడు. ఇతని పుత్రుడు హాలేయుడు అగు అరిష్టనేమి. - వంశం - ఆంధ్వ జాతీయుడు; కొడుకు(లు) - అరిష్టనేమి; పద్య సం.(లు) - 12-8-వ.,

  14) దండరచితకరణము- (){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
దేహము కర్రవలె బిగదీయుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  15) దండలాతదైవమండలము- (){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
బాణాకర్ర తిప్పునట్లు రెండు చేతులు చేర్చి మీదికెత్తి గిరగిర తిప్పుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  16) దండి-1 (){జాతి}[ప్రదేశం]:- దండి అంటే దండకారణ్యం. అర్జునుడు అన్నగారికి కృష్ణనిర్యాణం చెప్తూ, దండకారణ్యంలో ఖాండవదహనం చేసానంటే కృష్ణభగవానులు దయ వలననే కదా అన్నాడు. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 1-361-క.,

  17) దండి-2 (){జాతి}[మానవ యోని]:- దండి అంటే బ్రహ్మచారి, దండము ధరిస్తాడు కనుక దండి. శ్రీమానినీచోర దండకంలో "దండివి (బ్రహ్మచారిని అయి బలిచక్రవర్తిని యాచించలేదా, త్రివిక్రముడవు కాలేదా" అని కీర్తించారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1236-దం.,

  18) దండి-3 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దండి అంటే దండధరుడుకనుక యముడు. కువలయాపీడంతో కృష్ణుడు పోరు సందర్భంలో. ఆ ఏనుగు తొండాన్ని యమదండం వలె అని వర్ణిస్తూ దండిదండము అన్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1321-వ., 10.1-1558-వ.,

  19) దండితారిసమూహుడు- (){సంజ్ఞా}[దేవయోని]:- పంచమస్కందాంతంలో శ్రీకృష్ణుని, శిక్షింపబడిన శత్రువులు కలవాడు, దండితారి సమూహుడని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 5.2-167-మత్త.,

  20) దండిదండం- (){సంజ్ఞా}[పరికరం]:- దండిదండం అంటే యమదండం. కువలయాపీడంతో కృష్ణుడు పోరు సందర్భంలో. ఆ ఏనుగు తొండాన్ని యమదండం వలె అని వర్ణిస్తూ దండిదండము అన్నారు. - వంశం - పరికరం; పద్య సం.(లు) - 10.1-1321-వ., 10.1-1558-వ.,

  21) దంతవక్త్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని దంతవక్త్రుడు దానవుడు. శ్రీకృష్ణుని మేనత్త శ్రుతదేవ, కారూషదేశరాజు వృద్దశర్మల కొడుకు. శిశుపాలుడు మరొక మేనత్త శ్రుతశ్రవ, ఛేదిదేశరాజు దమఘోషుల కొడుకు. వాళ్ళిద్దరూ సనకాదుల శాపంవలన మూడవ జన్మలో పుట్టిన విష్ణుద్వారపాలకులు. విరోధభక్తితో శాపవిముక్తులై హరిని చేరారు అన్నాడు. ఇంతకు ముందు వారు 1, 2 జన్మలో హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రావణకుంభకర్ణులు. రుక్మిణీస్వయంవరానికి శిశుపాలునికి మద్ధతుగా దంతవక్త్రుడు, జరాసంధ, సాల్వదులతో వచ్చాడు. శిశుపాల, సాల్వుల మరణానికి క్రోధించి వచ్చిన దంతవక్త్రుని శ్రీకృష్ణుడు సంహరించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వృద్ధశర్మ కారూషకుడు; తల్లి - శ్రుతదేవ; పద్య సం.(లు) - 7-13-వ. నుండి 7-25-వ., 7-384-వ., 9-722-వ., 10.1-1181-వ,, 10.1-1722-ఉ., 10.2-914-వ., నుండి 10.2-920-చ., 11-7-సీ.,

  22) దంతి- (){జాతి}[జంతు]:- దంతి అంటే ఏనుగు. హరి వరహాతారమెత్తినప్పుడు బ్రహ్మదేవుని ముక్కులోంచి వచ్చిన ఈ వరాహం క్షణంలోనే దంతిప్రమాణం అంటే ఏనుగంత పరిమాణం పొందింది అని వర్ణించారు. షష్ఠస్కంధారంభంలో వినాయకుని దంతిముఖుడని నారయ స్తుతించారు - వంశం - జంతు; పద్య సం.(లు) - 3-408-సీ., 6-4-ఉ.,

  23) దంతిపురనాథుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దంతిపురనాథుడు అంటే హస్తినాపురమునకు రాజైన పరీక్షిత్తు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 6-54-క.,

  24) దంతిముఖుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దంతిముఖుడు అంటే వినాయకుడు. షష్ఠస్కంధారంభంలో వినాయకుని ప్రార్థన పద్యంలో దంతిముఖుడు అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-4-ఉ.,

  25) దంతియూధము- (){సంజ్ఞా}[జంతు]:- దంతియూధము అంటే ఏనుగు వీరుడైన గజేంద్రుడు. గంజేంద్రునిలా భక్తిచేయాలి అని వర్ణించారు. - వంశం - జంతు; పద్య సం.(లు) - 7-350-మ.

  26) దందశూకం- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నరకలోకంలో అనేక నరకాలు ఉన్నాయి. మహా భయంకరమైన ఆ నరకాలు తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం, క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే ఇరవై ఎనిమిది నరకాలు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-136-వ., 5.2-158-వ.,

  27) దందశూకము- (){జాతి}[జంతు]:- దందశూకము అంటే పాము. పరీక్షిత్తు అహంకారంతో తండ్రి మెడలో పాముశవాన్ని వేస్తే కొడుకు శపించడా అనుకునే సందర్భంలో ఈ మాట వాడారు.
భూదేవి పృథచక్రవర్తికి ఇచ్చిన సలహామేరకు అహి దందశూక సర్ప నాగులు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని పొందాయి. - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-492-ఆ., 4-502-వ., 8-337-వ., 11-99-వ., 12-28-వ.

  28) దందశూకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దందశూకుడు రాక్షసుడు. వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 6-363-వ.,

  29) దంభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దంభుడు అధర్ముని కొడుకు. ఈ తరాల వారు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. దంభుడుకి తండ్రి - అధర్ముడు (కన్నతండ్జి), పెంపుడు తండ్రి నిరృతి.; తల్లి - మృష; భార్య - మాయ; కొడుకు - లోభుడు - వంశం - దేవయోని; తండ్రి - అధర్ముడు (కన్నతండ్జి), పెంపుడు తండ్రి నిరృతి.; తల్లి - మృష; భార్య - మాయ ; కొడుకు(లు) - లోభుడు; కూతురు(లు)- నికృతి; పద్య సం.(లు) - 4-215-వ,

  30) దంభోళి-1 (){సంజ్ఞా}[పరికరం]:- దంభోళి అంటే వజ్రాయుధం. వరహావతారునిపై హిరణ్యకశిపుడు వేసిన భీకర శూలం, వజ్రాయుధం గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచినట్లు, వ్యర్థం అయిపోయింది. - వంశం - పరికరం; పద్య సం.(లు) - 3-686-సీ., 7-295-మ., 8-351-శా., 8-374-శా., 8-376-సీ.,

  31) దంభోళి-2 (){జాతి}[వస్తువు]:- దంభోళి అంటే పిడుగు - వంశం - వస్తువు; పద్య సం.(లు) - 4-391-మ., 6-454-స్రగ్వి.,

  32) దక్షసావర్ణిమనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దక్ష సావర్ణి మనువు - మనువులు పద్నాలుగురు(14)లో తొమ్మిదవ (9) వాడు. వరుణుని కొడుకైన దక్షసావర్ణి భవిష్యత్తులో తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైనవారు రాజులు అవుతారు. వరుడు, మరీచులూ, గర్గు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - వరుణుడు; కొడుకు(లు) - ధృతకేతు; దీప్తికేతు మొదలైనవారు; పద్య సం.(లు) - 8-417-వ., 8-418-ఆ.,

  33) దక్షసావర్ణిమన్వంతరం- ( ){సంజ్ఞా}[కాలము]:- దక్షసావర్ణిమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో తొమ్మిదవది. - వంశం - కాలము; పద్య సం.(లు) - 8-417-వ.,

  34) దక్షిణ-1 (స్త్రీ){సంజ్ఞా}[ప్రజాపతి]:- దక్షిణ సుయజ్ఞుని భార్య. స్వాయంభువ మనువు పుత్రికాధర్మం అనుసరించి (పుట్టబోయే బిడ్డను తనకి ఇవ్వాలని నియమం పెట్టి పెళ్ళిచేయడం) తన కూతురు ఆకూతిని రుచిప్రజాపతికి ఇచ్చాడు. రుచి ప్రజాపతి, ఆకూతిలకు సుయజ్ఞుడు దక్షిణ అని కవలలుగా హరి, లక్ష్మీదేవి పుట్టారు. సుయజ్ఞుడు దక్షిణను భార్యగా స్వీకరించాడు. వారికి సుయములు / యమ / తుషితులు అను పేరుగల వేల్పులు పుట్టారు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహించాడు. విష్ణువులాగా సమస్తలోకాల దుఃఖాన్నీ పరిహరింప జేశాడు. సుయజ్ఞుడు హరి అవతారంగా ప్రశస్తి వహించాడు. సుయజ్ఞుని స్వాయంభువుడు తీసుకున్నాడు. దక్షిణ తండ్రి రుచి వద్ద ఉన్నది. యమ అను ఆ పన్నెండుగురు (12) దేవతలు 1)తోషుడు, 2) ప్రతోషుడు, 3) సంతోషుడు, 4) భద్రుడు, 5) శాంతి, 6) ఇడస్పతి, 7) ఇధ్ముడు 8) కవి 9) విభుడు 10) వహ్ని, 11) సుదేవుడు, 12) రోచనుడు. - వంశం - ప్రజాపతి; తండ్రి - రుచిప్రజాపతి; తల్లి - ఆకూతి; భర్త - సుయజ్ఞుడు ; కొడుకు(లు) - సుయములు / యమ / తుషితులు దేవతలు వారు తోషుడు; ప్రతోషుడు; సంతోషుడు; భద్రుడు; శాంతి; ఇడస్పతి; ఇధ్ముడు; కవి; విభుడు; వహ్ని; సుదేవుడు; రోచనుడు ; పద్య సం.(లు) - 2-117-సీ., 4-4-వ., 4-5-క., 4-6-వ.,

  35) దక్షిణ-2 (){జాతి}[భాష]:- దక్షిణ అంటే 1. దానముతోపాటు ఇచ్చు నగదు. 2. యజ్ఞము మున్నగు వానిలో ఋత్విజులు మొదలగు వారి కిచ్చు ధనము. 3. గురువులకు ఇచ్చు ధనము మున్నగునవి. - వంశం - భాష; పద్య సం.(లు) - 1-391-వ., 2-94-సీ., 3-122-ఉ.,

  36) దక్షిణ-3 (){సంజ్ఞా}[ప్రదేశము]:- దక్షిణ అంటే దక్షిణదిక్కు, తూర్పుముఖముగా ఉన్నప్పుడు కుడివైపు దిక్కు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-39-వ.

  37) దక్షిణకర్టాటదేశాలు- (){సంజ్ఞా}[ప్రదేశం]:- ఋషభుడు జీవితంలోని చివరి ఆశ్రమంలో కొంకణ, వంక, పట, కుటకములను దక్షిణకర్ణాట దేశములకు ప్రచ్ఛన్నంగా వెళ్ళాడు. కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకుని, రాళ్ళు నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అక్కడ కార్చిచ్చులో కాలిపోయాడు. ఆసమయలో ఆ దేశపురాజు అర్హతుడు స్వధర్మం విడిచిపెట్టి, వేదబాహ్యమైన ఆ ఆచారాన్ని తన దేశంలో అనుమతించాడు. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 5.1-89-ఆ.,

  38) దక్షిణదిశాధినాయకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షిణదిశాధినాయకుడు యమధర్మరాజు. అజామిళుని విష్ణుదేవతలు యమదూతలనుండి విడిపించాక. యముడిని యమభటులు దక్షిణదిశాధినాయక యమధర్మరాజా శిక్షించేవాడివి నీవు ఒక్కడివేనా. అలా కాక ఎక్కువమంది ఉంటే చావుపుట్టుకలు ఎలా సుసంపన్నం అవుతాయి అని అడిగారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-163-క.,

  39) దక్షిణపాంచాలం- (){జాతి}[భాష]:- పురంజనోపాఖ్యానం సంకేతాలతో కూడినది. అందులోని పురంజయుడను పురుషుడు దక్షిణ ద్వారం పేరు పితృహువు. శ్రుతధరునితో కూడి దానినుండి దక్షిణ పాంచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. పురం అనే దేహం పొంది అందులో ఉంటాడు కనుక పురంజయుడు, పురుషుడు. - వంశం - భాష; పద్య సం.(లు) - 4-767-తే., 4-853-వ.,

  40) దక్షిణము- (){జాతి}[ప్రదేశం]:- దక్షిణము నలుదిక్కులలో ఒకటి. సూర్యుడు ఉదయించేది తూర్పు. కుడి ప్రక్కది దక్షిణము. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 1-329-వ.,

  41) దక్షిణసముద్రము- (){సంజ్ఞా}[జలప్రదేశం]:- దక్షిణసముద్రము అంటే ఇప్పటిపేరు హిందూమహాసముద్రం. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దక్షిణసముద్రాన్ని దర్శించాడు. - వంశం - జలప్రదేశం; పద్య సం.(లు) - 10.2-953-వ.,

  42) దక్షిణాగ్ని- (){జాతి}[ప్రదేశం]:- త్వష్ట వ్రేల్చిన దక్షిణాగ్నిలో వృత్రాసురుడు సృష్టించాడు. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 6-504-వ.,

  43) దక్షిణాయన నక్షత్రాలు- ( ){జాతి}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడివైపుకు చుట్టుకొని కుండలీభూతంగా ఉన్నదానికి దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు ఉన్నాయి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  44) దక్షిణాయనం- ( ){జాతి}[కాలము]:- ఆయనం అంటే ఒక కాలం కొలత. ఆయనాలు రెండు. సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయణం అని రెండు ఆయనములు ఉంటాయి. సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు. క్రమంగా మందకొడిగా, తీవ్రంగా, సమానంగా ఉంటాయి. వీటిని అనుసరించి రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గిస్తూ ఒక్కదినంలో తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-346-వ., 5.2-78-వ., 5.2-81-వ., 6-430-వ., 7-445-వ.,

  45) దక్షుడు-1 (పురుష){సంజ్ఞా}[ప్రజాపతి]:- దక్షప్రజాపతి బ్రహ్మ దేవుని కొడుకు. సంతానం కోరేవారు దక్షాది ప్రజాపతులను పూజిస్తారు.
చతుర్ముఖబ్రహ్మవల్ల దక్షాది నవ ప్రజాపతులు, నారదుడు, సనకాదులు. ఇంద్రగరుడాదులు, సకల జంతువులు ఉద్భవించాయి. ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహత్తత్త్వ సృష్టి అంటారు.
దక్షప్రజాపతి బ్రహ్మ దేవుని కొడుకు బొటకన వేలు నుండి పుట్టాడు.
స్వాయుంభువు మనువు శతరూపల మూడవ పుత్రిక ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చారు. వారి సంతతుల వల్ల జగత్తులు అన్నీ నిండుగా అయ్యాయి.”
కర్దమప్రజాపతి కూతురు రుచిని దక్షప్రజాపతికి ఇచ్చెను.
ప్రసూతి దక్షులకు పదహారు మంది పుత్రికలు. వారిలో 1) శ్రద్ధ, 2) మైత్రి, 3) దయ, 4) శాంతి, 5) తుష్టి, 6)పుష్టి, 7) ప్రియ, 8) ఉన్నతి, 9) బుద్ధి, 10) మేధ, 11) తితిక్ష, 12) హ్రీ, 13)మూర్తి అనే పదముగ్గురిని ధర్మునికి; 14) స్వాహాదేవిని అగ్నిదేవునికి; 15) సతీదేవిని శివునికి ఇచ్చెను. వీరి సంతానంతో ముల్లోకాలు నిండాయి. బ్రహ్మవేత్తలు చేయుచున్న యజ్ఞంలో దక్షుడు తను వచ్చినప్పుడు, శివుడు లేవలేదని క్రోధం పెంచుకున్నాడు. రుద్రహీనములైన యజ్ఞాలు చేయసాగాడు. పిలవకపోయినా తండ్రియజ్ఞానికి వచ్చిన సతీదేవిని పలకరించక దక్షుడు అవమానించాడు. రుద్రహీనమైన యాగంతో తన భర్తను, పలకరించక తనను అవమానించినందుకు, కోపించిన సతీదేవి తన యోగాగ్నిలో తాను దగ్దమైంది. శివడు కోపించగా తన జటనుండి భద్రుడు పుట్టాడు. వీరభద్రుడు దక్షుని తల నరికి హోమగుండంలో వేసాడు. దక్షాధ్వర ధ్వంసం చేసాడు. తరువాత శివుడు గొఱ్ఱె తల అతకించి దక్షుని బ్రతికింపజేసాడు. పునరుజ్జీవితుడైన దక్షుడు శివుని స్తుతించాడు. - వంశం - ప్రజాపతి; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - ప్రసూతి, రుచి; కూతురు(లు)- శ్రద్ధ; . మైత్రి; . దయ; . శాంతి; . తుష్టి; . పుష్టి; . క్రియ; . ఉన్నతి; . బుద్ధి; . మేధ; . తితిక్ష; . హ్రీ; . మూర్తి; . స్వాహాదేవి; . స్వధ; . సతి పార్వతి; పద్య సం.(లు) - 2-38-వ., 2-113-ఉ., 3-377-సీ., 3-450-సీ., 3-745-వ., 3-388-వ., 4-6-వ., 4-28-వ. నుండి , 4-210-చ.,7-80-వ., 8-681-వ.,8-686-వ.,

  46) దక్షుడు-2 (పురుష){సంజ్ఞా}[క్షత్రియ]:- ప్రచేతసులకు మారిష యను భార్య యందు. పూర్వ శివారాధం వలన జన్మించాడు. అతనిని బ్రహ్మదేవుడు ప్రజాసృష్ణికి నాయకునిగా నియమించాడు. కుమార్తెలంటే ఇష్టపడే దక్షుడు తన ఆత్మశక్తితో, వీర్యం ద్వారా చరాచర జీవరాశులను సృష్టింటాడు. దక్షుడు వింధ్యపర్వత పాదప్రదేశాన అఘమర్షణతీర్థంలో ఘోరమైన తపస్సు చేసాడు. శ్రీహరిని హంసగుహ్యం అనే స్తోత్రంతో ఇలా స్తుతించాడు.. పంచజన ప్రజాపతి పుత్రిక అసిక్నిని ఇచ్చి, ఈమె యందు దాంపత్యధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. ప్రజలందరూ ఈధర్మాన్ని ఆచరిస్తారు అని అనుగ్రహించాడు. దక్షుడు భార్య అసిక్ని యందు హర్యశ్వులను పదివేలమంది పుత్రులను కన్నాడు. తపస్సు వెళ్ళిన వారిని నారదుడు నివృత్తి మార్గం పట్టించాడు. తరువాత శబళాశ్వులను వారిని వేలకొలది కన్నాడు. వారిని కూడా నారదుడు నివృత్తిమార్గం పట్టించాడు. కోపంతో నారదుని స్థిరనివాసం లేదుండా ముల్లోకాలూ తిరుగుతూ ఉండని శపించాడు.అనంతరం దక్షప్రజాపతి తన అర్ధాంగి అయిన అసిక్ని యందు అరవై మంది కుమార్తెలను పొందాడు. వారంతా తమ తండ్రిమీద అమితమైన ఆదరాభిమానాలు కలవారు. దక్షుడు తన కుమార్తెలలో పదిమందిని ధర్మునికి, పదముగ్గిరిని కశ్యప ప్రజాపతికి, ఇరవై ఏడుగురిని చంద్రునికి, భూతునికి ఇద్దరిని, ఆంగిరసునికి ఇద్దరిని, కృశాశ్వునికి ఇద్దరిని, తార్క్షునికి (కశ్యపునికి నామాంతరం) నలుగురిని ఇచ్చి పెండ్లి చేసాడు. వారు, భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అనే పదిమంది ధర్మునకు భార్యలై కొడుకులను కన్నారు.కృత్తికలకు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. దోషునకు శర్వరి అనే భార్య వల్ల విష్ణువు యొక్క అంశ అయిన శింశుమారుడు పుట్టాడు. వస్తువుకు ఆంగిరస అనే భార్య వల్ల విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు పుట్టాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అనే భార్య వల్ల చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువు వల్ల విశ్వుడు, సాధ్యులు అనేవాళ్ళు పుట్టారు. విభావసునకు ఉష అనే భార్య వల్ల వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు జన్మించారు. వారిలో ఆతపునికి పంచయాముడు అనే దినాధిదేవత పుట్టాడు. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల కోట్లకొలది రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్ళు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. అంగిరసుడు అనే ప్రజాపతికి స్వధ అనే భార్య వల్ల పితృగణాలు పుట్టారు. సతి అనే భార్యకు అధర్వవేదాన్ని అభిమానించే దేవతలు పుట్టారు. కృతాశ్వునకు అర్చిస్సు అనే భార్య వల్ల ధూమ్రకేశుడు అనే కుమారుడు కలిగాడు. వేదశిరస్సుకు ధిషణ అనే భార్య వల్ల దేవలుడు, వయునుడు, మనువు జన్మించారు. కశ్యపునితి తార్క్షుడు అను నామాంతరం కలదు. అతనికి వినత, కద్రువ, పతంగి, యామిని అని నలుగురు భార్యలు. అందులో పతంగికి పక్షులు పుట్టాయి. యామినికి శలభాలు పుట్టాయి. వినత తనకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనమైన గరుత్మంతుని, సూర్యునికి సారథి అయిన అనూరుని కన్నది. కద్రువకు రకరకాల పాములు జన్మించాయి. చంద్రునికి కృత్తిక మొదలైన నక్షత్రాలు భార్యలు. చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. అదితి, దితి, కాష్ఠ, దనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమ అనే పదముగ్గురు కశ్యపుని భార్యల దేవ, దానవ, దైత్య, జంతు, పక్షి, వృక్షాదు లైన సంతానం ముల్లోకాలు నిండిపోయాయి. - వంశం - క్షత్రియ; తండ్రి - ప్రచేతసులు; తల్లి - మారిష; భార్య - అసక్ని ; కొడుకు(లు) - అనేక వేలమంది. వారిలో హర్యశ్వులు 60000 మంది, శబళాశ్వులు వేలసంఖ్యలు.; కూతురు(లు)- అరవైమంది (60). వారిలో: 1) ధర్ముని భార్యలు పదిమంది (10), భానువు; లంబ; కకుబ్దేవి; జామిదేవి; విశ్వ; సాధ్య; మరుత్వతి; వసువు; ముహూర్త; 1సంకల్ప; 2) భూతుని భార్య సరూప; (3) అంగిరసుని భార్యలు ఇద్దరు (2), స్వధ; సతి; (4) కృశాశ్వుని భార్య ఒకరు (1), అర్చి; (5) వేదశిరుని భార్య ఒకరు (1), ధిషణ; (5) తార్క్యు ని భార్యలు నలుగురు (4, వినత; కద్రువ; పతంగి; యామిని; (6) చంద్రుని భార్యలు ఇరవైఏడుగురు (27), కృత్తిక నుండి రోహిణి వరకు గల 27 నక్షత్రాలు ;. (7) కశ్యపుని భార్యలు పదముగ్గురు (13) అదితి, దితి, కాష్ట, దనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి,ఇల, సరమ, ; పద్య సం.(లు) - 4-943-సీ., 4-946-సీ., 5-204-క., 6-204-క, నుండి 6-435-వ.,

  47) దక్షుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ దక్షుడు మనుపుత్రుడైన అరిష్యంతుడు అను చిత్రసేనుని కొడుకు. ఇతని కొడుకు మీఢ్వాంసుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - చిత్రసేనుడు; కొడుకు(లు) - మీఢ్వాంసుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  48) దక్షుడు-4 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ దక్షుడు శ్రీరామచంద్రుని తమ్ముడు భరతుని కొడుకు. శ్రీరామునికి కుశలవులని; భరతునకు దక్షుడు, పుష్కలుడు; లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, శ్రుతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - భరతుడు; తల్లి - మాండవి; పద్య సం.(లు) - 9-347-వ.,

  49) దక్షుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దక్షుడు వసుదేవుని సోదరుడైన వృకుని పెద్ద కొడుకు. వృకునికి భార్య దూర్వాక్షికి దక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మున్నగువారు పుత్రులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వృకుడు; తల్లి - దూర్వాక్షి; పద్య సం.(లు) - 9-723-క.

  50) దత్త-1 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- దత్తాత్రేయావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 6 వ. అవతారం (1-63-వ.) దత్తావతారాన్ని అనసూయ అత్రిల కుమారుడని సూచించారు,
మఱియ, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 5 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-121-సీ)
అత్రి అనసూయలకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు. - వంశం - దైవయోని; తండ్రి - అత్రి; తల్లి - అనసూయ; పద్య సం.(లు) - 1-63-వ., 2-120-వ., 2-121-సీ., 4-23-ఉ., 6-307-వ., 6-558-సీ.,

  51) దత్త-2 (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- దత్త దైత్య స్త్రీ. భర్త దితి పుత్రుడు హిరణ్యకశిపుడు. జంభాసురుని కూతురు. దితిహిరణ్యకశిపులకు నలుగురు కొడుకులు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు; ఒక కూతురు సింహిక.
గమనిక ;- 7-102-శా. లో హిరణ్యకశిపుడు భార్య లీలావతీ యుక్తుడై విలాసాలలో తేలుతున్నట్లు చెప్పబడింది. - వంశం - రాక్షస యోని; తండ్రి - జంబాసుర; భర్త - హిరణ్యకశిపుడు; కొడుకు(లు) - ప్రహ్లాదుడు; అనుహ్లాదుడు; హ్లాదుడు; సంహ్లాదుడు ; పద్య సం.(లు) - 6-507-వ.

  52) దత్తాత్రేయుడు - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దత్తాత్రేయుడు బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన విష్ణుమూర్తి నాలుగవ అవతారం. అత్రిమహర్షి పుత్రుణ్ణి కోరగా శ్రీహరి "నేను నీకు దత్తుడ నయ్యాను” అని తానే అత్రికి దత్తాత్రేయుడై జన్మించాడు. దత్తాత్రేయుడు యోగాభ్యాసం నుండి పతనం కాకుండా కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-120-వ., 2-121-సీ., 6-307-వ., 9-431-సీ., 9-702-సీ.,

  53) దత్తుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దత్తుడు అంటే దత్తాత్రేయుడు. అత్రి అనసూయలకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు. - వంశం - ఋషి; తండ్రి - అత్రి; తల్లి - అనసూయ ; పద్య సం.(లు) - 2-120-వ., 2-121-సీ., 4-23-ఉ.,

  54) దధికుంభము- (){జాతి}[పరికరం]:- దధికుంభము అంటే పెరుగు కుండ. కుంతీదేవి కృష్ణుని స్తుతిస్తూ "భగవంతుడవైన కృష్ణ చిన్నప్పుడు కోపంతో పెరుగుకుండ విరగ్గొట్టావు. యశోదాదేవి తాడుతో కట్టేసింది. అప్పుడు ఏడుస్తున్న బాలునిలా లీలచూపడం అది అంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది" అన్నది - వంశం - పరికరం; పద్య సం.(లు) - 1-193-ఉ., 10.1-354-వ.,

  55) దధిమత్కుంభము- (){జాతి}[పరికరం]:- దధిమత్కుంభము అంటే పెరుగుతో నిండుగానున్న కుండ. వెన్నచిలుకుతున్న యశోదాదేవి ఆపి చనుబాలిస్తూ పొంగిపోతున్న పాలు దించడానికి, ఒళ్లోంచి దింపి వెళ్ళింది. ఆకలితీరని కృష్ణుడు కోపంతో పెరుగు కుండను రాయితో కొట్టి బద్దలుకొట్టాడు. తరువాత యశోదాదేవి కృష్ణుని రోలుకు కట్టివేయడం, జంటమద్దులు గూల్చడమూ. - వంశం - పరికరం; పద్య సం.(లు) - 10.1-359-మ., 10.1-360-వ.,

  56) దధిసముద్రము- ( ){సంజ్ఞా}[జల ప్రదేశము]:- దధి అంటే పెరుగు సముద్రము. క్షార = కారపు సముద్రము; ఇక్షురస = చెరకురసముసముద్రము; సుర = సురాసముద్రము; ఆజ్య = నేయ్యిసముద్రము; క్షీర = పాలసముద్రము; దధి = పెరుగుసముద్రము; ఉదకంబులు = నీటిసముద్రము; కలుగు = ఉండెడి; సాగరములు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నేయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; ఏడున్ = ఏడు (7). ఒక ద్వీపంతో మరొక ద్వీపం కలిసిపోకుండా ఉండడానికి సముద్రాలు ఏర్పడ్డాయి. - వంశం - జల ప్రదేశము; పద్య సం.(లు) - 5.1-19-సీ., 5.2-69-సీ.,

  57) దధీచి- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దధీచి ఒక గొప్ప మహర్షి. అతడు పూర్వకాలంలో అశ్వినీదేవతలకు అశ్వశిరము అనే విద్యను ఉపదేశించాడు. అంతేకాక, త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపునకు నారాయణ కవచాన్ని ఇచ్చాడు. ఇంద్రుని వజ్రాయుధంకోసం తన శరీరాన్ని త్యాగంచేసి ఎముకలను ఇచ్చాడు. అతడు దేవతలు వచ్చి, తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన గొప్ప దాత అని జరాసంధుని సభలో శ్రీకృష్ణుడు పొగిడాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 6-347-వ., నుండి 6-359-వ., 6-397-సీ., 10.2-722-క.,

  58) దధ్యంచుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- కర్దమమహర్షి తొమ్మిదవ పుత్రిక జిత్తి యందు అధర్వునకు కలిగిన కొడుకు ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ ఐన దధ్యంచుడు. - వంశం - ఋషి; తండ్రి - అథర్వుడు ; తల్లి - జిత్తి / శాంతి ; పద్య సం.(లు) - 4-26-వ.,

  59) దనువు- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- దక్షుడు పదముగ్గురు పుత్రికలను కశ్యపునకు ఇచ్చాడు. వారిలో నాలుగవ భార్య దనువు, కశ్యపునకు దక్షపుత్రిక దనువుకు పుట్టినవారు పద్దెనిమిది మంది వారి సంతానలను దానవులు అంటారు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; భర్త - కశ్యపుడు; కొడుకు(లు) - దనువు పుత్రులు పద్దెనిమిది మంది. వారు, ద్విమూర్ధుండును; శంబరుడు; అరిష్టుడు; హయగ్రీవుడు; విభావసుడు; అయోముఖుడు; శంకుశిరుడు; స్వర్భానుడు; కపిలుడు; అరుణి; పులోముడు; వృషపర్వుడు; ఏకచక్రుడు; అనుతాపకుడు; ధూమ్రకేశుడు; విరూపాక్షుడు; విప్రచిత్తి; దుర్జయుడు. వారు వారి వంశం వారు దానవులు ; పద్య సం.(లు) - 6-257-సీ.,

  60) దమఘోషతనూభవుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- దమఘోషతనూభవుడు అంటే శిశుపాలుడు. శ్రీకృష్ణుడిని అంతగా దూషించిన ఆ దమఘోష సుతుడైన శిశిపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా, అంత గొప్పగా భగవంతుడైన కృష్ణుడిలో ఎలా ప్రవేశించాడయ్యా. అని ధర్మరాజు నారదుని అడిగాడు - వంశం - రాజు; తండ్రి - దమఘోషుడు; తల్లి - శ్రుతశ్రవస; పద్య సం.(లు) - 10.2-786-క.,

  61) దమఘోషసుతుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- దమఘోషుసుతుడు టే శిశుపాలుడు. దమఘోషుడు శ్రుతశ్రవస ల కొడుకు. ధర్మరాజు యాగంలో కృష్ణునికి అగ్రపూజ వైభవం చూసి సహించలేక వదరుతూ, వంద తప్పులు పగగొని పూర్తిచేసాడు. కృష్ణుడు చక్రంవేసి సంహరించాడు. - వంశం - రాజు; తండ్రి - దమఘోషుడు; తల్లి - శ్రుతశ్రవస; పద్య సం.(లు) - 10.2-786-క.,

  62) దమఘోషుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- దమఘోషుడు ఛేదిదేశాధిపతి, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస భర్త. కృష్ణుని పితామహుడు శూరసేనునికి భార్యయందు పదిమంది కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు. వారిలో నాలుగవ కుమార్తె శ్రుతశ్రవస దమఘోషుని పెండ్లాడింది. వారి పుత్రుడు శిశుపాలుడు.
శమంతకపంచక క్షేత్రానికి కృష్ణుడు మొదలగువారు వెళ్ళినప్పుడు. వీరికంటే ముందు వచ్చి సేవించుకున్న క్షత్రియులు మున్నగువారిలో దమఘోషుడు ఒకడు. - వంశం - రాజు; భార్య - శ్రుతశ్రవస; కొడుకు(లు) - శిశుపాలుడు; పద్య సం.(లు) - 9-722-వ., 10.2-1044-వ.,

  63) దమని- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- దమని దైత్య స్త్రీ. హిరణ్యకశిపుని కోడలు. ప్రహ్లాదుని మూడవ తమ్ముడు హ్లాదుని భార్య. దమని హ్లాదులకు ఇద్దరు కుమారులు వాతాపి ఇల్వలుడు. వారిని అగస్త్యుడు భక్షించాడు. - వంశం - రాక్షస యోని; భర్త - హ్లాదుడు ; కొడుకు(లు) - వాతాపి; ఇల్వలుడు ; పద్య సం.(లు) - 6-508-వ.,

  64) దముడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దముడు సూర్యవంశ చక్రవర్తి మరుత్తు కొడుకు. ఆ మరుత్తు చేసిన యజ్ఢానికి సంతోషించిన ఇంద్రుడు యజ్ఞపరికరాలన్నింటినీ బంగారం చేసాడు. అంతటి వాని పుత్రుడు. తృణబిందువు ఇతని వంశం వాడే. దమునికి కుమారుడు రాజవర్ధనుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - మరుత్తు; కొడుకు(లు) - రాజవర్ధనుడు; పద్య సం.(లు) - 9-46-వ.,

  65) దయ- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- దయ దక్షప్రజాపతికి ప్రసూతి యందు కలిగిన పుత్రిక. ధర్ముని భార్య. ఈమెకు అభయం అను కుమారుడు పుట్టాడు. దక్షుడు తన పదహారుమంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్ముని కిచ్చి వివాహం చేసాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శ్రుతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియ వలన యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే ఇద్దరు ఋషులు జన్మించారు. - వంశం - ఋషి; తండ్రి - దక్షుడు; తల్లి - ప్రసూతి ; భర్త - ధర్ముడు; కొడుకు(లు) - అభయము; పద్య సం.(లు) - 4-28-వ.,

  66) దరి- ( ){జాతి}[ప్రదేశము]:- ఒడ్డు, గట్టు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-54-క.,

  67) దరీ- ( ){జాతి}[ప్రదేశము]:- గుహ, గుహలయందు - అని అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-23-సీ., 8-24-వ., 8-25-క., 8-26-శా.,

  68) దర్పం- (పురుష){సంజ్ఞా}[దక్షవంశం]:- దర్పం ధర్ముని భార్యలలో ఉన్నతి వలన కలిగెను - వంశం - దక్షవంశం; పద్య సం.(లు) - 4-28-వ.,

  69) దర్పకజ్వరము- (){జాతి}[భావము]:- దర్పకజ్వరము అంటే మన్మథవేదన - వంశం - భావము; పద్య సం.(లు) - 10.1-1000సీ.,

  70) దర్పకారాతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దర్పకారాతి అంటే దర్పకుడు అనగా మన్మథుడు అతని శత్రువు శివుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1242-సీ.,

  71) దర్పకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దర్పకుడు అంటే మన్మథుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1298-సీ., 10.2-3-ఉ., 10.2-8-వ., 10.2-330-చ.,

  72) దర్పము- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దర్పం ధర్మునికి భార్య "ఉన్నతి" వల్ల జన్మించెను. దక్షుడు తన పదహారుమంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, "ఉన్నతి", బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్ముని కిచ్చి వివాహం చేసాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శ్రుతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియ వలన యోగం, "ఉన్నతి" వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే ఇద్దరు ఋషులు జన్మించారు. - వంశం - ఋషి; తండ్రి - ధర్ముడు; తల్లి - ఉన్నతి; పద్య సం.(లు) - 4-28-వ.,

  73) దర్పుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దర్పుడు చంద్రవంశరాజు. యయాతి వంశెంలోని శిబి కుమారుడు, సుశీనరునకు శిబి వన క్రిమి దర్పు లన నలువురు జన్మించిరి. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఉశీనరుడు; పద్య సం.(లు) - 9-683-వ.,

  74) దర్భకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దర్భకుడు పరీక్షిత్తునకు భవిష్యత్తులోని శైశవనాగులు అను రాజులవర్ణనలో చెప్పబడ్డాడు. దర్భకుడు అజాతశత్రుని కొడుకు, ఇతని తండ్రి అజయుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అజాతశత్రుడు; కొడుకు(లు) - అజయుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  75) దర్శుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దర్శుడు సినీవాలీ ధాతల పుత్రుడు. అదితి పుత్రులైన ద్వాదశాదిత్యులలో ఏడవవాడైన ధాతకు కుహువు, సినీవాలీ, రాక, అనుమతి అని నలుగురు భార్యలు. వీరు అంగీరుడు అను మునికి భార్య శ్రద్ధ యందు కలిగిన కుమార్తెలు. కుహూదేవికి సాయంత్రం, సినీవాలికి దర్శుడు, రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు. - వంశం - దేవయోని; తండ్రి - ధాత; తల్లి - సినీవాలీ; పద్య సం.(లు) - 6-507-వ.,

  76) దవిద్యోతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దవిద్యోతుడు చంద్రవంశ రాజు. ఇతను దేవకీదేవి తాత తాత. దవిద్యోతుడు దుందుభి కొడుకు. దుందుభి తండ్రి తుంబురుని సఖుడైన అనువు. ఇతని కుమారుడు పునర్వసువు. అతనికి ఆహుకుడు, ఆహుకి అని కొడుకు కూతురు కలిగారు. ఆహుకుని కొడుకు దేవకీదేవి తండ్రి అయిన దేవకుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దుందుభి; కొడుకు(లు) - పునర్వసువు; పద్య సం.(లు) - 9-712-వ.,

  77) దశకంఠుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస]:- దశకంఠుడు అంటే రావణుడు - వంశం - రాక్షస; పద్య సం.(లు) - 2-166-వ.,

  78) దశకంధరుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దశకంధరుడు అంటే పది కంఠాలు గల రావణుడు,దశరథసూనుడు, శ్రీరాముడు వేసిన బాణంతో దశకంధరుడు, రావణుడు నేలకూలాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-304-క.,

  79) దశగ్రీవుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దశగ్రీవుడు అంటే పది మెడలు కలవాడైన రావణాసురుడు. దశగ్రీవుడు సకలలోకాలు గెలవాలని భావిస్తూ సుతలలోకంలోని బలిచక్రవర్తి ద్వారాన్ని దాటబోయాడు. కాపలాకాస్తున్న విష్ణువు కాలిబొటకనవేలుతో విసిరేస్తే రావణుడు పదివేల యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు
సీత చక్కదనం విని మన్మథ పరవశుడైన దశగ్రీవుడైన రావణుడు మారీచుడిని పంపాడు. ఆ నీచుడు బంగారు లేడి రూపంలో రాగా, శ్రీరాముడు వాడిని వధించాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతను తీసుకుపోయాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 5.2-115-వ., 9-269-సీ.,

  80) దశదిశలు- (){జాతి}[ప్రదేశము]:- దశదిశలు అంటే పది దిక్కులు, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము అను నల్దిక్కులు; ఈశాన్యం, ఆగ్నేయము, నైఋతి, వాయవ్యము అను నలుమూలలు; పై వైపు, క్రిందవైపు మొత్తం పదింటిని దశదిశలు అంటారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-91-క., 1-287-వ., 5,1-82-వ., ....

  81) దశరథరాజుపట్టి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరథరాజుపట్టి అంటే శ్రీరాముడు. శుకుడు పరీక్షిత్తుకు శ్రీరామాదుల వంశం వర్ణించు సందర్భంలో రాముని ఇలా స్తుతించాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 9-346-సీ.,

  82) దశరథరామచంద్రుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరథరామచంద్రుడు అంటే శ్రీరాముడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 2-171-సీ.,

  83) దశరథరాముడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరథరాముడు అంటే శ్రీరాముడు. ధశరథుని యొక్క కుమారుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 2-286-క., 8-1-క.,

  84) దశరథసూనుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరథసూనుడు శ్రీరాముడు. దశరథసూనుడు, శ్రీరాముడు వేసిన బాణంతో రావణుడు నేలకూలాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 9-304-క.,

  85) దశరథుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దశరథుడు చంద్రవంశెపు శశిబిందుని వంశం వాడు. నవరథుని కొడుకు, ఇతని కొడుకు శకుని. శశిబిందుని వంశంలోని వికృతికి భీమరథుడు; అతనికి నవరథుడు; అతనికి దశరథుడు; అతనికి శకుని; అతనికి కుంతి; అతనికి దేవరాతుడు; అతనికి దేవక్షత్రుడు; అతనికి మధువు; అతనికి కురువశుడు; అతనికి అనువు; అతనికి పురుహోత్రుడు; అతనికి అంశువు; అతనికి సాత్వతుడు పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నవరథుడు; కొడుకు(లు) - శకుని; పద్య సం.(లు) - 9-209-వ.,

  86) దశరథుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరథుడు రాముని తండ్రి. సూర్యవంశం వారైన ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, అతనికి రఘువు, అతనికి పృథుశ్రవణుడు, అతనికి అజుడు, అతనికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారాయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. వారి కథను వాల్మీకి మున్నగు మహర్షుల వలన వివరింపబడింది.
దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి శ్రీరాముడిని అడవికి పంపించాడు.
తన స్నేహితుడు రోమపాదుడు సంతానం లేదని బాధపడుతుంటే దశరథుడు తనకు పుట్టిన శాంతను ఇచ్చాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - అజుడు; భార్య - కౌసల్య, సుమిత్ర, కైకేయి; కొడుకు(లు) - విష్ణుమూర్తి అంశతో నాలుగు విధాలుగా శ్రీరాముడు కౌసల్య అందు, భరతుడు కైకేయి యందు, లక్ష్మణుడు సుమిత్ర అందు, శత్రుఘ్నుడు సుమిత్ర అందు; కూతురు(లు)- శాంత; పద్య సం.(లు) - 2.155-సీ., 9-259-వ., 9-265-క., 9-684-క.,

  87) దశరరథతనయుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దశరరథతనయుడు అంటే శ్రీరాముడు. గంగాప్రవాహవర్ణనలో దశరథతనయుని బొమముడి వలె, గంగ సింధునది గర్వాన్ని భంగపరుస్తూ ప్రవహిస్తోంది అని వర్ణించబడింది. - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 9-230-వ.,

  88) దశవదనవిదళన- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దశవదనవిదళన అంటే రావణుని సంహరించిన శ్రీరాముడు. ఏకదశ స్కంధంలోని సర్వలఘు సీస పద్యంలో ప్రయోగించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 11-72-సీ.,

  89) దశవదనుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దశవదనుడు అంటే రావణుడు. ఏకదశ స్కంధంలోని సర్వలఘు సీస పద్యంలో ప్రయోగించారు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 11-72-సీ.,

  90) దశాననవిరాముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దశాననవిరాముడు అంటే రావణుని చంపిన రాముడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-1-క.,

  91) దశాననుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దశాననుడు రావణుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 2-285-ఉ.,

  92) దశార్హుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని దశార్హుని వంశస్తులను దశార్హులు అంటారు. కృథునకు కుంతి; అతనికి ధృష్టి; అతనికి నిర్వృతి; అతనికి దశార్హుడు; అతనికి వ్యోముడు; అతనికి జీమూతుడు; అతనికి వికృతి; అతనికి భీమరథుడు; అతనికి నవరథుడు; అతనికి దశరథుడు; అతనికి శకుని; అతనికి కుంతి పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నిర్వృతి; కొడుకు(లు) - వ్యోముడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  93) దశార్హులు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- దశార్హులు చంద్రవంశంలోని ఒక వల్లవ జాతి. బలసంపన్నులైన యదు భోజ "దశార్హ" కుకుర అంధక వృష్టి వీరులచేత సంరక్షింపబడుతున్న ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు అని వర్ణింపబింది. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-256-వ., 1-349-వ., 9-731-సీ., 10.1-1163-సీ., 10.1-1206-క., 10.1-1401-వ.

  94) దశాస్యుడు- (పురుష){జాతి}[రాక్షసుడు]:- దశాస్యుడు అంటే రావణాసురుడు. రావణుని గర్వాన్ని హరించినవాడు ఐన వాలిని, శ్రీరాముడు ఒకే ఒక బాణంతో కూల్చివేశాడు. - వంశం - రాక్షసుడు; పద్య సం.(లు) - 9-273-క.,

  95) దశేంద్రియములు- (){జాతి}[అవయవ]:- దశేంద్రియములు శ్రవణ, త్వక్, నయన, రసన, ఘ్రాణ, వాక్, హస్త, పాద, గుద, గుహ్య అను పది ఇంద్రియములు. వీనిలో శ్రవణ, త్వక్, నయన, రసన ఘ్రాణ అను ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలు అంటారు, హస్త, పాద, గుద, గుహ్య అను ఈ ఐదింటిని కర్మేంద్రియాలు అంటారు. - వంశం - అవయవ; పద్య సం.(లు) - 2-86-వ., 3-391-వ., 11-62-వ.,

  96) దహనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దహనుడు అంటే అగ్నిదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-51-సీ., 7-419-వ., 10.1-280-సీ., 10.1-452-క., 10.2-122-వ.,

  97) దాక్షాయణులు- (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- దాక్షాయణులు అంటే దక్షుని కొడుకులు హర్యశ్వులు. నారాయణుని ఆజ్ఞప్రకారం, దక్షప్రజాపతి, పంచజని యొక్క కుమార్తె అసిక్నిని దాంపత్యధర్మంతో చేపట్టాడు. వారికి హర్యశ్వులు అని పేరుగల పదివేలమంది పుత్రులు కలిగారు. వీరిని దాక్షాయణులు అని వర్ణించారు. వీరు తండ్రి ఆజ్ఞప్రకారం ప్రజాసృష్టి చేయడం కోసం నారయణ సరస్సు వద్ద తపస్సు ప్రారంభించారు. నారదుడు వచ్చి నివృత్తి మార్గం భోదించాడు. వారు ఆ మార్గంలో నిమగ్నులయ్యారు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసిక్ని; పద్య సం.(లు) - 6-224-వ.,

  98) దానము-1 ( ){జాతి}[జంతు]:- మదగజము యొక్క కపోల మద జలము. రావణవదానంతంరం శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు నగరాన్ని ఇలా వర్ణించారు. సమదగజ దానధారల తుముతుములై ఉన్న పెద్దత్రోవలతో అయోధ్య అలరారుతోంది. - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-30-క., 9-322-క., 10.1-1321-వ.,

  99) దానము-2 (){జాతి}[విద్య]:- దానము అంటే లేనివారిఎడల జాలిపడి ఉచితంగా ఇచ్చేది. - వంశం - విద్య; పద్య సం.(లు) - 1-24-సీ., 2-62-చ.,

  100) దానవకులవైరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవకులవైరి అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-111-క.,

  101) దానవచమూజైత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవచమూజైత్రుడు అంటే రాక్షససైన్యములను జయించువాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-284-మ.,

  102) దానవభంజనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవభంజనుడు అంటే శ్రీకృష్ణుడు. దర్శనానికి వచ్చిన నారదుడు శ్రీకృష్ణుని దానవభంజన అని స్తుతించాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-643-క.,

  103) దానవరిపుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవరిపుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1424-క.,

  104) దానవవిద్విట్- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవవిద్విట్ అంటే దానవులను ద్వేషించువాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-500-ఉ.,

  105) దానవవైరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవవైరి అంటే విష్ణుమూర్తి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-100-చ.,

  106) దానవహంత- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవహంత అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-653-చ., 10.1-1173-ఉ.,

  107) దానవాంతకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దానవాంతకుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-836-వ., 10.2-1081-తే.,

  108) దానవారాతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- సప్తఅధోలోకాలలో వితలం క్రింద ఉండే సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. ఈ బలికి భవిష్యత్తులో దానవారాతి ఇంద్రత్వం ఇస్తాను అన్నాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 5.2-112-సీ.,

  109) దానవులు-1 (){జాతి}[రాక్షస యోని]:- దానవులు అంటే రాక్షసులు. భాగవతం మొట్టమొదటి పద్యంలో పోతనామాత్యులవారు దానవోద్రేకస్తంభకు అని స్తుతించారు. దనువు సంతానానికి దానవులు అని పేరు. ఐనా, దానవుడు పదానికి రాక్షసుడని సామాన్యార్థం ఉన్నది. విరాట్స్వరూపునకు వీర్యం దైత్యదానవులు.
కుముదపర్వతాన్ని ఆశ్రయించుకుని దేవతలు, దానవులు, మునీంద్రులు, గంధర్వులు మున్నగువారు సంతోషంతో విహరిస్తుంటారు.
రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 1-1-శా., 1-39-వ., 1-246-మత్త., 1-526-మా., 2-9-సీ., 2-16-వ., 3-727-క., 4-501-సీ., 5.2-29-ఆ., 5.2-119-వ., 5.2-112-సీ., 6-374-వ, 6-363-వ.,

  110) దానవులు-2 (పురుష){జాతి}[రాక్షస]:- కశ్యపునకు దక్షపుత్రిక దనువుకు పుట్టినవారు పద్దెనిమిది మంది వారి సంతానలను దానవులు అంటారు.
హరివర్షానికి దేవుడు నరసింహుడు. హరివర్షం "ప్రజలు" దైత్య దానువులు. వారు ప్రహ్లాదాదులతో కూడి నరసింహుని సేవిస్తూ ఉంటారు.
సప్తపాతాళలోకాలలో మయుడు నిర్మించిన మాయాపట్టణాలలో దైత్యులు, దానవులు, కాద్రవేయులు మున్నగు జన్మలవారు సుఖంగా ఉంటారు.
మహాతలం క్రింద రసాతలం ఉంది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనేవారు నివాసం చేస్తుంటారు. శ్రీహరి తేజస్సుకు లొంగినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బ్రతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు భయపడుతూ ఉంటారు.
దేవతలు, రాక్షసులు నర్మదానది ఒడ్డున కృతయుగంలో ప్రారంభించి యుద్ధం చేస్తుండగా త్రేతాయుగం ప్రారంభమైనది.
దైత్యవంశంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి పరమ భాగవతులై దేవ దానవులకు వందనీయులైనారు. - వంశం - రాక్షస; తండ్రి - కశ్యపుడు; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-257-సీ., 5.2-42-సీ., 5.2-105-వ., 5.2-119-వ., 6-507-వ., 7-29-వ.,

  111) దానవ్రతులు- (పురుష){జాతి}[మానవ యోని]:- వీరు శాకద్వీపంలో ఉన్న ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారిలో ఒకరు. వారి వాయుదేవుని ఆరాధిస్తారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  112) దామోదరుండు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దామోదరుడు అంటే తులసి మాలిక ఉదరమున కలవాడు, వాసుదేవుడు, విష్ణువు, కృష్ణుడు. పృథుచక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన సందర్భంలో దేవతలు అందరు వివిధ బహుమానాలు ఇచ్చారు. వారిలో దామోదరుడైన విష్ణుమూర్తి, విష్ణు చక్రము ఇచ్చెను - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-495-క., 4-443-సీ., 10.2-49-క., 10.2-533-వ., 10.2-581-క., 10.2-609-క., 10.2-694-వ., 10.2-813-వ., 10.2-827-వ., 10.2-919-వ.,

  113) దారకుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దారకుడు లేదా దారుకుడు శ్రీకృష్ణుని రథసారథి - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1718-వ., 10.2-515-వ., 10.2-669-సీ.,

  114) దారుకుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దారకుడు లేదా దారుకుడు శ్రీకృష్ణుని రథసారథి - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1718-వ., 10.2-515-వ., 10.2-669-సీ.,

  115) దాశరథి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దాశరథి అంటే దశరథ పుత్రుడైన శ్రీరాముడు - వంశం - సూర్యవంశం; తండ్రి - దశరథుడు; పద్య సం.(లు) - 3-304-సీ.,

  116) దాశరాజు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దాశరాజు కూతురు సత్యవతి యందు శంతనునకు చిత్రాంగద, విచిత్రవీర్యులు పుట్టారు. ఆ విచిత్రవీర్యునికి అంబిక, అంబాలిక అను కాశీరాజు పుత్రికలను భీష్ముడు తెచ్చి వివాహం చేసాడు. వారియందు ధ్రుతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 9-668-వ.,

  117) దాసవిహారుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దాసవిహారుడు అంటే దాసులయందు విహరించువాడైన విష్ణువు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 5.2-167-మత్త.,

  118) దితి- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- దితి సంతతిని దైత్యులు అంటారు, వారు అధర్మంగా ప్రవర్తిస్తుంటే. బుద్ధుడుగా అవతరించి వారిని వారి దురాచారాలు నిర్మూలించాడు.
దితి దక్షుని కూతురు, కశ్యపుని బార్య. ఒకమారు సంతానవాంఛతో భర్తను ఒత్తిడి చేసి అసురసంధ్యవేళ కలియగోరింది. భర్త కశ్యపుడు ఇది రుద్రానుచరులు సంచరించు సమయం నిషిద్ధకర్మ అని చెప్పినా వినలేదు. తరువాత కశ్యపుడు ఆమెకు లోకభయంకరులైన పుత్రులు కలుగుతారని. మనుమడు మహా భాగవతుడు అయి ముల్లోకాలలోనూ కీర్తి గడిస్తాడని చెప్తాడు. ఆ విధంగానే ఆమెకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టి విష్ణువు చేతిలో మరణించారు. హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడు పరమ భాగవతుడుగా ప్రసిద్ది పొందాడు.
దక్షుడు భార్య అసిక్నియందు పుట్టిన అరవై (60) మంది పుత్రికలలో పదమూడుమందిని కశ్యపునకు ఇచ్చాడు వారిలో రెండవ ఆమె దితి.
దైత్యవంశంలో ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి పరమ భాగవతులు పుట్టారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు; మఱియు మరుత్తులు అని నలభైతొమ్మిదిమంది కుమారులు; ఒక కుమార్తె రచన అని కలిగారు. ఆమను త్వష్ట పెండ్లాడాడు. వారికి విశ్వరూపుడు పుట్టాడు. హిరణ్యకశిపునకు జంభాసురుని కుమార్తె అయిన దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కుమారులు, సింహిక అనే కుమార్తె జనించారు. ఆ సింహికకు రాహువు పుట్టాడు. ఆ రాహువు అమృతాన్ని పానం చేయడంతో శ్రీహరి తన చక్రంతో దానిని ఖండించాడు. సంహ్లాదునకు గతి అనే భార్య యందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమని అనే భార్యయందు వాతాపి, ఇల్వలుడు జన్మించారు. వారిద్దరినీ అగస్త్యుడు భక్షించాడు. అనుహ్లాదునికి సూర్మి అనే భార్య యందు బాష్కలుడు, మహిషుడు పుట్టారు. ప్రహ్లాదునికి దేవి అనే భార్య వల్ల విరోచనుడు కలిగాడు. విరోచనునికి బలి జన్మించాడు. ఆ బలికి అశన అనే భార్య యందు బాణుడు పెద్దవాడుగా వందమంది కుమారులు పుట్టారు. బాణాసురుడు శివుణ్ణి ఆరాధించి ప్రమథ గణాలకు నాయకుడయ్యాడు. మరుత్తులు సంతానం లేనివారై ఇంద్రునితో ఉంటూ దేవత్వాన్ని పొందారు. ఎలాగంటే, ఇంద్రుడు తన సంతానాన్ని సంహరిస్తున్నాడని కోపంతో ఇంద్రుని చంపే పుత్రుడు కావాలని, భర్త కశ్యపుని బతిమాలింది. కశ్యపుడు ఏడాదిపాటు నియమభంగం కాకుండా పుంసవన వ్రతం చేయమని చెప్పాడు. ఎంతో శ్రద్ధగా చేసినా చివరికి దితి నియమభంగం చేసింది. దానికోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి పిండాన్ని వజ్రాయుదంతో నరికాడు. అది ఏడు ముక్కలై సజీవంగా ఉన్నారు. మరల నరికాడు ఏడు ఏళ్ళు, నలభైతొమ్మిది ముక్కలై సజీవంగా ఉన్నారు. వారు ఇంద్రునితో కూడి ఉంటామని పలికి స్నేహం కోరారు. ఇంద్రుడు అంగీకరించాడు. వారు మరుత్తులు, లేదా మరుద్గణము అను దేవతలు అయ్యారు.
సనకాదుల శాపానికి విష్ణుద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. దితి చిన్నకొడుకు హిరణ్యాక్షుని వరహాతారమెత్తి, పెద్దవాడు హిరణ్యకశిపుని నరసింహావతారమెత్తి విష్ణువు సంహరించాడు.
తల్లి దితికి హిరణ్యకశిపుడు తమ్ముని మరణదుంఖాన్ని ఓదారుస్తూ సుయజ్ఞోపాఖ్యానము చెప్పాడు.
కృతయుగాంత కాలంలో దితి సుతులకు, దేవతలకు పెద్ద యుద్ధం జరిగింది. దానిలో ఇంద్రుడు ఓడిపోయాడు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; భర్త - కశ్యపుడు; కొడుకు(లు) - హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యపురవాసులు; పద్య సం.(లు) - 1-196-మ., 3-450-1-సీ., నుండి 3-501-వ., 4-181-మ., 6-252-వ., 6-256-త., 6-258-వ., 6-510-సీ. నుండి 6-526-క., 7-24-వ., 7-37-వ., 7-384-వ., 9-161-సీ.,

  119) దినకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దినకరుడు అంటే సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-10-వ., 8-627-వ.,

  120) దినేశవంశజులు- (పురుష){జాతి}[రాజు]:- దినేశవంశజులు అంటే సూర్యవంశమువారు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-245-శా.,

  121) దినేశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దినేశుడు అంటే సూర్యుడు. తృతీయ స్కంధాంత ప్రార్థనలో శ్రీరాముని, సంసారమనే అంధకారానికి దినేశుడు సూర్యునివంటివాడా! అని స్తుతించారు.
కుంతీదేవి చిన్నతనంలో విశ్వామిత్రునికి సేవచేసి, కోరిన దేవత వచ్చి పుత్రుని ప్రసాదించే వరం పొందింది. పరీక్షార్థం ఆ మత్రం ప్రయోగించగా దినేశుడు సూర్యుడు వచ్చి ఆమె కన్యత్వం చెడకుండా పుత్రుని ప్రసాదించాడు. అతడే కర్ణుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-1054-మాలి., 9-718-క., 9-721-చ., 10.2-1225-ఆ.,

  122) దినేశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దినేశ్వరుడు అంటే సూర్యుడు. సూర్యుడు దినేశ్వరుడు చీకటిని పారదోలునట్లు సంసారమనే తమస్సు సర్వం తొలగించువాడవు, అని శ్రీరాముని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-286-క.,

  123) దినేశ్వరులు- (పురుష){జాతి}[దేవయోని]:- దినేశ్వరులు అంటే ఆదిత్యులు. వృత్రాసురుడు సురాసుర యుద్దంలో పెట్టిన బొబ్బకు దినేశ్వరులు (ఆదిత్యులు) వ్రేలిరి.. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-384-లగ్రా.,

  124) దిలీపుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దిలీపుడు గొప్ప చక్రవర్తి సగరుని మనుమడు భగీరథుడి తండ్రి. నిర్మలమతులైన ఈ దిలీపుడు మున్నగు మహాత్ములందరూ భక్తితో ఆ దేవదేవుని సేవించారు దాటరాని విష్ణుమాయను దాటారు...సూర్యవంశంలోని సగరుని యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకుపోయి కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు. సగరునికి భార్య సుమతియందు కలిగిన కొడుకులు వందమంది గుఱ్ఱం కోసం వెతుకుతూ వెళ్ళి కపిలుని దగ్గరలో ఉన్న అశ్వాన్ని తీసుకుని మునీశ్వరుడిని దొంగ అనుకుని సంహరించబోయారు. ఆయన కన్నులు తెరవగానే వారందరూ కాలిబూడిదైపోయారు. సగరునికి మరొక భార్య కేశిని యందు కలిగిన కొడుకు అసమంజసుడు. అతని కొడుకు అంశుమంతుడు. తాత సగరుని వద్ద పెరిగాడు. అశ్వాన్ని, తండ్రులను వెతుకుచూ వెళ్ళి కపిలాశ్రమంలో అశ్వాన్ని చూసి, వినయంతో కపిలుని మెప్పించి, అశ్వాన్ని తీసుకొచ్చి తాత సగరునికి ఇచ్చాడు. అశ్వాన్నిస్తూ కపిలుడు దేవనదిని ఈ బూడిదపై పారించు. వీరికి ఉన్నతగతులు దక్కుతాయి అని చెప్పాడు. అంశుమంతుని కొడుకు దిలీపుడు. వీరిద్దరూ తప్పస్సుచేసినా ఫలితం దక్కలేదు. దిలీపుని కొడుకు భగీరథుడు. తపస్సులు చేసి గంగాదేవిని శివుని మెప్పించి. గంగను భూలోకంలోకి తెచ్చాడు. తండ్రుల చితాభస్మాలపై పారించి వారికి ఉన్నతగతులు కల్పించాడు ఈ గంగాప్రవాహ వర్ణన వచనం అత్యంత అద్భుతమైన, రసపూరితమైన వచనం.. - వంశం - సూర్యవంశం; తండ్రి - అంశుమంతుడు; కొడుకు(లు) - భగీరథుడు; పద్య సం.(లు) - 2-204-సీ. ,9-217-వ., 9-205-సీ., నుండి 9-230-వ.,

  125) దివము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దివము అంటే స్వర్గము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-206-వ.,

  126) దివసకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివసకరుడు సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-627-వ.,

  127) దివస్పతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- రాబోయే కాలంలో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో దివస్పతి ఇంద్రుడు అవుతాడు. సుకర్ములూ, సుత్రాములూ దేవతలు అవుతారు. నిర్మోహుడూ, తత్త్వదర్శుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు దేవహోతకూ బృహతికీ యోగవిభుడు అనే పేరుతో పుడతాడు. దివస్పతికి మిక్కిలి సహాయం చేస్తాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-425-వ., 8-426-ఆ.,

  128) దివాకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివాకరుడు అంటే సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-683-చ.,

  129) దివాచరములు- (){జాతి}[సృష్టి]:- దివాచరములు పగలు సంచరించు జీవులు.. దక్షుడు తన ఆత్మశక్తితో, తన వీర్యం ద్వారా ఖేచరులు, భూచరులు. వనచరాలు, జలచరాలు. రాత్రి సంచరించేవి, దివాచరములు (పగలు సంచరించేవి) ఐన రకరకాల జీవులను సృష్టించాడు. - వంశం - సృష్టి; పద్య సం.(లు) - 6-206-ఉ.,

  130) దివి-1 ( ){జాతి}[ప్రదేశము]:- ఆకాశము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-69-మ., 8-51-సీ., 8-56-క.,

  131) దివి-2 ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- స్వర్గము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-700-మ.,

  132) దివిజకాంతామణులు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దివిజకాంతామణులు అంటే అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-126-క.,

  133) దివిజగణశరణ్యుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజగణశరణ్యుడు విష్ణువు, రాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-1054-మాలి.,

  134) దివిజగురువు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజగురువు అంటే బృహస్పతి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1179-వ.,

  135) దివిజనగరము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దివిజనగరము అంటే దేవతల రాజధాని అమరావతి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-444-క.,

  136) దివిజనది- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దివిజనది అంటే గంగానది - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-667-ఆ.,

  137) దివిజనారులు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దివిజనారులు అంటే అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-131-క.,

  138) దివిజభామలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దివిజభామలు అంటే అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-130-క.,

  139) దివిజమానినులు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దివిజమానినులు అంటే అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-166-చ.,

  140) దివిజరాజు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజరాజు దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-386-వ., 7-373-వ.,

  141) దివిజరిపువిదారుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజరిపువిదారుడు రాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-744-మాలి.,

  142) దివిజవల్లభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజవల్లభుడు దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-525-క.,

  143) దివిజస్తోముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజస్తోముడు శ్రీరాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-1-క.,

  144) దివిజాధిపవైద్యులు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజాధిపవైద్యులు అంటే అశ్వనీదేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-58-క.,

  145) దివిజాధీశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజాధీశుడు ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-113-మ., 3-227-క.,

  146) దివిజాధీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజాధీశ్వరుడు దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-506-మ.,

  147) దివిజారి- (పురుష){జాతి}[రాక్షసయోని]:- దివిజారి రాక్షసుడు - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 3-633-క.,

  148) దివిజాలయము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దివిజాలయము అంటే స్వర్గము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-192-సీ.,

  149) దివిజులు- (పురుష){జాతి}[దేవయోని]:- దివిజులు అంటే స్వర్గమున ఉండువారు కనుక దేవతలు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-9-సీ., 3-92-చ., 3-449-తే.,

  150) దివిజేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివిజేంద్రుడు అంటే దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-183-క.,

  151) దివిరథుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని యయాతి వంశంలోని మహామనసునకు 1.సుశీనరుడు, 2.తితిక్షువు అని ఇద్దరు కొడుకులు. వారిలో 1.సుశీనరునకు 1.శిబి, 2. వనుడు, 3.క్రిమి, 4.దర్పుడు అని నలుగురు కొడుకులు. సుశీనరుని కొడుకు 1వ కొడుకు శిబికి 1.వృషదర్పుడు, 2.సువీరుడు, 3.మద్రుడు, 4.కేకయుడు అని నలుగురు కొడుకులు. ఆ శిబి 2వ పుత్రుడు సువీరుని కొడుకు సత్యరథుడు; అతని కొడుకు “దివిరథుడు”; దివిరథుని కొడుకు ధర్మరథుడు; అతని కొడుకు చిత్రరథుడు. ఆ చిత్రరథుడు రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు. మహామనసుని 2వ కొడుకు తితిక్షువు కొడుకు రుశద్రథుడు; అతనికి హేముండు; అతనికి సుతపుడు; అతనికి బలి పుట్టారు. ఆ బలికి 1.అంగుడు, 2.వంగుడు, 3.కళింగుడు, 4.సింహుడు, 5.పుండ్రుడు, 6.ఆంధ్రుడు అని ఆరుగురు పుత్రులు. వారు తూర్పు రాజ్యాలకు రాజులు అయి, ఆయా రాజ్యాలకు వారివారి పేర్లు పెట్టి పరిపాలించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సత్యరథుడు; కొడుకు(లు) - చిత్రరథుడు; పద్య సం.(లు) - 9-683-వ.,

  152) దివిషద్గంగ- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దివిషద్గంగ అంటే దేవగంగానది. పరీక్షిత్తు దివిషద్గంగా ప్రవాహములోనికి వెళ్ళి ప్రాయోపవేశము లో ఉన్నాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-497-మ.,

  153) దివోదాసుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దివోదాసు ముద్గలవంశం బ్రాహ్మణుడు అహల్యకు సోదరుడు. భర్మ్యాశ్వుని కొడుకు ముద్గలుడు. అతని నుండి ముద్గలగోత్రంతో ముద్గల వంశ బ్రాహ్మణ కులం ఏర్పడింది. ముద్గలుని కొడుకు దివోదాసుడు, కూతురు అహల్య. ఆ అహల్య వలన గౌతమునికి శతానందుడు పుట్టాడు. శతానందునికి ప్రముఖ వైద్యశాస్త్ర పండితుడు సత్యధృతి పుట్టాడు. అతడు ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా అయ్యారు. ఆ సమయంలో. వారిని శంతన మహారాజు కృపి, కృపుడు అనుపేర్లతో పెంచాడు. కృపిని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు. వారి పుత్రుడు అశ్వత్థామ. దివోదాసునకు మిత్రాయువు, అతనికి సహదేవుడు, అతనికి సోమకుడు పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ముద్గల; కొడుకు(లు) - మిత్రాయువు; పద్య సం.(లు) - 9-657-వ.,

  154) దివోదాసుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దివోదాసుకు మరొక పేరు ద్యుమంతుడు. ఇతను ధన్వంతరి మనుమడైన భీమరథుని కొడుకు, ఇతనికి ప్రతర్దునుడు కొడుకు. ఆ ప్రతర్దనుడికి శత్రుజిత్తు అని, ఋతుధ్వజుడు అని పేర్లు ఉన్నాయి. ఆతనికి కువలయాశ్వుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భీమరథుడు; కొడుకు(లు) - ప్రతర్దనుడు; పద్య సం.(లు) - 9-499-వ.,

  155) దివౌకస్వామి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దివౌకస్వామి. అంటే దివినుండు వారు దివౌకులు. వారి స్వామి దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-611-మ.,

  156) దివ్యవత్సరము- (){జాతి}[కాలము]:- దివ్యవత్సరము - అంటే దేవతల సంవత్సరము, ఒక మానవ సంవత్సరము, దేవతలకు ఒక దినము, మానవులు ఉత్తరాయణము పగలు దక్షిణాయణము రాత్రి - అట్టి దినములు 30 ఐన ఒక దివ్యమాసము అవి 12 అయిన ఒక దివ్యసంవత్సరము. - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-281-మ.,

  157) దివ్యవాణి-1 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- దివ్యవాణి అంటే సరస్వతీతదేవి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-17-సీ.,

  158) దివ్యవాణి-2 (){జాతి}[విద్య]:- దివ్యవాణి అంటే ఆకాశవాణి. నముచి సంహార సమయంలో వజ్రాయుధం వ్యర్థమైపోతుంటే, దేవేంద్రుడు కళవళపడుతున్నాడు అప్పుడు దివ్యవాణి (ఆకాశవాణి) నముచి "తడివాటితో కానీ, పొడివాటితో కానీ చావులేకుండా వరం పొందాడు. వేరే మరొక దానిని దేనినైనా వేగిరం ప్రయోగించు” అంటూ పలికింది. - వంశం - విద్య; పద్య సం.(లు) - 8-376-సీ.,

  159) దివ్యాంగన- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దివ్యాంగన అంటే దేవతాస్త్రీ, అప్సరస - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-260-సీ.,

  160) దివ్యుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దివ్యుడు చంద్రంవంశలోని సాత్వతుని కొడుకు. చంద్రవంశంలోని అనువునకు కొడుకు పురుహోత్రుడు; అతని కొడుకు అంశువు; అతని కొడుకు సాత్వతుడు; సాత్వతునకు 1.భజమానుడు, 2.భజి, 3.దివ్యుడు, 4వృష్ణి, 5.దేవాపృథుడు, 6.అంధకుడు, 7.మహాభోజుడు అని ఏడుగురు కుమారులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సాత్వతుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  161) దివ్యులు- (పురుష){జాతి}[దేవయోని]:- దివ్యులు అంటే దేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-142-సీ.,

  162) దిశలు- (){జాతి}[ప్రదేశం]:- దిశలు అంటే దిక్కులు, నల్దిక్కులు తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. అష్టదిక్కులు నల్దిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయవ్యం అను నాలుగు మూలలు మొత్తం ఎనిమిది. దశదిక్కులు అష్టదిక్కులు పైన క్రింద కలిపి పది - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 8-624-వ.

  163) దిశాఛిద్రములు- (){జాతి}[ప్రదేశం]:- దిశాఛిద్రములు అంటే ఈశాన్య, ఆగ్నేయం, నైఋతి, వాయవ్యం అనే నాలుగు మూలలు. రెండు దిక్కులకు మధ్య స్థానములు - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 8-624-వ.

  164) దిశాధినాథుడు- (పురుష){జాతి}[దేవయోని]:- దిశాధినాథుడు అంటే దిక్పాలకుడు. దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకం వెనుతగులుతుంటే ఈశాన్య దిక్కున గల మానససరోవరం అందు కమలనాళం చొచ్చి ఒక ఏడాది ఉన్నాడు. అన్నాళ్ళూ నారాయణధ్యానం చేస్తూ ఉండడం వలననూ, ఈశాన్య దిశాధినాథుడైన శంకరునిచేత రక్షింపబడుతుండుట చేతనూ బ్రహ్మహత్యాపాతకం దేవేంద్రుని పీడింపలేకపోయింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-437-వ., 12-36-మ.,

  165) దిశాధిపులు- (పురుష){జాతి}[దేవయోని]:- దిశాధిపులు అంటే దిక్పాలకులు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-385-లగ్రా.,

  166) దిష్టుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దిష్టుడు వైవశ్వత మనువు (శ్రాద్ధదేవుడు) పదిమంది కొడుకులలో ఏడవవాడు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. వీరు వైవస్వతమన్వంతరంలో రాజులు.. పురందరుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, వసువులూ, రుద్రులు అనేవారు దేవతలు అయ్యారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ అనేవారు సప్త ఋషులు అయ్యారు. అందులో కశ్యపుని భార్య అయిన అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి, ఇంద్రునికి తమ్ముడు అయ్యాడు. ఈ దిష్టుని కొడుకు నాబాగుడు. వాడు తన కర్మవశాత్తు వైశ్యుడుగా అయ్యాడు. ఆ నాభాగుడికి హలంధనుడు పుట్టాడు; అతనికి వత్సప్రీతి; వత్సప్రీతికి ప్రాంశువు; అతనికి ప్రమతి; ప్రమతికి ఖమిత్రుడు; ఖమిత్రునికి చాక్షుసుడు; అతనికి వివింశతి; వివింశతికి రంభుడు; రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు; అతనికి కరంధనుడు; కరంధనునికి అవిక్షిత్తు; ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - వైవశ్వతమనువు; తల్లి - శ్రద్ధాదేవి; కొడుకు(లు) - నాభాగుడు; పద్య సం.(లు) - 8-412-వ., 9-9-వ., 9-43-క., 9-44-వ.,

  167) దీక్ష- (స్త్రీ){సంజ్ఞా}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిద్రేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు ధృతవ్రతుడు నామం కలిగి భార్య దీక్షతో, ఇంద్రియాలు స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - ధృతవ్రతుడు; పద్య సం.(లు) - 3-369-క.,., 3-370-వ.,

  168) దీక్షణీయేష్టి- (){జాతి}[యజ్ఞం]:- దీక్షణీయేష్టి. అంటే యజ్ఞదీక్ష. వరహావతారని దేవతలు స్తుతిస్తూ ఇలా కూడా అన్నారు. "వరహాస్వామి! భగవంతుడవైన నీవు మళ్ళీమళ్ళీ ఆవిర్భవించటం “దీక్షణీయ” మనే యజ్ఞము; నీ కోరలు “ప్రాయణీయ” మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, “ఉదయనీయం” అనే సమాప్తేష్టి." - వంశం - యజ్ఞం; పద్య సం.(లు) - 3-426-వ.,

  169) దీక్షితుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- దీక్షితుడు అంటే యజ్ఞదీక్షలో ఉన్నవాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-526-క., 4-564-సీ., 4-808-ఆ., 5.1-7-సీ., 10.1-854-క.,

  170) దీప్తకేతువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ధృతకేతువు, దీప్తకేతువు మొదలగువారు చతుర్దశమనువులలో తొమ్మిదవవాడైన దక్షసావర్ణి పుత్రులు, ఆ మన్వంతర కాలంలో వీరు రాజులు అవుతారు - వంశం - మనువు వంశం; తండ్రి - దక్షసావర్ణి; పద్య సం.(లు) - 8-417-వ.,

  171) దీప్తిమంతుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఎనిమిదవదైన సూర్య సావర్ణి మన్వంతరంలో గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు, సప్తఋషులు అవుతారు. ఇప్పుడు వారు తమతమ ఆశ్రమాలలో ఉన్నారు. సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు అవుతారు. బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-415-వ.,

  172) దీప్తిమంతుడు-2 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దీప్తిమంతుడు శ్రీకృష్ణుని కుమారులలో మిక్కిలి ప్రసిద్దులైనవారిలో ఒకడు. శ్రీకృష్ణునికి రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది మిక్కిలి ప్రసిద్ధులు. వారి పేర్లు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు - వంశం - మానవ యోని; తండ్రి - శ్రీకృష్ణుడు; పద్య సం.(లు) - 10.2-1330-వ.,

  173) దీర్ఘతపుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దీర్ఘతపుడు చంద్రవంశపు రాజు. ఇంతని తండ్రి రాష్ట్రుడు. చంద్రవంశలోని పురూరవునికి తరువాతి తరాలలోని కాశ్యునకు కాశి; కాశికి రాష్ట్రుడు; రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టారు. దీర్ఘతపుని కొడుకు విష్ణువు అంశతో పుట్టిన ధన్వంతరి. అతని కొడుకు కేతుమంతుడు. అతని కొడుకు భీమరథుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రాష్ట్రుడు; కొడుకు(లు) - ధన్వంతరి; పద్య సం.(లు) - 9-497-వ., 9-498-క, 9-499-వ.,

  174) దీర్ఘతపుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దీర్ఘతపుడు పురోహితుడుగా దుష్యంతుని పుత్రుడైన భరతుడు యమునానది గట్టు మీద డెబ్బైయెనిమిది; గంగానది గట్టుమీద ఏభైయైదు; మొత్తం నూటముప్పైమూడు అశ్వమేథ యాగాలు చేసాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 9-635-వ.,

  175) దీర్ఘతముడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దీర్ఘతముడు మమత కొడుకు. అన్న ఉచథ్యుని భార్య గర్భవతిగా ఉండగా, బృహస్పతి రతిక్రీడకు ఉపక్రమించగా, గర్భంలో ఉన్న వాడు తగినపనికాదు అని మొత్తుకున్నాడు. బృహస్పతి వానిని గ్రుడ్డివాడివి కమ్మని శపించాడు. వాడు అలిగి ఉపస్థులో ఉన్న వీర్యాన్ని ఊడదన్నగా, అది పిల్లవాడు అయి నేలమీద పడ్డాడు. ఆ శిశువు నువ్వు పెంచు నువ్వు పెంచు అని వాదులాడుకుని ఇద్దరూ వాడిని వదిలేసారు. వాడు భరద్వాజుడు అయ్యాడు వానిని మరుత్తులు పోషించి, అపుత్రకుడైన భరతునికి ఇచ్చారు..గర్భస్తుడైన శిశువు బృహస్పతి శాపం వలన దీర్ఘతముడు అయ్యాడు. - వంశం - ఋషి; తండ్రి - ఉచథ్యుడు; తల్లి - మమత; పద్య సం.(లు) - 9-640-సీ.,

  176) దీర్ఘబాహుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దీర్ఘబాహుడు సూర్యవంశంలో శ్రీరామునికి ముందరి తరాలవాడు. దీర్ఘబాహుడు ఖట్వాంగుని పుత్రుడు దీర్ఘబాహునికి రఘువు, రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఖట్వాంగుడు; కొడుకు(లు) - రఘువు; పద్య సం.(లు) - 9-259-వ.,

  177) దీర్ఘమఖము- (){జాతి}[యజ్ఞం]:- దీర్ఘమఖము అంటే చిరకాలము నడచు యాగము. - వంశం - యజ్ఞం; పద్య సం.(లు) - 4-676-క.,

  178) దీర్ఘసత్రము- (){జాతి}[యజ్ఞం]:- దీర్ఘసత్రము ఒక పెద్ద యాగము పేరు - వంశం - యజ్ఞం; పద్య సం.(లు) - 1-51-వ.,

  179) దీర్ఘికల్- (){జాతి}[ప్రదేశము]:- దీర్ఘికల్ అంటే దిగుడుబావి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-1247-మ.,

  180) దుందుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) ఒక రాక్షసుడు. సూర్యవంశపువాడైన కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక, కువలయాశ్వుడు దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంతరం) అని ప్రసిద్దుడు అయ్యాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-164-క., 9-165-వ.,

  181) దుందుభి-1 (){జాతి}[పరికరం]:- దుందుభి దుం.. అని శబ్దం వచ్చే భేరీ వాద్యం - వంశం - పరికరం; పద్య సం.(లు) - 1-228-వ.,

  182) దుందుభి-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దుందుభి ఒక రాక్షసుడు. దేవదానవ యుద్దంలో బలి సైన్యంలోని సేనానాయకుడు ఈ దుందుభి. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-331-వ.,

  183) దుందుభి-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుందుభి చంద్రవంశలోని అనువు కొడుకు. ఈ అనువు తుంబురుని స్నేహితుడు. దుందుభికి దవిద్యోతుండు, దవిద్యోతునకుఁ బునర్వసువు, నతనికి నాహుకుండను కుమారుండు, నాహుకి యనుకన్యయుం గలిగి; రా యాహుకునికి దేవకుం, డుగ్రసేనుండు నన నిరువురు జనించి; రందు దేవకునికి దేవలుండు, నుపదేవుండును, సుదేవుండు, దేవవర్ధనుం డన నలుగురు గలిగరి; వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, నుపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ననఁ దోబుట్టవు లేడ్వురు గలిగిరి; - వంశం - చంద్రవంశం; తండ్రి - అనువు; కొడుకు(లు) - దవిద్యోతుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  184) దుందుమారుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంతరం) అంటే దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) ఒక రాక్షసుని సంహరించిన సూర్యవంశపు రాజు కువలాయాశ్వుడు. ఇతడు సూర్యవంశంలోని శావస్తి నగరం నిర్మించిన శావస్తి మనవడు. బృహదస్వుని కొడుకు. సూర్యవంశపువాడైన కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక, కువలయాశ్వుడు దుందుమారుడు అని ప్రసిద్దుడు అయ్యాడు. కువలయాశ్వుడి పుత్రులు అందరు బూడిద అయిపోయారు. వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే తప్పించుకొన్నారు.
దుంధుమారుడు రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కువలయాశ్వుడు; కొడుకు(లు) - వెయ్యిమంది వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే దుందుడని రాక్షసునితో యుద్ధంలో చావు తప్పించుకొన్నారు. ; పద్య సం.(లు) - 9-163-వ., 9-164-క., 9-165-వ., 12-18-వ.,

  185) దుగ్ధసాగరము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దుగ్ధసాగరము అంటే పాలసముద్రము, క్షీరసాగరము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.2-979-సీ., 11-105-వ.,

  186) దురుక్తి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. దురుక్తికి తండ్రి - క్రోధుడు; తల్లి - హింస; భర్త - కలి; కొడుకు - భయం; కూతురు – మృత్యువు. - వంశం - దేవయోని; తండ్రి - క్రోధుడు; తల్లి - హింస ; భర్త - కలి; కొడుకు(లు) - భయం; కూతురు(లు)- మృత్యువు; పద్య సం.(లు) - 4-215-వ,

  187) దుర్గ-1 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- దుర్గాదేవి గ్రంథారంభ ప్రార్థనలో దుర్గాదేవిని పోతనామాత్యుల వారు అమ్మలగన్నయమ్మ - పద్యంలో స్తుతించారు. ఈ పద్యం గ్రంథానికే చక్కటి ఆణిముత్యం.
అన్యదేవతా భజన ఫలం చెప్తూ శ్రీకాముడు దుర్గను సేవింపవలెను,
క్షీరసాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవి భారతీ దేవి, దుర్గాదేవి తన సఖులు అని భావిస్తుంది. అని వర్ణించబడింది.
బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దక్షిణసముద్రము (హిందూమహాసముద్రము) సేవించి, కన్య అను పేరుగల దుర్గాదేవిని సేవించాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-10-ఉ., 2-38-వ., 8-275-సీ., 10.2-272-క., 10.2-953-వ.,

  188) దుర్గ-2 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- మాయా - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-38-వ., 10.1-61-వ.,

  189) దుర్గభూములకధిష్ఠానదేవతలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- అసక్ని దక్షుల అరవైమంది పుత్రికలలో పదిమందిని ధర్మునకు వివాహం చేసారు. వారిలో జామిదేవి ఒకరు. ఆమెకు దుర్గభూములకధిష్ఠానదేవతలు - వంశం - దేవయోని; తండ్రి - ధర్ముడు; తల్లి - జామిదేవి; పద్య సం.(లు) - 6-254-వ.,

  190) దుర్గము- (){జాతి}[ప్రదేశము]:- దుర్గము అంటే కోట - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-152-చ., 4-506-తే., 8-637-క.,

  191) దుర్గాభిమానినులయినదేవతలు - (స్త్రీ){జాతి}[దేవయోని]:- అసక్ని దక్షుల అరవైమంది పుత్రికలలో పదిమందిని ధర్మునకు వివాహం చేసారు. వారిలో కకుబ్దేవి ఒకరు. ఆమె కుమారుడు సంకుటుడు, అతని కొడుకు కీటకుడు. ఆ కీటకునికి దుర్గాభిమానినులయినదేవతలు పుట్టారు. - వంశం - దేవయోని; తండ్రి - కీకటుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  192) దుర్జయుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దుర్జయుడు ఒక దానవుడు. తల్లిదండ్రులు దనువు కశ్యపుడు. అసిక్ని దక్షుల అరవైమంది పుత్రికలలో పదమూడు మందిని కశ్యపుడు వివాహమాడాడు. వారిలో దనువు సంతానాన్ని దానవులు అంటారు. దనువుకు భర్త కశ్యపుని వలన ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని పద్దెనిమిది మంది పుత్రులు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-258-వ.,

  193) దుర్దమనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్దమనుడు చంద్రవంశంలో పరీక్షిత్తు తరువాతి తరములలోని వాడు. ఇతని తండ్రి శతానీకుడు, కొడుకు విహీనరుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - శతానీకుడు; కొడుకు(లు) - విహీనరుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  194) దుర్భగ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- దుర్భగ పురంజయోపాఖ్యానంలో కాలుని పుత్రిక తన దౌర్ఘ్యం వలన దుర్భగ అని పేరుపొందింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-812-సీ.,

  195) దుర్భవభయవిదూరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దుర్భవభయవిదూరుడు. విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-304-సీ.,

  196) దుర్మదాసురమారణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దుర్మదాసురమారణుడు అంటే విష్ణువు. షష్ఠ స్కంధాంతం ప్రార్థనలో కృష్ణుని దుర్మదాసురమారణుడు అని స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-528-త.,

  197) దుర్మదుడు-1 (){సంజ్ఞా}[మానవ యోని]:- పురంజయోపాఖ్యానంలో ఆసురీ నామకం అంటే పడమటి దిక్కు ద్వారం ఐన మేడ్రం. గ్రామకం అనగా సురత సుఖము; దుర్మదుడు అనగా గుహ్యేంద్రియము; నిరృతి అనెడి పశ్చిమద్వారం అనగా గుదము. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-853-వ.,

  198) దుర్మదుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుడు చంద్రవంశంలో యయాతి కొడుకైన ద్రుహ్యుని వంశంవాడు. ఇతని తండ్రి ఘృతుడు, కొడుకు ప్రచేతసుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఘృతుడు; కొడుకు(లు) - ప్రచేతసుడు; పద్య సం.(లు) - 9-699-వ.,

  199) దుర్మదుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్మదుడు చంద్రవంశంలో యయాతి కొడుకైన యదువు వంశంవాడు. ఇతని తండ్రి భద్రసేనుడు, కొడుకు ధనికుడు. ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు కొడుకులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భద్రసేనుడు; కొడుకు(లు) - ధనికుడు; పద్య సం.(లు) - 9-701-వ.,

  200) దుర్మదుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దుర్మదుడు వసుదేవుడు మరొక భార్య పౌరవిల కొడుకు. వసుదేవునికి బార్య పౌరవి యందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు మున్నగు పన్నెండుమంది కొడుకులు కలిగారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - పౌరవి; పద్య సం.(లు) - 9-722-వ.,

  201) దుర్మదుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దుర్మదుడు వసుదేవుడు మరొక భార్య రోహిణీల కొడుకు. వసుదేవునికి రోహిణి యందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుండు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగు కొడుకులు కలిగారు - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - రోహిణి; పద్య సం.(లు) - 9-722-వ.,

  202) దుర్మర్షణుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇంద్రుని సేనలోని కామదేవుడు, వృత్రాసురుని సేనలోని దుర్మర్షణునితో యుద్ధం చేసాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-334-వ.,

  203) దుర్మర్షణుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దర్మర్షణుడు చంద్రవంశంలోని రాష్ట్రపాలి సృంజయుల కొడుకు. కంసుని సోదరి, ఉగ్రసేనుని నలుగురు కూతుళ్ళలో నాలుగవామె అయిన రాష్ట్రపాలి, వసుదేవుని అన్న సృంజయుని వివామాడింది. వారి కొడుకులు దుర్మర్షణుడు మొదలగువారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సృంజయుడు; తల్లి - రాష్ట్రపాలి; పద్య సం.(లు) - 9-722-వ.,

  204) దుర్ముఖుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దుర్ముఖుడు రామరావణ యుద్దంలో రావణుని తరఫున యుద్దంచేసి అంగదుని చేతిలో మరణించిన వీరుడు. రావణుడు పంపించగా కుంభుడు, నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు విల్లంబులు, కొరడాలు, గదలు, ఖడ్గాలు, శూలాలు, గుదియలు, గొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, రోకళ్ళు మున్నగు ఆయుధాలు పట్టి ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు ఎక్కి వచ్చి యుద్ధం చేసారు. సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజగవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు; ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధాలలో చెట్లు, కొండలు పిడికిటిపోట్లుతో కొట్టి సంహరించారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-291-వ.,

  205) దుర్యోధనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుర్యోధనుడు భారతంలో ప్రధాన ప్రతినాయకుడు, కౌరవులలో అగ్రజుడు, తండ్రి ధృతరాష్ట్రుడు, తల్లి గాంధారి. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించటం కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు. అది చాలా దారుణమైన పని అని, లోకు లందరు నిందించారు.
శ్రీకృష్ణరాయబారం సమయంలో సలహా చెప్పడానికి పిలవగా, వచ్చిన విదరుని విపరీతంగా దుర్యోధనుడు అవమానించాడు.
గాంధారి ధృతరాష్ట్రులకు దుర్యాధనాదులు వందమంది పుత్రులు, దుశ్శల అని ఒక పుత్రిక - వంశం - చంద్రవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; తల్లి - గాంధారి; పద్య సం.(లు) - 1-140-వ., 1-365-సీ., 3-34-క., 3-36-వ., 9-673-వ.,

  206) దుర్వాసుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దుర్వాసుడు గొప్పమునీశ్వరుడు. కోపధారి. ఇతని చల్లిదండ్రులు అనసూయ అత్రిమహర్షి. ఒకనాడు దుర్యోధన పంపగా దుర్వాసుడు పదివేల మంది శిష్యులతో పాడవులు పాంచాలీ వద్దకు భోజనాలు అయ్యాక వచ్చి "మాకు అన్నం పెట్టండి" అన్నాడు. "పెట్టకపోతే శాపం పెడతాను"అంటూ నదికి స్నానానికి వెల్ళిపోయాడు. వంట పాత్రలన్నీ కాళీగా ఉన్నాయి. ద్రౌపది కృష్ణుణ్ణి తలచుకొంది. ఆయన ప్రత్యక్షమై, గిన్నిలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి తేనుపులు తేనుస్తూ వెళ్లిపోయారు.
ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు
అనసూయ అత్రి దంపతులకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు.
ఏకాదశి వ్రతం పిదప ద్వాదశి పారాయణ చేయబోతున్న అంబరీషునికడకు అతిథిగా వచ్చి. అతనిపై కృత్యను ప్రయోగించి, విష్ణుచక్రం బారిని పడ్డాడు. అలా గర్వభంగం పొంది. అంబరీషుని చేరి విష్ణుచక్రం నుండి కాపాడబడ్డాడు.
దుర్వాసుడు కుంతిభోజునికి అతిథిగా వెళ్ళినప్పుడు, పెంపుడు కూతురు కుంతి సేవలు చేసి మెప్పించింది. దుర్వాసుడు, కుంతికి కోరిన దేవతలు వచ్చి పిల్లలను అనుగ్రహిస్తారని మంత్రం ఇచ్చాడు. ఆ బాల్యంలో కుంతి మంత్రం పరీక్షించడానికి పిలిస్తే సూర్యుడు వచ్చి, కొడుకును ఇచ్చి కన్యగానే ఉంటావని వరం ఇచ్చాడు. ఆతడే కర్ణుడు. - వంశం - ఋషి; తండ్రి - అత్రి; తల్లి - అనసూయ; పద్య సం.(లు) - 1-365-సీ., 10.2-766-సీ., 4-23-ఉ., 8-148-క., 9-94-వ., నుండి 9-147-వ. వరకు, 9-717-వ.,

  207) దుశ్శల- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- గాంధారి ధృతరాష్ట్రులకు దుర్యాధనాదులు వందమంది పుత్రులు, దుశ్శల అని ఒక పుత్రిక - వంశం - చంద్రవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; తల్లి - గాంధారి; పద్య సం.(లు) - 9-673-వ.,

  208) దుశ్శాసనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుశ్శాసనుడు దుర్యోధనుని తమ్ముడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; తల్లి - గాంధారి; పద్య సం.(లు) - 3-34-క., 3-130-వ., 9-230-వ.,

  209) దుష్టదైత్యనాశుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుష్టదైత్యనాశుడు అంటే శ్రీకృష్ణుడు, శృతిగీతలలో ఇలా స్తుతించారు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2-1225-ఆ.,

  210) దుష్టదైత్యప్రహరుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దుష్టదైత్యప్రహరుడు అంటే శ్రీరాముడు. ద్వితీయ స్కంధాంత ప్రార్థనలో ప్రయోగించారు. - వంశం - సూర్యవంశం; పద్య సం.(లు) - 2-287-మాలి.

  211) దుష్టనిశాటవిరాముడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దుష్టనిశాటవిరాముడు అంటే శ్రీరాముడు. రామావతార వర్ణనలో దుష్టనిశాటవిరాముడు అని వర్ణించారు. - వంశం - సూర్యవంశం; పద్య సం.(లు) - 2-160-క.,

  212) దుష్టలోకవిదారణుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దుష్టలోకవిదారణుడు అంటే శ్రీరాముడు. తృతీయ స్కంధాంత ప్రార్థనలో ప్రయోగించారు. - వంశం - సూర్యవంశం; పద్య సం.(లు) - 3-1053-త.,

  213) దుష్యంతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దుష్యంతుడు చంద్రవంశపు రాజు. పూరుని తరువాతి తరాలలో సుమతి పుత్రుడైన రౌభ్యుని కుమారుడు. ఒకమాటు వేటకు వెళ్ళినప్పుడు, కణ్వాశ్రమానికి వెళ్ళాడు. శకుంతలను చూసి వరించాడు. దుష్యంతుడు తన నగరానికి వెళ్ళిపోయాక, శకుంతలకు భరతుడు పుట్టాడు. తరువాత వెళ్ళిన, భరతుని శకుంతలను దుష్యంతుడు గుర్తించడు. ఆకాశవాణి చెప్పాక స్వీకరించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రైభ్యుడు; భార్య - శకుంతల; కొడుకు(లు) - భరతుడు; పద్య సం.(లు) - 1-293-వ., 9-593-వ., నుండి 9- 9-633-వ.,

  214) దూర్జటి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దూర్జటి అంటే శివుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-50-తే., 4-835-మ.,

  215) దూర్జటివ్రతులు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దూర్జటివ్రతులు అంటే శివదీక్షాపరాయణులు. దక్షుడు శివుని శపించాడని ఆగ్రహించి నంది దక్షాదులను శపించాడు. అంతట, భృగుమహర్షి శివదీక్షపరులు శాస్త్ర విరోధులు పాషండులు అగుదురు గాక అని శపించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-50-తే.,

  216) దూర్జటిసైనికులు- (పురుష){జాతి}[దేవయోని]:- దూర్జటి సైనికులు అంటే ప్రమథులు. దక్షయజ్ఞనాశనంలో దూర్జటి సైనికులు వలన తమకు కలిగిన బాధలను దేవతలు బ్రహ్మదేవునికి చెప్పుకున్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-125-క.,

  217) దూర్వాక్షి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- దూర్వాక్షి వసుదేవుని సోదరుడైన వృకుని భార్య, వీరి పుత్రులు దక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మున్నగువారు - వంశం - చంద్రవంశం; భర్త - వృకుడు; కొడుకు(లు) - దక్షుడు, పుష్కరుడు, సాళ్వుడు మున్నగువారు; పద్య సం.(లు) - 9-722-వ.

  218) దూర్వుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దూర్వుడు పరీక్షిత్తు నకు భవిష్యత్తరాల రాజు. ఇతని తండ్రి నృపంజయుడు. కొడుకు నిమి. - వంశం - చంద్రవంశం; తండ్రి - నృపంజయుడు; కొడుకు(లు) - నిమి; పద్య సం.(లు) - 9-679-వ.,

  219) దూషణుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఖరుడు దూషణుడు కవలలూ, రాక్షసులూ. వీరు రావణుని తమ్ములు. దండకారణ్యంలో ఉండే వారు. వారిని శ్రీరాముడు సంహరించాడు. దానిని సూచిస్తూ చతుర్థ స్కంధాంత ప్రార్థనలో ఖర దూషణ ప్రముఖ గాఢతమఃపటల ప్రచండభాస్కరా! అని స్తుతించారు. శ్రీరాముని చరిత్ర చెప్తూ బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను చంపి, సుగ్రీవుని చేరదీసి, వాలిని నేలకూల్చి.. అని వర్ణించబడింది. లక్ష్మణుడు శూర్పణక ముక్కు కోయగా విని కోపంతో, ఖరుడు దూషణుడు పద్నాలుగువేల మంది రాక్షసులతో కలిసి దాడిచేసారు. వారిని రాముడు సంహరించాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 4-974-చ., 6-306-సీ., 8-447-క., 9-231-వ., 9-269-సీ.,

  220) దృఢచ్యుతుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దృఢచ్యుతుడు పురంజయోపాఖ్యానంలోని పాత్ర. పురంజయుడు తరువాత జన్మలో స్త్రీగా పుట్టాడు. ఆమె పాండ్యరాజు మలయధ్వజునికి వీర్యశుల్కంగా వెల్ళింది. వారి కుమార్తెను అగస్త్యుడు వివాహమాడాడు. వారి కొడుకు దృఢచ్యుతుడు. అతని కొడుకు ఇధ్మవాహుడు. - వంశం - ఋషి; తండ్రి - అగస్త్యుడు; తల్లి - లోపాముద్ర (ధృతవ్రత); కొడుకు(లు) - ఇద్మవాహుడు; పద్య సం.(లు) - 4-830సీ., 4-831-క.,

  221) దృఢనేమి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దృఢనేమి చంద్రవంశంలోని హస్తినా పుర నిర్మాత హస్తి వంశంవాడు. ఇతని తండ్రి సత్యధృతి, కొడుకు సుపార్శ్వకృత్తు. హస్తి రెండవ కొడుకైన ద్విమీఢుని మనుమని కొడుకు సత్యధృతి; ఆ సత్యధృతికి "దృఢనేమి"; దృఢనేమికి సుపార్శ్వకృత్తు; అతనికి సుపార్శ్వుడు; అతనికి సుమతి పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సత్యధృతి; కొడుకు(లు) - సుపార్స్వకృత్తు; పద్య సం.(లు) - 9-655-వ.,

  222) దృఢరుచి- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దృఢరుచి కుశద్వీపపతి ప్రియవ్రతుని పుత్రుడైన హిరణ్యరేతసుని రెండవ పుత్రుడు. హిరణ్యరేతసుడు తన పుత్రులు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు పేర్లతో ఏడు వర్షాలను ఏర్పాటు చేసి వారిని వాటికి అధిపతులుగా నియమించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - హిరణ్య రేతసుడు ; పద్య సం.(లు) - 5.2-64-వ,

  223) దృఢరుచి వర్షం- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దృఢరుచి వర్షం కుశద్వీపంలోని వర్షం. దీనికి అధిపతి కుశద్వీపపతి హిరణ్యరేతసుని కొడుకు దృఢరుచి ఈ వర్షంలో చతుశ్శృంగం అను గిరి, మధుకుల్య అను మహానది ఉన్నాయి. ఇక్కడ ఉండే కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-64-వ,

  224) దృఢసేనుడు- (పురుష){సంజ్ఞ}[చంద్రవంశం]:- దృఢసేనుడు జరాసంధుని తరువాతి తరాలలోని వాడు. వీరు పరీక్షిత్తు కాలానికి జరాసంధుని వంశలోని భవిష్యత్తు తరాలవారు ఇతని తండ్రి ధర్మనేత్రుని పుత్రడైన శ్రుతుడు. కొడుకు సుమతి. తరువాత తరాలవారు సుబలుడు; సునీతుడు; సత్యజిత్తు; విశ్వజిత్తు; పురంజయుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్రుతుడు; కొడుకు(లు) - సుమతి; పద్య సం.(లు) - 9-681-వ.,

  225) దృఢహనువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దృఢహనువు సూర్యవంశంలోని హస్తినాపురనిర్మాత హస్తి తరువాత తరాల వాడు అయిన సేనజిత్తునకు రెండవ కొడుకు. పెద్దవాడు రుచిరాశ్వుడు. తమ్ముళ్ళు కాశ్యుడు, వత్సుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సేనజిత్తు; పద్య సం.(లు) - 9-653-వ.,

  226) దృఢాశ్వుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దృఢాశ్వుడు సూర్యవంశంలోని శవస్తి నగర నర్మాత శావస్తి తరువాతి తరంవాడు. దృఢాశ్వుడు తండ్రి శావస్తి మనుమడు కువలయాశ్వుడు. ఇతను తన ఇరవైయొక్కవేలమంది పుత్రులతో వెళ్ళి రాక్షసుడైన దుందుని సంహరించుటచే, దుందుమారుడు అని పేరుపొందాడు. అ సమయంలో ఆ రాక్షసుడి నోటి నుండి వెలువడిన అగ్నికి కువలయాశ్వుడి పుత్రులు ముగ్గురు తప్ప అందరు బూడిద అయిపోయారు. వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే తప్పించుకొన్నారు. ఆ దృఢాశ్వునికి హర్యశ్వుడు. హర్యశ్వునికి నికుంభుడు. నికుంభునికి బర్హిణాశ్వుడు. బర్హిణాశ్వునికి కృతాశ్వుడు, కృతాశ్వునికి సేనజిత్తు. సేనజిత్తునికి యువనాశ్వుడు, పుట్టారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కువలయాశ్వుడు; కొడుకు(లు) - హర్యశ్వుడు; పద్య సం.(లు) - 9-165-వ.,

  227) దృషద్వతి- ( ){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని మహానదులలో ఒక నది. తెలుగు భాగవతంలో ఉదహరించిన భారతవర్షంలోని నదీనదాలు చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవా, శిలా, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృథ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనేవి నదాలు. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం.
దృషద్వతి శ్రీకృష్ణుడు ద్వారకనుండి ఇంద్రప్రస్థం వెళ్ళేదారిలోని ఒక నది. అలా దారిలో ఆనర్తక, సౌవీర, మరుత్ దేశాలు; ఇందుమతి, దృషద్వతి, సరస్వతి నదులు; పాంచాల, మత్స్య రాష్ట్రాలు మీదుగా ఇంద్రప్రస్త నగరం వెళ్ళాడు. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ., 10.2-684-వ.,

  228) దేవకన్యకలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దేవకన్యలు అంటే అప్సరసలు. శుకుడు గోచీకూడా లేకుండ వెళ్తున్నాడు. ఆ పక్క సరస్సులో స్నానాలు చేస్తున్న దేవకన్యలు సిగ్గుపడక చీరలు ధరించలేదు. శుకుడి వెనకాతల వ్యాసుడు, కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు. ఎందుకని అని అడిగిన వ్యాసునికి శుకుడు నిర్వికల్పుడు స్త్రీపురుష భేదం లేదు. అతనికి నీకు పోలికలేదు అన్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-77-ఉ.,

  229) దేవకామినిలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దేవతలు శివుని దర్శనంకేసం వెళ్ళినప్పుడు, సౌగంధికావనం వర్ణిస్తూ, అక్కడ మెలగుతున్న దేవకామినులను వర్ణించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-135-వ.,

  230) దేవకి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకీదేవి శ్రీకృష్ణుని కన్నతల్లి. వసుదేవుని భార్య. పుట్టుకలు లేని విష్ణువు భూభారాన్ని పోగొట్టడానికి, బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించి, కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై పుట్టాడు.
చంద్రవంశంలోని పునర్వసువు కొడుకు ఆహుకుడు, కూతురు ఆహుకి ; ఆ ఆహుకుని ఇద్దరు పుత్రులు దేవకుడు, ఉగ్రసేనుడు; ఆ దేవకునికి దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అని నలుగురు కొడుకులు; ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవు, దేవరక్షిత, సహదేవ, "దేవకి" అని ఏడుగురు పుత్రికలు; ఆ దేవకి ఆమె ఏడుగురు అక్కచెళ్ళెలను వసుదేవుడు వివామాడాడు.
ఆ దేవకుని ఏడుగురు కుమార్తెలలో వసుదేవునికి (1)ధృతదేవ వలన త్రిపృష్ఠుండు, (2)శాంతిదేవ వలన ప్రశ్రమ ప్రశ్రితాదులు, (3)ఉపదేవ వలన కల్పవృష్ట్యాదులు పదిమంది, (4)శ్రీదేవ వలన వసుహంస సుధన్వాదులు ఆరుగురు, (5)దేవరక్షిత వలన గదాదులు తొమ్మిదిమంది, (6)సహదేవ వలన పురూఢ శ్రుతుడు మున్నగు ఎనిమిది మంది, (7)"దేవకీదేవి" వలన కీర్తిమంతుడు సుషేణుండు భద్రసేనుడు ఋజువు సమదనుడు భద్రుడు సంకర్షణుడు(బలరాముడు) మఱియు శ్రీకృష్ణుడు అని ఎనమండుగురు పుత్రులు తరువాత "సుభద్ర" అని ఒక పుత్రిక కలిగారు.
మధుర, శూరసేన దేశాలు ఏలిన యాదవవంశపు శూరసేనుడు పుత్రుడైన వసుదేవుడు దేవకీదేవిల వివాహం అయ్యాక కంసుడు వారిని రథం ఎక్కించుకుని స్వయంగా తోలుతూ బయలుదేరాడు. దారిలో ఆకాశవాణి కంసుని ఉద్దేశించి ఈమె అష్టమగర్భంలో పుట్టేవాడు నిన్ను చంపుతాడు అని పలికింది. రోషంతో కంసుడు దేవకిని చంపబోతాడు. వసుదేవుడు నచ్చజెప్పి, ఈమెకు పుట్టే కొడుకులను నీకు ఇస్తాను అని మాట ఇస్తాడు, దేవకి వసుదేవులను మందలో విడిచి వెళ్పిపోతాడు. దేవకి కంసుని బాధలు పడుతూనే ఎనిమిదిమంది కొడుకలను ఒక కూతురుని కన్నది. మొదటపుట్టిన కీర్తిమంతుడును పుట్టిన వెంటనే వసుదేవుడు తీసుకెళ్ళి కంసునికి ఇస్తాడు. అతని నిజాయతీకి సంతోషించి, వీనిని తీసుకెళ్ళు అంటాడు, ఎనిమిదోవాడు కదా నా పాలిటి మృత్యువు వానిని పుట్టగానే సంహరిస్తాను అంటాడు.
నారదుడు వచ్చి దేవకి మొదలైన వారిందరూ దేవతలని కంసుడురాక్షసు డని చెప్తాడు. అంత దేవకీవసుదేవులను బంధించి కంసుడు చెరసాలలో పెడతాడు. దేవకీదేవికి కొడుకులను ఆరుగురిని కంసుడు వధిస్తాడు. విష్ణు ఆజ్ఞప్రకారం మాయాదేవి దేవకి ఏడవగర్భంలోని పిండం తీసి రోహిణీదేవి గర్భంలో పెడుతుంది. అలా రోహిణికి ఆదిశేషుని అంశతో బలరాముడు పుడతాడు. దేవకి ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు అర్ధరాత్రి నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలో ఉండగా పుట్టాడు. అప్పుడు బ్రహ్మాదేవుడు,వసుదేవుడు, దేవకి స్తుతిస్తారు. అప్పుడు భగవంతుడు పూర్వజన్మలో దేవకి పృశ్ని అని వసుదేవుడు ప్రజాపతి సుతపుడు అని. వారు చేసిన తపస్సుకి మెచ్చి పృశ్నిగర్భుడు అని కొడుకుగా పుట్టానని. తరువాత జన్మలో అదితి కశ్యపులైన మీకు వామనుడుగానూ ఇప్పుడు ఇలా పుట్టాను అని చెప్పాడు. తరువాత వసుదేవుడు తీసుకెళ్ళి వ్రేపల్లెలోని యశోద పక్కలో పడుకోబెట్టి, ఆమెకు అప్పుడే పుట్టిన మాయను తెచ్చి దేవకికి ఇస్తాడు. కంసుడు వచ్చి చెల్లెలు దేవకి వద్దనుండి ఆ పాపను లాక్కుని నేలపై విసిరి కొడతాడు. ఆమె క్రింద పడకుండా ఆకాశంలోకి వెళ్శి కంసుని మందలించి మాయమైపోతుంది.
కంసుడు దేవకీవసుదేవులకు సానుకూలంగా మాట్లాడి, వారి బంధనాలు విడిపించాడు.
కంసునికి నారదుడు కృష్ణుడు దేవకీవసుదేవుల బిడ్డడని,బలరాముడు రోహిణీ వసుదేవుల బిడ్డడని చెప్తాడు. కంసుడు మరల దేవకీ వసుదేవులను ఇనప గొలుసులతో బంధిస్తాడు.
కంసవధానంతంరం కృష్ణుడు బలరామునితో కలిసి వెళ్ళి దేవకీ వసుదేవులను బంధవిముక్తులను చేసి. మంచిమాటలు మాట్లాడి వారి దుఃఖం పోగొట్టాడు.
దేవకీదేవి కంసునిచే చంపబడ్డ తన ఆరుగురు కొడుకులను చూడాలని ఉందని బలరామ కృష్ణులను అడిగింది. సుతలలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉన్న తన అన్నలను ఆరుగురినీ తీసుకువచ్చి తల్లికి దేవకీదేవికి చూపి బలరామ కృష్ణులు సంతోషపెట్టారు.
సుభద్ర కోసం వచ్చిన అర్జునుడు, ఆమె దేవాలయానికి వచ్చిన సుభద్రను, కృష్ణుడు దేవకీ వసుదేవుల అనుమతితో తీసుకువెళ్ళాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; భర్త - వసుదేవుడు; కొడుకు(లు) - కీర్తిమంతుడు సుషణుడు భద్రసేనుడు ఋజువు సమదనుండుస భద్రుడు సంకర్షణుడు కృష్ణుడు సుభద్ర; పద్య సం.(లు) - 1-45-సీ., 1-195-క., 1-214-వ., 1-260-వ., 2-173-సీ., 3-56-క., 3-94-సీ., 9-712-వ., 9-713-వ., 10.1-9-సీ., 10.1-19-క., నుండి 10.1-161-వ., 10.1-207-శా., 10.1-286-వ., 10.1-1149-చ., 10.1-1151-వ., 10.1-1208-మ., 10.1-1210-వ., 10.1-1390-వ., 10.1-1523-సీ., 10.2-38-వ., 10.2-71-వ., 10.2-901-తే., 10.2-1064-చ., 10.2-1140-వ., నుండి 10.2-1163-క., 10.2-1172-వ., 11-82-వ.,

  231) దేవకీతనయుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకీతనయుడు అంటే కృష్ణుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2-829-చ., 12-50-సీ.,

  232) దేవకీనందనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకీనందనుడు అంటే శ్రీకృష్ణుడ - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-188-వ., 11-23-వ.,

  233) దేవకీపుత్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకీపుత్రుడు అంటే కృష్ణుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.2-1187-తే.,

  234) దేవకీసుతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకీసుతుడు అంటే కృష్ణుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-1387-సీ., 10.1-1692-సీ., 10.2-268-వ., 10.2-747-సీ.,

  235) దేవకుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకుడు పంచపాండవులలోని ధర్మరాజు, పౌరవతుల పుత్రుడు. పాండవులు ఐదుగురకు ద్రౌపది వలన వరుసగా ప్రతివింధ్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతకర్ముడు అని ఐదుగురు పుట్టారు. వారిని ఉపపాండవులు అంటారు. యుధిష్ఠిరునకు పౌరవతి వలన దేవకుడు; భీమసేనునికి హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు; సహదేవునికి విజయ వలన సుహోత్రుడు, నకులునకు రేణుమతి వలన నిరమిత్రుడు; అర్జునునకు ఉలూపి అనే నాగకన్య వలన ఇలావంతుడు, మణిపుర రాజు కుమార్తె చిత్రాంగద వలన బబ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు పుట్టాడు. వారిలో బబ్రువాహనుడు అర్జునుని ఆనతి మేర తన మాతామహుని చేరి వారి వంశం నిలబెట్టాడు. యుద్దానంతంరం ఉపపాండవుల తలలను నిద్రలో ఉండగా అశ్వత్థామ నరికాడు. మిగతావారందరూ కురుక్షేత్ర యుద్దంలో మరణించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ధర్మరాజు; తల్లి - పౌరవతి; పద్య సం.(లు) - 9-673-వ.,

  236) దేవకుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవకుడు దేవకీదేవి తండ్రి. కృష్ణుని మాతామహుడు. చంద్రవంశంలోని పునర్వసువు కొడుకు ఆహుకుడు, కూతురు ఆహుకి ; ఆ ఆహుకుని ఇద్దరు పుత్రులు "దేవకుడు", ఉగ్రసేనుడు; ఆ దేవకునికి దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అని నలుగురు కొడుకులు; ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవు, దేవరక్షిత, సహదేవ, దేవకి అని ఏడుగురు పుత్రికలు;
కంసుడు అక్రూరుని రామ కృ,ష్ణులను తీసుకురమ్మని బృందావనానికి పంపుతూ, నువ్వు వారిని తీసుకొచ్చాక ఎలాగో ఒకలాగ బలరామకృష్ణులను తెగటార్చి, పినతండ్రి దేవకుని చంపుతాను అంటాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఆహుకుడు; కొడుకు(లు) - దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్దనుడు; కూతురు(లు)- ధృతదేవి, శాంతిదేవి, ఉపదేవి, శ్రీదేవి, దేవరక్షిత, సహదేవి, దేవకి; పద్య సం.(లు) - 9-712-వ., 10.1-1263-సీ.,

  237) దేవకులు- (పురుష){జాతి}[మానవ యోని]:- దేవకులు క్రౌంచద్వీపంలోని ఒక వర్ణం ప్రజలు. క్రౌంచ ద్వీపానికి అధిపతి ఘృతవృష్ఠుడు ప్రియవ్రతుని పుత్రుడు; రాజులు ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అని అతని ఏడుగురు కొడుకులు; వర్షాలపేర్లు ఆమోద, మధువహ, మేఘపృష్ఠ, సుదామ, ఋషిజ్య, లోహితార్ణ, వనస్పతి; పర్వతాలు ఏడూ శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం; నదుల పేర్లు ఏడూ అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రగతి, శుక్ల; ప్రజల చాతుర్వర్ణాల పేర్లు గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు; దేవుడు వరుణదేవుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  238) దేవకుల్య - (స్త్రీ){సంజ్ఞా}[సుమతి వంశం]:- ఈ దేవకుల్య భర్త ఉద్గీథుడు, కొడుకు ప్రస్తోత . ప్రియవ్రతుని వంశంలోని భూమునకు భార్య ఋషికుల్యకు పుత్రుడు ఉద్గీతుడు. ఆ ఉద్గీతునకు భార్య దేవకుల్యకు పుత్రుడు ప్రస్తోత. ప్రస్తోత వరరుత్సలకు కొడుకు విభుడు. విభుడు భారతిలకు కుమారుడు కొడుకు పృథుషేణుడు. పృథుషేణుడు ఆకూతిలకు కొడుకు నక్తుడు. ఆ నక్తునకు కుమారుడు రాజర్షిశ్రేష్ఠుడైన గయుడు. - వంశం - సుమతి వంశం; భర్త - ఉద్గీథుడు; కొడుకు(లు) - ప్రస్తోత; పద్య సం.(లు) - 5.2-6-వ

  239) దేవకుల్య (గంగ)- (){సంజ్ఞా}[దేవయోని]:- దేవకుల్య తల్లి పూర్ణిమ, సోదరుడు విరజుడు. మరొక జన్మలో గంగ; మరీచికి భార్య కర్దముని కుమార్తె యైన కళకు కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు కలరు. ఆ పూర్ణిమ మరొకజన్మలో విష్ణువుయొక్క పాదప్రక్షాళన జలాలతో గంగగా పుట్టిన, దేవకుల్య అనే కుమార్తెను, విరజుడు అనే కుమారుని కన్నది. - వంశం - దేవయోని; తల్లి - పూర్ణిమ; పద్య సం.(లు) - 4-7-సీ.,

  240) దేవకూట పర్వతం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుండి ఉత్తరం వరకు పద్దెనిమిది యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-30-వ.,

  241) దేవక్షత్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవక్షత్రుడు చంద్రవంశంలోని దేవరాతుని కొడుకు, మధువు తండ్రి. దశరథునకు శకుని; శకునికి కుంతి; కుంతికి దేవరాతుడు; అతనికి దేవక్షత్రుడు; అతనికి మధువు; మధువునకు కురువశుడు; అతనికి అనువు; అనువునకు పురుహోత్రుడు; అతనికి అంశువు; అతనికి సాత్వతుడు; అతనికి భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృథుడు, అంధకుడు, మహాభోజుడు అని ఏడుగురు కుమారులు జన్మించారు. వారిలో భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని ముగ్గురు; రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని ముగ్గురు; జన్మించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవరాతుడు; కొడుకు(లు) - మధువు; పద్య సం.(లు) - 9-709-వ.,

  242) దేవగణనందితకీర్తి - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవగణనందితకీర్తి శ్రీకృష్ణుడు రుక్మణీదేవి విప్రలంభం పిమ్మట కృష్ణుని స్తుతించింది. దేవగణనందితకీర్తి కృష్ణుడు సంతోషించి అనేక బహుమానాలు ఇచ్చి కోరిన కోరికలు తీర్చాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-271-చ.,

  243) దేవగణిక- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దేవగణిక అంటే అప్సరస - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-396-క.,

  244) దేవగర్భం- ( ){సంజ్ఞా}[నది]:- కుశద్వీపపు సత్యవ్రత వర్షంలో, దేవగర్భం అను మహానది, దేవానీకం అను గిరి ఉన్నాయి. కుశద్వీపం మధ్య ఒక పెద్ద కుశస్తంబం (దర్భదుబ్బు) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. దాని వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. దీనికి అధిపతి ప్రియవ్రతపుత్రుడైన హిరణ్యరేతసుడు తన ఏడుగురు కుమారులు వసుదాన, దృఢరుచి, నాభి, గుప్త, సత్యవ్రత, విప్ర, వామదేవుడు పేర్లతో ఏడు వర్షాలుగా ఏర్పరచి, వాటికి అధిపతులను చేసాడు. ఆ వర్షాలలో ఏడు మహాపర్వతాలు ఏడుమహానదులు ఉన్నాయి. ఆ పర్వతాలు బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం; ఆ నదులు రసకుల్యం, మధుకుల్యం, శ్రుతవిందం, మిత్రవిందం, దేవగర్భము, ఘృతచ్యుతం, మంత్రమాల. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-63-సీ., 5.2-64-వ,

  245) దేవగుహ్యము- (){జాతి}[విద్య]:- దేవగుహ్యము అంటే దేవరహస్యము, సృష్టిరహస్యము, మరణము. అజామిళోపాఖ్యానము నందు, కాలపుత్రిక వరునికోసం తిరుగుతూ భయనాముడను యవనుని చేరి, తనను గ్రహించమన్నది. ఆ దేగుహ్యమును నెరవేర్చగోరుతున్న ఆ కాలకన్యను భయనాముడు గుర్తించి, ఇలా అన్నాడు.జ్ఞానదృష్టితో నీకు భర్తను నిర్ణయిస్తాను. నీవు అవ్యక్తగతివై లోకమంతటా తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు. నా సేనను నీకు తోడుగా పంపిస్తాను. దాని సాయంతో నీవు ప్రజానాశనం చేయగలవు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు. నీవు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కూడి నేను అవ్యక్తుడనై, భీమ సైనికుడనై ఈ లోకంలో సంచరిస్తాను” అని అన్నాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 4-813-వ., 4-817-వ. వరకు.

  246) దేవచక్రవర్తి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవచక్రవర్తి అంటే విష్ణువు. బ్రహ్మదేవుని విష్ణుస్తుతిలోని స్తుతి ఇది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-311-సీ.,

  247) దేవజిత్తు- (పురుష){సంజ్ఞా}[భరతుని వంసం]:- సుమతి”కి, అతని భార్య “దేవసేన”కు “దేవతాజిత్తు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “ఆసురి” అనే భార్యవల్ల “దేవద్యుమ్నుడు” అనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి “ధేనుమతి” వల్ల “పరమేష్ఠి” పుట్టాడు. అతనికి “సువర్చల” వల్ల “ప్రతీహుడు” కలిగాడు. - వంశం - భరతుని వంసం; పద్య సం.(లు) - 5.2-6-వ.,

  248) దేవజ్యేష్టుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- పద్నాలుగురు మనువులలో పన్నెండవవాడైన భద్ర సావర్ణి కొడుకులు దేవవంతుడూ, ఉపదేవుడూ, దేవజ్యేష్టుడూ మొదలైనవారు. ఆ కాలంలో వారు రాజులు అవుతారు. - వంశం - మనువు వంశం; తండ్రి - భద్రసావర్ణిమనువు; పద్య సం.(లు) - 8-423-వ.,

  249) దేవజ్యేష్ఠుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవజ్యేష్ఠుడు అనగా దేవతతలో పెద్దవాడైన బ్రహ్మదేవుడు. కృత్యను నాశనం చేసి వెంటపడిన చక్రం నండి కాపాడమని దుర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిన సందర్భంలో దేవజ్యేష్ఠుడు అని వర్ణించారు.
ఇంత భీకరమైన పెద్ద పాము రూపంలో ఉన్న అఘాసుర సంహారం ఇంత చిన్న కృష్ణబాలుడు ఎలాచేసి, గోగోపబాలుర ఎలా రక్షించాడో అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయిన సందర్భంలో దేవజ్యేష్ఠుడు అని వర్ణించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-108-శా., 10.1-486-శా.,

  250) దేవతలు -1- (పురుష){జాతి}[దేవయోని]:- గో రూపంలో ఉన్న భూదేవి, వృషభరూపంలో ఉన్న ధర్మమూర్తితో కలిప్రభావం గూర్చి చెప్తూ ఇలాఅంది.. . . దేవతలకూ, పితృదేవతలకూ, ఋషులకూ, నాకూ, నీకూ, నానావిధాలైన వర్ణాశ్రమాలకూ, గోవులకూ, మహానుభావులకూ బాధలు ప్రాప్తిస్తున్నందుకు బాధపడుతున్నాను. . .
దేవతలు నారాయణ శరీర సంభూతులు.
సాత్త్వికాహంకారం నుండి మనస్సు, దాని అధిదేవత చంద్రుడు, అంతేకాక దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-405-క., 1-493-క., 2-9-సీ., 2-84-వ., 2-86-వ., . . .

  251) దేవతలు -2- (పురుష){జాతి}[దేవయోని]:- విరాట్పురుషుని వర్ణనలో చెప్పినవి. వాగింద్రియానికి దేవత అగ్ని, ముక్కుకు వాయువు, కంటికి ఆదిత్యుడు, చర్మానికి వృక్షములు, చేతులకు ఇంద్రుడు, కాళ్ళకు విష్ణువు, శిశ్నేపస్థంములకు ప్రజాపతి, ఆంత్రకుక్షి నాడీ నిచయములకు సముద్రములు దేవతలు.ట
మార్పు చెందుతున్న సాత్త్వికాహంకారం వల్ల మనస్సూ, వికారము చెందు కార్యరూపులైన ఇంద్రియాల ఆధిదేవతలైన దేవతా గణాలూ ఉదయించాయి.. . కాల మయాంశ లింగ స్వరూపులై మహదాదులందు అభిమానం గల దేవతలు విష్ణుదేవుని కళలే.
మానవుల ఒక నెల పితృ దేవతలకు ఒక దినం. ఒక మానవ సంవత్సరం దేవతలకు ఒక దినం. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-296-వ., 3-202-వ.,

  252) దేవతలు -3- (పురుష){జాతి}[దేవయోని]:- విదురుడు కురుక్షేత్రంలో కురుకుమారులందరూ నశించారని విని శోకంతో యాత్రలకు బయలుదేరి, సరస్వతి, అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతానామాలతో ప్రసిద్ధమైన నదులలో స్నానాలు చేసాడు, - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-44-ఉ.,

  253) దేవతలు -4- (పురుష){జాతి}[దేవయోని]:- బ్రహ్మ తేజోమయమైన మరొక దేహాన్ని ధరించి, సత్త్వగుణంతో కూడినవారూ, ప్రకాశవంతులూ అయిన దేవతలను ప్రముఖంగా సృష్టించి, ఆ తేజోమయమైన దేహాన్ని వదలివేయగా అది పగలుగా రూపొంది దేవతలందరికీ ఆశ్రయ మయింది. అని దేవమనుష్యాది సృష్టి వర్ణనలో చేపబడింది
యజ్ఞుడు దక్షిణలకు యామ అను పేర్లు గవ దేవతలు జన్మించారు.
దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజము
దక్షయజ్ఞవేదికవద్ద సతీదేవి యోగాగ్ని దగ్గంకాగా, రుద్రానుచరులు అక్కడివారిని శిక్షించబోయారు. అప్పుడు, భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-722-వ., 4-5.క., 4-93-వ., 4-104-వ., 4-699-వ.,

  254) దేవతలు మన్వంతరంలో- (పురుష){జాతి}[దేవయోని]:- 2.స్వారోచిషమన్వంతరంలో తుషితాదులు దేవతలు,
3. ఉత్తమమన్వంతరంలో సత్యుడు భద్రుడు మొదలగువారు దేవతలు,
4.తామసమన్వంతరంలో సత్యకుడు, హరి, వీరుడు దేవతలు,
5.రైవతమన్వంతరంలో భూతుడు రయుడు మున్నగువారు దేవతలు,
6,చాక్షుసమన్వంతరంలో ఆప్యాదులు దేవతలు,
7.వైవశ్వతమన్వంతరంలో ఆదిత్యులు, మరుత్తులు అశ్వినులు, వసువులు, రుద్రులు దేవతలు,
8.సూర్యసావర్ణిమన్వంతంరంలో సుతపులూ, విరజులూ, అమృతప్రభులూ దేవతలు,
9దక్షసావర్ణి మన్వంతంరలో పరులు, మరీచులూ, గర్గులు మొదలైనవారు దేవతలు,
10.బ్రహ్మసావర్ణి మన్వంతరంలో విబుద్ధి మొదలగువారు దేవతలు,
11.ధర్మసావర్ణి మన్వంతరంలో విహంగములూ, కామగమనులూ, నిర్వాణరుచులూ దేవతలు,
12.భద్రసావర్ణి మన్వంతంరలో హరితాదులు దేవతలు, 13.దేవసావర్ణి మన్వంతరంలో సుకర్ములూ, సుత్రాములూ దేవతలు,
14.ఇంద్రసావర్ణి మన్వంతరంలో పవిత్రులు చాక్షుసులు దేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-7-వ., నుండి 8-15-సీ. వరకు., 8-138-క. నుండి 8-141-సీ. వరకు.,

  255) దేవతలు-5- (పురుష){జాతి}[దేవయోని]:- నిరంతరం స్వధర్మాన్ని ఆచరించిన పురుషుడు పెక్కు జన్మాల పుణ్యం చేత బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేత నన్ను పొందుతాడు. నేను బ్రహ్మాది దేవతలు అధికారాంతంలో పొందే విష్ణుపదాన్ని హరిభక్తుడు తనంతతానే పొందుతాడు. అని శివుడు ప్రచేతసులకు చెప్పాడు.
కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులై శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను, ఆచారాలను వదలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు.
n]వామనుడు త్రివిక్రమాతారుడై విశవరూపం దాల్చాడు. . . తొడలలో "దేవతలను", వస్త్రంలో సంధ్యాకాలాన్నీ, రహస్యాంగంలో ప్రజాపతులనూ, పిరుదులలో రాక్షసులనూ, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలనూ, వక్షంలో నక్షత్రసమూహాన్నీ, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మి దేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో "ఇంద్రాదులైన దేవతలను", చెవులలో దిక్కులూ, తలలో స్వర్గలోకాన్ని. .. ఇమిడించుకున్నాడు. . . బలిని భవిష్యత్తులో సావర్ణిమన్వంతంరలో దేవేంద్రుడు అనుతాడని వరమిచ్చి సపరివారంగా అప్పటిదాకా రసాతలంలో ఉండమని పంపించాడు. . . బ్రహ్మదేవుడు వామనుడు సకల లోకాలకూ, దిక్పాలులకు, ధర్మ, కీర్తిస సంపద, శుభాలకు, దేవతలకు, మోక్షానికీ అధిపతి అని నిర్ణయించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-699-వ., 5.1-89-వ., 8-624-వ., 8-664-క., 8-681-వ.,

  256) దేవతలు-6- (పురుష){జాతి}[దేవయోని]:- శ్రీరాముడు సీత వలన తప్పేమీలేదని అగ్నిపరీక్షద్వారా వెల్లడిచేసాడు. దేవతల అనుజ్ఞప్రకారం ఆమెను చేపట్టాడు. యాగపశువుగా అమ్ముడుపోయిన శునశ్సేపుని, విశ్వామిత్రుని కోరికమేరక దేవతలు విడిపించారు, కనుక అతనికి దేవారాతుడు అని పేరు వచ్చింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-313-వ., 9-491-వ., 9-497-వ.,

  257) దేవతాగ్రేసరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతాగ్రేసరుడు విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-590-ఉ.,

  258) దేవతాచక్రవర్తి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతాచక్రవర్తి విష్ణువు. శ్రీనాథనాథా దండకంలో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! అని స్తుతించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-203-దం.,

  259) దేవతాజిత్తుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు ప్రియవ్రతుని వంశపు భరతుని మనుమడు. తండ్రి సుమతి, తల్లి దేవసేన, భార్య ఆసురి, కొడుకు దేవద్యుమ్నుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - సుమతి; తల్లి - దేవసేన; భార్య - ఆసురి; కొడుకు(లు) - దేవద్యుమ్నుడు; పద్య సం.(లు) - 5.2-6-వ

  260) దేవతాతరువు- (){సంజ్ఞా}[వృక్ష]:- దేవతాతరువు అంటే కల్పవృక్షం - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 10.2-583-సీ.,

  261) దేవతానగరి- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవతానగరి స్వర్గంరాజధాని అమరావతి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-100-మ.,

  262) దేవతానికరనేత- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతానికరనేత అంటే బ్రహ్మదేవుడు. గ్రంథారంభ ప్రారంభ బ్రహ్మదేవుని ప్రార్థనలో ఇలా వర్ణించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-3-ఉ.,

  263) దేవతానోకహము- (){సంజ్ఞా}[వృక్ష]:- దేవతానోకహము అంటే కల్పవృక్షము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 2-155-సీ.,

  264) దేవతాపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతాపతి ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-520-చ., 6-270-సీ.,

  265) దేవతామంత్రి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతామంత్రి అంటే బృహస్పతి. బలి స్వర్గంమీదకి దండయాత్ర వచ్చాడు. విషయం తెలిసి, ఇంద్రుడు బృహస్పతిని సలహా అడిగాడు. ఇంతకుముందు ఓడినవాడు మరల వచ్చాడు. పరమ భీకరంగా ఉన్నాడు. ఏమి చెయ్యాలి అని అడిగాడు. బృహస్పతి ఇంద్రునికి. కాలం అనుకూలం కాకపోతే, ముందే తొలగి తప్పుకోవడమే మేలైన పని అని చెప్పాడు. ఇంద్రుడు దేవతలు మారువేషాలతో అమరావతి వదలి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-452-సీ.,

  266) దేవతావనరక్షాచణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతావనరక్షాచణుడు అంటే సంకర్షణుడు. అతనిని పాతళలోకంలో నాగకన్యలు స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-267-మ.,

  267) దేవతావిభవదాత- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతా విభవదాత అంటే బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-278-ఉ.,

  268) దేవతాహ్లాదగరిష్ఠుడు - (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవతాహ్లాదగరిష్ఠుడు అంటే వినాయకుడు. గ్రంథారంభ ప్రార్థనలో ఇలా స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-4-ఉ.,

  269) దేవదత్తము- (){జాతి}[జంతు]:- కలియుగంలో అధర్మం మితిమీరి పరిపక్వం అయినప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు. అప్పుడు కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. - వంశం - జంతు; పద్య సం.(లు) - 12-11-వ.

  270) దేవదత్తుడు-1 (పురుష){సంజ్ఞా}[నాగ జాతి]:- పాతాళలోకంలో నాగజాతివారు ఎంతో తెలివి గలవారై ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు. ఆ నాగజాతిలో వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు మహానాగులు ఉంటారు. వారికి ఐదు, నూరు వేయి తలలు ఉంటాయి. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - వంశం - నాగ జాతి; తండ్రి - కశ్యపుడు; తల్లి - కద్రువ; పద్య సం.(లు) - 5.2-121-వ.,

  271) దేవదత్తుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దేవదత్తుడు సూర్యవంశంలోని ఉరుశ్రవుని కొడుకు. ఆగ్నివేశ్యాయనం అనే బ్రాహ్మణు కులానికి ఆద్యుడైన ఋషి అగ్నివేశుని తండ్రి. అరిష్యంతుడు అనె వైవస్వత మనుపుత్రునికి తరువాతి తరానికి చెందిన శూరుడికి కొడుకు దేవదత్తుడు; అతనికి అగ్నివేశుడు పుట్టాడు. అగ్నివేశుడు కానీనుడు అనబడి, జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఉరుశ్రవుడు; కొడుకు(లు) - అగ్నివేశుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  272) దేవదేవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవదేవుడు అంటే విష్ణువు, కృష్ణుడు. బ్రహ్మదేవుడు నారదునకు వైష్ణవమహాత్మ్యం చెప్తూ దేవదేవుడని విష్ణువును వర్ణించాడు. కన్నతల్లిదండ్రులైన దేవకీవసుదేవుల కారాగార బంధాలను విడిపించి, దేవదేవుడైన కృష్ణుడు కంసునిచే మీరు బాధలు పడుతున్నా వచ్చి శత్రుసంహారం చేసి కాపాడుటలో ఆలస్యం చేసినందు మన్నించమని వేడుకున్నాడు. ఈ విషయం తలచున్నప్పుడల్లా తన హృదయం వ్యథచెందుతూ ఉంటుందని ఉద్దవుడు విదురునికి చెప్పాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-104-సీ., 2-242-తే., 3-94-సీ., 3-203-దం., 3-219-తే., 3-500-ఉ., . . .

  273) దేవదేవేశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవదేవేశుడు అంటే నారయణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-142-మ.,

  274) దేవద్యుమ్నుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు దేవతాజిత్తు ఆసురిల కొడుకు, భార్య ధేనుమతి. పుత్రుడు పరమేష్టి. వీరు భరతుని ప్రియవ్రతుని వంశంలోని వారు. పాషండుల బోధనలకు ప్రభావితుడైన “సుమతి”కి, అతని భార్య “దేవసేన”కు “దేవతాజిత్తు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “ఆసురి” అనే భార్యవల్ల “దేవద్యుమ్నుడు” అనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి “ధేనుమతి” వల్ల “పరమేష్ఠి” పుట్టాడు. అతనికి “సువర్చల” వల్ల “ప్రతీహుడు” కలిగాడు. ఆ మహానుభావుడు జనులందరికీ బ్రహ్మోపదేశం చేసి పరిశుద్ధమైన మనస్సుతో హరి స్మరణ చేస్తూ ఉండేవాడు. అతనికి యజ్ఞాలు చేయడంలో నిపుణులైన “ప్రతిహర్త”, “ప్రస్తోత”, “ఉద్గాత” అనే ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో ప్రతిహర్తకు “నుతి” అనే భార్యవల్ల “వ్యోముడు”, “భూముడు” అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి “ఋషికుల్య” అనే భార్యవల్ల “ఉద్గీథుడు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “దేవకుల్య” వల్ల “ప్రస్తోత” అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రస్తోతకు “వరరుత్స” వల్ల “విభుడు” అనే కొడుకు పుట్టాడు. విభునికి “భారతి” అనే భార్య వల్ల “పృథుషేణుడు” కలిగాడు. పృథుషేణునికి “ఆకూతి” వల్ల “నక్తుడు” జన్మించాడు. ఆ నక్తునకు రాజర్షులలో చాల గొప్పవాడై కీర్తి సంపాదించిన “గయుడు” పుట్టాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - దేవతాజిత్తు; తల్లి - ఆసురి; భార్య - ధేనుమతి; కొడుకు(లు) - పరమేష్ఠి; పద్య సం.(లు) - 5.2-6-వ

  275) దేవద్వేషి- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దేవద్వేషి అంటే దేవతలను ద్వేషించువారైన దైత్య, దానవాది రాక్షసులు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-178-క.,

  276) దేవధాని- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- ఇంద్రుడి పట్టణం, దేవధాని (అమరావతి) దేవతల రాజధాని. అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గిస్తూ ఒక్కదినంలో తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. ఈ మానసోత్తర పర్వతానికి తూర్పున దేవధాని ఉంటుంది. దక్షిణంలో సంయమని, అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచన అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోను సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాల భేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయం మొదలైనవి అక్కడి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణా లవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముపై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాలు అతిక్రమిస్తాడు. అలాగే మిగిలిన మూడు భాగల ప్రయాణాలు కూడ ఉంటాయి. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడు కుండలూ (నాభి ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్తకాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.
బలి దాడి చేసినప్పుడు దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టారు. బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలనూ తన వశం చేసుకున్నాడు. విశ్వవిజేత అయి చాలాకాలం పాలించాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-81-వ., 8-458-వ.,

  277) దేవనది-1 (){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవనది అంటే విష్ణుపాదాలందు పుట్టిన దేవగంగానది, ఆకాశగంగ. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 4-576-ఉ.,

  278) దేవనది-2 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- దేవనది అంటే గంగాదేవి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-205-క.,

  279) దేవనదీతనయుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- దేవనదీతనయుడు భీష్ముడు. ధర్మరాజు, నిరాహారుడై ఉన్న దేవనదీతనయుడైన భీష్ముడు పడి ఉన్న చోటుకు వెళ్లాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 1-205-క.,

  280) దేవనాయకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవనాయకుడు అంటే ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-436-సీ.,

  281) దేవపతినందనుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవపతినందనుడు అంటే అర్జునుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-743-క.,

  282) దేవపథము- (){జాతి}[ప్రదేశము]:- దేవపథము అంటే ఆకాశమార్గం - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-483-ఉ.,

  283) దేవపాలం,- ( ){సంజ్ఞా}[పర్వతం]:- శాకద్వీపంలోని బహురూప వర్షంలో దేవపాలం, అను సరిహద్దు పర్వతము, సహస్ర సృతి అను నది ఉన్నాయి. ప్రియవ్రతసుతుడైన మేధాతిథి తన కుమారులైన పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వాచారుడు అనే ఏడుగురి పేర శాకద్వీపాన్ని ఏడు వర్షాలను విభజించి, వారికి పట్టంగట్టాడు. తాను తపస్సుకు వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలలో క్రమంగా ఈశానం, ఉరుశృంగం, బలభద్రం, శతకేసరం, సహస్రస్రోతం, దేవపాలం, మహానసం అనే ఏడు సరిహద్దు పర్వతాలు; అనఘ, ఆయుర్ద, ఉభయసృశ్టి, అపరాజిత, పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే ఏడు నదులు ఉన్నాయి. ఆ ద్వీపవాసులు వాయుదేవుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  284) దేవప్రస్తుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవప్రస్తుడు గోపికావస్త్రాపహరణ పిమ్మట, కృష్ణుడు గోపాలురతో దూరప్రాంతంలో ధేనువులను మేపుతుండగా, తీక్ష్ణమైన ఎండగా ఉన్నా గొడుగులా ఉన్న చెట్లను చూసి శ్రీ కృష్ణుడు బలరాముడు, శ్రీరాముడు దేవప్రస్థుడు విశాలుడు అర్జునుడు మొదలైన వారితో తక్కిన గోపాలబాలకులు చెట్లను ఎవరికీ కీడుచేయవు అంటూ ఇంకా పొగిడారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-850-వ.,

  285) దేవబర్హ వర్షం- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవబర్హ వర్షం ప్లక్షద్వీపంలో ఉంది. దీనికి అధిపతి యజ్ఞబాహు కొడుకైన దేవబర్హుడు. దీనిలో కుముదం అను పర్వతం, కుహువు అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు. . . ప్లక్షద్వీపంలోని శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) జువ్విచెట్టంత ఉంది. ఈ బూరుగు చెట్టు దిగువభాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ప్రియవ్రతసుతుడైన యజ్ఞబాహువు ఈ ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడు. అతడు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, వారిబర్హుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అనే తన ఏడుగురు కుమారులను వారి పేర్లతోనే వ్యవహరింపబడే ఆ ఏడు వర్షాలకు అభిషిక్తులను చేసాడు. ఈ ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అని పిలువబడతారు. వారు సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురా (కల్లు) సముద్రం ఉంది. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  286) దేవబర్హుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవబర్హుని వర్షం దేవబర్హం ప్లక్షద్వీపంలో ఉంది. ఇతను యజ్ఞబాహు కొడుకు. ఈవర్షంలో కుముదం అను పర్వతం, కుహువు అను మహానది ఉన్నాయి. ఇక్కడి పురుషులను శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అంటారు. వారు సోముణ్ణి ఆరాధిస్తారు. . . ప్లక్షద్వీపంలోని శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) జువ్విచెట్టంత ఉంది. ఈ బూరుగు చెట్టు దిగువభాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ప్రియవ్రతసుతుడైన యజ్ఞబాహువు ఈ ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడు. అతడు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, వారిబర్హుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అనే తన ఏడుగురు కుమారులను వారి పేర్లతోనే వ్యవహరింపబడే ఆ ఏడు వర్షాలకు అభిషిక్తులను చేసాడు. ఈ ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యధరులు, ఇధ్మధర్ములు అని పిలువబడతారు. వారు సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురా (కల్లు) సముద్రం ఉంది. - వంశం - మానవ యోని; తండ్రి - యజ్ఞబాహువు; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  287) దేవబాహువు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవబాహువు శ్రీకృష్ణుని పద్దెనిమిది మంది ప్రసిద్దులైన పుత్రులలో ఒకడు. ఆ పద్దెనిమిదిమంది 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు. - వంశం - మానవ యోని; తండ్రి - కృష్ణుడు; పద్య సం.(లు) - 10.2-1330-వ.,

  288) దేవభాగుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవభాగుడు వసుదేవుని తమ్ముడు. హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనెడి పుత్రులు పుట్టారు; ఆ దేవమీఢునికి శూరుడు అని ఇంకో పేరు ఉంది. శూరునికి భార్య మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, నానకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు జన్మించారు.
దేవభాగుడు భార్య కంసుని సోదరియైన కంస. ఇద్దరు కొడుకులు చిత్రకేతుడు, బృహద్బలుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవమీఢుడు శూరుడు; తల్లి - మారిష; భార్య - కంస; కొడుకు(లు) - చిత్రకేతు, బృహద్బలుడు; పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.

  289) దేవభూతి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- పరీక్షిత్తునకు భవిష్యత్కాల రాజులలో శుంగవంశంలోని భాగవతుని కొడుకు. శుంగులు; పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు, సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి అని పదిమంది వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని నూటపన్నెండు ఏళ్ళు పాలిస్తారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, కణ్వుని మంత్రి వధిస్తాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భాగవతుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  290) దేవమంత్రి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవమంత్రి అంటే బృహస్పతి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-46-చ., 9-531-సీ.,

  291) దేవమార్గము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవమార్గము అంటే దేవయానం, పాలపుంత, అంతరిక్షమున ప్రకాశవంతమైన దారివలె నుండు తారల వరుస - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5-2-97-వ.,

  292) దేవమిత్రుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దేవమిత్రుడు పైలుని శిష్యుల పరపంరలోని వాడైన మాండకేయుని నుండి ఋగ్వేదశాఖను నేర్చుకున్నాడు. దేవమిత్రుడు సౌభరి మున్నగు చాలామంది శిష్యులకు ఆ ఋగ్వేద సంహితను ఉపదేశించాడు. అందులో ఒకడు సౌభరి కుమారుడైన శాకల్యుడు. ... ఋగ్వేదం పైలుడు నుండి ఇంద్ర ప్రమితికి, భాష్కలునికి; భాష్కలుని ముండి భోధ్యుండు, యాజ్ఞవల్క్యుడు, అగ్నిమిత్రులకు; ఇంద్రప్రమితి నుండి మాండూకేయుడి నుండి దేవమిత్రుడి నుండి సౌభరి మున్నగు వారు మఱియు సౌభరి కుమారుడైన శాకల్యుడు; శాకల్యుడు నుండి వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశురుడు అయిదుగురుకి వారి నుండి జాతుకర్ణి నుండి బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు, బాష్కలుని కుమారుడు బాష్కలి, అతను నుండి వాలఖిల్య సంహితను బాలాయని, గార్గ్యుడు, కాసారుడు అనే ముగ్గురికి బోధించాడు. ఈ విధంగా ఋగ్వేద సంహితలు శాఖలు విస్తృతమై నిల్చి ఉన్నాయి. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  293) దేవమీఢుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- కృతరయుని కొడుకైన దేవమీఢుని వంశంలో పుట్టింది, నిమి వీరి పూర్వజుడు వీరి నగరం విదేహ, ప్రతింధకునికి కొడుకు కృతరయుడు; అతని కొడుకు దేవమీఢుడు; అతని కొడుకు విధృతుడు; అతని కొడుకు మహాధృతి; అతని కొడుకు కీర్తిరాతుడు; అతని కొడుకు మహారోముడు; అతని కొడుకు స్వర్ణరోముడు; అతని కొడుకు హ్రస్వరోముడు; అతని కొడుకు సీరధ్వజుడు. ఇతని పుత్రిక సీత. - వంశం - సూర్యవంశం; తండ్రి - కృతరయుడు; కొడుకు(లు) - విధృతుడు; పద్య సం.(లు) - 9-372-వ.

  294) దేవమీఢుడు(శూరుడు)- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవమీఢుడు(శూరుడు) శ్రీకృష్ణుని పితామహుడు. వసుదేవుని తండ్రి. హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనెడి పుత్రులు పుట్టారు; ఆ దేవమీఢునికి శూరుడు అని ఇంకో పేరు ఉంది. శూరునికి భార్య మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, నానకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు జన్మించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - హృదికుడు; భార్య - మారిష; కొడుకు(లు) - వసుదేవుడు నానకదుందుభి, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు; కూతురు(లు)- పృథ కుంతి, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి; పద్య సం.(లు) - 9-714-వ.,

  295) దేవయాని- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవయాని తల్లిదండ్రులు ఉర్జస్వతి, శుక్రాచార్యుడు. ఊర్జస్వతి మనుపుత్రడైన ప్రియవ్రతుని కూతురు. శుక్రాచార్యుడు భర్గమహర్షి పుత్రుడు. ఒకసారి మలహరుడు అటురావడంతో, లజ్జతో స్నానాలు చేస్తున్న అందరూ బట్టలు కట్టుకునే తొందరలో వృషపర్వుడను రాక్షసేంద్రుని కూతురైన శర్మిష్ట దేవయాని బట్టలు కట్టుకుంది. ఆ సందర్భంలోని వాదులాటలలో శర్మిష్ట వివస్త్రగా దేవయానిని నూతిలోకి తోయించింది. వేటకు అటువచ్చిన యయాతి రక్షించాడు. పూర్వం దేవయాని, మృతసంజీవనికోసం వచ్చిన కచుడు క్షత్రియునికి భార్యవు అవుతావు అని తనను శపించిన విషయం చెప్పింది. యయాతి శర్మిష్టను వరించాడు.
తరువాత శర్మిష్ఠ తనుకు చేసిన అవమానం దేవయాని తండ్రికి చెప్పింది. శుక్రుడు తన శిష్యుడైన వృషపర్వునికి చెప్పి శర్మిష్ఠను చెలులందరితో సహా దేవయానికి సేవకురాలిగా చేస్తాడు. అలా దేవయానితో పాటు అరణంగా శర్మిష్ట కూడా వెళ్తుంది. దేవయానికి యయాతి వలన యదువు, తుర్వసులు అని కొడుకులు.
శర్మిష్ట యయాతిల రహస్య సంబంధం వలన ద్రుహ్యుడు, అనువు, పూరువు అని కొడుకులు కలిగారు. ఆ విషయం దేవయాని తండ్రికి చెప్పడంతో శుక్రుడు యయాతికి ముసలితనం శాపంగా ఇచ్చాడు. యయాతి తన ముసలితనం తీసుకుని వారి యవ్వనం కొన్నాళ్ళు ఇమ్మని కొడుకులను అడిగాడు. యదువు, తుర్వసుడు, ద్రుహ్యుడు, అనువు అంగీకరంచలేదు. పూరువు తన యవ్వనం ఇచ్చాడు. అలా కొన్నాళ్ళు అనుభవించి, విరక్తి చెంది, యయాతి బస్తోపాఖ్యానం భార్య దేవయానికి చెప్తాడు. తరువాత కొడుకు యౌవనం అతనికి ఇచ్చి, తన ముసలితనం తీసుకున్నాడు. రాజ్యం కొడుకలకు ఇచ్చి, స్వతస్సిద్ధమైన భాగవతగతి చెందాడు. దేవయాని సమస్త తగులాలు వదలి శ్రీహరి ధ్యానంలో నిమగ్నమై ముక్తి పదానికి చేరిందియ - వంశం - చంద్రవంశం; తండ్రి - శుక్రాచార్యుడు; తల్లి - ఊర్జస్వతి ; భర్త - యయాతి; పద్య సం.(లు) - 5.1-20-వ., 9-514-సీ, నుండి 9-590-సీ.,

  296) దేవరక్షిత- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవరక్షిత శ్రీకృష్ణుని ఏడుగురు తల్లులోను ఆరవయామె. . . . ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అని ఇద్దరు కొడుకులు. ఉగ్రసేనునికి కంసాది సంతానం. దేవకునికి దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్దనుడు అనెడి నలుగురు పుత్రులు; ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనెడి ఏడుగురు పుత్రికలు; వీరిని ఏడుగురిని వసుదేవుడు పెళ్ళాడాడు. కనుక, దేవకి యందు పుట్టిన కృష్ణునికి వీరు ఏడుగురు తల్లులు.
దేవరక్షిత యందు వసుదేవునికి గదుడు మున్నగు తొమ్మండ్రు కొడుకులు పుట్టారు. ఇంకా వసుదేవునికి ధృతదేవ అందు త్రిపృష్ఠుండు; శాంతిదేవ అందు ప్రశ్రముడు, ప్రశ్రితుడు మున్నగువారు; ఉపదేవ అందు కల్పవృష్టుడు మున్నగు పదిమంది (10); శ్రీదేవ అందు వసుహంసుడు, సుధన్వుడు ఆదులు ఆరుగురు; దేవరక్షిత అందు గదుడు మున్నగు తొమ్మిదిమంది; సహదేవ అందు పురూఢుడు, శ్రుతుడు, మున్నగు ఎనిమిదిమంది (8); దేవకి తోటి కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, సంకర్షణుడు అనెడి వారు ఏడుగురు జన్మించాక, శ్రీకృష్ణుడు, సుభద్ర పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; భర్త - వసుదేవుడు; కొడుకు(లు) - గద మున్నగు తొమ్మిదిమంది; పద్య సం.(లు) - 1-260-వ., 9-712-వ., 9-722-వ.

  297) దేవరమణులు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దేవరమణులు అంటే అప్సరసలు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-78-వ.,

  298) దేవరాజితవినుతుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవరాజితవినుతుడు శ్రీరాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-480-క.,

  299) దేవరాతుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవరాతుడు చంద్రవంశంలోని విదర్భపుత్రుడైన కృథుని తరువాతి తరాల వాడైన కుంతి కొడుకు. దశరథపుత్రుడైన శకుని కొడుకు కుంతి. కుంతి కొడుకు దేవరాతుడు. దేవరాతుని కొడుకు దేవక్షత్రుడు. అతని కొడుకు మధువు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కుంతి; కొడుకు(లు) - దేవక్షత్రుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  300) దేవరాతుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దేవరాతుడు సూర్యవంశంలోని మైథిలులగు వారిలో ఒక రాజు. అలా సీతాదేవి వంశంలోని పూర్వజుడు. . . మిథులుని కొడుకు ఉదావసుడు; అతని కొడుకు నందివర్దనుడు; అతని కొడుకు సుకేతుడు; అతని కొడుకు "దేవరాతుడు"; దేవరాతుని కొడుకు బృహద్రథుడు అతని కొడుకు మహావీర్యుడు; - సుధృతి; - ధృష్టకేతుడు; - హర్యశ్వుడు; - మరువు; - ప్రతింధకుడు; - కృతరయుడు; - దేవమీఢుడు; - విధృతుడు; - మహాధృతి; - కీర్తిరాతుడు; - మహారోముడు; - స్వర్ణరోముడు; - హ్రస్వరోముడు; అతని కొడుకు సీరధ్వజుడు. ఈయన కుమార్తె సీతాదేవి. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుకేతుడు; కొడుకు(లు) - బృహద్రథుడు; పద్య సం.(లు) - 9-372-వ.,

  301) దేవరాతుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- దేవరాతుడు శునశ్సేపుని మరొక పేరు. దేవతలచే విడివడుటచే శునశ్శేపుడు దేవరాతుడు అయ్యాడు. భృగువంశంలో పుట్టిన అజీగర్తుని పుత్రుడు శునశ్శేపుడు. అతని తల్లిదండ్రులు హరిశ్చంద్రుని యాగానికి బలిపశువుగా పంపారు. అతను బ్రహ్మదేవాది దేవతలను స్తుతించి మెప్పించి వారి వలన వదలిపెట్టబడ్డాడు. కనుక దేవరాతుడని ప్రసిద్ధుడయ్యాడు. గాధి పుత్రుడైన విశ్వామిత్రుడు ఇతనిని ఇష్ట పుత్రునిగా స్వీకరించాడు. తన నూటొక్కమంది కొడుకలను శునశ్సేపుని అన్నగా గ్రహించమన్నాడు. వారిలో మధుచ్ఛందుడు అతని ఏబై (50) తమ్ములు మాత్రమే అంగీకరించారు. తండ్రి అనుగ్రహం పొందారు. - వంశం - ఋషి; తండ్రి - అజీగర్తుడు, పెంపుడు తండ్రి విశ్వామిత్రుడు; పద్య సం.(లు) - 9-492-వ. నుండి 9-497-వ.,

  302) దేవర్షి- (పురుష){జాతి}[ఋషి]:- దేవర్షియైన నారదుడు విష్ణుమూర్తి ఏకవింశతి అవతారాలలో మూడవవాడు. నారదుడు కర్మనిర్మోచకమైన వైష్ణవతంత్రం టచెప్పాడు.
పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-24-వ.,1-63-వ., 1-499-వ., 1-521-వ., 4-570-వ., . . .

  303) దేవలుడు-1 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ దేవలుడుపరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు. పరీక్షిత్తు ప్రాయోపవిష్టుడై ఉన్నాడని తెలిసి తీర్థాలకు తీర్థత్వాన్ని సార్థకం చేసే, సర్వ సమర్థులైనవారు అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్ఠుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవషుడు, కణ్వుడు, కలశసంభవుడు (అగస్త్యుడు), వ్యాసుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులూ, దేవర్షులూ, రాజర్షులూ, అరుణుడు మొదలైన కాండర్షులూ, ఇంకా వివిధ గోత్రసంభవులైన మహర్షులు శిష్యులతోనూ, ప్రశిష్యులతోనూ కలిసి విచ్చేశారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-499-వ.,

  304) దేవలుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ద్వారకకు వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. ఆ మునీశ్వరులు ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం విచ్చేసారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ., 10.2-1122-వ.,

  305) దేవలుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ దేవలుడు విష్ణుమాయ దాటిన ఋషి. . . . బ్రహ్మదేవుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు, శివుడు, ప్రహ్లాదుడు, స్వాయంభువ మనువు, అతని భార్య శతరూప, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ప్రాచీనబర్హి , ఋభుమహర్షి, వేనుని తండ్రి అయిన అంగుడు, ధ్రువుడు, గాధి, గయుడు, ఇక్ష్యాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘు మహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి, అలర్క మహారాజు, దేవలుడు, సౌభరి, జనకమహారాజా, అభిమన్యుడు, ఆర్ష్ణిషేణుడు మొదలగు నిర్మలమతులైన మహాత్ములందరూ భక్తితో ఆ దేవదేవుని సేవించారు దాటరాని విష్ణుమాయను దాటారు.
పూర్వం వేదవ్యాసుడు, నారదుడు, దేవల మహర్షి తనకు చెప్పిన చిత్రకేతోపాఖ్యానము శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు చెప్పెను.
శివుడు, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, సిద్ధులు మున్నగు మహా జ్ఞానసంపన్నులు, సిద్ధ శ్రేష్ఠులు సైతం ఆయన మాయను తెలియలేరు. అటువంటి మహాత్ముడు సర్వేశ్వరుడైన విష్ణువు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 2-203-సీ., 2-204-సీ., 6-444-వ., 6-548-సీ., 9-113-సీ.,

  306) దేవలుడు-4 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ దేవలుడు ధిషణ వేదశిరస్సుల పెద్ద కుమారుడు. వేదశిరస్సుకు; అసిక్ని దక్షుల 16వ పుత్రిక యైన ధిషణ అనే భార్య వల్ల దేవలుడు, వయునుడు, మనువు అని ముగ్గరు పుత్రులు జన్మించారు. - వంశం - ఋషి; తండ్రి - వేదశిరుడు; తల్లి - ధిషణ ; పద్య సం.(లు) - 6-254-వ.,

  307) దేవలుడు-5 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ దేవలముని శాపం వలన పూర్వజన్మలో 'హూహూ' అనే గంధర్వుడు గజేంద్రమోక్షణలో గజేంద్రుని పట్టుకున్న 'మకరి', విష్ణుచక్రం ఖండించగా శాపవిముక్తుడయ్యాడు. దేవదేవునికి పెక్కు స్తోత్రాలు చేసి తన గంధర్వలోకానికి వెళ్ళాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-121-సీ.,

  308) దేవలుడు-6 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దేవలుడు చంద్రవంశంలోని వృష్ణివంశజాతుడైన శ్వఫల్కుని పన్నెండుగురులలో పెద్ద కుమారుడైన అక్రూరుని పెద్ద పుత్రుడు. ఇతని తమ్ముడు అనుపదేవుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - అక్రూరుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  309) దేవలుడు-7 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ దేవలుడు శ్రీకృష్ణుని మేనమామ; దేవకీదేవి పెద్దన్నగారు; చంద్రవంశ అంధకవంశజాతుడైన దేవకుని నలుగురు కొడుకులలో పెద్దవాడు; ఇతని తమ్ములు ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు; ఇతని తోబుట్టువులు ధృతదేవయు, శాంతిదేవయు, నుపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ఏడుగురను వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  310) దేవలోకము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- దేవలోకం అంటే స్వర్గలోకము. ప్రపంచస్వరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క దేవలోకానికీ, సత్యలోకానికీ, తేజస్సుకూ, సూర్యుడికీ, సకల నేత్రాలకూ లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియము నివాసము. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-89-వ., 2-145-వ., 4-853-వ.,

  311) దేవలోకోపకారుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవలోకోపకారుడు అంటే విష్ణువు.ట - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-744-సీ..

  312) దేవవంతుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దేవవంతుడు భద్రసావర్ణి కొడుకు. పద్నాలుగురు మనువులలో పన్నెండవవాడైన భద్ర సావర్ణి కొడుకులు దేవవంతుడూ, ఉపదేవుడూ, దేవజ్యేష్టుడూ మొదలైనవారు. ఆ కాలంలో వారు రాజులు అవుతారు. - వంశం - మనువు వంశం; తండ్రి - భద్రసావర్ణిమనువు; పద్య సం.(లు) - 8-423-వ.,

  313) దేవవంద్యుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవవంద్యుడు అంటే శివుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-222-సీ., 8-638-సీ.,

  314) దేవవతి- (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- దేవవతి మేరువు కూతుర్లు తొమ్మండుగురులోనూ చిన్నకూతురు; జంబూద్వీపపతి,ప్రియవ్రతపుత్రుడైన అగ్నీధ్రుని ఏడుగురు కొడుకులలో చిన్నవాడైన కేతుమాల భార్య. - వంశం - ప్రియవ్రతుని వంశం; తల్లి - మేరువు; భర్త - కేతుమాల; పద్య సం.(లు) - 5.1-40-వ.,

  315) దేవవర్దనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవవర్దనుడు శ్రీకృష్ణుని మేనమామ. దేవకీదేవి చిన్నన్నగారు; చంద్రవంశ అంధకవంశజాతుడైన దేవకుని నలుగురు కొడుకులలో చిన్నవాడు; ఇతని సోదరులు దేవలుడు, ఉపదేవుడు, సుదేవుడు; ఇతని సోదరీమణులు ధృతదేవయు, శాంతిదేవయు, నుపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ఏడుగురను వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; పద్య సం.(లు) - 9-712-వ.,

  316) దేవవల్లభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవవల్లభుడు అంటే దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-517-మ.,

  317) దేవవిభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవవిభుడు అంటే దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-62-మ., 6-269-ఉ., 8-18-సీ., 8-374-శా., 10.2-1165-సీ.,

  318) దేవవిభునిసుతుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవవిభునిసుతుడు అంటే అర్జునుడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-1165-సీ.,

  319) దేవశత్రులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దేవశత్రులు అంటే రాక్షసులు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-382-వ.,

  320) దేవశరణ్యుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవశరణ్యుడు అంటే శ్రీకృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-458-క.,

  321) దేవశీర్షుడు- (పురుష){సంజ్ఞా}[భవిష్యత్తు రాజులు]:- దేవశీర్షుడు పరీక్షిత్తునకు భవిష్యత్కాలపు అంధ్ర జాతీయ రాజు. ఇతని తండ్రి పురీమంతుడు. కొడుకు శివస్కంధుడు.. . . ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు పిమ్మట అతని తమ్ముడు కృష్ణుడు; తరువాత వంశపారంపర్యంగా శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అను ఇరవైయారు (26) మంది అంధ్ర రాజులు క్రమంగా నాలుగువందలయేభైఆరు (456) సంవత్సరములు ఏలారు. - వంశం - భవిష్యత్తు రాజులు; తండ్రి - పురీమంతుడు; కొడుకు(లు) - శివస్కంధుడు; పద్య సం.(లు) - 12-8-వ.,

  322) దేవశ్రవుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవశ్రవుడు కృష్ణుని చిన్నాన్న; వసుదేవుని తమ్ముడు. హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనెడి పుత్రులు పుట్టారు; ఆ దేవమీఢునికి శూరుడు అని ఇంకో పేరు ఉంది. శూరునికి భార్య మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, నానకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనీకుడు, వత్సకుడు, వృకుడు అనెడి పదిమంది పుత్రులు; పృథ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవస, రాజాధిదేవి అనెడి కుమార్తెలు ఐదుగురు జన్మించారు.
దేవశ్రవుని భార్య కంసుని సోదరియైన కంసవతి. వీరికి ఇద్దరు కొడుకులు వీరుడు, నిషుమంతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవమీఢుడు శూరుడు; తల్లి - మారిష; భార్య - కంసవతి; కొడుకు(లు) - వీరుడు, నిషుమంతుడు; పద్య సం.(లు) - 9-714-వ., 9-722-వ.

  323) దేవసత్రము- (){సంజ్ఞా}[యాగం]:- దేవసత్రము అంటే ఒక యాగము. నారదుడు పూర్వజన్మలో ఉపబర్హణుడు అను గంధర్వుడు. ఉపబర్హణుడు ప్రజాపతులు నిర్వహిస్తున్న దీర్ఘసత్రములో పాటలు పాడుటకు అప్సరసలతో వెళ్ళాడు. వారితో మోహంలోపడిపోయి, ప్రజాపతులచేత దాసీదాని కడుపున పుట్టమని శాపం పొందాడు. - వంశం - యాగం; పద్య సం.(లు) - 7-474-క.,

  324) దేవసర్గ- (){జాతి}[దేవయోని]:- దేవసర్గ అంటే బ్రహ్మదేవునిచే సృజించబడ్డ సృష్టి భేదం. . . సంక్షిప్తంగా బ్రహ్మదేవుడు చేసిన నవ విధ సర్గలుతోపాటు దేవసర్గ కలిసి దశవిధ సర్గలు / సృష్టులు. అందులో నవవిధ సర్గ (1) ప్రాకృత సృష్టులు ఆరు (అవి 1.మహత్తత్వం మొదటి సృష్టి. 2.అహంకారం తత్త్వం రెండవ సృష్టి. 3.పంచభూతాల సృష్టి మూడవది. 4.ఇంద్రియాల పుట్టుక నాలుగవ సృష్టి. 5.ఇంద్రియాధిదేవతల సృష్టి అయిదవది. 6.తామస సృష్టి ఆరవది.) మఱియు (2)వైకృత సృష్టులు మూడు (అవి 7.స్థావరములసృష్టి ఏడవది. 8.తిర్యక్కుల సృష్టి ఎనిమిదవది. 9- ఆర్వాక్ స్రోతము (మానవ) సృష్టి తొమ్మిదవది). ఇవి కాక 10.దేవ సర్గ పదవది) దేవసర్గ ఎనిమిది విధాలు. అందులో విబుధులు, పితృదేవతలు,సురాదులు మూడు భేదాలు; గంధర్వులు, అప్సరసలూ, ఒకటీ; యక్షులు, రాక్షసులు, ఒకటీ; భూత, ప్రేత, పిశాచాల ఒకటీ, సిద్ధ చారణ విద్యాధరులు ఒకటీ, కిన్నర కింపురుషులు ఒకటీ; ఈ ఎనిమిది కలిసి దేవ సర్గం అయింది. కౌమారసర్గం అనేది దేవసర్గం / సనత్కుమారాది సర్గం.లో ఒక భాగమే ఐనా ప్రత్కేకంగా చెప్పతగ్గది దీనిలో దైవత్వం మానుషత్వం కలిసి ఉంటాయి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-344-వ.,

  325) దేవసావర్ణిమనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దేవసావర్ణి పద్నాలుగురు (14) మనువులలో పదమూడవవాడు (13). భవిష్యత్తులో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో అతని కొడుకులైన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుకర్ములూ, సుత్రాములూ దేవతలు అవుతారు. దివస్పతి ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడూ, తత్త్వదర్శుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు దేవహోతకూ బృహతికీ యోగవిభుడు అనే పేరుతో పుడతాడు. - వంశం - మనువు వంశం; కొడుకు(లు) - చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలైనవారు; పద్య సం.(లు) - 8-425-వ., 8-426-ఆ.,

  326) దేవసావర్ణిమన్వంతరం- ( ){సంజ్ఞా}[కాలము]:- దేవసావర్ణిమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో పదమూడవది. - వంశం - కాలము; పద్య సం.(లు) - 8-425-వ., 8-426-ఆ.,

  327) దేవసేన - (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఈమె భరతపుత్రుడైన సుమతి భార్య, దేవతాజిత్తు తల్లి.. . . పాషండుల బోధనలకు ప్రభావితుడైన భరతుని కొడుకైన “సుమతి”కి, అతని భార్య “దేవసేన”కు “దేవతాజిత్తు” అనే కొడుకు పుట్టాడు. అతనికి “ఆసురి” అనే భార్యవల్ల “దేవద్యుమ్నుడు” అనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి “ధేనుమతి” వల్ల “పరమేష్ఠి” పుట్టాడు. తరువాతి తరాలలో రాజర్షియైన గయుడు జన్మించాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - సుమతి; కొడుకు(లు) - దేవతాజిత్తు; పద్య సం.(లు) - 5.2-6-వ

  328) దేవహువు- (){సంజ్ఞా}[మానవ యోని]:- దేవహువు పురంజయోపాఖ్యానంలో వస్తుంది. కామాసక్తుడైన పురంజయుడు దేవహువు అనేపేరు కలిగిన ఉత్తర ద్వారం నుండి శుతధరునితో కూడి పాచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. పురంజయుడు అంటే నవద్వార కలితమైన దేహంలో ఉండే జీవుడు. దేవహూ అంటే ఎడమ చెవి. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-769-సీ., 4-833-వ.,

  329) దేవహూతి- (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- దేవహూతి స్వాయంభువ మనువు ఇద్దరు కూతురులలో చిన్నామె.. భర్త కర్దమ ప్రజాపతి. వీరి పుత్రుడు. కపిలమహర్షి మఱియు తొమ్మిది మంది పుత్రికలు. మను పుత్రికలైన దేవపూతికి కపిలునిగానూ, ఆకూతికి యజ్ఞుడుగానూ విష్ణుమూర్తి అవతరించాడు.
విష్ణుమూర్తి కపిలావతారం ఎత్తినపుడు దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.. దేవహూతి భర్త యైన కర్దముడు బ్రహ్మదేవుని నీడనుండి పుట్టాడు. స్వాయుంభువు మనువు అతని భార్య శతరూప లకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, అనే ఇద్దరు పుత్రులూ; ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలూ పుట్టారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి; దేవహూతిని కర్దమ ప్రజాపతికి; ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసారు.
వివాహార్థం చేసిన కర్దముని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి స్వాయంభువమనువు పుత్రికను ఇస్తాడు వివాహామాడమని, ఆమె యందు తొమ్మిది మంది కుమార్తెలు పుడతారని, తను కొడుకుగా పుడతాననని వరాలు ఇచ్చాడు. ఆ ప్రకారమే స్వాయంభువ మనువు భార్య శతరూప కలిసి వచ్చి వారి కూతురు దేవహూతి నారదుని వలన కర్దముని గురించి విని, భర్తగా కావాలని కోరి వచ్చిందని చెప్పి పెళ్ళిచేసి, శతరూప స్వాయంభువలు వారి నగరానిరికి వెళ్ళిపోయారు.. అప్పుడు కర్దముడు సంతానం కలిగేదాకా గృహస్తుగా ఉంటానని తరువాత తపస్సుకు పోతానని నిబంధన పెట్టాడు. దేవహూతి, ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. దేవహూతి పతిసేవానిరతికి సంతోషించిన కర్దముడు తన తపశ్శక్తితో గొప్ప విమానం సకల సుఖసంపదలు యౌవన సౌభాగ్యాదులు సర్వం కల్పించి దేపహూతితో కూడి విలాసంగా లోకమంతా పర్యటించాడు. తరువాత వారికి తొమ్మిదిమంది పుత్రికలు పిమ్మట కపిలుడు అను పుత్రుడు పుట్టారు. తమ పుత్రికలైన 1.కళను మరీచికి, 2.అనసూయను అత్రికి, 3.శ్రద్ధను అంగిరసునకు, 4,హవిర్భువును పులస్త్యునకు, 5.గతిని పులహువునకు, 6.క్రియను క్రతువుకు, 7.ఖ్యాతిని భృగువుకు, 8.అరుంధతిని వసిష్ఠునకు, 9.శాంతిని అధ్వర్యునకు ఇచ్చి వివాహం చేసి, తపస్సుచేసుకోవడానికి కర్దములు వెళ్ళాడు. విష్ణుమూర్త అవతారమైన కపిలుడు తల్లి దేవహూతికి ప్రసిద్ధమైన సాంఖ్యయోగ తత్వబోధ చేసి. తపస్సు చేసుకొడానికి వెళ్ళాడు. దీనిని కపిలుని యోగశాస్త్రం అంటారు. దేవహూతి మహాయోగియై యోగమార్గంలో వాసుదేవుని విలీనమైంది. ఆమె మోక్షం పొందిన క్షేత్రం సిద్ధిపదం అని ప్రసిద్ధమైంది. - వంశం - మనువు వంశం; తండ్రి - స్వాయంభువమనువు; తల్లి - శతరూప; భర్త - కర్దముడు; కొడుకు(లు) - కపిలుడు; పద్య సం.(లు) - 1-63--వ., 2-119-చ., 2-203-వ., 3-378-సీ., 3-388-వ., 3-745-వ., నుండి 3-1051-వ. వరకు., 4-3-సీ., 4-6-వ., 8-7-వ.

  330) దేవహోత్రుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- రాబోయే కాలంలో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో విష్ణువు దేవహోత్రునికీ భార్య బృహతికీ యోగవిభుడు అనే పేరుతో అవతరిస్తాడు. ఆ మన్వంతరలో ఇంద్రుడగు దివస్పతికి ఆ యోగవిభుడు ఎంతో సహాయం చేస్తాడు. - వంశం - మానవ యోని; భార్య - బృహతి; కొడుకు(లు) - యోగవిభుడు; పద్య సం.(లు) - 8-426-ఆ.,

  331) దేవాంగన- (స్త్రీ){జాతి}[దేవయోని]:- దేవాంగన అంటే దేవతా స్త్రీలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-637-సీ., 5.2-20-వ.,

  332) దేవాగారము- (){జాతి}[ప్రదేశము]:- దేవాగారము అంటే గుడి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-459-శా.,

  333) దేవాచూడామణి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవచూడామణి అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-301-మ.,

  334) దేవాతిథి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవాతిథి జరాసంధుని తరువాతి తరాలకు చెందిన క్రోధనుని కొడుకు. దేవాతిథి కుమారుడు ఋక్షుడు. అతని పుత్రుడు భీమసేనుడు. అతనికొడుకు ప్రతీపుడు. అతనికి దేవాపి, శంతనుడు, బాహ్లుకుడు ముగ్గురు పుత్రులు. వారిలో ప్రసిద్ధుడైన శంతనుడు భరతుని తండ్రి - వంశం - చంద్రవంశం; తండ్రి - క్రోధనుడు; కొడుకు(లు) - ఋక్షుడు; పద్య సం.(లు) - 9-661-వ.,

  335) దేవాదిదేవుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవాదిదేవుడు అంటే పరమశివుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-465-క., 6-178-.,

  336) దేవాదిదేవుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవాదిదేవుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-191-సీ.,

  337) దేవాధిదేవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవాధిదేవుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-203-దం.,

  338) దేవాధీశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవాధీశుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-201-మ.,

  339) దేవాధీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవాధీశ్వరుడు అంటే బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-198-క.,

  340) దేవానీకం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- కుశద్వీపంలోని సత్యవ్రత వర్షంలో దేవానీకం అను గిరి, దేవగర్భ అను మహానది ఉన్నాయి. హిరణ్యరేతసుడు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే కుమారుల పేర్లతో ఏడు వర్షాలను ఏర్పాటు చేసి వారిని అందులో నియమించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ కుశద్వీపంలోని వర్షములలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, శ్రుతనింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఆ పవిత్ర నదీజలాలలో స్నానం చేసి శుచులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-64-వ,

  341) దేవానీకుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దేవానీకుడు సూర్యవంశంలో శ్రీరాముని తరువాతి తరాలలోని రాజు. పుండరీకుని కొడుకైన క్షేమధన్వుని పుత్రుడు దేవానీకుడు. దేవానీకుని కొడుకు అహీనుడు. అతని కొడుకు పారియాత్రుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - క్షేమధన్వుడు; కొడుకు(లు) - అహీనుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  342) దేవాపి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవాపి జరాసంధుని తరువాతి తరాలకు చెందినవాడు. దేవాతిథి కుమారుడు ఋక్షుడు. అతని పుత్రుడు భీమసేనుడు. అతనికొడుకు ప్రతీపుడు. అతనికి దేవాపి, శంతనుడు, బాహ్లుకుడు ముగ్గురు పుత్రులు. దేవాపి రాజ్యం వద్దని అడవికి వెళ్ళిపోయాడు. శంతనుడు రాజ్యం చేపట్టి ప్రసిద్ధుడైనాడు. ఆ దేవాపి యోగి అయి ఇప్పటికీ కలాపగ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. కలియుగంలో నాశనం అయ్యే జైవాతృక కులాన్ని (చంద్రవంశాన్ని) తరువాతి యుగాలలో నెలకొల్పుతాడు.
దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ప్రతీపుడు; పద్య సం.(లు) - 9-661-వ., 9-664-క., 12-15-వ.,

  343) దేవాపృథుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దేవాపృథుడు చంద్రవంశలోని శ్రీకృష్ణునికి ముందరి వాడు. సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృథుడు, అంధకుడు, మహాభోజుడు అని ఏడుగురు కుమారులు జన్మించారు. వారిలో భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని ముగ్గురు; రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని ముగ్గురు; జన్మించారు. వారిలో దేవాపృథునికి బభ్రువు జన్మించాడు. వీరు ఇద్దరి ప్రభావాలను శ్లోకాలతో కీర్తిస్తారు. దేవాపృథునికి సాటియైనవాడు మరింకొకడు లేడు అని కీర్తిస్తారు. ఇంకా బభ్రువు, దేవాపృథుడు పూని యోగం ఉపదేశించిన కారణం చేత పద్నాలుగువేల అరవైఐదుమంది మానవులు మోక్షాన్ని పొందారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సాత్వతుడు; కొడుకు(లు) - బభ్రువు; పద్య సం.(లు) - 9-709-వ., 9-710-తే., 9-711-క.,

  344) దేవాయతనము- (){జాతి}[ప్రదేశము]:- దేవాయతనము అంటే గుడి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-38-క.,

  345) దేవి- (స్త్రీ){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ దేవి దైత్యురాలు. ప్రహ్లాదుని భార్య. దితి సంతానాన్ని దైత్యులు అంటారు. దితికి కుమారుడైన హిరణ్యకశిపునకు భార్య దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే నలుగురు కుమారులు, సింహిక అనే కుమార్తె జనించారు. వారిలో ప్రహ్లాదునికి దేవి అనే భార్య వల్ల విరోచనుడు కలిగాడు. విరోచనునికి బలి జన్మించాడు. ఆ బలికి అశన అనే భార్య యందు బాణుడు పెద్దవాడుగా వందమంది కుమారులు పుట్టారు. - వంశం - రాక్షస యోని; భర్త - ప్రహ్లాదుడు ; కొడుకు(లు) - విరోచనుడు; పద్య సం.(లు) - 6-507-వ.,

  346) దేవేంద్రతనయుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- దేవేంద్రతనయుడు అనగా అర్జునుడు. సుభద్రపరిణయఘట్టంలో ఇలా వర్ణించారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-1167-క.,

  347) దేవేంద్రవందితుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవేంద్రవందితుడు అని శివుడిని బాణాసురుడు పొగిడాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-320-సీ.,

  348) దేవేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- స్వాయంభువమన్వంతరంలో యజ్ఞుడు దేవేంద్రుడు.
తన సభకు వచ్చిన దేవగురువు బృహస్పతిని ఇంద్రుడు గౌరవించలేదు. అవమానంతో ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు మన్నించమని వేడుటకు బృహస్తతి యింటికి వెళ్ళాడు. కాని బృహస్పతి అదృశ్యం అయ్యాడు. దేవతల గురువు దూరమగుట తెలిసి దేవతలు శుక్రాచార్యుని గురుత్వంతో రెచ్చిపోయి దేవతలపై యుద్ధానికి వెళ్ళారు.
శుక్రాచార్యుల మంత్రప్రభావం వల్ల రాక్షసుల సంపదలు దేవతల కంటే రెండింతలైనాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్యసందను విశ్వరూపుడు విష్ణుమాయ వలన దేవేంద్రునికి సాధించి పెట్టాడు. వర నారాయణకవచం అనే మహావిద్యను ఇంద్రునికి ఇవ్వడంద్వారా దేవతకు గొప్పసహాయంచేసాడు. దానితో ఇంద్రుడు వృత్రుని సంహరించాడు. దానితో అతనికి బ్రహ్మహత్యాపాతకం తగిలింది. ఇంతకు ముందు విశ్వరూపుని చంపి తగిలిన బ్రహ్మహత్యాపాతకాన్ని ఇంద్రుడు వేడగా స్త్రీలు, భూమి, జలమూ మూడుభాగాలుగా ఆ పాతకాన్ని తీసుకున్నాయి. ఈ వృత్రుని చంపిన పాతకం తప్పించుకోడానికి వెయ్యి ఏళ్ళు ఈశాన్యదిక్కులో మానససరస్సు నందలి కమలనాళంలో దాక్కున్నాడు. ఆ కాలంలో నహుషుడు ఇంద్రపీఠం ఎక్కాడు. మదాంధుడై. ఇంద్రపత్ని శచీజేవిని కోరి, అగస్త్యశాపంతో కొండచిలువై పదభ్రష్టు డయ్యాడు. అంత ఇంద్రుడు వచ్చి మహాయజ్ఢంచేసి పాపం పూర్తిగా పోగుట్టుకున్నాడు.
క్షీరసాగరమథనానంతరము జరిగిన సురాసుర యుద్ధంల బలిచక్రవర్తితో దేవేంద్రుడు పోరాడాడు.
ఇంద్రుని సింహాసనాన్ని ఒకమారు హిరణ్యకశిపుడు ఆక్రమింటాడు. అదను చూసి అతని బార్య ప్రహ్లాదుని కడుపులో మోస్తున్న తల్లిని చెరపట్టగా నారదుడు విడిపించి కాపాడాడు.
బలి యుద్దానికి వచ్చినప్పుడు బృహస్పతి, ఇంద్రునికి, ఇతడు శుక్రాచార్యుని అండబలంతో వచ్చాడు.ఇప్పుడు తపుకు తిరగడమే సరైన పని అని సలహా చెప్పాడు.
అదితి తన పతి కశ్యపప్రజాపతిని దైత్యుల వలన, ఇంద్రుడు భార్య, పిల్లలు జయంతాదులు, పరివారం అందరూ అడవులపాలయ్యారు. దానికి విరుగుడు వేడి, ఆయన చెప్పిని పయోభక్షమ వ్రతం చేసి వామనుని కన్నది. వామనుడు ముల్లోకాలను బలి నుండి గ్రహించి ఇంద్రునికి స్వర్గం తిరిగి ఇచ్చాడు..
కృష్ణునికి ఇంద్రుడు సుధర్మమనే దేవసభను ఇచ్చాడు.
దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడం కోసం అర్జునుడి రథానికి శ్రీకృష్ణుడు సారథి అయ్యాడు.
శ్రీకృష్ణుడు నరకసంహారం పిమ్మట అమరావతికి వెళ్ళి దితికి ఆమె కుండలాలు ఇచ్చాడు. శచీదేవి ఇంద్రులు సత్కరించారు. పారిజాతాపహరణం చేస, దానిని సత్యబామ తోటలో పాతాడు. - వంశం - దేవయోని; భార్య - శచీదేవి; కొడుకు(లు) - జయంతుడు; కూతురు(లు)- జయంతి; పద్య సం.(లు) - 1-177-శా., 1-366-సీ.,3-125-మ., 4-6-వ.,4-531-సీ., 6-270-సీ., 6-292-క, 7-99-మ., 7-232-వ., 7-261-క., 8-363-క., 8-436-సీ., 8-471-సీ., 8-686.వ., 9-332-వ., 9-377-వ., 9-401-క., 9-504-సీ., 10.1331-సీ., 10.1-1613-వ., 10.2-121-క., 10.2-214-వ., నుండి 10.2-218-వ., వరకు.

  349) దేవేశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దేవేశుడు అంటే కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-149-క., 1-179-మ., 7-381-సీ., 8-358-సీ.,

  350) దేహధారి- (){జాతి}[మానవ యోని]:- దేహధారి అంటే జీవుడు. శుకుని పరీక్షిత్తు ఇవాళో రేపో మరణించే దేహదారికి మోక్షమార్గం ఏమిటో చెప్పమని అడిగాడు, - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-526-సీ., 2-224-వ., 3-294-సీ.,

  351) దేహళి- (){జాతి}[ప్రదేశము]:- దేహళి అంటే ఇంటి గడప, గుమ్మం - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-26-వ., 3-808-సీ., 4-744-సీ.,

  352) దేహాత్మబుద్దులు- (పురుష){జాతి}[మానవ యోని]:- దేహాత్మబుద్దులు దేహమే ఆత్మ యని భావించువారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-1006-సీ.,

  353) దేహాత్మవాదులు- (పురుష){జాతి}[ఋషి]:- దేహమే కారణమని వాదించే ఋషులు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1220-వ

  354) దేహి- (){జాతి}[మానవ యోని]:- దేహి అంటే జీవుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-12-వ., 2-88-మ.,

  355) దైతేయమాయ- (){జాతి}[విద్య]:- శంబరాసురుడు దైతేయమాయ అనే రాక్షస మాయను మయుని నుండి నేర్చుకున్నాడు. దానిన ప్రద్యుమ్నుని మీద ప్రయోగించాడు. ప్రద్యుమ్నుడు సాత్వతమాయతో అణచివేశాడు. తరువాత ప్రయోగించిన పిశాచాది సకల మాయలను అణచివేసి, పెద్ద ఉక్కుకత్తితో శంబరుని శిరస్సు ఖండించాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 10.2-20-వ.,

  356) దైత్యారి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దైత్యారి అంటే కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-184-మ.,

  357) దైత్యులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దైత్య దానవానీకము విష్ణుమూర్తి విరాడ్విగ్రహంలో వీర్యము.
. హరివర్షానికి దేవుడు నరసింహుడు. హరివర్షం "ప్రజలు" దైత్య దానువులు. వారు ప్రహ్లాదాదులతో కూడి నరసింహుని సేవిస్తూ ఉంటారు.
రసాతలంలో దైత్యులు, దానవులు అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు,
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు.
దేవదానవులు మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు గిరగిర తిరుగుతున్న గిరిని కూర్మరూపంతో ధరించాడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - దితి; పద్య సం.(లు) - 1-366-సీ., 2-26-వ., 2-112-వ., 2-144-మ., 5.2-42-సీ., 5.2-119-వ.,6-363-వ.,

  358) దైవచూడామణి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దైవచూడామణి విష్ణువు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-181-మ.,

  359) దైవజ్ఞులు- (పురుష){జాతి}[మానవ యోని]:- దైవజ్ఞులు అనగా జ్యోతిష్కులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-4128-వ.,

  360) దైవతము- (పురుష){జాతి}[దేవయోని]:- దైవతము అంటే దేవునిగా కలది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-86-వ., 3-391-వ., 3-903-వ., 11-62-వ.,

  361) దైవతాసార్వభౌముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దైవతాసార్వభౌముడు శ్రీరాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-286-క.,

  362) దైవమండలము- (){సంజ్ఞా}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
చేతులను ఆకాశముకేసి చాచి నటించుట - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  363) దైవము- (పురుష){జాతి}[దేవయోని]:- దైవము అనగా దేముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-253-ఉ., 1-281-ఉ., . . .

  364) దైవోపహతులు- (పురుష){జాతి}[మానవ యోని]:- దైవోపహతులు అనగా నష్టజాతకులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-181-వ.,

  365) దోగ్ధ- (పురుష){జాతి}[మానవ యోని]:- దోగ్ధ అంటే పితికెడివాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-467-సీ., 4-496-క.,

  366) దోత్రము- (){జాతి}[పరికరములు]:- దోత్రము అంటే అంకుశము - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-358-క.,

  367) దోయిలి- (){జాతి}[అవయవము]:- దోయిలి అంటే దోసిలి, అంజలి - వంశం - అవయవము; పద్య సం.(లు) - 6-531-వ.,

  368) దోర్దండము- ( ){జాతి}[అవయవము]:- భుజదండము - వంశం - అవయవము; పద్య సం.(లు) - 4-107-శా., 8-57-శా.,

  369) దోర్దర్పము- (){జాతి}[అవయవము]:- దోర్దర్పము భుజబలగర్వము - వంశం - అవయవము; పద్య సం.(లు) - 3-101-మ.,

  370) దోర్బలము- (){జాతి}[అవయవము]:- దోర్బలము భుజబలము - వంశం - అవయవము; పద్య సం.(లు) - 2-191-మ.,

  371) దోర్బలుడు- (){జాతి}[మానవ యోని]:- దోర్బలుడు అంటే భుజబలము కలవాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-859-ఉ.,

  372) దోవతి- (){జాతి}[పరికరములు]:- దోవతి అనగా మగవారు కట్టుకొను వస్త్రము, పంచ వంటిది - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 10.2-468-క.,

  373) దోశ్శక్తి- (){జాతి}[అవయవము]:- దోశ్శక్తి భుజబలము - వంశం - అవయవము; పద్య సం.(లు) - 9-263-మ.,

  374) దోష- (స్త్రీ){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఈమె ధ్రువపుత్రుడు వత్సరుని పుత్రుడైన పుష్పార్ణుని రెండవ భార్య. ఈమె కొడుకులు ముగ్గురు ప్రదోషం, నిశీథి, వ్యుష్టుడు ... వత్సరునికి సర్వర్థి అనే భార్యవల్ల పుష్పార్ణుడు, చంద్రుకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అని ఆరుగురు కుమారులు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, 'దోష' అని ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతస్సు, మధ్యందినం, సాయం అని ముగ్గురు కొడుకులు. 'దోష'కు ప్రదోషం, నిశీథి, వ్యుష్టుడు అని ముగ్గురు కుమారులు. అందులో వ్యుష్టునికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కుమారుడు. అతనికి ఆకూతి అనే భార్యవల్ల చక్షుస్సు అనే మనువు పుట్టాడు. - వంశం - ధ్రువుని వంశం; భర్త - పుష్పార్ణుడు; కొడుకు(లు) - ప్రదోషం, నిశీథి, వ్యుష్టుడు; పద్య సం.(లు) - 4-390-వ.,

  375) దోష - (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ప్రియవ్రతుని వంశంలోని భువనుని భార్య. కొడుకు త్వష్ట.. . గయుని తరువాత తరాలలోని వీరవ్రతునికి”; “బోజ” వల్ల “మన్యువు”, “ప్రమన్యువు” అనే ఇద్దరు కుమారులు; అందులో మన్యువుకు “సత్య” అనే భార్యకు కొడుకు “భువనుడు”; భువనుని భార్య “దోష” వారి కొడుకు “త్వష్ట”, ఆ “త్వష్ట”కు భార్య “విరోచన”కు కొడుకు “విరజుడు”. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - భువనుడు; కొడుకు(లు) - త్వష్ట; పద్య సం.(లు) - 5.2-10-వ.,

  376) దోషచరులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దోషచరులు అంటే రాక్షసులు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 8-447-వ., 10.1-1174-ఉ.,

  377) దోషలతాలవిత్రకుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- దోషలతాలవిత్రకుడు స్వాయంభువమనువు. బ్రహ్మదేవుడు భూమ్యుద్ధరణ వేడిన స్వాయంభువ మనువును ఇలా పలికాడు. - వంశం - మనువు వంశం; పద్య సం.(లు) - 3-402-ఉ.,

  378) దోషాకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దోషాకరుడు అంటే దోషవర్తనకు అనుకూలమైన రాత్రిని కలిగించువాడు, చంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1297-ఉ.,

  379) దోషాచారులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దోషాచరులు అంటే రాక్షసులు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-230-వ.,

  380) దోషాటులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- దోషాటులు అంటే రాక్షసులు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-209-క.,

  381) దోషుడు- (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- దోషుడు అసిక్ని దక్షుల వంశంలోని వాడు. ధర్మునికి భార్య మఱియు దక్షపుత్రి వసువునందు కలిగిన ఎనిమిది మందిలో ఆరవవాడు. దోషునికి భార్య శర్వరికి పుత్రుడు హరికళాంశజుడు శింశుమారుడు. దక్షపుత్రి వసువు ధర్ముని పదముగ్గురలోనూ ఎనిమిదవ భార్య. వారిద్దరి ఎనమండుగురు కొడుకులు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు; వారిలో ద్రోణునకు అభిమతి అనే భార్య వల్ల హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు; ప్రాణునకు ఊర్జస్వతి అనే భార్య వల్ల సహుడు, ఆయువు, పురోజవుడు; ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు; అర్కునికి వాసన అనే భార్య వలన తర్షుడు మొదలైనవారు; అగ్నికి వసోర్ధార అనే భార్యవల్ల ద్రవిణకుడు మొదలైనవారు; కృత్తికలకు స్కందుడు; ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. 'దోషు'నకు 'శర్వరి' అనే భార్య వల్ల విష్ణువు యొక్క అంశతో శింశుమారుడు పుట్టాడు. - వంశం - దక్ష వంశం; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; భార్య - శర్వరి; కొడుకు(లు) - శింశుమారుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  382) దోహనము- (){జాతి}[పరికరములు]:- దోహనము పితికెడి పాత్ర - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 4-496-క.,

  383) దౌష్యంతి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- దౌష్యంతి అంటే దుష్యంతుని కొడుకైన భరతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దుష్యంతుడు; తల్లి - శకుంతల; పద్య సం.(లు) - 9-635-వ.,

  384) ద్యుతిమంతుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- తొమ్మిదవదైన దక్షసావర్ణి మన్వంతరంలో ద్యుతిమంతుడు మున్నగువారు సప్తర్షులు. . . వరుణుని కొడుకైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైనవారు రాజులు అవుతారు. పరులు, మరీచులూ, గర్గులు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-417-వ.,

  385) ద్యుమంతుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ద్యుమంతునికి మరొకపేరు దివోదాసుడు. ఇతను ధన్వంతరి మనుమడైన భీమరథుని కొడుకు, ఇతనికి ప్రతర్దునుడు కొడుకు. ఆ ప్రతర్దనుడికి శత్రుజిత్తు అని, ఋతుధ్వజుడు అని పేర్లు ఉన్నాయి. ఆతనికి కువలయాశ్వుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భీమరథుడు; కొడుకు(లు) - ప్రతర్దనుడు; పద్య సం.(లు) - 9-499-వ.,

  386) ద్యుమంతుడు-2 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ ద్యుమంతుడు సార్వోచిష మనువు పెద్ద కొడుకు. . . రెండవ మనువు స్వారోచిషుడు అగ్ని కుమారుడు. ఆ మనువు పుత్రులు ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు, మొదలైనవారు. ఆ మన్వంతరంలో వారు రాజులు అయ్యారు.. ఆ మన్వంతరంలో ఇంద్రుడు రోచనుడు. దేవతలు తుషితులు మొదలైన వారు. సప్తర్షులు ఊర్జస్తంబుడు మొదలైనవారు. విభుడు అను పేరుతో విష్ణువు వేదశిరుడు అను బ్రాహ్మణుడు అతని భార్య తుషిత లందు అవతరించాడు. ఆ అవతారంలో అతను కుమార బ్రహ్మచారి అయి ఎనభై ఎనిమిదివేల మహా మునులు అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడు అయ్యాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - స్వారోచిష మనువు; పద్య సం.(లు) - 8-14-సీ.,

  387) ద్యుమంతుడు-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ ద్యుమంతుడు మహర్షి, ఇతని తండ్రి బ్రహ్మ మానస పుత్రుడైన వసిష్ఠుడు. తల్లి కర్దముని తొమ్మిదిమందిలో పుత్రికలలో ఎనిమిదవామైన అరుంధతియ ఈమె మరోక పేరు ఊర్జ. . . . వసిష్ఠుని భార్య ఊర్జ అని మరోపేరు గల అరుంధతి. వారికి చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులు జన్మించారు. మరొక భార్యవల్ల శక్తి మొదలైన కొడుకులు కలిగారు. - వంశం - ఋషి; తండ్రి - వసిష్ఠుడు; తల్లి - ఊర్జ / అరుంధతి ; పద్య సం.(లు) - 4-26-వ.,

  388) ద్యుమంతుడు-4 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ఈ ద్యుమంతుడు అని పురంజయోపాఖ్యానంలో ప్రయోగించారు. ద్యుమతుడు అను సఖునితో పురంజంయుడు ఖద్యోతం, హవిర్ముఖి అనే రెండు తూర్పు ద్వారాలు గుండా విభ్రాజితం అనే జనపదానికి వెళ్తుంటాడు. ఇక్కడ ప్రతీకాత్మతలు ఏమిటంటి. పురంజయుడు అంటే జీవుడు. నవద్వారాలు గల పురానికి అంటే మానవదేహం. పురంజుయుడు ఆ పురానికి రాజుట. ఆ నవద్వారాలు నవ రంద్రాలు రెండు కళ్ళు, రెండు ముక్కు రంద్రాలు, ఒక నోరు రెండు చెవులు. గుహ్యము, గుదము. వాటిలో కళ్ళు రెంటిని ఖద్యోతం, హవిర్ముఖి. సఖుడు ద్యుమత్తు అంటే చూపు. విభ్రాజితమైన అంటే కనబడే రూపాలు అనే జనపదాలు అంటే లోకం. అలా మొత్తం ఉపాఖ్యానం అంతా ప్రతీకలతోనే నడుస్తుంది. - వంశం - మానవ యోని; తండ్రి - -; పద్య సం.(లు) - 4-768-వ.,

  389) ద్యుమంతుడు-5 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ ద్యుమంతుడు స్వారోచిమనువు పెద్దకొడుకు. రెండవ మనువు స్వారోచిషుడు అగ్ని కుమారుడు. ఆ మనువు పుత్రులు ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు, మొదలైనవారు మిక్కిలి ప్రసిద్ధులై ఆమన్వంతరంలో భూమిని పరిపాలించారు. - వంశం - మనువు వంశం; పద్య సం.(లు) - 8-14-సీ.,

  390) ద్యుముడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్యుముడు సాల్వుని మంత్రి. సాల్వుడు మధురను ముట్టడించినప్పుడు జరిగిన యుద్ధంలో ప్రద్యుమ్నునితో సాల్వునిమంత్రి ద్యుముడు యుద్ధం చేసి అతని చేతిలో మరణించాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-871-క., 10.2-878-ఉ., 10.2-880-చ.,

  391) ద్యుమ్నుడు- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఇతడు ధ్రువుని వంశపు చక్షుస్సంజ్ఞునికి భార్య నడ్వల యందు కలిగిన కొడుకులు పన్నిండుగురులో ఒకడు.. . ధ్రువుని కుమారుడైన వత్సరుని తరువాత తరాలలోని వ్యుష్టునికి భార్య ఆకూతికి పుత్రుడు చక్షుస్సు అనే మనువు. నడ్వల చక్షుస్సులకు పన్నెండుమంది పుత్రులు పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, 'సుద్యుమ్నుడు', శిబి, ఉల్ముకుడు.. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - చక్షుస్సంజ్ఞుడు; తల్లి - నడ్వల; పద్య సం.(లు) - 4-390-వ.,

  392) ద్రమిళుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ద్రమిళుడు / ద్రమీఢుడు ఋషభునికి జయంతి యందు కలిగిన వందమంది కొడుకులలో ఒకడు, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు. వీరు ఆకాశగమనాది సిద్దులు పొందారు. వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమనుడు, కరభాజనుడు.. ఋషభుని పెద్దకొడుకు ప్రసిద్ధుడైన భరతుడు. కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే ఇంకొక తొమ్మిది మంది భూభాగాలను ఏలారు. మిగతా ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలు అనుష్ఠానములలో ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి; పద్య సం.(లు) - 5.1-63-సీ.,., 5.1-64-వ.,, 11-35-వ. నుండి. 11-79-వ. వరకు

  393) ద్రమీఢుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ద్రమిళుడు / ద్రమీఢుడు ఋషభునికి జయంతి యందు కలిగిన వందమంది కొడుకులలో ఒకడు, వీరిలో ఇతనితోపాటు తొమ్మిది మంది పరమ భాగవతులు అయ్యారు. వీరు ఆకాశగమనాది సిద్దులు పొందారు. వీరు తరువాతి కాలంలో విదేహ రాజుకు తత్వం చెప్పారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు.. ఋషభుని పెద్దకొడుకు ప్రసిద్ధుడైన భరతుడు. కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే ఇంకొక తొమ్మిది మంది భూభాగాలను ఏలారు. మిగతా ఎనభైఒక్కమంది కుమారులు నిత్యకర్మలు అనుష్ఠానములలో ఆసక్తికలవారై బ్రాహ్మణత్వాన్ని గ్రహించారు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - ఋషభుడు; తల్లి - జయంతి ; పద్య సం.(లు) - 5.1-63-సీ.,., 5.1-64-వ.,, 11-35-వ. నుండి. 11-79-వ. వరకు

  394) ద్రవిడ- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- ద్రవిడ అంటే ఒక దక్షిణభారత దేశము. పురంజనోపాఖ్యానంలో పురంజయుడు తరువాత జన్మలో విదర్భరాజకుమార్తెగా పుట్టాడు. పాండ్యరాజు మలయధ్వజుడు యుద్ధంలో ఎందరో రాజులను గెలిచి ఆ విదర్భరాజు పుత్రికను వీర్యశుల్కంగా పొందాడు. ఆమెవల్ల అతనికి ఒక కుమార్తె, ఏడుగురు కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి పదికోట్లమంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలయధ్వజుని కుమార్తె అగస్త్యుని వరించింది.
గజేంద్రమోక్షంలోని గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అను ద్రవిడదేశపు మహారాజు. అగస్త్యమహర్షి శాపంవలన ఏనుగు జన్మ ఎత్తాడు.
పూర్వ కల్పాంత సమయంలో మత్యావతారుడు చిన్న చేపపిల్లగా సత్యవ్రతుని దోసిట్లోకి వచ్చాడు, ఆ సత్యవ్రతుడు ద్రవిడదేశపు రాజు.
ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది.
ద్రవిడదేశంలోని తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం లభిస్తుంది. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 4-830-సీ., 8-122-మ., 8-694-సీ., 8-695-వ., 10.2-348-ఉ., 11-78-సీ.,

  395) ద్రవిణం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- కుశద్వీపంలోని వామదేవ వర్షంలో ద్రవిణం అను గిరి, మంత్రమాల అను మహానది ఉన్నాయి. ప్రియవ్రతపుత్రుడు కుశద్వీపపతి హిరణ్యరేతసుడు కుమారలు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే ఏడుగురు కుమారుల ఏలిన ఏడు వర్షములలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, శ్రుతనింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఆ పవిత్ర నదీజలాలలో స్నానం చేసి శుచులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-64-వ,

  396) ద్రవిణకుడు- (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- అసిక్ని దక్షుల 8వ పుత్రిక, ధర్ముని 13 భార్యలలో 8వ ఆమే అయిన వసువు పుత్రులు అష్ట వసువులు. వీరిలో 5వ వాడు అగ్ని భార్య వసోర్దార లకు కొడుకులు ద్రవిణకుడు మొదలైనవారు. - వంశం - దక్ష వంశం; తండ్రి - అగ్ని ; తల్లి - వసోర్ధార ; పద్య సం.(లు) - 6-254-వ.,

  397) ద్రవిణకులు- (పురుష){జాతి}[మానవ యోని]:- క్రౌంచద్వీపంలోని గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారి లోని వారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  398) ద్రవిణము- (){జాతి}[పరికరములు]:- ద్రవిణము అంటే ధనము. రాజుకు సప్తప్రకృతులు అమాత్యులు (మంత్రులు), జనపదములు (ఊర్లు), దుర్గము (కోట), ద్రవిణము ((ధనము), సంచయములు (వస్తు సముదాయములు), దండనము (తప్పుచేసిన వారి శిక్షలు), మిత్రులు (స్నేహితులు), ఈ సప్త మాతృకలుచే రాజు కాపాడబడుతుంటాడు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 3-732-క., 6-449-వ.,

  399) ద్రవిణుడు- (పురుష){సంజ్ఞా}[రాజు]:- పృథుచక్రవర్తి అర్చిల అయిదుగురు కొడుకులలో నాలుగవ వాడు. ఆ అయిదుగురు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు. విజితాశ్వుడు మహారాజైన తర్వాత తన నలుగురు తమ్ముళ్ళలో హర్యశ్వునకు దక్షిణ దిక్కును, వృకునకు పడమటి దిక్కును, ద్రవిణునకు ఉత్తర దిక్కును సమంగా పంచి ఇచ్చాడు. - వంశం - రాజు; తండ్రి - పృథుచక్రవర్తి; తల్లి - అర్చి; పద్య సం.(లు) - 4-640-వ., 4-673-సీ.,

  400) ద్రుతంజయుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శృతంజయుడు నకు పాఠ్యంతరం ద్రుతంజయుడు. ఇతడు సత్యాయువు కొడుకు, పురూరవుని మనవడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సత్యాయువు; పద్య సం.(లు) - 9-422-వ.,

  401) ద్రుపదపుత్రి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రుపదపుత్రి ద్రౌపది. ఈమె పాండవుల భార్య - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్రుపదుడు; పద్య సం.(లు) - 1-170-వ.,

  402) ద్రుపదరాజనందన- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రుపదరాజనందన ద్రౌపది. ఈమె పాండవుల భార్య - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్రుపదుడు; పద్య సం.(లు) - 10.2-821-వ.,

  403) ద్రుపదరాజపుత్రి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రుపదరాజపుత్రి ద్రౌపది. ఈమె పాండవుల భార్య - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్రుపదుడు; పద్య సం.(లు) - 1-158-వ., 1-389-వ.,

  404) ద్రుపదుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రుపదుడుద్రౌపది తండ్రి. చంద్రవంశంలోని పాంచాల రాజులలో ప్రముఖుడు, దివోదాసునకు మిత్రాయువు; మిత్రాయువునకు చ్యవనుడు; చ్యవనునకు సుదాసుడు; సుదాసునకు సహదేవుడు; సహదేవునకు సోమకుడు; సోమకునకు సుజన్మకృత్తు; సుజన్మకృత్తునకు వందమంది పుత్రులు పుట్టారు. వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు; పృషతునకు ద్రుపదుడు; ద్రుపదునకు ధృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. దృష్టద్యుమ్నునకు దృష్టకేతువు జన్మించాడు. వీరిని పాంచాల రాజులు అంటారు.
శ్రీకృష్ణుడు శ్యమంతకపంచక క్షేత్రానికి వెళ్ళినప్పుడు భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు,మొదలగు అనేకులు వచ్చి కృష్ణుని దర్శించుకున్నారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పృషతుడు; కొడుకు(లు) - దృష్టద్యుమ్నుడు ఆదులు; కూతురు(లు)- ద్రౌపది; పద్య సం.(లు) - 1-158-వ., 1-159-క,, 9-659-సీ., 10.2-1044-వ.,

  405) ద్రుమకల్పకవల్లి- (){జాతి}[వృక్ష]:- ద్రుమకల్పకవల్లి అంటే కల్పవృక్షము. సరస్వతీదేవిని ప్రణుతద్రుమకల్పకవల్లిగా వర్ణించారు. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 6-5-ఉ.,

  406) ద్రుహిణతనూభవుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ద్రుహిణతనూభవుడు బ్రహ్మదేవుని పుత్రుడైన భృగుమహర్షి. భృగుమహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని పరీక్షించడానికి బయలుదేరి, శివుని వద్దకు వచ్చినప్పుడు ద్రుహిణతనూభవుడు వచ్చినందుకు సంతోషిస్తాడు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1271-చ.

  407) ద్రుహిణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ద్రుహిణుడు అంటే బ్రహ్మదేవుడు. లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు. సంహార సమయంలో హరునికి అంతర్యామిగా సంహరిస్తాడు. అని చెప్పేసందర్భంలో ద్రుహిణ శబ్దం వాడారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-275-మ., 11-72-ససీ.

  408) ద్రుహ్యుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- యయాతి శర్మిష్ఠల ముగ్గురు కొడుకులు ద్రుహ్యుడు, అనువు, పూరువు. తనకు శాపంవలన కలిగిన ముసలితనాన్ని తీసుకుని, తమ యవ్వనాన్ని ఇమ్మని యయాతి అడుగగా కొడుకులు యదువు, తుర్వసుడు, "ద్రుహ్యుడు" తిరస్కరించారు. కడగొట్టు కొడుకైన పూరువు అంగీకరించాడు. పిమ్మట, యయాతి పూరుని యౌవనాన్ని అతనికి ఇచ్చేసి ముసలితనాన్ని తీసుకొన్నాడు. రాజ్యాన్ని విభజించి ద్రుహ్యునకు తూర్పు భాగం, యదువునకు దక్షిణ భాగం, తుర్వసునకు పడమర భాగం, అనువుకు ఉత్తర భాగం ఇచ్చి, పూరుడిని రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసాడు., ద్రుహ్యుని కొడుకు బభ్రుసేతువు. అతని కొడుకు నారబ్దుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - యయాతి; తల్లి - శర్మిష్ఠ; కొడుకు(లు) - బభ్రుసేతువు; పద్య సం.(లు) - 9-542-వ., నుండి 9-586వరకు, 9-699-వ.,

  409) ద్రోణ-1 ( ){జాతి}[వృక్ష]:- ద్రోణ అంటే తుమ్మ చెట్లు అని ద్రోణుడు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  410) ద్రోణ-2 ( ){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణ అంటే ద్రోణుడు అని తుమ్మ చెట్లు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో కురుపాండవుల యుద్ధం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-39-వ.,

  411) ద్రోణకుటుంబిని- (స్త్రీ){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణకుటుంబిని అంటే కృపి. అశ్వత్థామ తల్లి. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-166-ఉ.,

  412) ద్రోణజుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణజుడు అంటే అశ్వత్థామ . . శ్రీకృష్ణుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు. అలా తిరుగులేని బ్రహ్మాస్త్రం వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయింది. - వంశం - మానవ యోని; తండ్రి - ద్రోణుడు; పద్య సం.(లు) - 1-147-శా.,

  413) ద్రోణతనయుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణతనయుడు అంటే అశ్వత్థామ . . శ్రీకృష్ణుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు. అలా తిరుగులేని బ్రహ్మాస్త్రం వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయింది. - వంశం - మానవ యోని; తండ్రి - ద్రోణుడు; పద్య సం.(లు) - 1-185-మ., 1-186-వ., 1-189-సీ.,

  414) ద్రోణనందనుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణనందనుడు అశ్వత్థామ. దుర్యోధనునికి సంతోషపెట్టడానికి అశ్వత్థామ, ద్రౌపది పుత్రులైన ఉపపాండవులను, రాత్రిసమయంలో చిన్న పిల్లలను, నిద్రలో ఉండగా తలలు ఖండించి దుర్యోధనునికి సమర్పించాడు. అతనిని తరుముతూ కృష్ణార్జునులు వస్తుంటే ప్రాణభయంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుని ఆజ్ఞప్రకారం అర్జునుడు దానిమీద తన బ్రహ్మాస్త్రం వేసి రెంటి ఉపసంహారం చేసి, అశ్వత్థామను చంపకుండా బంధించి ద్రౌపది వద్దకు తీసుకెళ్ళాడు. - వంశం - మానవ యోని; తండ్రి - ద్రోణుడు; పద్య సం.(లు) - 1-147-వ., 1-152-వ., 1-154-వ., 1-189-సీ.,

  415) ద్రోణపర్వతం- (){సంజ్ఞా}[పర్వతం]:- ద్రోణపర్వతం భారతవర్షంలోని ఒక పర్వతం. భారతవర్షంలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు.
చిత్రకేతుడను విద్యాధర చక్రవర్తి ఆదిశేషుని నుండి తత్వం విని. పిమ్మట కులద్రోణాది పర్వతాలు మున్నగు రమణీయ ప్రదేశాలలో విహరించాడు. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ., 6-484-వ.,

  416) ద్రోణాచార్యుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణాచార్యుడు కురుపాండవులకు విలువిద్య నేర్పిన గురువు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-161-మ.,

  417) ద్రోణుడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఈ ద్రోణుడు అష్టవసువులలో పెద్దవాడు. తరువాతజన్మలో నందుడు అయి జన్మించాడు. ద్రోణుడు ధర్మునికి వసువునందు కలిగిన ఎనిమిది మందిలో పెద్దవాడు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు; ద్రోణుని భార్య అభిమతి. వీరి పుత్రులు హర్షుడు; శోకుడు; భయుడు మొదలైనవారు.
ఆ ద్రోణుడు అనే వసువు బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం ఈ నందుడుగా జన్మించాడు, వసువు భార్య ధరాదేవి యశోదగా జన్మింటింది.; - వంశం - దేవయోని; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; భార్య - అభిమతి, ధర; కొడుకు(లు) - హర్షుడు; శోకుడు; భయుడు మొదలైనవారు; పద్య సం.(లు) - 1- 165-వ., 3-130., 6-254-వ., 10.1-353-సీ.,

  418) ద్రోణుడు-2 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రోణుడు కురుపాండవులకు విలువిద్యా గురువు, అశ్వత్థామ తండ్రి, కృపి భర్త. రాబోయే సూర్యసావర్ణి మన్వంతరంలో ఈ ద్రోణుని కొడుకు అశ్వత్థామ ఆ నాటి సప్తర్షులలో ఒకడు అవుతారు. అప్పటి సప్తర్షులు గాలవుడూ, దీప్తిమంతుడూ, పరశురాముడు, ద్రోణుని కొడుకైన అశ్వత్థామ, కృపుడూ, వ్యాసుడు, ఋష్యశృంగుడు,
సత్యధృతి వలన పుట్టిన ఒక ఆఢ ఒక మగ కవలలను అడవిలో వదివేయడంతో, వారిన శంతనమహారాజు చూసి కరుణతో చేరదీసి కృపుడు కృపి అని పేర్లుపెట్టాడు. వారిలో కృపుడు, ద్రోణుడు కురుపాండవులకు గురువులు అయ్యారు. కృపిని ద్రోణుడువివాహం చేసుకున్నాడు. - వంశం - మానవ యోని; భార్య - కృపి; కొడుకు(లు) - అశ్వత్థామ; పద్య సం.(లు) - 1-161-మ., 1-166-ఉ., 3-130-వ., 8-415-వ., 8-659-వ., 10.2-283-వ., 10.2-1042-వ.,

  419) ద్రౌణి- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్రౌణి అంటే ద్రోణుని కొడుకైన అశ్వత్థామ. తన కొడుకులను చంపిన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చిన సందర్భంలో వాడారు. - వంశం - మానవ యోని; తండ్రి - ద్రోణుడు; తల్లి - కృపి; పద్య సం.(లు) - 1-144-మ., 1-146-శా., 1-159-క., 1-165-ఉ,

  420) ద్రౌపది- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్రౌపది పాండవుల భార్య.
అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించటం కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించి తెచ్చి సమర్పించాడు. లోకలు దీనిని దుష్కృతం అన్నారు. ద్రౌపది దుఃఖించడం చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో అశ్వత్థామను తరిమి పట్టి బంధించారు. అతనిని తీసుకవచ్చి ద్రౌపది ముందర పెట్టి, అర్జునుడు వీనిని చంపుతాను. అంటే ద్రౌపది నయవాక్యాలతో వద్దని వారించింది. అశ్వత్థామ తల్లి కృపి ఎంత పుత్రశోకం పొందుతుందో అని బాధపడిన సహృదయ ద్రౌపది. గురుపుత్రుడవు, శుద్దశూరుడవు, బ్రహ్మణుడువు శిష్యులు నీకు పుత్రసమానులు కదా అని అశ్వత్థామకు బుద్ధిచెప్పిన మహా నయశీలి ద్రౌపది. ఇంతటి సంయమనం, సౌశీల్యం, నిగ్రహం, గాంభీర్యం కల స్త్రీలు బహు అరుదు. అర్జునుడు అశ్వత్థామ తల గొరిగి, బయటకు పంపేసాడు. నిండుసభలో ద్రౌపదిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన కౌరవులను అందరినీ శ్రీకృష్ణుడు కరుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు;
చిన్నతనంలో కుంతీదేవి కోరిన దేవుడు వచ్చి పిల్లలను అనుగ్రహించే మంత్ర ఉపదేశం పొందింది. పాండురాజుతో కుంతి వివాహం పిమ్మట మాద్రితో కూడా వివాహమైంది. మునిశాపx వలన పిల్లలను కనలేని పాండురాజునకు కుంతీదేవి ఎడల యమధర్మరాజు అనుగ్రహంతో యుధిష్ఠరుడు; వాయుదేవుని అనుగ్రహంతో భీముడు ; ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అనె ముగ్గురు కుమారులు; మాద్రిదేవి ఎడల అశ్వనీదేవతల అనుగ్రహం వలన నకులుడు, సహదేవుడు అని ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు కలిగారు. ఆ ఐదుగురకు ద్రుపద రాజు కూతురు ద్రౌపది భార్య. ఆమె యందు వారికి వరుసగా ప్రతివింధ్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతకర్ముడు అని ఐదుగురు పుట్టి ఉపపాండవులు అని పేరుపొందారు. ఇంకా, యుధిష్ఠిరునకు పౌరవతి వలన దేవకుడు; భీమసేనునికి హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు; సహదేవునికి విజయ వలన సుహోత్రుడు, నకులునకు రేణుమతి వలన నిరమిత్రుడు; అర్జునునకు ఉలూపి అనే నాగకన్య వలన ఇలావంతుడు, మణిపుర రాజు కుమార్తె చిత్రాంగద వలన బబ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు పుట్టాడు. ఆ అభిమన్యుడు మిక్కిలి పరాక్రమం, ధైర్యం, తేజస్సు, వైభవాలతో సకల రాజులలో ప్రసిద్ధుడు అయ్యాడు. వారిలో బబ్రువాహనుడు అర్జునుని ఆనతి మేర తన మాతామహుని చేరి వారి వంశం నిలబెట్టాడు. కురుక్షేత్ర యుద్దం తరువాత అభిమన్యునికి పుట్టిన కొడుకు పరీక్షిత్తు ఒక్కడు మాత్రమే పాండవుల వంశం నిలబెట్టడానికి మిగిలాడు.
ధర్మరాజు తను చేపట్టిన రాజసూయయాగంలో అందరికీ తృప్తికరంగా భోజనాలు వడ్డనలు చేయించే బాధ్యత ద్రౌపదికి ఇచ్చాడు. భీముడు వంటలు చేయించడానికి, అర్జునుడు కృష్ణునికి సేవలు చేయడానికి, నకులుడు సంబారాల ఏర్పాటుకు, సహదేవుడు అతిథి సత్కారాలు, కర్ణుడు దానాలుచేయడానికి, దుర్యోధనుడు కానుకలు స్వీకరించడం భాధ్యతలను అప్పగించాడు.
శమంతకపంచకం వద్దకు కృష్ణునితో పాటు అందరూ తమ కుటుంబాలతో వచ్చినప్పుడు, ద్రౌపది కృష్ణుని భార్యలో కూడి కబుర్లు చెప్పుకుంది. లక్షణ మున్నగువారి నుండి వారి వివాహాల విశేషాలు చెప్పించింది. - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్రుపదుడు; భర్త - పంచపాండవులు; కొడుకు(లు) - ప్రతివింద్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానీకుడు. శ్రుతకర్ముడు {వీరు ఉపపాండవులు}; పద్య సం.(లు) - 1-142-వ. నుండి 1-177-శా. వరకు,1-89-సీ., 1-234-వ., 1-364-శా., 9-673-వ., 10.2-771-సీ., 10.2-1081-తే. నుండి 10.2-1114-వ. వరకు.,

  421) ద్రౌపదీపుత్రులు- (పురుష){జాతి}[రాజు]:- ద్రౌపదీపుత్రులు అంటే ఉపపాండవులు ఐదుగురు, పంచపాండవులకు ద్రౌపది యందు పుట్టిన వారు. వారు యుద్ధంచేసే వయసురాని చిన్నపిల్లలుగా ఉండగా, అర్థరాత్రి సమయంలో, గుడారంలో నిద్రలో ఉన్నవారిని దయమాలి, అశ్వత్థామ దుర్యోధనుని సంతోషంకోసం తలలు నరికి, దుర్యోధనునికి సమర్పించాడు. అప్పటికే యుద్దంలో పాండవుల కొడుకులు ఘటోత్కచుడు, అభిమన్యుడు మున్నగు వారందరూ మరణించారు. కనుక తద్వారా పాండవ వంశోద్దారకులులేకుండా నిర్మూలించాలని ఉపపాండవులను చంపేసారు. లోకులు ఇది దుష్కృతమని దూషించారు.
పంచపాండవులకు ద్రౌపది యందు పుట్టిన ఆ ఉపపాండవుల పేర్లు 1.ప్రతివింద్యుడు, 2.శ్రుతసేనుడు, 3.శ్రుతకీర్తి, 4.శతానీకుడు, 5.శ్రుతకర్ముడు. - వంశం - రాజు; తండ్రి - పాండవులు; తల్లి - ద్రౌపది; పద్య సం.(లు) - 1-142-వ. నుండి 1-177-శా. వరకు,1-89-సీ., 1-234-వ., 1-364-శా., 9-673-వ.,

  422) ద్వాజుడు- (పురుష){జాతి}[దేవయోని]:- బృహస్పతి “ఇద్దరు పుత్రులు పుట్టారు అని చెప్పి నమ్మేలా చేసి, ఇతనిని పెంచు” అన్నాడు. కాని మమత “నేను పెంచలేను ఈ ద్వాజుని నీవే పెంచు.” అంది. అలా ఇద్దరూ "భర ద్వాజః" అంటూ వాదించుకోవడం వలన భరద్వాజుడు అని పేరుబడ్డాడు. ఈయన గొప్ప మహర్షి వంశకర్త. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-640-సీ., 9-641-వ.,

  423) ద్వాదశరాశాత్మకము- (){జాతి}[ప్రదేశము]:- మేషాది ద్వాదశరాశులతో కూడినది కనుక జగత్తును ద్వాదశరాశాత్మకము అంటారు. సూర్యుడు ఈ పన్నెండు రాశులలలో ఒక ఆవృత్తి తిరగడానికి పట్టేకాలమును ఏడు (సంవత్సరము) అంటారు. ఇది మహత్కాలము. సంవత్సరం లోపు సూక్ష్మ కాలము. సంవత్సరానికి పైది బృహత్కాలము.
మానవులకు ఒక నెల అంటే పితృదేవతలకు ఒక దినము అగును. పన్నెండు మాసములు ఒక సంవత్సరము అగును. అది దేవతలకు ఒక దినము. నూరు సంవత్సరములు మానవుల జీవితకాలము (పరమాయువు).పరమాణువు, నిమేషములు మున్నగు విభాగాలు కలిగి, సూర్యుడు గ్రహ నక్షత్ర తారల ద్వారా చక్రభ్రమణం ద్వాదశరాశులను దాటటం పూర్తిచేసి కాలాన్ని సంవత్సరం, వరీవత్సరం, ఏడావత్సరం, అనువత్సరం, వత్సరం అని ఐదు రకాలుగా కొలుస్తారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-345-సీ., 3-346-వ.,

  424) ద్వాదశరాసులు- (){జాతి}[ప్రదేశము]:- ద్వాదశరాసులు 1మేషము 2వృషభము 3మిథునము 4కర్కాటకము 5సింహము 6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము 11కుంభము 12మీనము.. సూర్య రూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాలను వెలిగిస్తూ ద్వాదశ రాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తాడు.
బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ద్వాదశరాశులలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-86-వ., 5.2-90-సీ.,

  425) ద్వాదశాక్షరవిద్య- (){సంజ్ఞా}[మంత్ర]:- ద్వాదశాక్షరీ అంటే "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రం. శ్రీమన్ నారాయణకవచం ప్రయోగించుటలోని విధానం వర్ణస్తూ, నారాయణకవచాన్ని అనుసంధానించి అష్టాక్షరి ద్వాదశాక్షరి లతో అంగన్యాసకరన్యాలు చేయాలి. మంత్రమూర్తియై ఓంకారచేత ఓంవిష్ణవేనమః మంత్రంతో దిగ్భందనం చేసి, షట్ఛక్తి సంయుతంబైన నారాయణ కవచం అనే మంత్రరాజాన్ని పఠించాలి - అని చెప్పబడింది. - వంశం - మంత్ర; పద్య సం.(లు) - 6-299-వ.,

  426) ద్వాదశాక్షౌహిణి- (){సంజ్ఞా}[పరికరములు]:- ద్వాదశాక్షౌహిణి అంటే పన్నెండు అక్షౌహిణుల చతుర్విధ సైన్యము. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 10.2-396-సీ.,

  427) ద్వాదశాదిత్యులు - (పురుష){జాతి}[దేవయోని]:- ద్వాదశాదిత్యులు అంటే అదితి కశ్యపుల పుత్రులైన వివస్వతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పన్నెండుగురు కుమారులు.
సూర్యుడు మన్నెండుమాసాలలో పన్నెండుపేర్లతో వ్యవహరిస్తారు ఆయా మాసాలలో అయా పరివారంతో సంచరిస్తాడు. ద్వాదశాదిత్యుల పేర్లు 1.చైత్రమాసంలో సూర్యుడు ధాత అని పేరు ధరిస్తాడు. 2వైశాఖమాసంలో అర్యముడు 3. జ్యేష్ఠమాసంలో మిత్రుడు, 4. ఆషాడమాసంలో వరుణుడు, 5. శ్రావణమాసంలో ఇంద్రుడు, 6. భాద్రపదమాసంలో వివస్వంతుడు, 7. ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట్ర , 8. కార్తీకమాసంలో విష్ణువు, 9. మార్గశీర్షమాసంలో అర్యముడు. 10. పుష్యమాసంలో సూర్యుడు భగుడు, 11. మాఘమాసంలో పూషుడు, 12.ఫాల్గుణమాసంలో క్రతువు అను పేర్లతో సంచరిస్తాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-249-వ., 12-41-వ.,

  428) ద్వాదశావహము- (){సంజ్ఞా}[కాలము]:- ద్వాదశావహము అంటే ద్వాదశ (పన్నెండు) అహములు (పగళ్ళు) చేయు ఒక విధమైన యాగము. బ్రహ్మదేవుడు వరాహదేవుని స్తుతిస్తూ ఇలా అన్నాడు. ఓ వరాహస్వామీ! నీవు మళ్ళీమళ్ళీ ఆవిర్భవించటం “దీక్షణీయ” మనే యజ్ఞము; నీ కోరలు “ప్రాయణీయ” మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, “ఉదయనీయం” అనే సమాప్తేష్టి; సోమరసం నీ రేతస్సు; నీ ఉనికియే ప్రాతఃకాలం, మధ్యాహ్నం, సాయం సమయం అనే మూడు యజ్ఞాంశలు. నీ చర్మం మాంసం మొదలైన సప్తధాతువులూ అగ్నిష్ఠోమం, ఉర్ధ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం, 'ద్వాదశాహం' మొదలైన యజ్ఞ భేదాలు; సమస్త యజ్ఞాలు నీ శరీర సంధులు; క్రతువులన్నీ నీవే; నీవే యజ్ఞ బంధాలతో అలరారుతూ ఉంటావు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-426-వ.,

  429) ద్వాదశాహుతుల - (){జాతి}[విద్య]:- ద్వాదశాహుతుల కశ్యపుడు అదితికి చెప్పిన పుంసవన వ్రత విధానంలో హవిశ్శేషంబు 'ద్వాదశాహుతుల' వ్రేల్చి అని చెప్పారు - వంశం - విద్య; పద్య సం.(లు) - 6-521-వ.,

  430) ద్వాదశి- (){సంజ్ఞా}[కాలము]:- ద్వాదశి అంటే పక్షంలోని పన్నెండవ తిథి, ధ్రువచరిత్ర ద్వాదశినాడు, శ్రవణనక్షత్రంనాడు, దినక్షయంనాడు, మకర సంక్రమణాది సంక్రమణకాలంలో, వ్యతీపాతములలో, సభలలో భక్తిశ్రద్ధలతో వినే సజ్జనులకు సకల శుబాలు కలుగుతాయి అని ఫలశ్రుతిలో చెప్పబడింది.…
శ్రవణద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి; అభిజిత్తు అనబడే లగ్నం; అందు వామనుడు అవతరించాడు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 4-383-తే., 7-448-వ., 8-17-వ., 8-506-మ.,

  431) ద్వాదశీవ్రతము- (){సంజ్ఞా}[విద్య]:- ద్వాదశీవ్రతము అంటే ప్రతి ఏకాదశినాడు ఉపవాసముండి కార్తీక శుక్ల ద్వాదశి గడియలలో పారణము ఉద్వాసన చేసెడి వ్రతము. అంబరీష మహారాజు నారాయణుని గురించి ద్వాదశీవ్రతం ఆచరించాడు. ఈవ్రత ఉద్వాసన సమయంలోనే దుర్వాసుడు రావడం కృత్య ప్రయోగిచడం విష్ణుచక్రం కాపాడి ఋషిమీదకు వెళ్ళడం జరిగింది.. - వంశం - విద్య; పద్య సం.(లు) - 9-90-క.,

  432) ద్వాదశీస్నానము- (){జాతి}[విద్య]:- ద్వాదశీస్నానము అంటే ఏకదశీ ఉపవాసం ఉండి ద్వాదశినందు చేసే స్నానము. నందుడు ద్వాదశీస్నానం చేస్తుంటే వరుణుని దైత్యుడు తీసుకెళ్ళి వరుణునికి అప్పజెప్పాడు. కృష్ణుడు వెళ్ళి తండ్రిని వెనక్కి తీసుకువచ్చాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 10.1-954-సీ.,

  433) ద్వాపరము / ద్వాపరయుగము- (){సంజ్ఞా}[కాలము]:- ద్వాపరము / ద్వాపరయుగము చతుర్యుగములు నాలుగింటిలో మూడవ యుగము
ధర్మ దేవతవుకు కృతయుగంలో తపం, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండేవి. త్రేతాయుగంలో ఆ నాలుగు పాదాలలో ఒక పాదం భగ్నమయింది. ద్వాపరయుగంలో రెండు పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు లుప్తమైపోయి సత్యంమనే ఒక్కపాదం మాత్రం మిగిలి ఉంది. ఆ పాదాన్ని కూడా కలియుగాంతంలో అధర్మం ఆక్రమించి భగ్నం చెయ్యాలని చూస్తోంది.
ద్వాపరయుగంలో భాగవతాన్ని శుకుని చేత అతని తండ్రి వ్యాసుడు చదివించాడు.
చతుర్యుగ పరిమాణము. కృతయుగం నాలుగువేల దివ్యసంవత్సరాలు. దాని సంధ్యాకాలం ఎనిమిదివందల ఏళ్ళు. త్రేతాయుగ ప్రమాణం మూడువేలదివ్య సంవత్సరాలు. సంధ్యాకాలం ఆరువందల ఏళ్ళు. ద్వాపరయుగ ప్రమాణం రెండువేల దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం నాలుగువందల సంవత్సరాలు. కలియుగ వెయ్యి దివ్యసంవత్సరాలు. సంధ్యాకాలం రెండువందల సంవత్సరాలు. ఈ సంధ్యాకాలం మధ్య కాలంలో ధర్మం అధికంగా ఉంటుంది. సంధ్యాంకంలో ధర్మం అల్పమై ఉంటుంది. ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతోనూ, త్రేతలో మూడు పాదాలతోనూ, ద్వాపరంలో రెండు పాదాలతోనూ, కలియుగంలో ఒకపాదంతోనూ సంచరిస్తాడు.
కృతయుగంలో శుక్ల (తెల్లని) రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చిఉంటాడు. హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతాడు. త్రేతాయుగంలో రక్త (ఎఱ్ఱని) రంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతాడు. ద్వాపరయుగంలో శ్యామల (నీల) వర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులు కలిగి, దివ్యమైన ఆయుధాలు, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ధరించి; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో పిలువబడతాడు. కలియుగంలో కృష్ణ (నల్లని) రంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి ఉంటాడు, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో పిలువబడతాడు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 1-82-వ., 1-430-వ., 3-349-సీ., 7-384-వ., 11-77-వ., 2-7-సీ., 3-349-వ., 7-362-వ., 11-77-వ.,

  434) ద్వారక / ద్వారకానగరము / ద్వారకాపురము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ద్వారక శ్రీకృష్ణుని ముఖ్యపట్టణము. ద్వారకానగరం కురుజాంగల, పాంచాల, శూరసేన, బ్రహ్మావర్తం, కురుక్షేత్రం, మత్స్య, సారస్వత, మరుధన్వ, ఆభీర, సౌవీర, సింధు దేశాలు దాటాక వచ్చే ఆనర్తమండలంలో ఉంది.
యవనుడు దాడిచేసినప్పుడు. జరాసంధుడు కూడా దాడిచేయడానికి వస్తాడని, శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సముద్రమధ్యన దుర్గమప్రదేశం సంపాదించి విశ్వకర్మచేత ద్వారకానగరాన్ని నిర్మింపజేయించుకున్మాడు. మధురలోని తన ప్రజలను అందరినీ తన యోగమాయతో ఈ ద్వారకానగరానికి తీసుకువచ్చాడు. దానిన తన నగరంగా మార్చుకున్నాడు.
రుక్మిణీదేవి పంపిన వివాహప్రసస్థంబైన సందేశం అగ్నిద్యోతనుడు ద్వారకానగరంలో ఉన్న కృష్ణునికి అందించాడు. కృష్ణుడు రుక్మణీదేవిని తన ద్వారకానగరానికి తీసుకు వెళ్ళి వివాహమాడాడు..
శంబరవధానంతరం రతీప్రద్యుమ్నులు ద్వారకామనగరానికి వచ్చారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-178-వ., 1-234-వ., 1-243-వ., 10.1-1592-వ. నుండి 10.1-1615-వ., వరకు., 10.1699-క., 10.1-1751-వ., 10.2-48-వ.,

  435) ద్వారవతి- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ద్వారవతి అంటే ద్వారకానగరము. దేవతాదులు కృష్ణుని వైతుంఠానికి మరలి రమ్మని కోరడానికి ద్వారవతికి వచ్చారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 11-83-క.,

  436) ద్విచంద్రాదికము- (){జాతి}[విద్య]:- ద్విచంద్రాదికము రెండు చంద్రుడులు ఉన్నట్లు తోచుట మున్నగునవి. - వంశం - విద్య; పద్య సం.(లు) - 2-252-వ.,

  437) ద్విజన్ములు- (పురుష){జాతి}[మానవ యోని]:- ద్విజన్ములు అంటే బ్రహ్మణులు, క్షత్రియులు,... - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1707-మ.,

  438) ద్విజరాజవంశవర్యులు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- ద్విజరాజవంశవర్యులు అంటే చంద్రవంశ శ్రేష్ఠులు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1408-క.,

  439) ద్విజరాజు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ద్విజరాజు అంటే - ద్విజులు అంటే విప్రులు, పక్షులు నాగులు, వీరిలో రాజు అంటే శ్రేష్ఠుడు, ప్రభువు. కనుక ద్విజరాజు అంటే చంద్రుడు, విప్రోత్తముడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1408-క.,

  440) ద్విజులు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ద్విజులు అంటే విప్రులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-203-మ., 1-356-క., . . .10.1-1408-క.,

  441) ద్వితీయపరార్థము- (){జాతి}[కాలము]:- ద్వితీయపరార్థము. బ్రహ్మదేవుని ఆయుఃపరిమాణం వంద బ్రహ్మసంవత్సరములు. అందు మొదటి సగం పూర్వపరార్ధం, రెండవ సగం ద్వితీయపరార్ధం అంటారు. మొదటి సగం గడిచిపోయింది కనుక ఇప్పుడు నడుస్తున్నది ద్వితీయపరార్ధము. ద్వితీయపరార్థం ఆరంభలో హరి వరాహావతారం ఎత్తాడో అది వరాహకల్పం.. వర్తమానంలో నడుస్తున్నది వరాహాకల్పం.
బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు, రెండుపరార్ధాల పర్యంతం ఆత్మస్వరూపులుగా సత్యలోకంలో ఉంటారు. తరువాత బ్రహ్మదేవునితో పాటు పురాణపురుషునిలో లీనం అవుతారు, - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-359-సీ., 3-361-వ., 3-1018-వ.,

  442) ద్వితుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు. ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం విచ్చేసారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,

  443) ద్విప- (){జాతి}[జంతువు]:- ద్విప అంటే ఏనుగు. శ్రీకృష్ణుడు కంసవధా సమయంలో కువలయాపీడం అనే భీకరమైన ద్విపము (ఏనుగు) సంహరం చేసాడు. - వంశం - జంతువు; పద్య సం.(లు) - 2-169-మ., 2-190-చ.,

  444) ద్విపరార్ధము- (){జాతి}[కాలము]:- ద్విపరార్ధము అంటే ఒక కాలము కొలత, బ్రహ్మదేవుని ఆయుపరిమాణము యైన కాలము - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-361-వ., 9-109-వ.,

  445) ద్విపాత్పశువులు- (పురుష){జాతి}[మానవ యోని]:- ద్విపాత్పశువులు అంటే పశుప్రాయులైన మానవులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-127-వ.,

  446) ద్విపాదులు- (){జాతి}[జంతువు]:- ద్విపాదులు అంటే రెండుకాళ్ళు కలిగిన మానవ,పక్షి జాతులు. జీవలోకంలో ఏక, ద్వి, చతుష్, బహు పాదంబులు అను రకాలు ఉన్నాయి. - వంశం - జంతువు; పద్య సం.(లు) - 4-853-వ.,

  447) ద్విపేంద్రము- (){జాతి}[జంతువు]:- ద్విపేంద్రము కంసుని కువలయాపీడం అను ఏనుగు. - వంశం - జంతువు; పద్య సం.(లు) - 10.1-1155-శా.,

  448) ద్విమీఢుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ద్విమీఢుడు చంద్రవంశంలోని భరతుని తరువాత తరారలలోని హస్తి కొడుకు. ద్విమీఢుని కొడుకు అమీనరుడు. సంతులేని భరతుడు భరద్వాజుడు అనే వితథుడు అతనికి మన్యవు. మన్యువునకు గల ఐదుగురు కొడుకులలో బృహత్క్షత్రుడు ఒకడు. అతని మనుమడు హస్తినాపురం నిర్మించిన హస్తి. ఆ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని ముగ్గురు కొడుకులు. ద్విమీఢుని కొడుకు అమీనరుడు, అతని కొడుకు కృతిమంతుడు, అతని కొడుకు సత్యధృతి, సత్యధృతి కొడుకు దృఢనేమి. - వంశం - చంద్రవంశం; తండ్రి - హస్తి; కొడుకు(లు) - అమీనరుడు; పద్య సం.(లు) - 9-653-వ., 9-655-వ.,

  449) ద్విమూర్ధుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ద్విమూర్థుండు దానవులలో ఒకడు. కశ్యపుని భార్య దక్షుని పుత్రిక యైన దనువుకు - ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని పద్దెనిమిది మంది కొడుకులు. వారిని వారి సంతానాన్ని దానవులు అంటారు.
దేవదానవ యుద్ధాలలో వృత్రాసురుని వైపు, బలి వైపు పాల్గొన్నవారిలో ఒకరు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-258-వ., 6-363-వ.,8-331-వ.,

  450) ద్విరదము- (){జాతి}[జంతు]:- ద్విరదము అంటే ఏనుగు. - వంశం - జంతు; పద్య సం.(లు) - 4-187-చ.,

  451) ద్విరేఫము- (){జాతి}[కీటకము]:- ద్విరేఫము అంటే తుమ్మెద - వంశం - కీటకము; పద్య సం.(లు) - 3-223-మ., 10.1-1734-మ., 10.2-626-క.,

  452) ద్వివిదుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ద్వివిదుడు కంసుని అనుచరుడు; కంసుడు, నారదుని వలన నందుడు, వసుదేవుడు మున్నగువారందరు దేవతలు తాను రాక్షసుడను మున్నగునవు వినిన పిమ్మట,దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు.విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. రాజ్యాన్ని ఆక్రమించాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, "ద్వివిదుడు", పూతన మున్నగు రాక్షసులను కూడగట్టుకుని యుద్ధాలు చేసి యాదవులను అందరిని ఓడించి తానే ఏలసాగాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 2-190.చ., 10.1-56-వ.,

  453) ద్వివిదుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ ద్వివిదుడు బలరాముడు సంహరించిన వానరుడు. ద్వివిదుడు నరకాసురుని స్నేహితుడు. వీనిని సుగ్రీవుని మంత్రి మైందుని తమ్ముడు అంటాడు. తన మిత్రుడు నరకుని మృతికి పగపట్టాడు. కృష్ణుడు ఏలే రాజ్యంలో అందరినీ బాధించేవాడు. రైవతపర్వత గుహకు వచ్చి, అక్కడ కాలక్షేపం చేస్తున్న బలరాముని విసిగించగా, బలరాముడు ద్వివిదుని చంపాడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 10.2-538-క. నుండి 10.2-559-వ. వరకు.,

  454) ద్వీపవతి- (స్త్రీ){సంజ్ఞా}[ప్రదేశము]:- ద్వీపవతి అనగా నది. బలరాముడు యాత్రలకు వెళ్ళినప్పుడు కామాదేవి అను నది (ద్వీపవతి) దర్శించాడు. . . దక్షిణసముద్రము, కన్యాకుమారి, గోకర్ణక్షేత్రం, కామాదేవి నది, తాపి యందలి పయోష్ణి నదిని, నిర్వింధ్య, దండకాటవి, మహిష్మతీ పురము, మనుతీర్థం, ప్రభాసతీర్థం దర్శించాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-953-వ.,

  455) ద్వైపాయనుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు. శుకబ్రహ్మ తండ్రి. భారతము, మహాపురాణాలు వ్రాసిన మహానుభావుడు. ద్వాపరయుగంలో వేదతుల్యమైన భాగవతం శుకుని చేత చదివించాడు.
మైత్రేయుడు వీరి సహాధ్యాయి.
వ్యాసుడు, నారద దేవల మహర్షులు తనకు చెప్పిన చిత్రకేతోపాఖ్యానమును శుకుడు పరీక్షిత్తునకు చెప్పెను. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 2-7-సీ., 3-147-వ., 3-715-వ., 6-307-వ., 6-444-వ., 7-7-వ.,

  1) ధనంజయుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధనంజయుడు అంటే అర్జునుడు, నైమిశారణ్య వర్ణనలో, ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడికలదై; ఆకాశంనిండా క్రమ్ముకున్న ధూళికల ధనంజయుని (అర్జునుడి) యుద్ధములా ఉంది అని వర్ణించారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-39-వ., 1-154-వ., 1-168-వ., 1-216-వ., . . .10.2-120-వ., . . .

  2) ధనంజయుడు-2 (పురుష){సంజ్ఞా}[నాగ జాతి]:- ఇతడు మాఘ (తపో) మాసంలో సూర్యుని అనుచరులలోని నాగుడు.
సూర్యుడు ఈ మాసంలో పూష అను పేరుతో, ఘృతాచి, గౌతముడు, ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - నాగ జాతి; పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

  3) ధనంజయుడు-3 (పురుష){సంజ్ఞా}[నాగ జాతి]:- పాతాళలోకంలో వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు మహానాగులుఉంటారు. వారికి ఐదు, నూరు వేయి తలలు ఉంటాయి. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - వంశం - నాగ జాతి; పద్య సం.(లు) - 5.2-121-వ.,

  4) ధనంజయుడు-4 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ ధనంజయుడు పరీక్షిత్తుకాలనికి భవిష్యత్తులోని సూర్యవంశపు వాడు. వీరు బృహద్బలుని తరువాత పుట్టినవారు. సుతపునకు అమిత్రజిత్తు; అతనికి బృహద్వాజి; అతనికి బర్హి; బర్హికి "ధనంజయుడు"; ధనంజయునకు "రణంజయుడు"; అతనికి సృంజయుడు; తరువాత ఎనునిదవ తరంలో సుమిత్రుడు పుడతారు. సుమిత్రుని తరువాత సూర్యవంశం నశించిపోతుంది. - వంశం - సూర్యవంశం; తండ్రి - బర్హి; కొడుకు(లు) - రణంజయుడు; పద్య సం.(లు) - 9-366-వ.,

  5) ధనదుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధనదుడు అంటే కుబేరుడు. నైమిశారణ్యమును ఇతని నివాసంలాగ ఉంది అని వర్ణించారు. శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎఱ్ఱతామరలతోటి; కుబేరుని సౌధము లాగ (పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము లనే నవనిధులు లోని) శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది అన్నారు. ధ్రువుడు తండ్రి రాజ్యం చేపట్టాక, అన్న ఉత్తముని మృతికి కారణం కుబేరుని అనుచరులైన యక్షులని కోపించి యుద్దానికి వెళ్ళి. వారిని సంహరిస్తున్నాడు. కోపాన్ని విడువమని యక్షులను చంపవద్దని వచ్చి చెప్పిన స్వాయంభువ మనువు ప్రకారం ధ్రువుడు యుద్దం ఆపాడు. ధనదుని (కుబేరుని) స్తుతించాడు. ఆయన కోరిన వరాలిచ్చాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-39-వ., 2-189-మ., 4-364-తే. నుండి 4-357-వ., 5.1-147-సీ., 8-114-వ.,

  6) ధనదేశుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధనదేశుడు అంటే కుబేరుడు. అర్జునుడు, మరణించిన బ్రాహ్మణుని పిల్లలకోసం, ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర (ధనదేశుని), ఈశానుల లోకాలకు వెళ్ళి అన్వేషించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1300-క.,

  7) ధనికుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధనికుడు చంద్రవంశపువాడు. యదువంశంలోని దుర్మదుని కొడుకు. ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతౌజుడు అని నలుగురు కొడుకులు. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యార్జునుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దుర్మదుడు; కొడుకు(లు) - కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు; పద్య సం.(లు) - 9-701-వ.,

  8) ధనిష్ఠ-1 ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం కుడి ఎడమ నేత్రాలలలో ధనిష్ఠ, మూల ఉన్నాయి - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  9) ధనిష్ఠ-2 (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- ధనిష్ట చంద్రుని భార్యలైన నక్షత్రాలలో ఒకామె. అసిక్నీయక్షులకు అరవైమంది పుత్రికలు పదిమందిని ధర్మునికి, పదముగ్గిరిని కశ్యప ప్రజాపతికి, ఇరవై ఏడుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసాడు. మిగిలిన కుమార్తెలలో భూతునికి ఇద్దరిని, ఆంగిరసునికి ఇద్దరిని, కృశాశ్వునికి ఇద్దరిని, తార్క్షునికి (కశ్యపునికి నామాంతరం) నలుగురిని ఇచ్చి పెండ్లి చేసాడు. వారిలో ధనిష్ఠ దక్షుని కుమార్తెలో 43వ యామె, చంద్రుని భార్యలలో 23 ఆమె; 27 నక్షత్రాలలో 23వది. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-252-వ.,

  10) ధనురాచార్యుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధనురాచార్యుడు అనగా కౌరవ పాండవులకు విలువిద్య బోధించిన ద్రోణాచార్యుడు. శ్రీకృష్ణరాయబార సమయంలో ఉద్దవుని పిలిపించగా వచ్చి, ధృతరాష్ట్ర, ధనురచార్య (ద్రోణ), భీష్మ, దుర్యోధనాదులకు నమస్కరించాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-573-వ.,

  11) ధనురాశి- ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో సంచరిస్తుంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి తగ్గుతూ వస్తుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాశులలో సంచరిస్తుంటే ఒక్కొక్క గడియ చొప్పన రాత్రి పెరుగుతుంది. పగలుతగ్గిపోతుంది. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-79-ఆ., 5.2-80-ఆ.,

  12) ధనుర్గుణములు- ( ){జాతి}[పరికరములు]:- ధనుర్గుణములు అంటే విల్లులు అల్లెతాళ్ళు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు

  13) ధనుర్యాగము- (){జాతి}[యాగము]:- కంసుడు ధనుర్యాగం పేరుతో బలరామ కృష్ణులను మధురకుపిలిచి చంపించాలని యోచించి అనుచరులకు ధనుర్యాగానికి సిద్ధంచేయమని చెప్పి అక్రూరుని తీసుకురమ్మని పంపాడు. వారువచ్చి కంసాదులను సంహరించారు. - వంశం - యాగము; పద్య సం.(లు) - 10.1-1156-క. నుండి 10.1-1210-వ.,

  14) ధనుర్వేదము- (){సంజ్ఞా}[విద్య]:- ధనుర్వేదము అంటే విలువిద్య, యజుర్వేదానికి ఉపవేదము. మైత్రేయుడు విదురునితో బ్రహ్మఏయే ముఖాలనుండి ఏవి జనించాయో చెప్తూ, ధనుర్వేదం బ్రహ్మదేవుని దక్షిణ ముఖంనుంచి ఉద్భవించింది అని చెప్పాడు.,
అహల్యాగౌతముల పుత్రుడైన శతానందునికి సత్యధృతి పుట్టాడు. సత్యధృతి ధనుర్వేద విశారదుడు. ఈ సత్యధృతి ఊర్వశిని గనుటచే రేతఃపతనం అయ్యి రెల్లుగడ్డి పై బడి కవలలుగా ఆడబిడ్డ మగబిఢ్డ అయ్యారు. వారిని శంతనుడు పెంచుకున్నాడు. వారే కృపి కృపుడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-388-వ., 9-656-క., 9-657-వ., 10.1-1412-శా.,

  15) ధనువులు- (){జాతి}[పరికరములు]:- ధనువులు అంటే ధనుస్సులు, విల్లులు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 6-79-క., 6-535-లగ్రా., 7-57-క.,

  16) ధనుస్సులు- ( ){జాతి}[పరికరములు]:- ధనుస్సులు అంటే విల్లులు, బాణాసనములు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-327-క., నుండి 8-334-వ., వరకు

  17) ధన్వ- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధన్వ ఒక దేశము పేరు. కృష్ణుడు మిథిలానగరపు బహుళాశ్వుడు, శ్రుతదేవుడులను చూడడానికి వెళ్తుంటే, దారిలో కానుకలిచ్చిన రాజులలో ధన్వ దేశపు రాజు ఒకరు. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.2-1178-వ.,

  18) ధన్వంతరి-1 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- ధన్వంతరి అవతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 12 వ. అవతారం. ధన్వంతరి దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి అవతరించాడు. అలా అమృతకలశం పట్టుకుని ధన్వంతరిని చూసి రాక్షసులు తని చేతిలోని అమృతభాండాన్ని లాక్కున్నారు. అప్పుడు జదన్మోహినిగా అవతరించి, అమృతం పంచవలసి వచ్చింది.
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 19 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించిన కాలం తరువాత ఈనాటి వరకు, జరిగిన ఆరు అవతారాలులోనిది.
తినరానిది తిన్న దోషం నుండి ధన్వంతరి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 1-63-వ., 2-152-వ., 2-199-వ., 6-300-చ., నుండి 6-307-వ., 8-293-సీ.,

  19) ధన్వంతరి-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధన్వంతరి వాసుదేవాంశసంభూతుడు యజ్ఞబాగార్హుడు. చంద్రవంశపు పురూరవుని తరువాతరాలలోని రాష్ట్రునిపుత్రుడైన దీర్ఘతపుని పుత్రుడు. వైష్ణవ అంశతో పుట్టి, ఆయుర్వేదం తెలిసిన మహానుభావుడు. ఈ ధన్వంతరి పుత్రుడు కేతుమంతుడు, అతనికి భీమరథుడు, అతనికి దివోదాసుడు జన్మించారు. దివోదాసుడు మరొకపేరు ద్యుమంతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దీర్ఘతపుడు; కొడుకు(లు) - కేతుమంతుడు; పద్య సం.(లు) - 9-498-క.,

  20) ధన్వి- (){జాతి}[మానవ యోని]:- ధన్వి అంటే విలుకాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-212-ఉ., 8-441-క.,

  21) ధర-1 (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధర అంటే ధరించెడిది కాబట్టి భూమి .
దేవతలు పిలుస్తే ఖట్వాంగుడు ధర నుండి దినికి వెళ్ళాడు. యుద్దాలలో అసురులమీద దేవతలకు జయం ఇచ్చాడు. ముహూర్తం మాత్రమే తనకు ఆయువు ఉన్నదని దేవతలు తెలుపగా, గోవిందనామ కీర్తనతో మోక్షం పొందాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-295-భు., 2-9-సీ.,

  22) ధర-2 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ఈ ధర ద్రోణుడనే వసువు భార్య. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు ఈ ధర ద్రోణుడుకృష్ణావతారుని పుత్రునిగా సేవించడానికి, యశోదా నందులుగా భూమిమీద పుట్టారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-353-సీ.,

  23) ధరణి-1 ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- ధరణి అంటే భూమి, నేల - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-199-వ., 1-338-సీ., 2-16-సీ., 3-171-సీ., 8-51-సీ.,

  24) ధరణి-2 (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ధరణి అంటే భూదేవి. జైత్రయాత్రచేసి వస్తున్న పరీక్షిత్తు గోవు వృషభం రూపాలలోనున్న భూదేవి ధర్మదేవతలను అక్రమంగా తన్నుతున్న కలిని చూసి నిగ్రహించి భూదేవి ధర్మదేవతలకు సంతోషం కలిగించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-432-వ.,

  25) ధరణి-3 (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- ఈ ధరణి ధ్రువుడు అను వసువు భార్య. దక్షపుత్రి సంకల్పయందు, ధర్మునికి సంకల్పుడు జన్మించాడు. ఆ సంకల్పునకు కాముడు పుట్టాడు. వసువుకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనిమిదిమంది వసువులు పుట్టారు. వారిలో ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు కలిగాయి. - వంశం - దక్ష వంశం; భర్త - ధ్రువుడు ; కొడుకు(లు) - నానావిధ పురాలు; పద్య సం.(లు) - 6-254-వ.,

  26) ధరణిదేవి- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ధరణిదేవి అంటే భూదేవి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-126-సీ.,

  27) ధరణిపుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణిపుడు అంటే రాజు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-134-చ.,

  28) ధరణిరుహము- (){జాతి}[వృక్ష యోని]:- ధరణిరుహము అంటే చెట్టు - వంశం - వృక్ష యోని; పద్య సం.(లు) - 4-943-సీ.,

  29) ధరణివిభుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణివిభుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-392-సీ.,

  30) ధరణిసురుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీసురుడు అంటే విప్రుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-186-వ., 1-209-ఆ., 2-94-సీ.,

  31) ధరణీతనయ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ధరణీతనయ సీతాదేవి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-1-క.,

  32) ధరణీతనూజుడు- (పురుష){సంజ్ఞా}[భగణ విషయం]:- ధరణీతనూజుడు అంటే అంగారకుడు. బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా పన్నెండు రాసులలో సంచరిస్తూ ఉంటాడు. వక్రగతిలో ఉన్నా లేకున్నా అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-89-వ.,

  33) ధరణీదివిజులు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీదివిజులు అంటే విప్రులు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-216-క.,

  34) ధరణీదేవత- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీదేవతలు అంటే విప్రులు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-72-మ.,

  35) ధరణీధరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధరణీధరుడు అంటే విష్ణును. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 5.2-165-చ.,

  36) ధరణీధవుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీధవుడు అంటే రాజు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-492-క., 4-750-క.,

  37) ధరణీనాథుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీనాథుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-37-క.,

  38) ధరణీనాయకుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీనాయకుడు అంటే రాజు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-24-మ.,

  39) ధరణీలలామ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ధరణీలలామ అంటే భూదేవి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-84-వ.,

  40) ధరణీవల్లభుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీవల్లభుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-6-క.,

  41) ధరణీశుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరణీశుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-144-మ., 2-24-మ.,

  42) ధరాచక్రము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధరాచక్రము అంటే భూమండలము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-130-వ.,

  43) ధరాతలము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధరాతలము అంటే భూమండలము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-439-ఉ.,

  44) ధరాదివిజుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరాదివిజుడు అంటే బ్రహ్మణుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-362-ఉ.,

  45) ధరాధిపుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరాధిపుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-11-చ.,

  46) ధరామరుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరామరుడు అంటే బ్రాహ్మణుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-253-క.,

  47) ధరిత్రి-1 (స్త్రీ){సంజ్ఞా}[ప్రదేశము]:- ధరిత్రి అంటే నేల, భూమి, భూదేవి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-120-ఉ., 1-441-క., 3-54-క., 4-476-తే., . .

  48) ధరిత్రి-2 (){సంజ్ఞా}[జంతు]:- ధరిత్రి కృష్ణుని గోవులలో ఒక గోవు పేరు. గోవులను మేపుతూగౌతమీగంగ, భాగీరథీతనయ, సుధాజలరాశి, మేఘబాలిక, చింతామణి, సురభి, మనోహారిణి, సర్వమంగళ, భారతీదేవి, ధరిత్రి, శ్రీమహాలక్ష్మి, మందమారుతి, మందాకిని, శుభాంగి మున్నగు వాటి పేర్లతో కృష్ణుడు ఎంతో మనోజ్ఞంగా పిలిచేవాడు. - వంశం - జంతు; పద్య సం.(లు) - 10.1-604-సీ.,

  49) ధరిత్రీసురుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధరిత్రీసురుడు అంటే బ్రాహ్మణుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-502-ఉ.,

  50) ధర్మకేతువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మకేతువు చంద్రవంశపు రాజు. అలర్కుని మనవడు సునీతుడు అతని కొడుకు సుకేతనుడు. ధర్మకేతువు ఆ సుకేతనుని కొడుకు. ధర్మకేతువు కుమారుడు సత్యకేతువు. అతని కొడుకు ధృష్టకేతువు - వంశం - చంద్రవంశం; తండ్రి - సుకేనుడు; కొడుకు(లు) - సత్యకేతువు; పద్య సం.(లు) - 9-501-వ.,

  51) ధర్మగేహిని- (){జాతి}[మానవ యోని]:- ధర్మగేహిని అంటే ధర్మపత్ని - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-24-సీ.,

  52) ధర్మజుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మజుడు అంటే యముని వరమున కలిగిన వాడు, యుధిష్ఠరుడు, మరొకపేరు ధర్మరాజు. పాండురాజునకు భార్య కుంతి యందు యముని అనుగ్రహంతో పుట్టాడు. పాండవులలో పెద్దవాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-194-క., 1-202-వ., 1-212-ఉ., 1-233-సీ., 3-59-తే., . . .

  53) ధర్మతనూభవుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మతనూభవుడు అంటే ధర్మరాజు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 3-19-చ.,

  54) ధర్మదేవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మదేవుడు అంటే రూపందాల్చిన ధర్మము. జైత్రయాత్రచేసి వస్తున్న పరీక్షిత్తు గోవు వృషభం రూపాలలోనున్న భూదేవి ధర్మదేవతలను అక్రమంగా తన్నుతున్న కలిని చూసి నిగ్రహించి భూదేవి ధర్మదేవతలకు సంతోషం కలిగించాడు.
ధర్మ దేవతకు కృతయుగంలో తపం, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండేవి. త్రేతాయుగంలో ఆ నాలుగు పాదాలలో ఒక పాదం భగ్నమయింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించాయి. ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు లుప్తమైపోయి ఒక్కపాదం మాత్రం మిగిలి ఉంది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-196-వ., 1-411-వ., 1-430-వ.,

  55) ధర్మదేహుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మదేహుడు అంటే విష్ణువు. శ్రీహరి స్తోత్రం సనకాదులకు చెప్తూ బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-701-సీ.,

  56) ధర్మధ్వజుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ధర్మధ్వజుడు సీతాదేవి మేనల్లుడు. ఇతను సూర్యవంశపు మైథిలులలోని వాడు, సీరధ్వజునకు నాగలి చాలులో సీతాదేవి కలిగింది. ఆ సీరధ్వజునికి కుశధ్వజుడు; కుశధ్వజునికి ధర్మధ్వజుడు; ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు జన్మించారు. వారిలో కృతధ్వజునికి కేశిధ్వజుడు పుట్టాడు. అతను ఆత్మజ్ఞానం బాగా తెలిసినవాడు. మితధ్వజునకు ఖాండిక్యుడు పుట్టి తండ్రి నుండి కర్మకాండలు నేర్చుకున్నాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కుశధ్వజుడు; కొడుకు(లు) - కృతధ్వజుడు, మితధ్వజుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  57) ధర్మనందనుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మనందనుడు యమధర్మరాజు వరమున కుంతీదేవికి పుట్టినవాడు, యుధిష్టరుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పాండురాజు; తల్లి - కుంతి; పద్య సం.(లు) - 1-168-వ., 1-216-వ., 3-130-వ,

  58) ధర్మనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మనేత్రుడు పరీక్షిత్తుకాలానికి భవిష్యత్తుకు చెందిన మాగథుడు. జరాసంధుని తరువాతి తరాలవాడైన క్షేమునికి కొడుకు సువ్రతుడు; అతని కొడుకు ధర్మనేత్రుడు; అతని కొడుకు శ్రుతుడు; అతని కొడుకు ధృడసేనుడు; అతని కొడుకు సుమతి; అతని కొడుకు సుబలుడు; అతని కొడుకు సునీతుడు; అతని కొడుకు సత్యజిత్తు; అతని కొడుకు విశ్వజిత్తు; అతని కొడుకు పురంజయుడు. జరాసంథుడు మున్నగు ఈ మగధ దేశరాజులు కలియుగంలో వెయ్యి సంవత్సరముల లోగానే జనించి నశించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సువ్రతుడు; కొడుకు(లు) - శ్రుతుడు; పద్య సం.(లు) - 9-681-వ.,

  59) ధర్మపాలుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మపాలుడు అంటే విష్ణువు. శ్రీహరి స్తోత్రం సనకాదులకు చెప్తూ బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-703-సీ.,

  60) ధర్మపుత్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మపుత్రుడు అంటే యమధర్మరాజు వరమున కుంతీదేవికి పుట్టినవాడు, యుధిష్టరుడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-171-శా., 1-289-వ.,

  61) ధర్మరథుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మరథుడు చంద్రవంశపు దివిరథుని కొడుకు. సువీరునకు సత్యరథుడు; అతనికి దివిరథుడు; దివిరథునికి ధర్మరథుడు; ధర్మరథునకు చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడు రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దివిరథుడు; కొడుకు(లు) - చిత్రరథుడు; పద్య సం.(లు) - 9-683-వ.,

  62) ధర్మరాజవశంకరులు- (పురుష){జాతి}[దేవయోని]:- ధర్మరాజు అంటే యమధర్మరాజు. అజామిళోపాఖ్యానంలో అజామిళునిని మరణసమయంలో యమదూతలు (ధర్మరాజ వశంకరులు) తీసుకెళ్ళడానికి వచ్చారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-68-క.,

  63) ధర్మరాజు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మరాజు అంటే యుధిష్ఠరుడు. ధర్మానికి మారుపేరైన ప్రభువు కనుక ధర్మరాజు. ధర్మంవైపునే ఉంటాడు కనుక కృష్ణుడు, ధర్మరాజుకు అండగా ఉండి విజయాన్ని రాజ్యాన్ని ఇచ్చాడు, రాజసూయాది యాగాలు చేయించాడు. ధర్మరాజు అంపశయ్యమీద ఉన్న భీష్ముని వద్దకు వెళ్ళి సకలధర్మాలు విన్నాడు. కృష్ణ నిర్యాణం తరువాత మహాప్రస్థానం చేసాడు. ధర్మరాజు దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, - వంశం - చంద్రవంశం; తండ్రి - పాండురాజు; తల్లి - కుంతి,; భార్య - ద్రౌపది, పౌరవతి; కొడుకు(లు) - ద్రౌపది యందు ప్రతివింద్యుడు, పౌరవతి యందు దేవకుడు; పద్య సం.(లు) - 1-202-వ. 1-306-చ.,

  64) ధర్మరాజు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మరాజు అంటే ధర్ముడు, ధర్మమూర్తి. బ్రహ్మకుమారుడైన దక్షునికి, స్వాయంభువమనుపుత్రి ప్రసూతి యందు పదహారు (16) మంది కుమార్తెలు కలిగారు. దక్షుడు వారిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని (13) ధర్మరాజు (ధర్ముని)కి ఇచ్చాడు. స్వాహాదేవిని అగ్నికి, సతీదేవిని శివునికి, ఒకతెను పితృదేవతలకు ఇచ్చాడు. ధర్ముని భార్యలలో 1.శ్రద్ధ వల్ల శ్రుతం, 2.మైత్రి వల్ల ప్రసాదం, 3.దయ వల్ల అభయం, 4.శాంతి వల్ల సుఖం, 5.తుష్టి వల్ల ముదం, 6.పుష్టి వల్ల స్మయం, 7.ప్రియ వలన యోగం, 8.ఉన్నతి వల్ల దర్పం, 9.బుద్ధి వల్ల అర్థం, 10.మేధ వల్ల స్మృతి, 11.తితిక్ష వల్ల క్షేమం, 12.హ్రీ వల్ల ప్రళయం, 13.మూర్తి వల్ల ఇద్దరు ఋషులు నరనారాయణులు జన్మించారు. - వంశం - దేవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి ; కొడుకు(లు) - 1.శ్రద్ధ వల్ల శ్రుతం, 2.మైత్రి వల్ల ప్రసాదం, 3.దయ వల్ల అభయం, 4.శాంతి వల్ల సుఖం, 5.తుష్టి వల్ల ముదం, 6.పుష్టి వల్ల స్మయం, 7.ప్రియ వలన యోగం, 8.ఉన్నతి వల్ల దర్పం, 9.బుద్ధి వల్ల అర్థం, 10.మేధ వల్ల స్మృతి, 11.తితిక్ష వల్ల క్షేమం, 12.హ్రీ వల్ల ప్రళయం, 13.మూర్తి వల్ల నరనారాయణులు; పద్య సం.(లు) - 4-28-వ., 4-31-వ.,

  65) ధర్మరాజు-3 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మరాజు అంటే యమధర్మరాజు. అజామిళోపాఖ్యానంలో అజామిళునిని మరణసమయంలో యముని దూతలు (ధర్మరాజ వశంకరులు) తీసుకెళ్ళడానికి వచ్చారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-68-క.,

  66) ధర్మసావర్ణిమనువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- పద్నాలుగురు మనువులలో పదకొండవవాడు ధర్మసావర్ణి. ఆ పదకొండవ ధర్మసావర్ణి మన్వంతరంలో అతనిక కొడుకులైన సత్యధర్ముడు మొదలైనవారు పదిమంది రాజులు అవుతారు. విహంగములూ, కామగమనులూ, నిర్వాణచరులూ దేవతలు అవుతారు. వైధృతుడు ఇంద్రుడు అవుతాడు. వరుణుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - మనువు వంశం; కొడుకు(లు) - సత్యధర్ముడు మొదలైనవారు పదిమంది; పద్య సం.(లు) - 8-421-వ.,

  67) ధర్మసావర్ణిమన్వంతరం- (){సంజ్ఞా}[కాలము]:- ధర్మసావర్ణిమన్వంతరం పద్నాలుగు మన్వంతరాలలో పదకొండవది. చతుర్దశమన్వంతరముల పేర్లు -1) స్వాయంభువ మన్వంతరము; 2) స్వారోచిష మన్వంతరము; 3)ఉత్తమ మన్వంతరము; 4) తామస మన్వంతరము; 5) రైవత మన్వంతరము; 6) చాక్షుష మన్వంతరము; 7) వైవస్వత మన్వంతరము (ప్రస్తుతం నడుస్తున్నది); 8) సూర్య సావర్ణిక మన్వంతరము; 9) దక్షసావర్ణి మన్వంతరము; 10) బ్రహ్మసావర్ణి మన్వంతరము; 11) ధర్మసావర్ణి మన్వంతరము; 12) భద్రసావర్ణి మన్వంతరము; 13) దేవసావర్ణి మన్వంతరము; మఱియు 14) ఇంద్రసావర్ణి మన్వంతరము - వంశం - కాలము; పద్య సం.(లు) - 8-421-వ.,

  68) ధర్మసుతుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధర్మసుతుడు అంటే యముని వరం వలన జన్మించినవాడు, యుధిష్ఠరుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-279-తే., 3-130-వ.,

  69) ధర్మసూతి- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధర్మసూతి అంటే ధర్మరాజు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-96-క.,

  70) ధర్మసూనుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధర్మసూనుడు అంటే యముని వరమున జనించిన యుధిష్ఠరుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-205-క.,

  71) ధర్మసేతువు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రమునండు విష్ణుని ధర్మసేతువు అని స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-308-సీ.,

  72) ధర్మసేతువు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- భవిష్యత్తులోది, పదకొండవది అయిన ధర్మసావర్ణి మన్వంతరంలో విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. - వంశం - దేవయోని; తండ్రి - సూర్యుడు; పద్య సం.(లు) - 8-422-ఆ.,

  73) ధర్మాత్ముడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్మాత్ముడు అంటే విష్ణువు. శ్రీహరి స్తోత్రం సనకాదులకు చెప్తూ బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-701-సీ.,

  74) ధర్ముడు-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్ముడు అంటే యమధర్మరాజు. వీరి ప్రసాదం వలన కుంతీదేవికి ధర్మరాజు అనే యుధిష్ఠరుడు పుట్టాడు. లేడి రూపంలో ఉన్న ముని పెట్టిన శాప భయం వలన భార్యలను కవియుటకు బెదరిన పాండురాజునకు కుంతీదేవి ఎడల యమధర్మరాజు అనుగ్రహంతో యుధిష్ఠరుడు; వాయుదేవుని అనుగ్రహంతో భీముడు ; ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అనె ముగ్గురు కుమారులు; మాద్రిదేవి ఎడల అశ్వనీదేవతల అనుగ్రహం వలన నకులుడు, సహదేవుడు అని ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు కలిగారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-673-వ.,

  75) ధర్ముడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఉత్తమమన్వంతరంలో సత్యసేనుడుగా అవతరించిన విష్ణువు తల్లిదండ్రులు సూనృత ధర్ముడు. - వంశం - దేవయోని; భార్య - సూనృత; కొడుకు(లు) - సత్యసేనుడు; పద్య సం.(లు) - 8-16-సీ.,

  76) ధర్ముడు-3 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- పదకొండవ మనువు ధర్మసావర్ణిమననువు పదిమంది పుత్రులలో రెండవవాడు. ఆ మన్వంతరంలో రాజు. - వంశం - మనువు వంశం; తండ్రి - ధర్మసావర్ణి; పద్య సం.(లు) - 8-421

  77) ధర్ముడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధర్ముడు శశిబిందుని మనవడు. శశిబిందుని కొడుకులలో ముఖ్యుడైన పృథుశ్రవుడికి ధర్ముడు జన్మించాడు; ధర్మునకు ఉశనుడు జన్మించి వంద అశ్వమేథయాగాలు చేసాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పృథుశ్రవుడు; కొడుకు(లు) - ఉశనుడు; పద్య సం.(లు) - 9-705-వ.,

  78) ధర్ముడు-5 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధర్ముడు అంటే ధర్మదేవత. ధర్ముడు నరనారాయణుల తండ్రి. ఏకవింశతి అవతారాలలో నాలుగవ అవతారంలో ధర్మునికి భార్యయైన దక్షపుత్రి మూర్తి వలన నరనారాయణుగా అవతరించాడు.
బ్రహ్మదేవుని దక్షిణస్తనము వలన ధర్ముడు (ధర్మము) పుట్టెను
పృథుచక్రవర్తికి పట్టాభిషేకం సమయంలో ధర్ముడు (ధర్మదేవత) విశాల యశోరూపమైన పుష్పమాలికను బహుమానంగా ఇచ్చాడు.
పురంజనోపాఖ్యానంలో పురంజయుడు ప్రమదోత్తమను చూసి, నీవు ధర్ముని (ధర్మదేవతను) భర్తగా కోరి వెదుకుతున్న హ్రీవా? లేక . . అని అడిగాడు
అసిక్ని దక్షుల అరవైమంది పుత్రికలలో, భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అనే పదిమందిని ధర్ముడు వివాహమాడాడు. వారి అందరివలన వలన పుత్రులను పొందాడు. - వంశం - దేవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప; కొడుకు(లు) - ధర్మునివలన 1.భానువుకు వేదఋషభుడు పుట్టాడు. 2.అంబకు విద్యోతుడు పుట్టాడు. 3.కకుబ్దేవికి సంకుటుడు పుట్టాడు. 4.జామిదేవికి దుర్గభూములకు అధిష్ఠాన దేవతలు జన్మించారు. 5.విశ్వకు విశ్వేదేవతలు జన్మించారు. 6.సాధ్యకు సాధ్యగణాలు పుట్టారు.7.మరుత్వతికి మరుత్వతుడు, జయంతుడు అనేవారు కలిగారు. 8.ముహూర్తకు సకల ప్రాణులకు ఆయా కాలాలలో కలిగే ఆయా ఫలితాలాను ఇచ్చే మౌహూర్తికులు అనే దేవసమూహం పుట్టింది. 9.సంకల్పకు సంకల్పుడు జన్మించాడు. 10,వసువుకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే ఎనిమిదిమంది వసువులు పుట్టారు. ; పద్య సం.(లు) - 1-63-వ., 2-125-క., 3-377-సీ., 4-28-వ., 4-751-సీ., 6-252-వ., 6-254-వ., 9-113-వ., 11-63-క.,

  79) ధర్ముడు-6 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- ధర్ముడు అంటే విష్ణువు. శ్రీహరి స్తోత్రం సనకాదులకు చెప్తూ బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు.. విష్ణువు.
కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, "ధర్ముడు", అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 4-703-సీ., 11-77-వ.,

  80) ధర్ముడు-7 ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- ధృవునికి ధృవస్థానాన్ని వరమిస్తూ విష్ణువు ఇలా వర్ణించాడు. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవైఆరువేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు.
శింశుమారచక్రం తోకభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉన్నారు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 4-290-వ., 5.2-97-వ.,

  81) ధర్ముడు-8 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధర్ముడు చంద్రంవంశలో యదువువంశంలోని హేహయుని కొడుకు. ఇతనికొడుకు నేత్రుడు. నేత్రుని కొడుకు కుంతి, అతని కొడుకు మహిష్మంతుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - హేహయుడు; కొడుకు(లు) - నేత్రుడు; పద్య సం.(లు) - 9-701-వ.,

  82) ధర్మేపువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మేపువు చంద్రవంశంలోని రాజు. శర్యాతికి సంయాతి, సంయాతికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు అప్సరస ఘృతాచి అందు ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అని పదిమంది పుత్రులు పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - రౌద్రాశ్వుడు; తల్లి - అప్సరస ఘృతాచి; పద్య సం.(లు) - 9-593-వ.,

  83) ధర్శుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఈ ధర్శుడు ధాత అనే ఆదిత్యునికి సినీవాలీ అను భార్యయందు పుట్టాడు. అదితి సంతానమైన ద్వాదశాదిత్యులలో ఏడవవాడైన ధాతకు కుహువు (చంద్రకళ కనిపించని అమావాస్య), సినీవాలి (చంద్రకళ కనిపించే అమావాస్య), రాక (పౌర్ణమి), అనుమతి (ఒక కళ తక్కువైన చంద్రుడున్న పౌర్ణమి) అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయం(కాలం), సినీవాలికి దర్శ (అమావాస్య), రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు. - వంశం - దేవయోని; తండ్రి - ధాత ; తల్లి - సినీవాలి; పద్య సం.(లు) - 9-507-వ.,

  84) ధాత-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధాత అంటే బ్రహ్మదేవుడు. గ్రంథారంభ ప్రార్థనలో బ్రహ్మదేవుని స్తుతి. . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-3-ఉ., 1-89-ఉ., 2-240-చ., 3-500-ఉ.,

  85) ధాత-2 (){సంజ్ఞా}[భగణ విషయం]:- శింశుమారచక్రం తోక మూల భాగంలో ధాత, విధాత ఉన్నారు. తోకవద్ద ప్రజాపతి, అగ్నీధ్రుడు;. కటిప్రదేశమున సప్తఋషిమండలము ఉన్నారు - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-97-వ.,

  86) ధాత-3 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ధాత. విధాతలు భృగువు పుత్రులు. భృగువునకు ఖ్యాతి అనే భార్యవల్ల ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులూ, శ్రీ అనే కుమార్తె జన్మించారు. ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. - వంశం - ఋషి; తండ్రి - భృగువు; తల్లి - ఖ్యాతి ; భార్య - ఆయతి; నియతి; పద్య సం.(లు) - 4-26-వ.,

  87) ధాత-4 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధాత ద్వాదశాదిత్యులు యందు ఒకడు. అదితి కశ్యపులకు 1వివస్వతుడు 2అర్యముడు 3పూషుడు 4త్వష్ట 5సవిత 6భగుడు 7ధాత 8విధాత 9వరుణుడు 10మిత్రుడు 11శుక్రుడు 12ఉరుక్రముడు అనెడు పన్నెడుమంది అదితి పుత్రులు వీరిని ద్వాదశాదిత్యులు అంటారు.
ధాతకు కుహువు, సినీవాలి, రాక, అనుమతి అని నలుగురు భార్యలు. వారిలో కుహూదేవికి సాయంకాలం, సినీవాలికి దర్శ, రాకకు ప్రాతఃకాలం, అనుమతికి పూర్ణిమ అనే కుమారులు జన్మించారు.
ఇతడు ద్వాదశాదిత్యులలో ఒకడు. సూర్యుడు చైత్ర (మధు) మాసంలో ధాత అను పేరుతో సంచరిస్తాడు. ఈ మాసంలో అతనికి అప్సరస కృతస్థలి; ఋషి పులస్త్యుడు; నాగుడు వాసుకి; రాక్షసుడు హేతి; గంధర్వుడు తుంబురుడు; యక్షుడు రథకృత్తు మున్నగువారు అనుచరులై ఉంటారు. - వంశం - దేవయోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - అదితి ; భార్య - కుహువు; సినీవాలి; రాక; అనుమతి; కొడుకు(లు) - సాయంకాలం; ధర్శుడు; ప్రాతఃకాలం; పూర్ణిముడు; పద్య సం.(లు) - 6-258-వ., 6-507-వ., 12-41-వ.,

  88) ధాతకుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- పుష్కరద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి, ప్రియవ్రతపుత్రుడైన వీతిహోత్రుని రెండవ కొడుకు. పుష్కరద్వీపానికి అధిపతి వీతిహోత్రునికి రమణకుడు, ధాతకుడు అని ఇద్దరు కుమారులు. వీతిహోత్రుడు పుష్కరద్వీపాన్ని తన పుత్రులపేర్లతో రెండు వర్షాలుగా విభజించి వారిని రాజులను చేసాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - వీతి హోత్రుడు ; పద్య సం.(లు) - 5.2-70-వ.,

  89) ధాతుత్రయము- (){జాతి}[అవయవము]:- ధాతుత్రయము అనగా వాత, పిత్త, శ్లేష్మములు - వంశం - అవయవము; పద్య సం.(లు) - 10.2-1121-సీ.,

  90) ధాతువు-1 (){జాతి}[పరికరములు]:- ధాతువు అంటే ఖనిజములు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 3-420-మ., 4-134-సీ.,

  91) ధాతువు-2 (){జాతి}[అవయవం]:- ధాతువు అంటే ప్రకృతి భేదము. 1వాత 2పైత్య 3శ్లేష్మ ప్రకృతులు నాలుగూ ధాతుభేదములు. శ్రీకృష్ణుడు కబ్జ కోరిన వరం తీర్చడానికి, ఆమె గృహమునకు వెళ్ళినప్పుడు, జాతి, కాలము, కళ, బలము, దేశము, భావము, చేష్ట, ధాతువు, ప్రాయము, గుణము, దశ, హృదయము, దృష్టి, సంతుష్టి ఇన్నిటిని ఎరిగి, మగువ మనసును దోచి, శ్రీకృష్ణుడు, అనేక విధముల కుబ్జను మన్మథసౌఖ్యాలలో ఓలలాడించి తృప్తి పరచాడు. - వంశం - అవయవం; పద్య సం.(లు) - 10.1-1495-ఉ.,

  92) ధాత్రి- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధాత్రి అంటే భూమండలం. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-290-చ., 1-396-వ., 2-115-వ.,

  93) ధాత్రీఛందం- (){జాతి}[విద్య]:- శ్రీమన్నారాయణుని సప్తధాతువులలో రోమాలు ఉష్ణికం ఛందస్సనీ, చర్మం "ధాత్రీఛందస్స"నీ, మాంసం త్రిష్టుప్ ఛందస్సనీ, స్నాయువు అనుష్టుప్ ఛందస్సనీ, శల్యం జగతీఛందస్సనీ, మజ్జ పంక్తిచ్ఛందస్సనీ, ప్రాణం బృహతీ ఛందస్సనీ వ్యవహరిస్తారు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 2-89-వ.,

  94) ధాత్రీజమ- (){జాతి}[వృక్ష]:- ధాత్రీజము అంటే చెట్టు. జరాసంధుడు మధురను ముట్టడించాడు. కృష్ణుడ బలరాముడు పారిపోతుండగా వెంట తరుముతున్న జరాసంధుడు నిందించడంలో చక్కటి నిందా స్తుతి ప్రయోగించారు. నాతో యుద్దం అంటే ఓ గోపాలకృష్ణా! ఇది యువతిని చంపుట (పూతన), కొంగను ద్రుంచుట (బకాసురుడు), ధాత్రీజములను కూల్చుట (జంట మద్దులు), గాడిదను గెడపుట (ధేనుకాసురుడు), పామును పారద్రోలుట (కాళియుడు), . . కాదు అన్నాడట - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 10.1-1545-మ.,

  95) ధాత్రీపతి- (పురుష){జాతి}[మానవ యోని]:- ధాత్రీపతి అంటే రాజు. మిథిలానగరాన్ని ఏలెడి వాడు బహుళాశ్వుడు అను ధాత్రీపతి. ఇతనిని ఈ పురిలోని విప్రుని చూచుటకోసం శ్రీకృష్ణుడు ఋషులని తీసుకొని వెళ్ళాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-199-వ., 3-20-క., 10.2-1178-ఉ,.

  96) ధాత్రీపాలకుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధాత్రీపాలకుడు అంటే రాజు. శృంగి పరీక్షిత్తును శపిస్తాను అంటూ. ధాత్రీపాలకు శపియింతు అన్నాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-472-క.,

  97) ధాత్రీశ్వరుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధాత్రీశ్వరుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-311-మ., 1-375-శా.,

  98) ధాత్రీసురుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధాత్రీసురుడు అంటే బ్రాహ్మణుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-174-సీ.,

  99) ధారణ- (){సంజ్ఞా}[విద్య]:- ధారణ , ధారణా యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అను అష్ట యోగాంగములలో ఒకటి - వంశం - విద్య; పద్య సం.(లు) - 2-13-క.,

  100) ధారిణి- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- ఈ ధారిణి జ్ఞానవిజ్ఞాన పారగురాలు, బ్రహ్మినిష్ఠపరురాలు. అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, "ధారిణి" అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు - వంశం - దేవయోని; తండ్రి - అగ్నులు; తల్లి - స్వధ; పద్య సం.(లు) - 4-34-వ.,

  101) ధారుణి- (){సంజ్ఞా}[ప్రదేశము]:- ధారుణి అంటే భూమి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-382-క., 4-939-సీ.,

  102) ధారుణీశ్వరచంద్రుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధారుణీశ్వరచంద్రుడు అంటే రాజోత్తముడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-92-మ.,

  103) ధారుణీశ్వరుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధారుణీశ్వరుడు అంటే రాజోత్తముడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-106-చ.,

  104) ధార్తరాష్టులు- (పురుష){జాతి}[కౌరవవంశం]:- ధృతరాష్ట్రుని కొడుకులు ధార్తరాష్ట్రులు, వీరినే కౌరవులు అని కూడా అంటారు. (వైశ్యసతికి పుట్టినయుయుత్సుడు కూడా దార్త్రాష్ట్రుడే కాని ఇతను పాండవుల పక్షాన ఉన్నాడు) వీరిని పాడవులు కురుక్షేత్రంలో జయించారు.
సాంబుని కౌరవులు బంధించారని, యాదవులు కౌరవులపైకి వెళ్ళబోతుంటే, బలరాముడు వారు మనకు దగ్గర బంధువులు, నేను వెళ్ళి మాట్లాడతాను అన్నాడు.
కురుక్షేత్ర యుద్దంలో రాజులు అందరూ మరణించారని, భీముడు దుర్యోధనుడు గదాయుద్దానికి సిద్ధపుతున్నారని తెలిసి బలరాముడు వారిని వారించడానికి బలరాముడు వెళ్ళాడు. - వంశం - కౌరవవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; పద్య సం.(లు) - 1-177-శా., 1-190-మత్త., 3-2-ఉ., 10.2-572-తే., 10.2-953-వ.,

  105) ధార్తరాష్ట్ర-1 ( ){జాతి}[గగనచర]:- ధార్తరాష్ట్ర అంటే హంసలు అని ధృరాష్ట్రుని కొడుకులైన కౌరవులు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - గగనచర; పద్య సం.(లు) - 1-39-వ.,

  106) ధార్తరాష్ట్ర-2 (పురుష){జాతి}[కౌరవవంశం]:- ధార్తరాష్ట్ర అంటే ధృరాష్ట్రుని కొడుకులైన కౌరవులు అని హంసలు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - కౌరవవంశం; పద్య సం.(లు) - 1-39-వ.,

  107) ధార్తరాష్ట్రుడు-1 (పురుష){సంజ్ఞా}[కౌరవవంశం]:- ధృతరాష్ట్రుని కొడుకైన దుర్యోధనుడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడు ధృతరాష్ట్రుని కొడుకైన దుర్యోధనుని ఇంటికి వెళ్ళలేదు. విదురుని ఇంటికి వెళ్ళాడు. - వంశం - కౌరవవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; తల్లి - గాంధారి; పద్య సం.(లు) - 3-6-క.,

  108) ధార్తరాష్ట్రుడు-2 (పురుష){సంజ్ఞా}[కౌరవవంశం]:- ధృతరాష్ట్రుని కొడుకైన దుశ్శాసనుడు. సభలో ద్రౌపది చీరలు ఒలుస్తుంటే, శ్రీకృష్ణుడు ఆమె మానం కాపాడాడు. - వంశం - కౌరవవంశం; తండ్రి - ధృతరాష్ట్రుడు; పద్య సం.(లు) - 1-189-సీ.,

  109) ధార్మికుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- ధార్మికుడు అంటే పుణ్యాత్ముడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-150-సీ., 3-485-తే.,

  110) ధార్ష్ట్యము- (పురుష){జాతి}[మానవ యోని]:- ధార్ష్ట్యము అంటే స్వాయంభువ మనవు కొడుకైన ధృష్ణుని సంతాన వలన ఏర్పిడిన వంశము. వీరు బ్రాహ్మణత్వము స్వీకరించారు - వంశం - మానవ యోని; తల్లి - ధృష్టుడు; పద్య సం.(లు) - 9-42-వ.,

  111) ధిషణ- (స్త్రీ){సంజ్ఞా}[దక్ష వంశం]:- ధిషణ దక్షునికి అసిక్ని యందు కలిగిన అరవైమంది (60)లోనూ పదహారవ (16) పుత్రిక. ఈమె భర్త వేదశిరసుడు. వీరిక దేవలుడు, వయనుడు, మనువు అని ముగ్గరు పుత్రులు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - వేదశిరుడు; కొడుకు(లు) - దేవలుడు; వయునుడు; మనువు ; పద్య సం.(లు) - 6-254-వ.,

  112) ధీ- (స్త్రీ){సంజ్ఞా}[దైవయోని]:- ఈ ధీ (అర్థం బుద్ధి, మతి అని నిఘంటువు)ఏకాదశ నీలలోహితు (రుద్రు)లకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు మన్యువు నామం కలిగి భార్య ధీతో, చంద్రుడు స్థానంగా కలిగి ఉంటాడు. బ్రహ్మదేవుడు సృష్టిక్రమంలో సనకాదులను సృష్టించి, ప్రపంచాన్ని వృద్ధిచేయండి అన్నాడు, మోక్షాసక్తులైన వారు అంగీకరించలేదు. వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్నా, బ్రహ్మదేవుని భృకుటి నుండి నీలలోహితుడు పుట్టాడు. పుట్టగానే రోదించుటచే రుద్రుడవు అంటూ పన్నెండు నామాలు పన్నెండుగురు భార్యలను పన్నెండు వాసస్థానములను బ్రహ్మదేవుడు నిర్దేశించాడు. వానిలో మొదటినామం మన్యువు. - వంశం - దైవయోని; భర్త - మన్యువు; పద్య సం.(లు) - 3-369-క.,., 3-370-వ.,

  113) ధుంధుమారుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంతరం) అంటే దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) ఒక రాక్షసుని సంహరించిన సూర్యవంశపు రాజు కువలాయాశ్వుడు. ఇతడు సూర్యవంశంలోని శావస్తి నగరం నిర్మించిన శావస్తి మనవడు. బృహదస్వుని కొడుకు. సూర్యవంశపువాడైన కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక, కువలయాశ్వుడు దుందుమారుడు అని ప్రసిద్దుడు అయ్యాడు. కువలయాశ్వుడి పుత్రులు అందరు బూడిద అయిపోయారు. వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే తప్పించుకొన్నారు.
దుంధుమారుడు రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - కువలయాశ్వుడు; కొడుకు(లు) - వెయ్యిమంది వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను ముగ్గురు (3) మాత్రమే దుందుడని రాక్షసునితో యుద్ధంలో చావు తప్పించుకొన్నారు. ; పద్య సం.(లు) - 9-163-వ., 9-164-క., 9-165-వ., 12-18-వ.,

  114) ధుంధువు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) ఒక రాక్షసుడు. సూర్యవంశపువాడైన కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక, కువలయాశ్వుడు దుందుమారుడు (ధుంధుమారుడు అని పాఠ్యంచరం) అని ప్రసిజదుడు అయ్యాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-164-క., 9-165-వ.,

  115) ధూమ్రకేతుడు.- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ సూర్యవంశపు ధూమ్రకేతుడు తృణబిందుని కొడుకు. తృణబిందుని అలంబుస వరించింది. వారికి ఇలబిల అని ఒక కూతురు, విశాలుండు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు అని ముగ్గురు కొడుకులు. ధూమ్రకేతు సోదరి ఇలబిల విశ్రవసుల కొడుకు ఐలబిలుడు అనే కుబేరుడు. అన్నగారు విశాలుడు వంశవర్ధనుడు మఱియు వైశాలి నగరం నిర్మించినవాడు. అతనికి హేమచంద్రుడు; అతనికి ధూమ్రాక్షుడు; అతనికి సహదేవుడు; అతనికి కృశాశ్వుడు; అతనికి సోమదత్తుడు పుట్టారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - తృణబిందుడు; తల్లి - అలంబుస; పద్య సం.(లు) - 9-47-క., 9-48-వ.,

  116) ధూమ్రకేతువు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఈ ధూమ్రకేతువు భరతుని అయిదుగురు కొడుకులలో అయిదవవాడు. భరతుడు రాజ్యంఏలుతూ విశ్వరూపుని పుత్రికైన పంచజనిని వివాహమాడాడు. ఆ పంచజని భరతులకు సుమతి, రాష్ట్రభృక్కు, సుదర్శనుడు, ఆచరణుడు, "ధూమ్రకేతువు" అనే అయిదుగురు కొడుకులు. అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది. - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - భరతుడు; తల్లి - పంచజని ; పద్య సం.(లు) - 5.1-92-మ., 5.1-93-వ.,

  117) ధూమ్రకేశుడు-1 (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- పృథుచక్రవర్తి అర్చిల అయిదుగురు కొడుకులలో నాలుగవ వాడు. ఆ అయిదుగురు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు. విజితాశ్వుడు మహారాజైన తర్వాత తన నలుగురు తమ్ముళ్ళలో హర్యశ్వునకు తూర్పుదిక్కును, ధూమ్రకేశునకు దక్షిణ దిక్కును, వృకునకు పడమటి దిక్కును, ద్రవిణునకు ఉత్తర దిక్కును సమంగా పంచి ఇచ్చాడు. - వంశం - మానవ యోని; తండ్రి - పృథుచక్రవర్తి; తల్లి - అర్చి; పద్య సం.(లు) - 4-640-క., 4-673-క.,

  118) ధూమ్రకేశుడు-2 (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- ఈ ధూమ్రకేశుడు అసిక్ని దక్షుల పుత్రి యైన అర్చికి కృశాశ్వునకు పుట్టినవాడు. - వంశం - దక్ష వంశం; తండ్రి - కృశాశ్వుడు; తల్లి - అర్చి ; భర్త - కృశాశ్వుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  119) ధూమ్రకేశుడు-3 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ ధూమ్రకేశుడు దానవుడు. దనవు సంతానాన్ని దానవులు అంటారు. కశ్యపునకు భార్యయైన దక్షపుత్రి దనువునందు ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, "ధూమ్రకేశుడు", విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని పద్దెనిమిది మంది కుమారులు.
ఈ ధూమ్రకేశుడు వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధంలో వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు. రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్యగణాలు, అశ్వినీదేవతలు, పితృదేవతలు, విశ్వేదేవుళ్ళు, అగ్ని, యముడు, నైరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన వారు ఇంద్రుని వైపు; నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూతసంతాపనుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్య దానవ యక్ష రాక్షసులు వృత్రాసురుని వైపు పోరాడారు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు ; తల్లి - దనువు ; పద్య సం.(లు) - 6-258-వ., 6-363-వ.,

  120) ధూమ్రవర్ణం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- ప్లక్షద్వీపంలోని క్షేమవర్షంలో ధూమ్రవర్ణం అను కుల పర్వతము, సుప్రభాత అను మహానది ఉన్నాయి.. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-60-వ.,

  121) ధూమ్రాక్షుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ధూమ్రాక్షుడు సూర్యవంశపు వాడు. తృణబిందు అలంబుసలకప ఇలబిల అని ఒక కూతురు, విశాలుండు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు అని ముగ్గురు కొడుకులు. ఇలబిల విశ్రవసుల కొడుకు ఐలబిలుడు అనే కుబేరుడు. అన్నగారు విశాలుడు వంశవర్ధనుడు మఱియు వైశాలి నగరం నిర్మించినవాడు. అతనికి హేమచంద్రుడు; అతనికి "ధూమ్రాక్షుడు"; అతనికి సహదేవుడు; అతనికి కృశాశ్వుడు; అతనికి సోమదత్తుడు పుట్టారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - హేమచంద్రుడు; కొడుకు(లు) - సహదేవుడు; పద్య సం.(లు) - 9-47-క., 9-48-వ.,

  122) ధూమ్రాక్షుడు-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ ధూమ్రాక్షుడు రావణునికి చెందిన రాక్షసుడు. సమరంలో వానరవీరుడు పవనుని చేతిలో మరణించాడు. రామకార్యంకోసం లంక ముట్టడించిన వానరసేన అల్లకల్లోలం చేయగా. రావణాసురుడు పంపించగా కుంభుడు, నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు యుద్ధానికి వచ్చారు. వారిని సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు సంహరించారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-291-వ.,

  123) ధూమ్రానీక వర్షం- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- ధూమ్రానీక వర్షం శాకద్వీపాన్ని మేధాతిథి విభాగించిన సప్త వర్షాలలోది. ఈ వర్షానికి అదిపతి ధూమ్రానీకుడు. ఈ వర్షంలో శతకేసరం, అను సరిహద్దు పర్వతము, అపరాజిత అను నది ఉన్నాయి. శాకద్వీపవాసులు వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. వీరిలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  124) ధూమ్రానీకుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- ధూమ్రానీకుడు ధూమ్రానీక వర్షం అధిపతి. శాకద్వీపాన్ని మేధాతిథి సప్త వర్షాలుగా విభాగించాడు. ఈ ధూమ్రవర్షానికి అదిపతి ధూమ్రానీకుడు. ఈ వర్షంలో శతకేసరం, అను సరిహద్దు పర్వతము, అపరాజిత అను నది ఉన్నాయి. ఈ శాకద్వీపవాసులు వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. వీరిలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు. - వంశం - మానవ యోని; తండ్రి - మేధాతిథి ; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  125) ధూర్జటి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధూర్జటి అంటే శివుడు. తపోజ్ఞాన సత్త్వ సంపన్నులైన మనువు, బ్రహ్మ, శివుడు మొదలైనవారే, శివా! నీ మహామహిమను వర్ణించలేరు అని ప్రచేతసులు స్తుతించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-935-మ.,

  126) ధూర్తయుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధూర్తయుడు చంద్రవంశపు అజకునికొడుకైన కుశుని రెండవ కొడుకు. కుశునికి కుశాంబువు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు పుత్రులు - వంశం - చంద్రవంశం; తండ్రి - కుశుడు; పద్య సం.(లు) - 9-422-వ.,

  127) ధృతకేతువు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ధృతకేతువు, దీప్తకేతువు మొదలగువారు తొమ్మిదవవాడైన దక్షసావర్ణి పుత్రులు, ఆ కాలంలో వీరు రాజులు అవుతారు. పరులు, మరీచులూ, గర్గులు మొదలైనవారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. ద్యుతిమంతుడు మొదలైనవారు సప్తఋషులు అవుతారు. విష్ణువు దనుజహరణుడు ఆయుష్మంతుడికీ అంబుధారకూ జన్మిస్తాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - దక్షసావర్ణి; పద్య సం.(లు) - 8-417-వ.,

  128) ధృతగిరి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృతగిరి అంటే గిరిధారి శ్రీకృష్ణుడు. చాణూరుడు కృష్ణునికి లొంగినప్పుడు ధృతగిరి అని పేర్కొన్నారు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-1361-క.,

  129) ధృతదేవ- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృతదేవ దేవకీదేవి ఆరుగురు అక్కలలోనూ పెద్దక్క. ధృతదేవ, శాంతిదేవ, నుపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అను ఈ ఏడుగురు అక్కచెల్లెళ్ళు వసుదేవుని పెళ్ళాడారు. వీరి తండ్రి దేవకుడు. ఈ ధృతదేవ యందు వసుదేవునికి కలిగిన పుత్రుడు త్రివృష్ఠుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవకుడు; భర్త - వసుదేవుడు; కొడుకు(లు) - త్రిపృష్టుడు; పద్య సం.(లు) - 9-712-వ., 9-722-వ.,

  130) ధృతమందరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధృతమందరుడు అంటే కూర్మావతారంలో మందరపర్వతాన్ని ధరించినవాడైన విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-26-వ.,

  131) ధృతరాష్ట్రసూనుడు - (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృతరాష్ట్రసూనుడు దుర్యోధనుడు - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 10.1-1515-మ.,

  132) ధృతరాష్ట్రుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృతరాష్ఠ్రుడు కురువంశ రాజు, కౌరవుల తండ్రి, పాండురాజు అన్నగారు. కౌరవుల పేర్లు ఇక్కడ నొక్కి చూడగలరు
భీష్మ నిర్యాణానంతరం ధర్మరాజు గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో రాజ్యాన్ని స్వీకరించాడు. పాండవుల వద్ద ఉన్న ధృతరాష్ట్రుడు విదురుని ప్రభోదం విని, విదుర గాంధారీల తోకూడి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ప్రాణ విడిచాడు.
దుర్యోధనుడు మొదలైన తన కుమారులను ధృతరాష్ట్రుడు అతిగారాబం చేస్తూ పెంచాడు.
శ్రీకృష్ణుడు రాయబారానికి ధృతరాష్ట్రుని వదందకు వెళ్ళి నచ్చచెప్పాడు. వినడంలేదని, విదురుని పిలిపించాడు. దుర్యోధనుడు విదురుని అవమానించడంతో, అతను లేచివెళ్ళిపోయాడు..
విచిత్రవీర్యునికి భార్యలు కాశీరాజు పుత్రికలు అంబిక అంబాలిక. అతను క్షయరోగంతో మరణించగా, తల్లి సత్యవతీదేవి ఆదేశంమేరకు అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజును, అంబాలిక సేవకురాలు యందు విదురుని పుట్టించాడు.అంత, ధృతరాష్ట్రునికి భార్య గాంధారి యందు దుర్యోధనాదులగు కొడుకులను నూరుమందిని (100) దుశ్శల అను కుమార్తె జన్మించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - విచిత్రవీర్యుడు; తల్లి - అంబిక; భార్య - గాంధారి; కొడుకు(లు) - కౌరవులు వీరు దుర్యోధనుడు ఆదులు మంది; కూతురు(లు)- దుశ్శల; పద్య సం.(లు) - 1-176-వ., 1-177-శా., 1-228-వ., 1-310-వ. నుండి 1-317-వ. వరకు, 3-11-చ., 3-21-క., 9671-వ. నుండి 9-673-వ., 10.1-1511-వ., 10.2-1044-వ.,

  133) ధృతరాష్ట్రుడు-2 (పురుష){సంజ్ఞా}[గంధర్వుడు]:- ఇతడు ఆశ్వయుజ (ఇషము) మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో త్వష్ట అను పేరుతో, తిలోత్తమ, ఋచీకతనయ (జమదగ్ని), కంబళాశ్వుడు, బ్రహ్మపేతుడు,, ధృతరాష్ట్రుడు, శతజిత్తు, ఇషంబరుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 12-43-వ.,

  134) ధృతరాష్ట్రుడు-3 (పురుష){సంజ్ఞా}[నాగులు]:- పాతాళలోకంలోని ప్రముఖ నాగులలో ఒకడు.
వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు (అధోలోకం అయిన) పాతాళలోక వాసులైన మహానాగులు. వారిలో కొందరు ఐదు తలలవారు, కొందరు నూరు తలలవారు, వేయి తలలవారూ ఉన్నారు. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - వంశం - నాగులు; పద్య సం.(లు) - 5.2-121-వ.,

  135) ధృతవ్రత- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- ధృతవ్రత (లోపాముద్ర) అగస్త్యుని భార్య. ధృతచ్యుతుని తల్లి - వంశం - ఋషి; తండ్రి - మలయధ్వజుడు; భర్త - అగస్త్యుడు; కొడుకు(లు) - దృఢచ్యుతుడు; పద్య సం.(లు) - 4-830-సీ., 4-831-క.,

  136) ధృతవ్రతుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- రుద్రుని ఏకాదశ నామాలలో ఒకటి. బ్రహ్మదేవుని ముడిపడిన బొమముడి నుండి ఉద్భవించిన రుద్రునికి, బ్రహ్మదేవుడు ఇచ్చిన ఏకదశనామాలలో ధృతవ్రతుడు నామం కలిగి భార్య దీక్షతో, ఇంద్రియాలు స్థానంగా కలిగి ఉంటాడు. రుద్రుని ఏకాదశనామాలు (మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు) ఏకాదశ భార్యలు (ధీ, వృత్తి, అశన, ఉమ, నియుతి, సర్పి, ఇల, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష). ఏకాదశ స్థానాలు (చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు) - వంశం - దైవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; భార్య - దీక్ష; పద్య సం.(లు) - 3-369-క.,., 3-370-వ.,

  137) ధృతవ్రతుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధృతవ్రతుని తండ్రి చంద్రవంశంలోని ధృతి. ధృతి కొడుకు ధృతవ్రతుడు. అతని కుమారుడు సత్యకర్ముడు, అతని కొడుకు అతిరథుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - దృతి; కొడుకు(లు) - సత్యకర్ముడు; పద్య సం.(లు) - 9-697-వ.,

  138) ధృతవ్రతుడు-3 (పురుష){సంజ్ఞా}[కర్దమ వంశం]:- ఈ ధృతవ్రతుడు కర్దమపుత్రి చిత్తికి భర్త అథర్వునికి కొడుకు. ఆ దంపతులకు ఈ ధృతవ్రతుడు, దధ్యంచుడు అని ఇద్దరు కొడుకులు. దధ్యంచుడు అశ్వశిరస్సు కలవాడు. - వంశం - కర్దమ వంశం; తండ్రి - అథర్వుడు; తల్లి - చిత్తి; పద్య సం.(లు) - 4-26-వ.,

  139) ధృతి-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధృతి తండ్రి చంద్రవంశంలోని విజయుడు తల్లి సంభూతిల. ఇతని కొడుకు ధృతవ్రతుడు. అతని కుమారుడు సత్యకర్ముడు, అతని కొడుకు అతిరథుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - విజయుడు; తల్లి - సంభూతి; కొడుకు(లు) - ధృతవ్రతుడు; పద్య సం.(లు) - 9-697-వ.,

  140) ధృతి-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ ధృతి సూర్యవంశంలోని మైథిలి రాజులులోని వీతిహవ్యునకు పుత్రుడు. ఇతని కొడుకు బహుళాస్వుడు, అతని కుమారుడు కృతి. కృతి కొడుకు మహావశి. మహావశి మైథిలులలో చివరివాడు.ఈ ధృతికి పూర్వుడైన సీరధ్వజుడు యాగంకోసం నాగలితో దున్నతుంటే సీతాదేవి పుట్టింది. సీతాదేవిని మైథిలి రాకుమారి కనుక మైథిలి అని కూడా అఁటారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - వీతిహవ్యుడు; కొడుకు(లు) - బహుళాశ్వుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  141) ధృతుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ధృతుడు సూర్యవంశంవాడు, మైథిలుడు, సీతాదేవి తండ్రి సీరధ్వజుని తరువాతి తరాలలోని వాడు. జయుని కొడుకు విజయుడు. విజయుని పుత్రుడు "ధృతుడు"; ధృతునకు అనఘుడు; అనఘునకు వీతిహవ్యుడు; వీతిహవ్యునకు ధృతి; ధృతికి బహుళాశ్వుడు; బహుళాశ్వునకు కృతి; కృతికి మహావశి పుట్టారు. ఈ రాజులను మైథిలులు అంటారు. వీరు బ్రహ్మజ్ఞానం పొంది, పరబ్రహ్మంతో ఎడతెగని అనుసంధానం కలిగి ఉంటారు. - వంశం - సూర్యవంశం; తండ్రి - విజయుడు; కొడుకు(లు) - అనఘుడు; పద్య సం.(లు) - 9-374-వ.,

  142) ధృష్టకేతుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ ధృష్టకేతుడు సూర్యవంశపువాడు. నిమి తరువాత తరంవాడు. నిమి మృతదేహం మధించగా జనకుడు పుట్టాడు. ఇతనికి వైదేహుడు, మిథులుడు అని సార్థకనామాలు ఉన్నాయి. మిథిలానగరం ఈయనే నిర్మించాడు. ఇతనికి ఏడవతరంవాడైన సుధృతి కొడుకు ఈ ధృష్టకేతుడు. ధృష్టకేతుని కొడుకు హర్యశ్వుడు. అతనికి మరువు పుట్టాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - సుధృతి; కొడుకు(లు) - హర్యశ్వుడు; పద్య సం.(లు) - 9-372-వ.,

  143) ధృష్టకేతుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టకేతుడు కేకయదేశపు రాజు, శ్రుతకీర్తి భర్త. ఈ దంపతులకు ప్రతర్థనాదులు ఐదుగురు కొడుకుల పుట్టారు. శ్రుతకీర్తి కృష్ణుని మేనత్త, కుంతీదేవి సహోదరి, శూరుని మూడవ కుమార్తె,
శ్రుతకీర్తి ధృష్టకేతులకు భద్ర అని కూతురు సందర్శనుడను కొడుకు ఉన్నారు. ఈ భద్రను శ్రీకృష్ణుడు వివాహమాడాడు. - వంశం - చంద్రవంశం; భార్య - శ్రుతకీర్తి; కొడుకు(లు) - సందర్శన, ప్రతర్థనాదులు ఐదుగురు; కూతురు(లు)- భద్ర; పద్య సం.(లు) - 9-722-వ., 10.2-145-మ., 10.2-1044-వ.,

  144) ధృష్టకేతువు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టకేతువు పాంచాల రాజు, ద్రౌపది మేనల్లుడు. ధృష్టద్యుమ్నుని కొడుకు. పాంచాల రాజు సుజన్మకృత్తునకు వందమంది పుత్రులు పుట్టారు. వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు; పృషతునకు ద్రుపదుడు; ద్రుపదునకు దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. దృష్టద్యుమ్నునకు దృష్టకేతువు జన్మించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ధృష్టద్యుమ్నుడు; పద్య సం.(లు) - 9-659-వ., 10.2-1044-వ.,

  145) ధృష్టకేతువు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టకేతువు చంద్రవంశంలోని సత్యకేతువు కొడుకు. ధృష్టకేతువు కొడుకు సుకుమారుడు. వీరి పూర్వజుడు కువలయాశ్వుని పుత్రుడైన అలర్కుడు. అలర్కునకు సన్నతి; అతనికి సునీతుడు; అతనికి సుకేతుడు; అతనికి ధర్మకేతువు; అతనికి సత్యకేతువు; అతనికి ధృష్టకేతువు; ఆ ధృష్టకేతువుకు సుకుమారుడు; సుకుమారునికి వీతిహోత్రుడు; వీతిహోత్రునకు భర్గుడు; భర్గునకు భార్గభూమి; పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - సత్యకేతువు; కొడుకు(లు) - సుకుమారుడు; పద్య సం.(లు) - 9-501-వ., 9-722-వ.,

  146) ధృష్టద్యుమ్నుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టద్యుమ్నుడు ద్రౌపది సోదరుడు. పాంచాల రాజులలో ప్రముఖుడైన ద్రుపదుని కొడుకు
సూతుడు శౌనకాదులకు చెప్తున్నాడు. ఇతను కౌరవ పాండవ యుద్ధంలో పాండవుల సేనానాయకుడు. భాగవతం అనే వేదాన్ని పఠించడం ద్వారా మోక్షం సుళువుగా దొరుకుతుంది. పరీక్షిత్తు వృత్తాంతం, కృష్ణోదయం చెప్తాను. కౌరవలతో, ధృష్టద్యుమ్నుడు సైన్యాద్యక్షుడుగా పాండవుల చేసిన కురుక్షేత్ర యుద్దం తరువాత భీముడు దుర్యోధనుని తొడలు విరిచి కూల్చాడు....
పాంచాల రాజు సుజన్మకృత్తునకు వందమంది పుత్రులు పుట్టారు. వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు; పృషతునకు ద్రుపదుడు; ద్రుపదునకు దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. దృష్టద్యుమ్నునకు దృష్టకేతువు జన్మించాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ద్రుపదుడు; కొడుకు(లు) - దృష్టకేతువు; పద్య సం.(లు) - 1-142-వ., 9-659-వ.,

  147) ధృష్టవర్ముడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టవర్ముడు చంద్రవంశంలోని అక్రూరుని సోదరుడు. వీరికి మరొక పదిమంది సోదరులు ఒక సోదరి ఉన్నారు యుథాజిత్తునకు శిని, అనమిత్రుడు పుట్టారు. అనమిత్రునికి నిమ్నుడు; నిమ్నునికి సత్రాజిత్తు, ప్రసేనుడు అని ఇద్దరు జన్మించారు. ఇంకను అనమిత్రునికి శిని అను పేరుతో ఇంకొకడు ఉన్నాడు. అతనికి కొడుకు సత్యకుడు; అతనికి యుయుధానుడు అని ప్రసిద్ధుడైన సాత్యకి; జన్మించాడు. ఇంకను అనమిత్రునకు పృశ్ని అని ఇంకొక పుత్రుడు ఉన్నాడు. అతనికి శ్వఫల్క, చిత్రకుడు పుట్టారు; వారిలో శ్వఫల్కునకు గాందిని అందు అక్రూరుడు, అనసంగుడు, సారమేయుడు, మృదుకుడు, మృదుపచ్చివుడు, వర్మదృక్కు, "ధృష్టవర్ముడు", క్షత్రపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అని పన్నెండుమంది కొడుకులు, సుచారువు అనె ఆడపిల్ల పుట్టారు; - వంశం - చంద్రవంశం; తండ్రి - శ్వఫల్కుడు; తల్లి - గాంధిని; పద్య సం.(లు) - 9-712-వ.,

  148) ధృష్టి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధృష్టి చంద్రవంశపు శశిబిందుని వంశంలోని వాడు. కృథునకు కొడుకు కుంతి; కుంతికి పుత్రుడు ధృష్టి; అతని కొడుకు నిర్వృతి; నిర్వృతి కొడుకు దశార్హుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కుంతి; కొడుకు(లు) - నిర్వృతి; పద్య సం.(లు) - 9-709-వ.,

  149) ధృష్టుడు-1 (పురుష){జాతి}[విద్య]:- ధృష్టుడు అంటే చతుర్విధనాయకులలో ఒకడు - వంశం - విద్య; పద్య సం.(లు) - 4-775-సీ.,

  150) ధృష్టుడు-2 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ధృష్టుడు వైవశ్వత మనువు పదిమంది కొడుకులలో మూడవవాడు. శ్రద్ధాదేవి, వైవశ్వతమనువుల ఆ పదిమంది కొడుకులు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. వీరిలో కరూశునికి కొంతమంది కారూశులు అను రాజులు పుట్టారు. ఉత్తరదిక్కు రాజ్యాలు పాలించారు. ధృష్ఠుని వలన ధార్ష్ఠము అనె వంశము ఏర్పడి భూలోకములో బ్రాహ్మణత్వం స్వీకరించింది. నృగుని వంశములో సుమతి జన్మించాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - వైవశ్వతమనువు; తల్లి - శ్రద్ధాదేవి; కొడుకు(లు) - దార్ష్ట్రము అను వంశం బ్రహ్మజ్ఞానులు; పద్య సం.(లు) - 8-412-వ., 9-8-సీ., 9-9-వ., 9-42-వ.,

  151) ధేనుకవనము- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- ధేనుకాసురుని తాటితోపు పెరు ధేనుకవనము. ఇక్కడే బలరామ కృష్ణులు ధేనుకాసురుని అతని అనుచరులను సంహరించారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-626-క.,

  152) ధేనుకాసురుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షసయోని]:- ధేనుకాసురవధ. శ్రీదాముడు ఒక మంచి ధేనుకాసురుడు ఉన్న తాడితోపు గురించి చెప్పాడు. బలరామ కృష్ణులు తాటితోపుకు వెళ్ళి ధేనుకాసురుని అతని అనుయాయులను రూపుమాపారు. అంతట దేనుకవనంలో గోపకులు ఆ తాడిపండ్లు తనివితీరా తిన్నారు. ఆవులు వనంలోని పచ్చికలు కడుపునిండా మేసాయి. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 10.611-వ. నుండి 10.1-626-క. వరకు

  153) ధేనుకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ధేనుకుడు కృష్ణుడు రూపుమాపిన రాక్షసులలో ఒకడు.
ధేనుకుడు కంసుని అనుచరుడు. కంసుడు నారదుని వలన నందుడు, వసుదేవుడు మున్నగువారందరు దేవతలు తాను రాక్షసుడను మున్నగునవి వినిన పిమ్మట, బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, "ధేనుకుడు", బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మున్నగు రాక్షసులను కూడి యుద్ధాలు చేసి యాదవులను అందరిని ఓడించి తానే ఏలసాగాడు
ధేనుకాసురవధ. శ్రీదాముడు ఒక మంచి ధేనుకాసురుడు ఉన్న తాడితోపు గురించి చెప్పాడు. బలరామ కృష్ణులు తాటితోపుకు వెళ్ళి ధేనుకాసురుని అతని అనుయాయులను రూపుమాపారు. అంతట దేనుకవనంలో గోపకులు ఆ తాడిపండ్లు తనివితీరా తిన్నారు. ఆవులు వనంలోని పచ్చికలు కడుపునిండా మేసాయి. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 2-190-చ., 10.1-56-వ., 10.611-వ. నుండి 10.1-626-క. వరకు, 11-7-సీ.,

  154) ధేనుమతి- (స్త్రీ){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ధేనుమతి ప్రియవ్రతుని వంశంలోని దేవద్యుమ్నుని భార్య, వీరి పుత్రుడు పరమేష్టి. దేవద్యుమ్నునికి “ధేనుమతి” వల్ల “పరమేష్ఠి” పుట్టాడు. అతనికి “సువర్చల” వల్ల “ప్రతీహుడు” కలిగాడు. ఆ మహానుభావుడు జనులందరికీ బ్రహ్మోపదేశం చేసి పరిశుద్ధమైన మనస్సుతో హరి స్మరణ చేస్తూ ఉండేవాడు. అతనికి యజ్ఞాలు చేయడంలో నిపుణులైన “ప్రతిహర్త”, “ప్రస్తోత”, “ఉద్గాత” అనే ముగ్గురు కుమారులు పుట్టారు. వీరి తరువాతి తరాలలో రాజర్షులలో చాల గొప్పవాడని కీర్తి సంపాదించిన “గయుడు” పుట్టాడు. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - దేవధ్యుమ్నుడు; కొడుకు(లు) - పరమేష్టి; పద్య సం.(లు) - 5.2-6-వ.,

  155) ధేనువు- (){జాతి}[జంతు]:- ధేనువు అంటే గోవు. - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-63-వ.,. . . .

  156) ధైవతం- (){సంజ్ఞా}[విద్య]:- ధైవతం అంటే సంగీతంలోని సప్తస్వరాలలో ఒకటి. అవి షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అనే ఏడు స్వరాలు, శరత్కాలపు పండువెన్నెల కురుస్తుంటే కృష్ణుడు గోపికలతో రాసం ఆడాడు. ఆ నృత్యకేళి ఉత్సాహంలో పిల్లనగ్రోవి యందు అనేక రాగ, స్థాయి, స్వరాలు, కళలు, జాతులు ఆరోహణ అవరోహణ క్రమాలు తేటపడేలా అవ్యక్తమధురంగా గానంచేసాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 2-188-సీ.,

  157) ధౌమ్యుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ధౌమ్యుడు ఒక ఋషి. చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనవారు ఎన్నో విధాల ఓదార్చారు;
రంగపతితుడైన భీష్ముడిని దర్శించడానికి ధర్మరాజు వెళ్ళినప్పుడు బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి వచ్చారు. వారిలో ఈయ నొకరు.
ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్న మునీశ్వరులలో ఒకడు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 1-202-వ., 1-206-వ., 1-234-వ., 10.2-766-సీ.,

  158) ధ్రువసంధి- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ధ్రువసంధి సూర్యవంశపు రాజు. శ్రీరాముని వంశంలో తరువాత తరాలలోని వాడు. యోగం ఆచరించిన హిరణ్యనాభుని కొడుకైన పుష్యుని పుత్రుడు ఈ ధ్రువసంధి. ఇతని కుమారుడు సుదర్శనుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - పుష్యుడు; కొడుకు(లు) - సుదర్శనుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  159) ధ్రువసేన- (స్త్రీ){సంజ్ఞా}[భరతుని వంశం]:- ధ్రువసేన భరతుని కోడలు పాషండబోధితుడైన సుమతి భార్య, ఆ దంపతులకు పుత్రుడు దేవతాజిత్తు అతని కొడుకు దేవద్యుమ్నుడు. - వంశం - భరతుని వంశం; భర్త - సుమతి ; కొడుకు(లు) - దేవతాజిత్తుడు; పద్య సం.(లు) - 5.2-6-వ.,

  160) ధ్రువుడు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ధ్రువావతారము ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 8 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది.
ధ్రువుడు నారదుని ఉపదేశ ప్రభావంతో యముణ్ణి తన్ని అత్యున్నత స్థానాన్ని అందుకున్న మహా విష్ణుభక్తుడు
ధ్రువుడు విష్ణువు గురించి తపస్సు చేసి సర్వోన్నతమైన ధృవ స్థానాన్ని పొందాడు. తాత వైవశ్వతమనువు, తండ్రి ఉత్తానపాదుడు. తల్లి సునీతి. సవితి తల్లి కొడుకు ఉత్తముడు తండ్రి తొడ ఎక్కగా తను ఎక్కాలని ఆశించాడు. సవితి తల్లి సురుచి కఠోరమైన మాటలకు అలిగి, అడవికివెళ్ళి తపస్సు చేసి దుస్సాధ్యమైన విష్ణుదేవుని అనుగ్రహం పొందాడు. ఇతనికి ఇద్దరు భార్యలు భ్రమి అని శింశుమార ప్రజాపతి కుమార్తె, ఇల అని వాయుదేవుని పుత్రిక. భ్రమి యందు కల్పుడు, వత్సరుడు అని ఇద్దరు కొడుకులు. ఇల యందు ఉత్కలుడు అని కొడుకు మిక్కిలి అందమైన కూతురు కలిగారు. ధ్రువునికి చిత్రరథుడు అను పేరు కలదు. యక్షులతో యుద్దము చేయునప్పుడు ఈ పేరు వినబడెను.
ధాన్యం నూర్చే కళ్ళంలో పశువులను కట్టడం కోసం మధ్యలో పాతిన స్తంభంలాగా ధ్రువుడు ఆ శింశుమారచక్రం నడుమఉన్నాడు. ధ్రువుని చుట్టూ నక్షత్రాలు గ్రహాలు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. - వంశం - మనువు వంశం; తండ్రి - ఉత్తానపాదుడు; తల్లి - సునీతి; భార్య - భ్రమి, ఇల; కొడుకు(లు) - భ్రమి యందు కల్పుడు, వత్సరుడు: ఇల యందు ఉత్కలుడు, మిక్కిలి అందమైన కూతురు; కూతురు(లు)- ఇల యందు మిక్కిలి అందమైన కూతురు; పద్య సం.(లు) - 2-136-సీ.,2-2-03-వ., 3-448-క., 3-449-తే., 4-217-తే.,., 4-218-క.,., 4-322-వ., 4-342-వ., 8-136-వ.,

  161) ధ్రువుడు-2 (){సంజ్ఞా}[భగణ విషయం]:- యోగి బ్రహ్మలోకానికి పోతూ ధృవనక్షత్రం వరకు ఉన్న లోకాలు దాటుతాడు.
ధ్రువుడు శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం భక్తితో స్వీకరిస్తూ, నేటికీ తలపై చల్లుకొంటూ ఉంటాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్తర్షు లున్నారు.
శింశుమారచక్రంలో పరమ భక్తుడైన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలైన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఇతడు ఉత్తానపాదుని కుమారుడు.శింశుమారచక్రం తలక్రిందుగా, గుండ్రంగా అందంగా ఉంటుంది. శింశుమార చక్రం తోక చివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు.
లోకాలోకపర్వతం ఎనిమిది కోట్ల యోజనాలు ఉంటుంది సువర్ణభూమి, సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడం వల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది.
సూర్యుడు మేరువునకు, ధ్రువునికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు.
వామనుడు త్రివిక్రమ రూపుడు అగచూ, ధ్రువమండలం దాటాడు అని వర్ణించారు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 2-30-వ., 2-136-సీ., 5.2-32-వ., 5.2-73-వ., 5,2-82-సీ., 5.2-84-క., 5,2-93-సీ.,8-622-శా.,

  162) ధ్రువుడు-3 (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- ధర్మునికి వసువునందు కలిగిన ఎనిమిది మందిలో మూడవవాడు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు వారిలో ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు కలిగాయి. - వంశం - దక్ష వంశం; తండ్రి - ధర్ముడు; తల్లి - వసువు ; భార్య - ధరణి; కొడుకు(లు) - నానావిధ పురాలు; పద్య సం.(లు) - 6-254-వ.,

  163) ధ్రువుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధ్రువుడు చంద్రవంశంలోని పూరుని వంశంలోని వాడు. ఋతేపువు కొడుకైన అంతిసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని ముగ్గురు పుత్రులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అంతిసారుడు; పద్య సం.(లు) - 9-503-వ.,

  164) ధ్రువుడు-5 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ ధ్రువుడు కృష్ణునికి సోదరుడు. బలరామునికి తమ్ముడు. వసుదేవుని కుమారుడు. వసుదేవునికి రోహిణి యందు కలిగిన పుత్రులు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు మున్నగువారు; - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - రోహిణి; పద్య సం.(లు) - 9-722-వ.,

  165) ధ్వజచేలములు- (){జాతి}[పరికరములు]:- ధ్వజచేలములు అంటే జండా గుడ్డలు, సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో ఇరు పక్షాల వారు వీటిని వాడారు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-332-సీ.

  166) ధ్వజనీ- (){జాతి}[పరికరములు]:- ధ్వజనీ అంటే సేన. వామనుడు బలి యాగశాలకు చేరి అక్కట ఏనుగులు గుఱ్రాలు సేనలను చూసాడట - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 8-531-శా.

  167) ధ్వజనీకాంతుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ధ్వజనీకాంతుడు అంటే (విష్ణుమూర్తి యొక్క) ధ్వజినీ (సేనా) కాంతుడు (నాయకుడు), విష్వక్సేనుడు. గజేంద్ర రక్షార్థం విష్ణువు చటుక్కున బయలుదేరి వెళ్తున్నాడు. ఆ హడావిడిలో లక్ష్మీదేవి కొంగు వదలకపోవడంతో ఆవిడ ఆయనవెనుక పరుగెడుతోంది. అలా వారు వెళ్తున్న పరిస్థితిని పద్యచలనచిత్రంలో బంధించిన పోతన గారి "తనవెంటన్ సిరి . ." లో నారదుని వెనుక ధ్వజనీకాంతుడు అనుసరించాడట. అంతఃపురం నుండి బయలుదేరాడు కదా ముఖ్యంగా అమ్మగారు వెంట వెళ్తున్నారు. మరి అంతఃపుర పరిచరులకు ముందుగా తెలిసింది అందరూ బయలుదేరారా, వారి తరువాత ప్రయాణానికి తను లేకపోతే ఎలాగని గరుడులవారు, రక్షించడానికి కదా వెళ్తున్నాడు ఏ అవసరం వస్తుందో అని పరికరాలు వెంటబడ్డారు. త్రిలోకసంచారి త్రికాలజ్ఞుడు కదా ఆయనకి హడావిడి తొందరగా తెలిసింది కనుక ఆయన చేరాడు. అబ్బో ఇంత హడావిడ గ్రహించి సేనానాయకులవారు చేరారు. ఇదేదో ఊరేగింపులా ఉందని వైకుంఠం ఊర్లోని వారందరూ చేరారట. మరీ వెళ్తున్నది మత్తేభం కోసం కనుక మత్తేభంలోనట. . . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-98-మ.,

  1) నంద-1 (){సంజ్ఞా}[నది]:- కైలాసం సమీపంలో నంద, అలకనంద అని నదులు ఉన్నవి. దక్షాధ్వరధ్వంసం పిమ్మట దేవతలు శివుని వేడుటకు వెళ్ళినప్పుడు ఈ నంద అలకనంద నదులను దర్శించారు. - వంశం - నది; పద్య సం.(లు) - 4-135-వ.,

  2) నంద-2 (){జాతి}[కాలము]:- శుక్లపక్షమునుండి మొదటి ఐదు తిథులను (పాడ్యమి విదియ తదియ చవితి పంచమి) నంద అంటారు - వంశం - కాలము; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  3) నంద-3 ( ){సంజ్ఞా}[నది]:- ఆప్యాయన వర్షం శాల్మలీద్వీపంలో ఉంది. దీనిలో పుష్పవర్షం అను పర్వతం, నంద అను మహానది ఉన్నాయి. శాల్మలీద్వీపంలో సురోచన, సౌమనస్య, రమణక, దేవబర్హ, వారిబర్హ, ఆప్యాయన, అభిజ్ఞాత అనే ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే సప్త పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-62-వ.,

  4) నందకధరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందకధరుడు అంటే విష్ణువు, కృృష్ణుడు, రాయభారానికి వెళ్తున్న కృష్ణుని నందకధరుడు అని వర్ణించారు. యజ్ఞవరాహమూర్తి ని స్తుతిస్తూ నంధకధరా అన్నారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-19-చ., 3-434-చ., 6-121-క.,

  5) నందకమహాసి- ( ){సంజ్ఞా}[పరికరములు]:- నందకమనే పేరు గల విష్ణుమూర్తి ఖడ్గం నా శత్రు వ్యూహాలను ఖండ ఖండాలుగా చించి చెండాడు అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 6-307-వ.,

  6) నందకము- ( ){సంజ్ఞా}[పరికరములు]:- నందకము విష్ణువు ఖడ్గము. అష్టబాహువిష్ణువు వర్ణనలో నందకము కూడ చెప్పబడింది. ఉషాకన్యకు చిత్రరేఖ చిత్రపటంలో పౌండ్రకుని చూపుతో ఇతను నందకమనే ఖడ్గం మున్నగునవి కలిగిఉండడంతో తానే వాసుదేవుడనని గర్విస్తాడు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 6-218-సీ., 10.2-353-మ., 10.2-353మ.,

  7) నందగోకులము- (){జాతి}[ప్రదేశము]:- నందగోకులము అంటే నందుని వ్రేపల్లె. విష్ణువు మాయాదేవికి వసుదేవుని భార్య రోహిణి వ్రేపల్లెలో ఉన్నది. దేవకీదేవి గర్భంలో పిండాన్ని తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశ పెట్టమని. తరువాత తను యశోదాదేవి కడుపున పుడతానని, మాయను యశోదాదేవికి పుడతావు అని చెప్పాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-58-వ., 10.1-1190-వ.,

  8) నందగోకులవిహారి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని గోకులంలో విహరిస్తాడు కనుక కృష్ణుడు నందగోకులవిహారి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-29-ఉ.,

  9) నందగోపకుడు- (పురుష){సంజ్ఞా}[గోపాలురు]:- గోపకులలోని వాడు కనుక నందుడు, నందగోపకుడు. - వంశం - గోపాలురు; పద్య సం.(లు) - 10.1-954-సీ.,

  10) నందగోపకుమారుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుడను గోపకుని కుమారుడు కనుక కృష్ణుడు నందగోపకుమారుడు. కుంతి కృష్ణుని స్తుతిస్తూ నందగోపకుమారా అన్నది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-188-వ., 5.2-1-క.,

  11) నందఘోషము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందఘోషము అంటే నందుని పల్లె. నైమిశారణ్య వర్ణనలో చక్కగా ఉన్న నల్లజింకలతో; కృష్ణుని శక్తిసామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది. అని వర్ణించారు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-39-వ., 10.1-571-క.,

  12) నందడింభకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందడింభకుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-689-ఆ.,

  13) నందతనయుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందతనయుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-590-క., 10.1-784-క., 10.1-903-శా.,

  14) నందతనూజుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందతనూజుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-96-క.,

  15) నందతపఃఫలము- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందతపఃఫలము. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1249-ఉ.

  16) నందన- (){సంజ్ఞా}[నది]:- నందన క్రౌంచద్వీపంలోని ఒక పెద్దనది. ఆ ద్వీపంలో ఆమోదం, మధువహం, మేఘపృష్ఠం, సుదామం, ఋషిజ్యం, లోహితార్ణం, వనస్పతి అను ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడు కొండలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రగతి, శుక్ల అనే ఏడు నదులు ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  17) నందనం-1 ( ){సంజ్ఞా}[పర్వతం]:- క్రౌంచద్వీపంలోని లోహితార్ణ వర్షంలో నందనం అను పర్వతము, పవిత్రగతి అను నది ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-66-వ.,

  18) నందనం-2 (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందనవనం మందర పర్వతశిఖరంపై ఉన్న ఒకదేవతా ఉద్యానవనం. ఇంద్రుని వనమిది. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాలు ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికి నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు ప్రక్కల నాటిన పొట్టి గుంజల లాగా ఉన్నాయి. ఆ పర్వత శిఖరాలపై నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ, ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-20-వ.,

  19) నందనందనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందనందనుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-451-వ., 10.1-1015-సీ., 10.1-1100-క., 10.1-1524-వ., 10.2-275-వ., 10.2-309-వ.,

  20) నందనవనము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. భగీరథునివెంట వస్తున్న గంగా ప్రవాహం ఇంద్రుడు విహరించే నందనవనం వలె, కౌశకీనదితో విహరిస్తూ ఉంది. అని వర్ణించారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 6-326-వ., 9-230-వ., 10.1-451-వ., 10.1-1084-వ., 10.1-1615-వ., 10.2-214-వ., 10.2-214-వ.,

  21) నందవ్రజము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందుని పల్లె (వ్రజము) వ్రేపల్లె - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-105-క., 10.1-1440-వ.,

  22) నందసుందరి- (స్త్రీ){సంజ్ఞా}[గోపాలురు]:- నందసుందరి అంటే నందమహారాజు భార్య యశోదాదేవి. - వంశం - గోపాలురు; పద్య సం.(లు) - 10.1-354-వ.,

  23) నందసుతుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందసుతుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-588-క., 10.1-937-క.,

  24) నందాంగన- (స్త్రీ){సంజ్ఞా}[గోపాలురు]:- నందాంగన అంటే నందమహారాజు భార్య యశోదాదేవి. - వంశం - గోపాలురు; భర్త - నందుడు; కొడుకు(లు) - కృష్ణుడు; పద్య సం.(లు) - 1-1-శా.,

  25) నందాంగనాడింభకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నందాంగనాడింభకుడు అంటే యశోదానందుల ముద్దుల బిడ్డడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నందుడు; తల్లి - యశోద; పద్య సం.(లు) - 1-1-శా.,

  26) నందాఖ్యులు- (పురుష){జాతి}[రాజు]:- పరీక్షిత్తుకు భవిష్యత్తుకాలంలో చివరి శైశవనాగుడైన మహానంది పిమ్మట వందఏళ్ళ తరువాత కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు. నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 12-4-వ.,

  27) నందాలక- (){సంజ్ఞా}[నది]:- నందాలక కైలైసపర్వతం దగ్గరి నందాలక, నంద అను రెండు నదులలో ఒకటి. కైలాసపర్వతం దగ్గర కుబేరుని పట్టణం అలకాపురి ఉంది. దాని వెలుపల నంద అలకనంద అని జంట నదులు ఉన్నాయి. వాటిని దాటాక సౌగంధికా వనం ఉంది. ఇవన్నీ దక్షాధ్వర ధ్వంసం పిమ్మట దేవతలు బ్రహ్మదేవునితో కలిసి, పరమశివుని శరణు వేడుటకు వెళ్తూ చూసారు. - వంశం - నది; పద్య సం.(లు) - 4-135-వ.,

  28) నంది-1 (పురుష){సంజ్ఞా}[దక్ష వంశం]:- ధర్మునికి భార్య జామిదేవికి దుర్గభూములకు అధిష్ఠాన దేవతలు జన్మించారు. వారికి స్వర్గుడు, నంది పుట్టారు. - వంశం - దక్ష వంశం; తండ్రి - దుర్గభూములకు అధిష్టాన దేవతలు; పద్య సం.(లు) - 6-254-వ.,

  29) నంది-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నంది శివుని వాహనం. . శర్మిష్ఠ, దేవయాని చెలులతో నగ్నంగా స్నానం చేస్తున్నారు. నంది వాహనంపై అటుగా వెళ్తున్న పార్వతీపరమేశ్వరులను చూసి హడావిడిగా బట్టలు కట్టకోవడంలో జరిగిన గందరగోళం యయాతి చరిత్ర ప్రసిద్ధం కావడానికి కారణం అయింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-514-సీ.,

  30) నందికేశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందికేశ్వరుడు శివుని అనుచరులలో శ్రేష్ఠుడు. దక్షుడు పరమశివుని శపించుట విని, నందికేశ్వరుడు దక్షుడు మేషముఖుడు అవుతాడని మఱియు బ్రహ్మణులను యాచకులై చరిస్తారు అని శపించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-47-వ., 4-49-వ.,

  31) నందిగ్రామము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందిగ్రామము అయోధ్యకు సమీపమున ఉండు ఒక చిన్నగ్రామము. ఇందు రాముఁడు అరణ్యవాసము చేయుకాలమున అతని పాదుకలకు రాజ్యవ్యవహారములను నివేదించుచు భరతుఁడు వల్కలజటాధారుఁడై నివసించి ఉండెను.
శ్రీరాముడు రావణవధానంతరం అయోధ్యకు వస్తూ, పుష్పకవిమానంలో నందిగ్రామమునకు విచ్చేసెను. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-315వ.,

  32) నందితబలగోవిందము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- బలరాముడు, కృష్ణులకు ఆనందం కలిగించేది కనుక బృందావనము. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-1198-క.,

  33) నందివర్ధనుడు-1 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నందివర్ధనుడు మైథిలుడు, సీతాదేవికి పూర్వజుడు. నిమి దేహాన్ని మథించగా జనకుడు పుట్టాడు, ఈయనకు వైదేహుడు, మిథిలుడు అని పేర్లు ఉన్నాయి. మిథిలానగరం ఈయనే నిర్మించాడు. ఆ జనకుని కొడుకు ఉదావనుడు. ఉదావనుని కొడుకు నందివర్థనుడు. నందివర్థనునికి కొడుకు సుకేతుడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఉదావసుడు; కొడుకు(లు) - సుకేతుడు; పద్య సం.(లు) - 9-372-వ.,

  34) నందివర్ధనుడు-2 (పురుష){సంజ్ఞా}[రాజు]:- ఈ నందివర్ధనుడు పరీక్షిత్కాలానికి భవిష్యత్తులో శునకుని మనవడు, విశాఖరూపుని కొడుకు. వీరు ఐదుగురు నూటముప్పైయెనిమిది (138) ఏళ్ళు ఏలారు. - వంశం - రాజు; తండ్రి - విశాఖరూపుడు; పద్య సం.(లు) - 12-4-వ.,

  35) నందివర్ధనుడు-3 (పురుష){సంజ్ఞా}[రాజు]:- ఈ నందివర్ధనుడు పరీక్షిత్కాలానికి భవిష్యత్తులో శైశవనాగ వంశంలోని అజయుని కొడుకు, నందివర్ధను పుత్రుడు మహానంది. శిశునాగుని మొదలు మహానంది వరకు పదిమంది రాజులు మూడువందలరవై (360) ఏళ్ళు ఏలిరి. - వంశం - రాజు; తండ్రి - అజయుడు; కొడుకు(లు) - మహానంది; పద్య సం.(లు) - 12-4-వ.,

  36) నందీశ్వరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందీశ్వరుడు పరమ శివుని అనుచరులలో శ్రేష్ఠుడు. దక్షాధ్వరధంస సమయంలో నంది భగుని పట్టి, పూర్వం దక్షుడు శివుని నిందిస్తుంటే కన్నుగీటిన భగుని కన్నులు పెకలించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-118-వ., 9-119-క.,

  37) నందుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నందుడు కృష్ణుని సహచరుడు. ధర్మరాజు ద్వారక నుండి వచ్చిన అర్జునుని అందరిక్షేమ సమాచారాలు అడిగాడు. వారిలో అంధకులూ, యాదవులూ, భోజులూ దశార్హులు, వృష్ణులూ, సాత్వతులూ మొదలైన యదువంశ వీరులందరూ క్షేమంగా ఉన్నారా? శ్రీకృష్ణుని పుత్రులైన సాంబుడూ, సుషేణుడూ మొదలైనవారూ, అనుచరులైన ఉద్ధవుడూ మొదలైనవారూ, సహచరులైన నందుడూ, సునందుడూ మొదలైన వారూ సుఖంగాను, ఆనందంగానూ ఉన్నారా?” అని కూడా అడిగాడు - వంశం - చంద్రవంశం; భార్య - ; పద్య సం.(లు) - 1-349-వ.,

  38) నందుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- అద్భుతమైన వైకుంఠపురంలో విష్ణు పరిచారకులు సారూప్యం గలవారూ ఐన సునందుడు, నందుడు, అర్హణుడు, ప్రబలుడు మొదలైనవారు భగవానుని భక్తితో భజిస్తున్నారు.
బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుడు రత్నాలు పొదిగిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు; నందుడు, సునందుడు, కుముదుడు మున్నగువారు సేవిస్తున్నారు; - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-230-సీ., 2-238-వ., 8-624-వ., 8-634-వ.,

  39) నందుడు-3 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నందోపనందుల కృష్ణునకు సోదరుల వరుస అవుకారు. వసుదేవునికి మదిర యందు కలిగిన పుత్రులు "నందుడు" ఉపనందుడు, కృతకుడు, శ్రుతుడు, శూరుడు మొదలగువారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - వసుదేవుడు; తల్లి - మదిర; పద్య సం.(లు) - 9-722-వ.,

  40) నందుడు-4 (పురుష){సంజ్ఞా}[గోపాలురు]:- నందుడు శ్రీకృష్ణుని తండ్రి, యశోదాదేవి భర్త. ఒకరాత్రి నందుడు యమునలో స్నానం చేస్తూ మునిగి, వరుణుని పాశాలలో చిక్కుకున్నాడు. కృష్ణుడు వెళ్ళి విడిపించాడు..
కృష్ణుడు పుట్టగానే తీసుకుని వసుదేవుడు నందుడు ఉన్న వ్రేపల్లెకు రహస్యంగా వెళ్ళాడు. నందుని భార్య యశోద పక్కలో బాలుణ్ణి పడుకోబెట్టాడు. యశోదకు పుట్టిన మాయను తీసుకుని తిరిగి వెనక్కి వచ్చాడు.
నందుడు మున్నగువారు ఇంద్రయాగం చేస్తామని కృష్ణునికి చెప్పారు.
విష్ణువు ఆదేశం మేరకు దేవకీదేవి కడుపులో ఉన్న పిండాన్ని జాగ్రత్తగా తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టింది. అలా బలరాముడు పుట్టాడు. తరువాత అష్టమగర్భంలో పుట్టిన కృష్ణుడు నందుని ఇంటికి వెళ్ళాడు. యశోదకు పుట్టిన మాయాదేవి దేవకి ఒడిని చేరింది. ఆ పాపనే అష్టమ గర్భం అనుకుని కంసుడు చంపబోతే, మాయాదేవి నింగికి ఎగసింది. బలరాముడు, కృష్ణుడు ఇద్దరు నందుని వ్రజంలో కలిసి పెరిగారు. కంసవధకు మధుర వెళ్ళేదాకా బలరామడు కృష్ణుడు యశోదానందుల వద్దనే ఉన్నారు. - వంశం - గోపాలురు; తండ్రి - శూరుడు; భార్య - యశోద; కొడుకు(లు) - కృష్ణుడు పెంపుడు కొడుకు; పద్య సం.(లు) - 1-29-ఉ., 2-181-క., 2-92-చ., 3-104-క., 3-113-మ., 10.1-52-సీ., 10.1-59-సీ. 10.1-145-వ., 10.1-157-వ., . . .

  41) నందుడు-5 (పురుష){సంజ్ఞా}[రాజు]:- ఈ నందుడు అనగా మహానంది అని శైశవనాగులలోని చివరి రాజు, నందివర్ధనుని కొడుకు, పరీక్షిత్తునకు భవిష్యత్కాలపు రాజు. పరీక్షిన్మహారాజు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. - వంశం - రాజు; తండ్రి - నంది ర్ధనుడు; పద్య సం.(లు) - 12-11-వ.,

  42) నందునిమంద- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నందునిమంద అంటే వ్రేపల్లె - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-145-వ., 10.1-808-వ., 10.1-145-వ., 10.1-905-వ.,

  43) నందునిసతి- (స్త్రీ){సంజ్ఞా}[గోపాలురు]:- యశోద నందుని సతి (భార్య)కు మాయాదేవి పుట్టగానే ఊర్లో అందరికి ఒకవిధమైన మైకము కమ్మింది - వంశం - గోపాలురు; పద్య సం.(లు) - 10.1-142-2-క.,

  44) నందుపట్టి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నందుని కొడుకు కనుక కృష్ణుడు నందుపట్టి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1321-వ.,

  45) నందుపొలతి- (స్త్రీ){సంజ్ఞా}[గోపాలురు]:- నందుపొలతి అంటే నందగోపుని భార్య యశోదాదేవి - వంశం - గోపాలురు; పద్య సం.(లు) - 10-.1-59-సీ.,10.1-248-సీ.,

  46) నందుభార్య- (స్త్రీ){సంజ్ఞా}[గోపాలురు]:- యశోద నందుని భార్య. వసుదేవుడు నవజాత కృష్ణుని తీసుకు వస్తుంటే. యశోదకు మాయాదేవి పుట్టి ఉంది. - వంశం - గోపాలురు; పద్య సం.(లు) - 10.1-138-క.,

  47) నంద్యావర్తబంధము- (){జాతి}[నృత్తము]:- పారిభాషిక పదము - రాసక్రీడ - నృత్తము
అరవైనాలుగు అక్షరముల కాలముగల నంద్యావర్తము అనెడి తాళమానమునకు సరిపడ నృత్యమండలమును చుట్టివచ్చి హస్త విన్యాసాదులను కనుపింప చేయునది - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  48) నకుల-1 ( ){జాతి}[జంతు]:- నకుల అంటే ముంగిసలు అని నకులుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-39-వ.,

  49) నకుల-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నకుల అంటే నకులుడు అని ముంగిసలు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో మహాభారతం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 1-39-వ.,

  50) నకులుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నకులుడు పంచపాండవులలో నాలుగవ వాడు. శాప భయం వలన భార్యలను కవియుటకు బెదరిన పాండురాజునకు కుంతీదేవి ఎడల యమధర్మరాజు అనుగ్రహంతో యుధిష్ఠరుడు; వాయుదేవుని అనుగ్రహంతో భీముడు ; ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అనె ముగ్గురు కుమారులు; మాద్రిదేవి ఎడల అశ్వనీదేవతల అనుగ్రహం వలన నకులుడు, సహదేవుడు అని ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు కలిగారు. ఆ ఐదుగురకు ద్రుపద రాజు కూతురు ద్రౌపది వలన వరుసగా ప్రతివింధ్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతకర్ముడు అని ఐదుగురు పుట్టి ఉపపాండవులు అని పేరుపొందారు. ఇంకా, యుధిష్ఠిరునకు పౌరవతి వలన దేవకుడు; భీమసేనునికి హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు; సహదేవునికి విజయ వలన సుహోత్రుడు, నకులునకు రేణుమతి వలన నిరమిత్రుడు; అర్జునునకు ఉలూపి అనే నాగకన్య వలన ఇలావంతుడు, మణిపుర రాజు కుమార్తె చిత్రాంగద వలన బబ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పాండురాజు; తల్లి - మాద్రి; భార్య - ద్రౌపది, రేణుమతి; కొడుకు(లు) - ద్రౌపది యందు శతానీకుడు, రేణుమతి యందు నిరమిత్రుడు; పద్య సం.(లు) - 1-168-వ., 1-234-వ., 9-673-వ.,

  51) నక్క- (){జాతి}[జంతు]:- పొద్దుపొద్దున్నే మంటలు కక్కుతూ నక్క ఏడుస్తుండడం వంటి దుశ్శకునాలు అనేకం ధర్మరాజుకు కనబడ్డాయి. అది కృష్ణనిర్యాణ సమయం. - వంశం - జంతు; పద్య సం.(లు) - 1-338-సీ.,

  52) నక్తుడు- (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ఇతడు పృథుషేణునికి ఆకూతి యందు పుట్టాడు, ఇతని కొడుకు ప్రియవ్రతుని వంశంలోని ప్రసిద్ధుడైన గయుడు - వంశం - ప్రియవ్రతుని వంశం; తండ్రి - పృథుషేణుడు; తల్లి - ఆకూతి; కొడుకు(లు) - గయుడు; పద్య సం.(లు) - 5.2-6-వ

  53) నక్రచక్రము- ( ){జాతి}[జంతు]:- మొసళ్ళగుంపు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-64-వ.,

  54) నక్రము- (స్త్రీ){జాతి}[జలచర]:- పీత, ఎండ్రకాయ, మొసలి - వంశం - జలచర; పద్య సం.(లు) - 8-47-మ., 8-51-సీ.,

  55) నక్షత్రలోకం- (){జాతి}[ప్రదేశము]:- భగవంతుని విరాడ్విగ్రహానికి వక్షస్థలము గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-16-వ.,

  56) నక్షత్రసంఘము- (){జాతి}[భగణము]:- కృష్ణుడు తెల్లని గొడుగు అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే "నక్షత్రాల సమూహంతో", కపిలవర్ణవస్త్రాలనే ఇంద్రధనుస్సుతో, ఆభరణమణులనే మెరుపు తీగలతో మేఘంలా ఉన్నాడట.. - వంశం - భగణము; పద్య సం.(లు) - 1-259-ఉ., 1-521-వ.,

  57) నక్షత్రాలు - (స్త్రీ){జాతి}[దక్ష వంశం]:- (కృత్తిక నుండి రోహిణి వరకు గల) ఇరవై ఏడు (27) నక్షత్రాలు అసిక్ని దక్షుల అరవై మంది కుమార్తెలలో 21 నుండి 47 వరకు గల కుమార్తెలు. వీరిని ఇరవై ఏడుగురిని చంద్రునకు ఇచ్చారు. చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు.. - వంశం - దక్ష వంశం; తండ్రి - దక్షుడు; తల్లి - అసక్ని; భర్త - చంద్రుడు; పద్య సం.(లు) - 6-254-వ.,

  58) నగచరేంద్రముఖ్యుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నగచరేంద్రముఖ్యుడు అంటే జాంబవంతుడు. ఆయన శమంతక మణి కోసం వచ్చిన కృష్ణునితో పోరాడేడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-64-క.,

  59) నగచాపుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నగచాపుడు శివుడు మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టినందున నగచాపుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-121-క.,

  60) నగజాత- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- నగజాత అంటే పర్వతపుత్రి పార్వతీదేవి. రుక్మీణీదేవి కృష్ణునికి సందేశం పంపుతూ తను ఆచారం ప్రకారం నగజాతను పూజించడానికి నగరం వెలుపలికి వస్తాను, అక్కడ శివాలయం వద్దకి వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పించింది. ఆ ప్రకారమే గౌరీపూజ చేయడానికి బయలుదేరి వెళ్ళింది. కృష్ణుడు చేపట్టాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1709-సీ., 10.1-1742-సీ.,

  61) నగధరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నగధరుడు అంటే కృష్ణుడు, గిరిధారి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1553-వ., 10.1-1700-వ., 10.1767-వ., 10.2-270-క.,

  62) నగభేది- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నగభేది పర్వతాల గర్వం అణచిన ఇంద్రుడు. సగరుని యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు తీసుకుపోయి పాతాళంలో కపిలుని ఆశ్రమంలో దాచాడు. ఆ వంకనే కదా భాగీరథి గంగ అవతరించినది, - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-205-సీ.,

  63) నగరాజు- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నగరాజు అంటే పర్వతాలలో రాజు వంటిదైన మేరుపర్వతం.. నగరాజధీరుడు అంటే మేరుపర్వతం అంత ధీరత్వం ఉన్నవాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-204-క.,

  64) నగరాతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నగరాతి అంటే పర్వతాలకు ఆరాతి యైన ఇంద్రుడు. నగజాతను పూజించి ఆలయం వెలుపలికి వచ్చిన రుక్మిణీదేవి స్వయంవరానికి వచ్చిన ఇంద్రుని ఐరావతం తొండం వంటి హస్తాలు గల శ్రీకృష్ణుని కనుకొనెను - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1750-మ.,

  65) నగవరి- (పురుష){జాతి}[మానవ యోని]:- నగవరి అంటే నవ్వులు చిందించే వాడు. ఆ నవ్వులు చిందించే చిన్నారి శైశవకృష్ణుడు నగుమోములతో తనను పలకరిస్తున్న గోపకాంతలను చూసి నవ్వడం నేర్చుకున్నాడట. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-293-క.

  66) నగ్నజిత్తు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నగ్నజిత్తు కోసల దేశ రాజు. ఆ రాజు కుమార్తె నాగ్నజిత్తును, శ్రీకృష్ణుడు సప్తవృషభముల ముక్కులు కుట్టి పెళ్ళిచేసుకున్నాడు. - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 3-124-చ., 10.2-126-సీ., నుండి 10.2-141-వ., వరకు, 10.21044-వ.,

  67) నగ్నజిత్తు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నాగ్నజిత్తు శ్రీకృష్ణుని భార్య నాగ్నజితి తండ్రి. కోసలదేశానికి రాజు. - వంశం - చంద్రవంశం; కూతురు(లు)- నాగ్నజితి; పద్య సం.(లు) - 10.2-126-సీ., నుండి 10.2-141-వ., వరకు

  68) నట-1 ( ){జాతి}[వృక్ష]:- నట అంటే దుండిగ చెట్లు అని నటులు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నాట్యరంగం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  69) నట-2 ( ){జాతి}[మానవ యోని]:- నట అంటే నటులు అని దుండిగ చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నాట్యరంగం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-39-వ.,

  70) నటీ-1 ( ){జాతి}[వృక్ష]:- నటీ అంటే దొండ చెట్లు అని నటీమణులు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నాట్యరంగం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  71) నటీ-2 ( ){జాతి}[మానవ యోని]:- నటీ అంటే నటీమణులు అని దొండ చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నాట్యరంగం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-39-వ.,

  72) నడగొండ- (){జాతి}[ప్రదేశము]:- నడగొండ అంటే నడిచేకొండ. అనగా చాలా పెద్ద వాడు అని. వృత్రాసురుడు ఇంద్రునితో యుద్దంలో చేతులు నరికేసాకా నడగొండ వలె భూమ్యాశాలు ఆక్రమిస్తూ ఇంద్రుని మీదకి వచ్చాడని వర్ణించారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 6-425-వ., 10.1-1347-సీ.,

  73) నడపునయ్య- (పురుష){జాతి}[దేవయోని]:- నడపునయ్య అంటే కృష్ణుడు. పాండవుల వద్దనుండి తిరిగి తన నగరానికి విచ్చేసిన శ్రీష్ణునికి ప్రజలు స్వాగతం చెప్పి, బిడ్డలు తండ్రికి చెసివట్లు, ఆ నడపునయ్యకు నమస్కరించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-249-వ.,

  74) నడబావి- (){జాతి}[ప్రదేశము]:- నడబావి అంటే దిగుడుబావి. వైకుంఠంలోని నైశ్రేయసం అనే ఉద్యానవనంలో లక్ష్మీదేవి ముఖపద్మం అక్కడి కోనేటినీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాలతీగలు అల్లుకొని ఉంటాయి. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-507-వ.,

  75) నడ్వల- (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నడ్వల ధ్రువుని వంశంలోని చక్షుస్సు అను మనువు భార్య. సర్వతేజునికి భార్య ఆకూతికి కొడుకు చక్షుస్సు మనువు. అతనికి భార్య "నడ్వల" వలన పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు. వారిలో ఉల్ముకునికి భార్య పుష్కరిణికి ఆరుగురు కొడుకులు. వారు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. వారిలో అంగుడు భార్య సునీథల కొడుకు వేనుడు. - వంశం - మనువు వంశం; భర్త - చక్షుస్సంజ్ఞుడు; కొడుకు(లు) - పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది; పద్య సం.(లు) - 4-390-వ.,

  76) నతత్రాత- (){జాతి}[దేవయోని]:- నతత్రాత అంటే మ్రొక్కినవారిని రక్షించువాడు, పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండగా భగవంతుని కాపాడమని వేడుకుంటూ నతత్రాత కాడా అన్నాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-284-శా.,

  77) నన్నయసూరి- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- నన్నయ ప్రథమాంధ్రకవి, ఆంధ్రమహాభారతము కర్త. ఈతనిని నన్నయసూరి అంటారు. పోతనామాత్యులవారు గ్రంథారంభంలో పూర్వకవి స్థుతి చేస్తూ ఈ మహాకవిని స్మరించారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-12-వ.,

  78) నభగుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నభగుడు వైవశ్వత మనువు పదిమంది కొడుకులలో రెండవవాడు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. ఇది అష్టమ స్కంధంలో వివరం, పాఠ్యంతరమున నవమ స్కంధములో వైవస్వత మనువు భార్య శ్రద్ధల పదిమంది కొడుకులలో తొమ్మిదవ వాడు ఆ తొమ్మిది పేర్లు. . . ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి. - వంశం - సూర్యవంశం; తండ్రి - వైవశ్వతమనువు; తల్లి - శ్రద్ధాదేవి; కొడుకు(లు) - నాభాగుడు మున్నగువారు, అంబరీషుడు; పద్య సం.(లు) - 8-412-వ., 9-9-వ., 9-75-క.,నండి

  79) నభశ్చరులు- (){జాతి}[దేవయోని]:- నభశ్చరులు అంటే ఆకాశ సంచారం కలవారైన ఖేచరులు, - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-683-వ., 10.2-345-చ., 10.2-525-క., 10.2-922-క.,

  80) నభసః- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నభసః అంట్ ఆకాశము తానైనవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-702-సీ.,

  81) నభస్థ్సలము- (){సంజ్ఞా}[గగన ప్రదేశం]:- నభస్థ్సలము అంటే ఆకాశము. విష్ణుమూర్తి విరాట్స్వరూపమునకు నభస్థ్సలము నాభీవివరము (బొడ్డు) - వంశం - గగన ప్రదేశం; పద్య సం.(లు) - 2-16-వ.,

  82) నభస్వంతుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- కృష్ణుని చేతిలో మరణించిన మురాసురుని పుత్రుడు. మురాసురుని మిగతా పుత్రులు తామ్రుడు, అంతరిక్షుండు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, అరుణుడు. - వంశం - రాక్షస యోని; తండ్రి - మురాసురుడు; పద్య సం.(లు) - 10.2-165-వ.,

  83) నభస్వతి- (స్త్రీ){సంజ్ఞా}[సూర్యవంశం]:- నభస్వతి సూర్యవంశంలో ప్రసిద్ధుడైన పృథుచక్రవర్తి కోడలు, ప్రాచీనబర్హికి పితామహి. పృథువు కొడుకైన విజితాశ్వునికి రెండవ భార్య నభస్వతి. ఈయన మొదటి భార్య శిఖండి యందు పుట్టిన పుత్రులు ముగ్గురు మరల అగ్నులు అయి వెళ్ళిపోయారు ఈయన పన్నులు కప్పాలు వసూలుచేయకుండా రాజ్యం ఏలాడు. యజ్ఞం చేసి గొప్ప యోగసమాధి పొందాడు. వీరికి హవిర్ధానుడు పుట్టాడు. ప్రాచీనబర్ఙి ఈ నభస్వతి కొడుకు హవిర్ధానునికి భార్య హవిర్ధాని యందు కలిగిన ఆరుగుర కొడుకులలో ఒకడు. - వంశం - సూర్యవంశం; భర్త - విజితాశ్వుడు; కొడుకు(లు) - హవిర్ధానుడు; పద్య సం.(లు) - 4-675-క.,

  84) నభుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నభుడు రామచంద్రుని వంశం వాడు. కుశుడి మనమడైన నిషధుని కొడుకు. ఇతని కొడుకు పుండరీకుడు, అతనికి క్షేమధన్వుడు, అతనికి దేవానీకుడు. . . - వంశం - సూర్యవంశం; తండ్రి - నిషదుడు; కొడుకు(లు) - పుండరీకాక్షుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  85) నభోమణి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నభోమణి అంటే సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-69-ఉ., 6-142-ఉ., 10.2-682-చ.

  86) నభోరమ- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- పురూరవుని వరించి వచ్చిన ఊర్వశిని చూసి, ఈమె తనను వశం చేసుకోడానికి వేసిన ఎరా; మబ్బులనుండి దిగివచ్చిన మెఱుపుతీగా; మోహినీదేవా; నభోరమా (ఆకాశలక్ష్మా). ఈమెను చేపట్ట లేని జీవితం ఎందుకు అనుకున్నాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-390-ఉ.

  87) నముచి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నముచి దానవుడు. దనువుకు భర్త కశ్యపుని వలన పట్టిన పద్దెనిమిది మంది దానవులలోనూ ఎనిమిదవ వాడైన స్వర్భానునకు కుమార్తె యైన సుభద్రకు భర్త నముచి. ఆ పద్దెనిమిది మంది దానవులు ఎవరంటే ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, 'స్వర్భానుడు', కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు.
వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు వృత్రాసురుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు.
హిరణ్యకశిపుడు సోదరుని మరణానికి పగతీర్చుకోవాలని హరిమీదకు వెళ్తానంటూ తన సబికులైన త్రిమస్తకుడు, త్రిలోచనుడు, శకుని, శతబాహువు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మున్నగు దైత్యదానవులకు చెప్పాడు. వారిలో నముచి ఒకడు.
సాగరమథన యత్నంకోసం, ఇంద్రుడు బలితో స్నేహం కనబరచాడు. నముచి, తారక, బాణాసురులతో మిత్రత్వం సాగించాడు; అలా బహువిధోపాయాలతో అమృతమథనానికి వారిని ఒప్పించాడు. అమృతసాధన పిమ్మట జరిగిన సురాసుర యుద్ధానికి బలిదానవుడు నముచి మున్నగువారితో కదలి వచ్చాడు. ఆ యుద్ధములో బలి పక్షమున నముచి, ఇంద్రసేనలోని పరాజితునితో యుద్ధం చేసాడు. జంభాసురుడు ఇంద్రుని చేతిలో మరణించుట తెలిసి వాని సోదరులు బలుడు, పాకుడు నముచి ఇంద్రుని మీదకి వెళ్ళారు. బల పాకాసురులను సంహరించాక నముచి ఇంద్రుని మీద భీకరంగా పోరాడాడు. నముచికి కల తడి లేదా పొడి ఆయుధాలతో మరణం లేకుండా ఉన్న వరం వలన, ఇంద్రుని వజ్రాయుధం కూడా ఇతని తల నరకలేకపోయింది.. ఆ విషయం ఆకాశవాణి చెప్పగా ఇంద్రుడ, తడీ పొడీ కాని ఫేనం (సముద్రపు నురుగు) అద్దిన వజ్రం ప్రయోగించి వాని తలనరికాడు. ఆ అసురసోదరులు యందు జంభాసురుని కూతురు దత్తకు భర్త హిరణ్యకశిపుడు నకు పుట్టిన ఐదుగురు కొడుకులలో ప్రహ్లాదుడు ఒకడు.
రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - రాక్షస యోని; భార్య - సుభద్ర; పద్య సం.(లు) - 6-258-వ., 6-363-వ., 6-507-వ., 7-29-వ., 8-182-వ., నుండి 8-378-ఆ. వరకు. , 12-18-వ.,

  88) నరకంఠీరవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నరకంఠీరవుడు అంటే నరసింహస్వామి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-340-క.,

  89) నరకదైత్యుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నరకదైత్యుడు అంటే నరకుడు అను రాక్షసుడు - వంశం - రాక్షస యోని; తల్లి - భూదేవి; పద్య సం.(లు) - 3-126-సీ., 8-334-వ., 10.1-1163-సీ., 10.2-148-సీ., నుండి 10.2-204-చ., వరకు, 10.2-540-క.,నుండి 10.2-558-తే., వరకు

  90) నరకము- (){సంజ్ఞా}[ప్రదేశం]:- నరకలోకంలో పాపులను యముడు శిక్షిస్తాడు. నరకములు ఇరవైఎనిమిది (28) రకాలు. అందు మహానరకములు 21. అవి, 1) తామిశ్రము, 2) అంధతామిశ్రము, 3) రౌరవము, 4) మహారౌరవము, 5) కుంభీపాకము, 6) కాలసూత్రము, 7) అసిపత్రవనము, 8) సూకరముఖము, 9) అంధకూపము, 10) క్రిమిభోజనము, 11) సందంశము, 12) తప్తోర్మి , 13) వజ్రకంటకశాల్మలి, 14) వైతరణి, 15) పూయోదము, 16) ప్రాణనిరోధము, 17) విశసనము, 18) లాలాభక్షణము, 19) సారమేయాదనము, 20) అవీచిరయము లేదా మానకవీచి మఱియు 21) రేతఃపానము; ఇవికాక సప్తనరకములు ఏడు (7) అవి, 1) క్షారకర్దమము 2) రక్షోగణభోజనము, 3) శూలప్రోతము, 4) దందశూకము, 5) అవట నిరోధము, 6) అపర్యావర్తనము మఱియు 7) సూచీముఖము - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 1-13-ఉ., 4-147-సీ., 5.2-75-వ., 5.2-133-ఆ. నుండి 5.2-164-వ. వరకు,

  91) నరకాసురుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నరకాసురుడు అంటే నరకుడు అను రాక్షసుడు - వంశం - రాక్షస యోని; తల్లి - భూదేవి; పద్య సం.(లు) - 3-126-సీ., 8-334-వ., 10.1-1163-సీ., 10.2-148-సీ., నుండి 10.2-204-చ., వరకు, 10.2-540-క.,నుండి 10.2-558-తే., వరకు

  92) నరకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- భూదేవికి కుమారుడు నరకుడు. నరకాసురుని పట్టణం ప్రాగ్జోతిషపురం. వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు చక్రంతో వాని తలనరికాడు. అనంతరం భూదేవి వేడగా అతని కుమారుడికిపట్టంకట్టాడు. ఆ నరకాసురుని చెరసాలలో మ్రగ్గుతున్న పదహారువేల నూరుగురు కన్యలనూ కృష్ణుడు వివాహమాడెను.
సాగరమథనం తరువాత జరిగిన సురాసుర యుద్ధంలో నరకుడు, శనైశ్వరునితో యుద్ధం చేసాడు.
కంసుడు అక్రూరుని బృందావనానికి పంపుతూ, రామకృష్ణులు ధనుర్యాగానికి వస్తే వారిని సంహరించి, శత్రువుల సంహరిస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన తన చెలికాండ్రతో గూడి భూమండలాన్ని పరిపాలిస్తాను అన్నాడు.
నరకాసురుడు అదితి కర్ణకుండలాలనూ, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు కోరగా, శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి సత్యభామతో గరుడవాహనం ఎక్కి వెళ్ళాడు. అక్కడ కోట ధ్వంసంచేసి, ఐదు తలల మురాసురుని, అతని ఏడుగురు కొడుకులు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణులను సంహరించాడు. అంత సత్యభామ నరకాసురునితో యుద్ధంచేసి విజయం సాధించింది. కృష్ణుడు చక్రంతో నరకాసురుని తల నరికాడు. భూదేవి వచ్చి వేడగా భగదత్తుని ప్రాగ్జోతీషానికి పట్టంకట్టాడు. నరకుని చెరలో మ్రగ్గుతున్న పదహారువేల వందమంది రాచ కన్నెలు విడిపించబడి కృష్ణుని వరించారు. వారందంరినీ కృష్ణుడు ద్వారకలో వివాహమాడాడు. అమరావతికి వెళ్ళి అదితి కుండలాలు అదితికి, వరుణుడి ఛత్రం వరుణుడికి, మణిపర్వతం దేవతలకు ఇచ్చి, తిరిగి వచ్చేటప్పుడు పారిజాతం అపహరించాడు.
ప్లవగుడు అను వానరుడు నరకుని స్నేహితుడు, స్నేహితుని మరణానికి కక్షగట్టిరాగా బలరాముడు సంహరించాడు. - వంశం - రాక్షస యోని; తల్లి - భూదేవి; పద్య సం.(లు) - 3-126-సీ., 8-334-వ., 10.1-1163-సీ., 10.2-148-సీ., నుండి 10.2-204-చ., వరకు, 10.2-540-క.,నుండి 10.2-558-తే., వరకు

  93) నరకేసరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నరకేసరి అంటే నరసింహస్వామి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-304-క.,

  94) నరనాథుడు- (పురుష){జాతి}[రాజు]:- నరనాఛుడు అంటే రాజు, మానవులను పరిపాలించువాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-262-తే., 4-396-ఆ.,

  95) నరనాథోత్తముడు- (పురుష){జాతి}[రాజు]:- నరనాథోత్తముడు అంటే రాజు, మానవులను పరిపాలించువాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-140-మ.,

  96) నరనాయకచంద్రుడు- (పురుష){జాతి}[రాజు]:- నరనాయకచంద్రుడు అంటే రాజోత్తముడు - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-497-క.,

  97) నరనాయకుడు- (పురుష){జాతి}[రాజు]:- నరనాయకుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-449-క.,

  98) నరనారాయణులు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- నరనారాయణావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 4 వ. అవతారం (1-63-వ.).
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 7 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-125-సక, 2-134-క). నరనారాయణావతారుడు బదరికావనంలో అపారమైన తపస్సుచేసారు. నరనారాయణులు ధర్మునికి, దక్షపుత్రి మూర్తియందు అవతరించారు. బదరికావనంలో వారి తపస్సును భగ్నంచేయడానికి ఇంద్రుడు పంపగా రంభాది అప్సరసలు వచ్చారు. వారెంత ప్రయత్నించిన నరనారాయణులు చలించలేదు., వారిమీద కోపించలేదు. ఆ నారాయణ ఋషి, అప్పుడు, తన తొడగీరగా ఊర్వశి మొదలైన అత్యంత అందగత్తెలు వచ్చారు. అప్సరసలు వారి అందచందాలకు ఓడి, ఊర్వశిని నాయకురాలిగా గైకొని స్వర్గానికి తీసుకెళ్ళారు.
ఉద్ధవుడు బదరికావనంలో నారాయణాశ్రమానికి వెళ్ళాడు.
ఆ నరనారాయణులే పిమ్మట అర్జున కృష్ణులుగా జన్మించారు. ఋషభుడు, మేరుదేవి బదరికలో నరనారాయణులను గరించి తపస్సు చేసారు. - వంశం - దైవయోని; తండ్రి - ధర్ముడు; తల్లి - మూర్తి; పద్య సం.(లు) - 1-63-వ.,2-125-సీ.,2-134-క.,3-170-క,. 4-28-వ., 4-33-క., 5.1-60-వ., 7-218-మ.,

  99) నరపతి- (పురుష){జాతి}[రాజు]:- నరపతి అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 5.1-61-చ.,

  100) నరపశువులు- (){జాతి}[మానవ యోని]:- నరపశువులు అంటే పశుప్రాయులైన మానవులు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 6-476-వ.,

  101) నరపాలకుడు- (పురుష){జాతి}[రాజు]:- నరపాలకుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-420-క.,

  102) నరభోజనహస్తిహరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నరభోజనహస్తిహరి, నరసింహమూర్తి, అంటే నరభోజనుడు (హిరణ్యకశిపుడు), హస్తి (ఏనుగు) పాలిటి హరి (సింహమైనవాడు) - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-304-క.,

  103) నరభోజనుడు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- రాక్షసుడు నరమాంసం తింటాడు కనుక నరభోజనుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-304-క., 10.2-1262-క.,

  104) నరమృగేంద్రుడు- (పురుష){జాతి}[దేవయోని]:- నరమృగేంద్రుడు అంటే నరసింహస్వామి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-289-మ.,

  105) నరలోకేశ్వరుడు- (పురుష){జాతి}[రాజు]:- నరలోకేశ్వరుడు అంటే మహారాజు, ధర్మరాజును, నారదుడు నరసింహావతార ఘట్టంలో నరలోకేశ్వరుడు అని ప్రయోగించారు - వంశం - రాజు; పద్య సం.(లు) - 7-301-క.,

  106) నరవరాధీశుడు- (పురుష){జాతి}[రాజు]:- నరవరాధీశుడు అంటే రాజోత్తముడు - వంశం - రాజు; పద్య సం.(లు) - 8-411-తే.,

  107) నరవరుడు- (పురుష){జాతి}[రాజు]:- నరవరుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-440క.,

  108) నరవరేణ్యుడు- (పురుష){జాతి}[రాజు]:- నరవరేణ్యుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 4-541-సీ.,

  109) నరవాహనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నరవాహుడు అంటే (1) నిరృతి (2) కుబేరుడు, వీరిద్దరూ నరుని వాహనంగా కలవారు కనుక నరవాహనులు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-426-క.,

  110) నరవిభుడు- (పురుష){జాతి}[రాజు]:- నరవిభుడు రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-151-వ.,

  111) నరసఖుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నరసఖుడు అంటే నరుడు (అర్జునుడు)కి సఖుడైన శ్రీకృష్ణుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-201-శా., 10.2-607-క.,

  112) నరసింహ- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- నరసింహావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 14 వ. అవతారం (1-63-వ.)
మఱియు, ద్వితీయ స్కంధములో అవతారముల వైభవంలో వివరించిన పంచవింశతి అవతారాలు (25) అందలి 14 వ. అవతారం. ఇది బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి, జరిగిన పద్దెనిమిది అవతారాలులోనిది (2-146-మ).
మఱియు, నరసింహావతారము ఏకాదశ స్కంధములో వివరించిన దశా వతారములు(10) అందలి 4 వ. అవతారం.
హరివర్షానికి దేవుడు నరసింహుడు. హరివర్షం ప్రజలు దైత్య దానువులు. వారు ప్రహ్లాదాదులతో కూడి నరసింహుని సేవిస్తూ ఉంటారు.
జయవిజయులు ప్రథమజన్మ హిరణ్యాక్షహిరణ్యక్షశిపులలో, హిరణ్యకశిపుని నరసింహావతారం ఎత్తి వాడిగోళ్ళతో వక్షంచీల్చి సంహరించాడు. అతని పుత్రుడు తన భక్తాగ్రేసరుడు ఐన ప్రహ్లాదుని పాలించాడు. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 1-63-వ.,2-146-మ., 11-71-వ., 5.2-42-సీ., 7-24-వ., నుండి 7-385-ఉ.,

  113) నరహరి- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- నరహరి అంటే నరసింహావతారుడు. హరివర్షానికి అధిపతి నరహరి. అక్కడి జనులు దైత్య దానవోత్తములు. వారు ఎల్లప్పుడూ ప్రహ్లాదుడు మొదలైన పెద్దలతో నరసింహుని సేవిస్తూ ఉంటారు. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 5.2-42.-సీ.,

  114) నరాంతకుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నరాంతకుడు రావణాసురుని సేనలోని రాక్షసుడు. రామరావణయుద్ధంలో ఈ నరాంతకునితో పాటు కుంభుడు, నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మొదలగు వారిని, సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు సంహరించారు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-291-వ.,

  115) నరిష్యంతుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- నరిష్యంతుడు వైవశ్వత మనువు పదిమంది కొడుకులలో అయిదవవాడు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. పాఠ్యంతరమున వారు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి. ఈ నరిష్యంతునకు కొడుకు చిత్రసేనుడు. అతనికి దక్షుడు; అతనికి మీఢ్వాంసుండు; అతనికి శర్వుడు; అతనికి ఇంద్రసేనుడు; అతనికి వీతిహోత్రుడు; అతనికి సత్యశ్రవుడు; అతనికి ఉరుశ్రవుడు; అతనికి దేవదత్తుడు; అతనికి అగ్నివేశుడు పుట్టారు. అగ్నివేశుడు జాతకర్ణుండు అను పేర గొప్పఋషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణకులం ఏర్పడింది. - వంశం - మనువు వంశం; తండ్రి - వైవశ్వతమనువు (శ్రాద్ధదేవుడు); తల్లి - శ్రద్ధాదేవి; కొడుకు(లు) - చిత్రసేనుడు; పద్య సం.(లు) - 8-412-వ., 9-9-వ., 9-42-వ.,

  116) నరుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ధర్మరాజు అనోక దుశ్శకునాలు చూసి కలతచెందిన మనసుతో భీమునితో నరుడు ద్వారకకు వెళ్ళి చాలా రోజులైంది ఏ కబురులేదు ఏమైందో అంటూ బాధపడ్డాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పాండురాజు; తల్లి - కుంతీదేవి; పద్య సం.(లు) - 1-224-మ.,

  117) నరుడు-2 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఈ నరుడు నరనారాయణులలోని నరుడు, దక్షపుత్రి మూర్తి యందు ధర్మునికి నర నారాయణులను పేర విష్ణువు అవతరించాడు. నరనారాయణులు మహా తపస్సంపన్నులు. వీరి తపస్సు పరీక్షించడానికి వచ్చిన రంభాదులు ఏమాత్రం చలిపజేయలేక ఓడిపోయారు. నారాయణముని ఊరువు (తొడ) గీరగా ఊర్వశీ మున్నగు అందగత్తెలు పుట్టారు. వారి అందానికి ఓడిన రంభాదులు ఊర్వశిని నాయకురాలిగా కొని స్వర్గలోకానికి తీసుకువెళ్ళారు. వీరు గర్వపడడం నుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. నరనారాయణులలోని నారాయణుడు నారదునికి చెప్పిన జ్ఞానాన్ని నారదుడు ప్రహ్లాదునికి చెప్పాడు. - వంశం - దేవయోని; తండ్రి - ధర్ముడు; తల్లి - మూర్తి; పద్య సం.(లు) - 2-125-క., 6-307-వ., 7-218-మ., 9-22-సీ.,

  118) నరుడు-3 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నరుడు తామస మనువు పుత్రుడు. నాలుగవ వాడైన తామస మనవు కొడుకులు కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన వారు పదిమంది. వారు బలవంతులైన రాజులు. - వంశం - మనువు వంశం; తండ్రి - తామస మనువు; పద్య సం.(లు) - 8-18-సీ.,

  119) నరుడు-4 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నరుడు భరతవంశకర్త వితథుని కుమారుడైన మన్యువు ఐదుగురు కొడుకులలో నాలుగవ వాడు. వారు బృహత్క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు. నరునికి కుమారుడు సంకృతి పుట్టాడు. సంకృతికి కుమారులు గురుడు, రంతిదేవుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - మన్యువు; కొడుకు(లు) - సంకృతి; పద్య సం.(లు) - 9-641-వ.,

  120) నరుడు-5 (పురుష){జాతి}[మానవ యోని]:- వైరాగ్యమార్గం పట్టిన నరుడు మోక్షమార్గం పడతాడు.
నరులు అంటే మానవులు. నరుల, అసురుల, సురల రూపాలను బలి దేవేంద్రుల నేతృత్వంలో జరిగిన సురాసుర యుద్ధంలో రాక్షసులు ధరించి యుద్ధం చేసారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-316-క., 3-193-క., 3-320-సీ., 5.1-11-వ., 5.2-139-క., 6-41-ఆ., 7-241-వ., 8-327-క., నుండి 8-334-వ., వరకు 9-79క.,

  121) నరునిసకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- భావతము తేటపఱచుటకు శుకుడు లేదా కృష్ణుడు తప్ప ఇంకెవరు సమర్థులు అని కృతిపతినిర్ణయంలో సింగన అన్నారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-23-ఆ.,

  122) నరేంద్రచంద్రుడు- (పురుష){జాతి}[రాజు]:- నరేంద్రచంద్రుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 7-459-ఉ.,

  123) నరేంద్రాగ్రణి- (పురుష){జాతి}[రాజు]:- నరేంద్రాగ్రణి అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-145-వ.,

  124) నరేంద్రుడు- (పురుష){జాతి}[రాజు]:- నరేంద్రుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 1-173-సీ., 4-421-వ.,

  125) నరేశ్వరుడు- (పురుష){జాతి}[రాజు]:- నరేశ్వరుడు అంటే రాజు - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-143-మత్త.,

  126) నర్మద-1 ( ){సంజ్ఞా}[మహానది]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నదము.
వృత్రాసుర సంహారం జరిగిన దేవదానవుల యుద్దం కృతయుగంలో మొదలై కొనసాగుతుండగానే త్రేతాయుగం ప్రారంభం అయింది.
ఈ నర్మదానది తీరంలో బలిచక్రవర్తి యజ్ఞంచాసాడు. విష్ణువు వామనావతారంలో వచ్చి దానం పట్టాడు. త్రివిక్రమావతారం ఎత్తాడు. - వంశం - మహానది; పద్య సం.(లు) - 5.2-55-వ., 6-374-వ., 8-529-క.,

  127) నర్మద-2 (స్త్రీ){సంజ్ఞా}[రాజు]:- నర్మద నాగకుమారుల చెల్లెలు, మాంధాత రెండవ కొడుకైన పురుక్సుతుని భార్య - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-191-వ.,

  128) నఱవఱలు- (){జాతి}[ప్రదేశము]:- నఱవఱలు అంటే భూమిపై ఏర్పడు నెఱ్ఱలు., బీటలు. మంథర పర్వంతతో చిలుకుతుంటే అకాలంలో ప్రళయం వచ్చినట్లు. . . దిక్కులు కలత చెందాయి; చెట్లు పడిపోయాయి; నేలలు నఱవఱలు అయ్యాయి. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-216-వ.,

  129) నఱ్ఱ- (){జాతి}[జంతు]:- నఱ్ఱ అంటే క్రొవ్విన ఎద్దు. గో గోపకులు గోవర్ధనగిరి ప్రదక్షిణలు చేస్తుంటే నఱ్ఱలు గుఱ్ఱాల కన్నా వేగంగా పరుగెట్టాయిట. - వంశం - జంతు; పద్య సం.(లు) - 10.1-895-క.,

  130) నల-1 ( ){జాతి}[వృక్ష]:- నల అంటే వట్టివేరు అని నలు డనే వానర వీరుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో వట్టివేరు, నీలి, పనసాది చెట్ల తోటి; నలుడు, ,నీలుడు, పనసుడు మొదలైన వానరవీరు లనే కొండలతో ప్రకాశిస్తున్నట్లు ఉంది అని, రామసేతువు నిర్మాణం కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  131) నల-2 (పురుష){సంజ్ఞా}[వానర]:- నల అంటే నలు డనే వానర వీరుడు అని వట్టివేరు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రామసేతువు నిర్మాణం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వానర; పద్య సం.(లు) - 1-39-వ.,

  132) నలకూబరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలకూబరుడు గుహ్యకుడు, కుబేరుని కొడుకు. మిక్కిలి చక్కనివారని పేరుపొందిన వారిలో ప్రముఖులు నలకూబరుడు, మన్మథుడు, జయంతుడు. నలకూబరుని సహోదరుడు మణిగ్రీవుడు. నలకూబరమణిగ్రీవులు నారదుని శాపం వలన జంట మద్దిమ్రాఁకులుగా చిరకాలము పడి ఉండగా చిన్న కృష్ణుఁడు రోలు ఈడ్చుకొని వెళ్ళి వాటిని కూల్చాడు. అలా వారికి శాపవిమోచనము అయింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-177-ఉ., 10.1-391-వ., నుండి 10.1-412-వ. వరకు.

  133) నలచక్రవర్తి- (పురుష){సంజ్ఞా}[రాజు]:- భాగీరథుని వంశంలోని ఋతిపర్ణుడు, నలమహారాజుతో స్నేహంచేసి, ఆయనకు అక్షహృదయము అనే విద్యను నేర్పాడు. ఆయననుండి అశ్వవిద్యను నేర్చుకున్నాడు. అక్షహృదయము అంటే 1 అధికసంఖ్యలలో కల వస్తువులనైనను చూచినంతమాత్రముననే లెక్కింపకయే మొత్తము చెప్పగల విద్య, 2 జూదమునందలి పాచికలనడకలోని రహస్యము తెలియు విద్య. అశ్వవిద్య లేదా అశ్వహృదయం అంటే గుఱ్ఱముయొక్క అభిప్రాయము తెలిసికొనుటకు సాధనమైన విద్య. నలమారాజు అంటే నలదమయంతుల వృత్తాంతంలోని నలుడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-235-ఆ.,

  134) నలినగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినగర్భుడు అంటే నలిన (పద్మము) నందు గర్భుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-320-సీ., 3-377-సీ.,

  135) నలినజుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినజుడు అంటే నలిన (పద్మము) నందు జుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-221-సీ.,

  136) నలినదళాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినదళాక్షుడు అంటే నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-332-క.,

  137) నలిననయన- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నలిననయన అంటే నలినము (పద్మము)ల వంటి నయన (కన్నులుగలామె), స్త్రీ - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-943-సీ.,

  138) నలిననయనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలిననయనుడు అంటే పద్మాక్షుడు, విష్ణుమూర్తి. విష్ణుభక్తి అనే నావ లేకుండా సంసారం అనే సాగరం తరించలేము. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-50-సీ.,

  139) నలిననాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలిననాభుడు - పద్మము నాభియందు కలవాడు, విష్ణువు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-697-సీ., 10.2-1073-తే.,

  140) నలినభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినభవుడు అంటే పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-268-తే.,

  141) నలినము- (){జాతి}[వృక్ష]:- నలినము అంటే పద్మము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 2-225-సీ., 8-111-శా.,

  142) నలినముఖి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నలినముఖి - నలిన (పద్మములవంటి) ముఖి (ముఖము గలామె), స్త్రీ - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 6-446-సీ.,

  143) నలినసఖుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినసఖుడు - నలిన (పద్మములకు) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 12-23-సీ.,

  144) నలినాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినాక్షుడు అంటే నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు , విష్ణువు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-290-మ., 3-294-సీ., 3-567-క., 10.1-782-సీ.,

  145) నలినాయతాక్షి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నలి నాయ తాక్షి అంటే నలిన (పద్మముల వంటి) ఆయత (పెద్ద) అక్షి (కన్నులు ఉన్నామె), స్త్రీ - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-951-క.,

  146) నలినాయతాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినాయతాక్షుడు అంటే పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-168-ఉ., 10.2-1281-సీ.,

  147) నలినాసననందనులు- (పురుష){జాతి}[దేవయోని]:- నలినాసననందనులు అంటే నళిన (తామరపువ్వు) లో ఆసన (కూర్చున్న వాడు, బ్రహ్మదేవుడు) యొక్క నందనులు (పుత్రులు), నారదుడు, సనకసనందనాదులు మున్నగు ఋషులు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-254-వ.,

  148) నలినాసనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలి నాసనుడు అంటే నలినము (పద్మము)న ఆసీనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-588-ఉ.,

  149) నలినీబాంధవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినీభాంధవుడు అంటే పద్మముల బంధువు, సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-259-ఉ.,

  150) నలినోదరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలినోదరుడు అంటే నలినము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-772-సీ., 10.1-782-సీ.,

  151) నలుడు-1 (పురుష){సంజ్ఞా}[వానర]:- శ్రీరాముడు, నలుడు అను వానర వీరునిచే రామ సేతువు నిర్మాణం చేయించాడు. ఇందు నలుడు, నీలుడు, పనస మున్నగువారు పాల్గొన్నారు - వంశం - వానర; పద్య సం.(లు) - 1-39-వ., 2-168-వ.,

  152) నలుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నలుడు, యదుమహారాజు కొడుకులు నలుగురులో మూడవ వాడు. వారు సహస్రజిత్తు, క్రోష్ణువు, నలుడు రిపుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - యదువు; పద్య సం.(లు) - 9-701-వ.,

  153) నలుదిక్కులు- (){జాతి}[ప్రదేశము]:- తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరములు నలుదిక్కులు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-16-వ.,

  154) నలుమొంగబులప్రోడ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలు మొగముల ప్రోడ అంటే నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) ప్రోడ (పెద్ద), బ్రహ్మదేవుడు. తను మాయంచేసిన గోగోపబాలకులు, మరల ఎదురుగా కనబడేసరిగి అంతటి టక్కరి కంగారు పడ్డాడుట. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-80-వ.,

  155) నలుమొగంబులతక్కరిగొంటు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలు మొగముల తక్కరిగొంటు అంటే నలు (నాలుగు 4) మొగముల (ముఖములుగల) తక్కరిగొంటు (దిట్టయైన టక్కరివాడు), బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1537-వ.,

  156) నలువ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నలువ అంటే నలు (నాలుగు) వా (మోములు గలవాడు), బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-171-క., 8-266-సీ. 10.1-88-వ.,

  157) నల్దిక్కులు- (){జాతి}[ప్రదేశము]:- నల్దిక్కులు అంటే తూర్పు, దక్షిణము, పడమరస, ఉత్తర నాలుగు (4) దిక్కులు; - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 4-29-సీ.,

  158) నల్లనయ్య- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నల్లనయ్య అంటే నల్లని అయ్య శ్రీకృష్ణులవారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-145-వ.,

  159) నళినదళలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినదళలోచనుడు శ్రీకృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-762-క.,

  160) నళినదళవిశాలనయనలు- (పురుష){జాతి}[రాజు]:- శ్రీరాముడు తన వద్దకు వచ్చిన లవకుశులను నళినదళవిశాలనయనలు అని సంబేధించాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 9-353-ఆ.,

  161) నళినదళాక్షి- (){సంజ్ఞా}[మానవ యోని]:- నళినదళాక్షి అంటే నళినము (పద్మము) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులు గల స్త్రీ) - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-848-క.,

  162) నళినదళాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినదళాక్షుడు అంటే పద్మాక్షుడు. పూతన చిన్ని కృష్ణుని, 'నళినదళాక్షుడా! నా చనుబాలోక్క గుక్కెడు తాగు, నీ అందం నా చందం తెలిసిపోతాయి' అంది.
తరువాత కాళిందుడు కూడా నళినదళాక్షుడని అన్నాడు.
నళినదళాక్షుడు శ్రీకృష్ణుడు గోవులను పేరు పేరున పిలవగానే ధేనువులు సంతోషంతో “అంబా” అని మారు పలుకుతూ మరలి వచ్చాయి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-221-క., 10.1-692-చ., 10.1-743-క., 10.1-775-క.,

  163) నళిననయనలు- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నళిననయనలు అంటే పద్మముల వంటి కన్నులు కలవారు, గోపికలు. ఉద్దవునిచే గోపికలకు సందోశాలు పంపుతూ నళిననయనలు అన్నారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1474-ఆ.,

  164) నళిననేత్రి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నళిననేత్రి అంటే నళినము (పద్మముల) వంటి నేత్రములు గల స్త్రీ. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 5.1-37-ఆ.,

  165) నళిననేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళిననేత్రుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-286-సీ.,

  166) నళినము- (){జాతి}[వృక్ష]:- నళినము అంటే పద్మము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 4-204-వ.,

  167) నళినలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినలోచనుడు అంటే నళినము (పద్మము) వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-130-త., 10.1-600-సీ., 10.1-665-సీ.

  168) నళినాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినాక్షుడు అంటే నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-203-సీ., 7-124-ఆ., 10.1-774-క.,

  169) నళినాప్తుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినాప్తుడు - పద్మములకు బంధువు, సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-455-క.,

  170) నళినాయతాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినాయతాక్షుడు అంటే పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1281-సీ.,

  171) నళినాసనజనకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినాసనజనకుడు - నళినాసనుని (బ్రహ్మ యొక్క) జనకుడు, విష్ణువు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 11-108-క.,

  172) నళిని-1 (){జాతి}[అవయవము]:- పురంజనుని నవద్వార పురానికి నళిని, నాళిని అని రెండు తూర్పు ద్వారాలు ఉన్నాయి. నవద్వారపురం అంటే దేహము, నళినీనాళికలు ముక్కు రంధ్రాలకు సంకేతం. పురంజయుడు ఈ నళినీ నాళిని ద్వారాలు (ముక్కు రంధ్రముల) ద్వారా అవధూత (వాసన చూపెడి అంతరింద్రియం) అను స్నేహితుని సహాయంతో సౌరభము (వాసన) అను విషయా (ఇంద్రియార్థము) లకు వెళ్తాడట - వంశం - అవయవము; పద్య సం.(లు) - 4-768-వ.,

  173) నళిని-2 (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నళిని అంటే సుందరి అని అర్థం. విష్ణుమూర్తి వామనుడై అవతరించడానికి, అదితితో నళినీ నీ గర్భాన పుడతాను అని చెప్పాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 8-488-క.,

  174) నళిని-3 (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నళిని చంద్రవంశ రాజు అజమీఢుని భార్య. వారి కొడుకు నీలుడు. మనవడు శాంతి. ఈమె హస్తినాపురం నిర్మించిన హస్తి మహారాజు పెద్దకోడలు. - వంశం - చంద్రవంశం; భర్త - అజమీఢుడు; కొడుకు(లు) - నీలుడు; పద్య సం.(లు) - 9-655-వ.,

  175) నళినీతటము- (){జాతి}[సరస్సు]:- నళినీతటము అంటే పద్మాకరము, సరస్సు - వంశం - సరస్సు; పద్య సం.(లు) - 4-745-వ.,

  176) నళినోదరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నళినోదరుడు అంటే విష్ణుమూర్తి, కృష్ణుడు. విష్ణువు కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-782-క., 11-77-వ.,

  177) నవకంజాతదళాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవకంజదళాక్షుడు - నవ (కొత్త, తాజా) కంజము (పద్మము)ల దళము (రేక)ల వంటి అక్షులు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-530-ఉ.,

  178) నవద్వారము- (){జాతి}[మానవ యోని]:- నవద్వారము అంటే నవరంధ్రములైన కన్నులు, ముక్కులు, చెవులు, నోరు, గుహ్యము, గుదము లతో కూడి ఉండునది, భౌతిక దేహము.. అజమీఢేపాఖ్యానంలో దీనిని ఒకపురంగా. జీవుని పురంజయుడుగా సంకేతాలు అనేకానేకంతో గౌప్ప ఆధ్యాత్మిక కథ చెప్పబడింది. పురంజయుడు అనువాడు తన నివాసంకోసం వెతుకుతూ ఒక పురాన్ని ఎన్నుకుని దానికి యజమాని అయ్యడు. అది తొమ్మిది ద్వారలు లేదా రంద్రములు కలది. అవేమిటి అంటే, తూర్పున (తలదిక్కువైపు ముందు వైపు సంకేతం) గల ఐదులోను రెండు ఖద్యోత, హవిర్ముఖి (రెండు కన్నులకు సంకేతం). ఈ ద్వారాలద్వారా పురంజయుడు విభ్రాజితము (చూపు అంతరింద్రియం) జనపదానికి (కనబడు విషయాలు) పోతుంటాడు. నళిని నాళిని అనే ఒకేచోట ఉండే రెండూ ద్వారాలు అవధూత (వినికిడి అంతరింద్రియం) అనే స్నేహితుని తోడ్పాటుతో సౌరభము (వాసనలు) అనే విషయాలకు పోతాడు. ఐదవది ముఖ్య (నోరు) ద్వారం రసజ్ఞుడు విపణుడు (రుచి, పలుకు) అనే మిత్రుల సహాయంతో ఆపణము, బహూదనము అనే విషయాలకు పోతాడు. దక్షిణ (కుడి), ఉత్తర (ఎడమ) వైపు ద్వారాలు పిత్రుహూవు, దేవహూవు వినికిడి విషయాలకు పోతాడు. పశ్చిమ (క్రిందివైపు) ద్వారాలు ఒకటి ఆసురి (గుహ్యక ఇంద్రియం) ద్వారం ద్వారా గ్రామకము అనే దేశానికి పోతాడు. రెండవది నిరృతి (గుద ఇంద్రియం) ద్వారా విసర్జన విషయానికి వెళ్తాడు. అలా మిగతా అవయవాలు వర్ణిస్తూ కథ నడుస్తుంది. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-744-సీ., 4-849-వ., 4-853-వ.,

  179) నవనందులు- (పురుష){జాతి}[రాజు]:- పరీక్షిత్తుకు భవిష్యత్తుకాలంలో చివరి శైశవనాగుడైన మహానంది పిమ్మట వందఏళ్ళ తరువాత కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు. నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. - వంశం - రాజు; పద్య సం.(లు) - 12-4-వ.,

  180) నవనీరజనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవనీరజనేత్రుడు అంటే నవ(కొత్త, తాజా) నీరజ (ఫద్మము) వంటి నేత్రములు కలవాడు, విష్ణువు, లెక్కలేనన్ని బ్రహ్మాండకోశాలు తన ఉదరంలో ధరించు విష్ణువు, పరమాణు రూపంతో బ్రహ్మాండకోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-364-చ.,

  181) నవపద్మదళాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవ పద్మద ళాక్షుడు అంటే నవ (లేత) పద్మముల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-589-వ.,

  182) నవపద్మముఖి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నవపద్మముఖి అంటే నవ (తాజా) పద్మమువంటి ముఖముగల అందగత్తె, ఇక్కడ దేవయాని - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 9-577-క.,

  183) నవపద్మాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవపద్మాక్షుడు, అంటే విష్ణుమూర్తి. త్రివిక్రమణ ఉపసంహారం పిమ్మట బలికి సుతలగమనం చెప్పిన సందర్భంలో నవపద్మదళాక్షుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-650-శా.,

  184) నవపుండరీకాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవపుండరీకాక్షుడు అంటే కొత్త (తాజా) పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-407-సీ.,

  185) నవభామలు- (స్త్రీ){జాతి}[ఋషి]:- నవభామలు అంటే దేవహూతి కర్దముల తొమ్మిది మంది (9) కుమార్తలు. ఈ నవభామల తరువాత కపిలుడు పుట్టాడు. వారు కళ, అనసూయ, శ్రద్ద, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి. వారిలో కళను మరీచి, అనసూయను అత్రి, శ్రద్ధను అంగిరసుడు, హవిర్భువును పులస్త్యుడు, గతిని పులహువుడు, క్రియను క్రతువు, ఖ్యాతిని భృగువు, అరుంధతిని వసిష్ఠుడు, శాంతిని అధ్వర్యుడు వివాహం చేసుకున్నారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 2-119-చ., 3-848-వ.

  186) నవమి- (){జాతి}[కాలము]:- నవమి తిథి తిథులలో తొమ్మిదవది.ఏయే సమయాలలో గృహస్తుడు బ్రాహ్మణులు, దేవతలు, మానవులు, పశువులు మున్నగు సర్వ జాతులకు సంతర్పణలు చేయాలో చెప్తూమార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే కృష్ణపక్ష అష్టమీ తిథులలోనూ, వాటి ముందు వెనుక సప్తమి, నవమి రోజులలో; కూడా చేయాలని చెప్పారు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 7-448-వ.,

  187) నవరత్నాలు- (){జాతి}[పరికరములు]:- నవరత్నములు అంటే తొమ్మిది జాతుల మణులు, 1 మౌక్తికము (ముత్యము) 2 పద్మరాగము (కెంపు) 3 వజ్రము 4 ప్రవాళము (పగడము) 5 మరకతము (గరుడ పచ్చ, పచ్చ) 6 నీలము 7 గోమేధికము 8 పుష్యరాగము 9 వైడూర్యము - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 3-518-సీ.,

  188) నవరథుడు- (పురుష){జాతి}[చంద్రవంశం]:- ఈ నవరథుడు విదర్భుని తరువాతి తరాలలోని వాడు. వికృతికి భీమరథుడు; భీమరథునకు నవరథుడు; నవరథునకు దశరథుడు; ఇతను రామయణంలోని దశరథుడు కాడు, ఇతనికి శకుని; ఇతనికి కుంతి; ఇతనికి దేవరాతుడు; ఇతనికి దేవక్షత్రుడు; ఇతనికి మధువు; ఇతనికి కురువశుడు; ఇతనికి అనువు పుట్టారు - వంశం - చంద్రవంశం; తండ్రి - భీమరథుడు; కొడుకు(లు) - దశరథుడు; పద్య సం.(లు) - 9709-వ.,

  189) నవవత్స- (){జాతి}[జంతు]:- నవవత్స అంటే లేగదూడ, ప్రభాసతీర్థం వద్ద యాదవులు లేగదూడలతో ఉన్న గోవులను భూరి దక్షిణలతో దానాలు చేసారు - వంశం - జంతు; పద్య సం.(లు) - 3-135-ఉ.,

  190) నవవారిజాక్షి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- నవవారిజాక్షి అంటే తాజా పద్మముల వంటి కన్నులు కలామె, రుక్మిణీదేవి - వంశం - చంద్రవంశం; పద్య సం.(లు) - 3-123-సీ.,

  191) నవవిధప్రపంచము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నవవిధ ప్రపంచము అంటే నవవిధసృష్టి కలది, 6 ప్రాకృత సృష్టులు (1 మహత్తు 2 అహంకారము 3 భూతసృష్టి 4 ఇంద్రియసృష్టి 5 దేవగణ 6 తామససృష్టి) మఱియు 3 వైకృతసృష్టులు (7 స్ఠావరములు 8 తిర్యక్కులు 9 ఆర్వాక్ స్రోతము (నరులు)) అను 9విధముల సృష్టులు కలది - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-248-క., 3-344-వ.,

  192) నవసితసారసలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవసితసారసలోచనుడు అంటే తాజా తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-102-క.,

  193) నవోఢ- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నవోఢ లేదా నవోఢా అంటే కొత్తపెళ్ళికూతురు, [నవ+వహ్+క్త+టాప్, నవా ఊఢా] కొత్త పెండ్లికూతురు, గజేంద్రరక్షణ కోసం వినువీధిని వెళ్తున్న శ్రీమహావిష్ణువును వర్ణిస్తూ కొత్తపెళ్ళికూతురులా వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు.అని వర్ణించారు (నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్) - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 8-105-మ.,

  194) నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణుడు అంటే విష్ణుమూర్తి, క్రొత్త పెళ్ళికూతురులా విలసిల్లే లక్ష్మీదేవి వెనువెంట రాగా విహరిస్తుండే వాడు కనుక... - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-105-మ.,

  195) నవోదకం- (){సంజ్ఞా}[నది]:- నవోదకం కులపర్వత మందలి ఒక నది. పురంజయోపాఖ్యానంలోని మలయధ్వజుడు భార్య వైదర్భితో శ్రీహరిని కొలవడానికి కులపర్వతానికి వెళ్ళినప్పుడు చంద్రమస, తామ్రపర్ణి, నవోదకం అనే నదులలో తీర్థమాడాడు. - వంశం - నది; పద్య సం.(లు) - 4-834-వ.,

  196) నహుషుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నహుషుడు యయాతి తండ్రి. నహుషుని తండ్రి ఆయువు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠను ఈ యయాతి వివాహమాడెను.
ఇంద్రుడు బ్రహ్మహత్యా భయంతో ఈశాన్య దిక్కుకుపోయి దాక్కున్న సంవత్సరం పాటు కాలం, నహుషుడు స్వర్గాధిపత్యం వహించాడు. ఇది తన విద్యా, తపో, యోగ బలంబుల వలన సాధ్యమయింది. కాని గర్వంతో శచీదేవిని ఇంద్రుడు వచ్చేదాకా నాతో ఉండు అన్నాడు. ఆమె బృహస్పతి సలహా ప్రకారం సహ్తర్షు మోసే పల్లకీ ఎక్కి రమ్మంది. అలా చేసి, అగస్త్య మహర్షిశాపం పొంది పదభ్రష్టుడై అజగర (కొండచిలువ) రూపం పొందాడు.
పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రంభుడు అనేనసుడు అని అయిదుగురు కొడుకులు. నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆరుమంది కొడుకులు. కొడుకులకు రాజ్యం అప్పజెప్పి నూరు యజ్ఢాలు చేసి, ఇంద్ర పదవి పొందాడు. శచీదేవిని పొందుకు పిలిచాడు. మునులు మోస్తున్న పల్లకి ఎక్కి నేల కూలి సర్పం అయ్యాడు.
ఈ నహుషుడు, వేనుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు మున్నగు రాజులు ప్రజలను బాధించుట వలన నాశనమయ్యారు అని శ్రీ కృష్ణుడు జరాసంధచెర విడిపించిన రాజులకు చెప్పాడు
రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ఆయువు; కొడుకు(లు) - యతి, యయాతి, సంయాతి, నాయాతి, నియతి, కృతి, సుహ్రోతుడు; పద్య సం.(లు) - 6-258-వ., 6-437-వ., 9-497-వ., 9-506-వ., 9-509-క., 10.2-755-చ., 12-18-వ.,

  197) నాకము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నాకము అంటే దుఃఖములేనిది, స్వర్గము.. శ్రీకృష్ణుడు సత్యభామ కోరిక తీర్టడానికి నాకామున కేగి, పారిజాతాన్ని అంతఃపురానకి తెచ్చాడు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-125-మ., 3-600-క.,

  198) నాకలోకము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నాకలోకము అంటే దుఃఖములేనిది, స్వర్గలోకము. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-112-వ., 7-36-సీ.,

  199) నాకుజుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- నాకుజుడు అంటే వాల్మీకిమహర్షి, నాకువు (పుట్టలో) పుట్టినవాడు కనుక. బలరామ కృష్ణులను కలవడానికి వచ్చి వసుదేవునిచే యజ్ఞం చేయించిన 21 ముఖ్య ఋషులలో ఒకరు. వారు ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల తాపస శ్రేష్ఠులు - వంశం - ఋషి; పద్య సం.(లు) - 10.2-1117-ఉ.,

  200) నాకులు- (పురుష){జాతి}[దేవయోని]:- నాకులు అంటే నాకలోకవాసులైన దేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-323-క., 3-613-ఉ.,

  201) నాగ - ( ){జాతి}[వృక్ష]:- నాగ అంటే 1, నాగమల్లి, 2. పొన్న - ఇవి తృతీయస్కంధంలోని నైశ్శ్రేయస వనం వర్ణనలోను, చతుర్థలో వెండికొండ వర్ణనలోను, అష్టమ స్కంధములోని త్రికూట పర్వతము వర్ణనలోను వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 3-507-వ., 4-135-వ., 8-24-వ.,

  202) నాగకన్యలు- (స్త్రీ){జాతి}[నాగ జాతి]:- నాగకులములోని స్త్రీలు, పాతాళం లోని సంకర్షణమూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోడానికి నాగకన్యలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీర విలాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు., అర్జునునకు ఉలూపి అనే నాగకన్య వలన ఇలావంతుడు పుట్టాడు - వంశం - నాగ జాతి; పద్య సం.(లు) - 5.2-125-వ., 9-673-వ.

  203) నాగకుమారులు- (పురుష){జాతి}[దేవయోని]:- మాంధాత రెండవ (2) పుత్రుడు పురుక్సుతుడు అతనిని నాగలోకమునకు తీసుకు వెళ్ళి నాగకుమారులు తమ సోదరి నర్మదను ఇచ్చి పెండ్లి చేసారు. పురుక్సుతుడు అక్కడ చాలామంది గంధర్వులను సంహరించి, తన నాగలోకసంచారం మననం చేసేవారికి సర్ప భయం లేకుండేలా వరం పొందాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-191-వ.

  204) నాగకులము, నాగజాతివారు- (పురుష){జాతి}[నాగ జాతి]:- పాతాళలోకంలో వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు మహానాగులుఉంటారు. వారికి ఐదు, నూరు వేయి తలలు ఉంటాయి. వారి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను పారద్రోలుతుంటాయి. - వంశం - నాగ జాతి; పద్య సం.(లు) - 5.2-120-క., 5.2-121-వ., 5.2-106-సీ.

  205) నాగతల్పుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నాగతల్పుడు అంటే శేషసాయియైన విష్ణుమూర్తి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-358-సీ.

  206) నాగపతులు- (పురుష){జాతి}[నాగ జాతి]:- నాగపతులు అంటే నాగజాతిలోని రాజులు, నాగరాజులు - వంశం - నాగ జాతి; పద్య సం.(లు) - 7-146-మ.

  207) నాగబంధము- (){జాతి}[నృత్తము]:- నాగబంధము రాసక్రీడ నృత్తము నందలి పారిభాషిక పదము
పాముల వలె పెనవైచుకొనుచు నర్తించుచు లయ తప్పక అంగ విన్యాసాదులను చూపునది - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  208) నాగము- (){జాతి}[జంతు]:- నాగము - 1. ఏనుగు, 2. పాము, 3, నాగరం అనే బంగారు శిరోలంకారం, 4. శ్రీకృష్ణుడు కాళిందు సర్పమును గిరగిర తిప్పి విసిరికొట్టెను, 5. ఐరావణనాగము అంటే ఐరావతము - వంశం - జంతు; పద్య సం.(లు) - 5.2-75-వ., 5.2-110-వ., 6-118-సీ., 6-409-క., 10.1-904-క. 7-438-సీ., 8-31-క., 9-230-వ., 10.1-664-వ.

  209) నాగరకాంత- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నాగరకాంత అంటే నగరంలో నివసించునామె, నాజూకైన స్త్రీ, 2. కాళిందుని భార్యలైన నాగకాంతలు వాని దుస్థితికి చింతించి కృష్ణుని నుతించి పతిభిక్ష లబ్ధిపొందారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-257-మత్త., 10.1-671-వ.

  210) నాగరుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నాగరుడు అంటే నగరంలో నివసించువాడు, నాజూకైనవారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-249-వ., 9-346-సీ.

  211) నాగలోకము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నాగలోకము అంటే పాతాళంలో నాగులు నివసించే లోకము. సగరుని యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకుపోయి నాగలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిలుని వద్ద కట్టాడు. యాగాశ్వంకోశం బయలుదేరిన సగరుని పుత్రులు, భూమిని త్రవ్వుకొని వెళ్ళి మునివద్ద ఉన్న గుఱ్ఱాన్ని చూసి, పౌరషాలు చూపారు. ముని కంటిచూపుకు భస్మమయ్యారు. భగీరథుడు తన గంగావతరణం చేసి, గంగను తన పూర్వీకుల భస్మంపై పారించి వారికి ఉత్తమలోకాలూ, మానవులందరికీ పనిత్ర గంగానదిని సాధించాడు ఆ భాగీరథుడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-205-సీ.

  212) నాగసూదనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నాగసూదనుడు - నాగములను చంపువాడు, గరుత్మంతుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-16-చ.,

  213) నాగాయుతసత్త్వుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నాగాయుతసత్త్వుడు అంటే నాగము (ఏనుగు)లు ఆయుత (వెయ్యింటి) సత్త్వము (బలము) కలవాడు అని. కృష్ణుడు రాజసూయం తలపెట్టిన ధర్మరాజు గురించి నారదుని వలన విని, ఉద్దవుని తరువాత కార్యం ఏంచేయాలి అని అడిగాడు. ఉద్దవుడు ధర్మరాజు రాజసూయం నిర్వహింప జేయాలి, ఆ సందర్భం పురస్కరించుకుని జరాసంధుని భీముని చేత సంహరింప జేయాలి అని చెప్తూ జరాసంధుడు నాగాయుతసత్త్వుడు అన్నాడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-668-వ.

  214) నాగుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షసయోని]:- నాగుడు - పాము రూపమున వచ్చిన అఘాసురుడు - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 2-190-చ.,

  215) నాగులు- (పురుష){జాతి}[దేవయోని]:- నాగులు - 1. నాగుపాము, 2, సర్ప, పాము జాతికి చెందినవి, 3. దేవయోని విశేషము, నవవిధసృష్టులలో మహత్తత్త్వ సృష్టి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-112-వ., 4-502-వ., 4-683-చ., 5.2-83-వ., 7-257-సీ., 9-333-సీ.

  216) నాగేంద్రులు- (పురుష){సంజ్ఞా}[జంతు]:- నాగేంద్రము అంటే గజేంద్రుడు - వంశం - జంతు; పద్య సం.(లు) - 8-95-మ.

  217) నాగ్నజిత్తి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- నాగ్నజిత్తి కృష్ణుని అష్టమహిషిలలో ఒకరు. ఈమె నగ్నజిత్తు అనే కోసలరాజు కుమారి. నగ్నజిత్తు ఆమె స్వయంవరానికి ఏడు భీకరమైన వృషభాలను పట్టి ముక్కుతాళ్ళు వెయ్యాలని నియమం పెట్టాడు. దానిని సాధించి కృష్ణుడు వివాహమాడాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నగ్నజిత్తు; భర్త - కృష్ణుడు; కొడుకు(లు) - వీరుడు , చంద్రుడు , అశ్వసేనుడు , చిత్రగుడు , వేగవంతుడు , వృషుడు , లఘుడు , శంకుడు , కసుడు , కుంతి ; పద్య సం.(లు) - 10.2-126-సీ., నుండి 10.2-141-వ., వరకు

  218) నాచనసోమనాథుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- నాచనసోమనాథుడు 14వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆంధ్ర మహాకవి ఉత్తర హరివంశం వ్రాసెను. ఇందలి ప్రయోగములను దీని శైలియు అసదృశములు. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనావేస్తున్నారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 6-11-సీ.

  219) నాచు- ( ){జాతి}[వృక్ష]:- నాచు, తీగపాచి, గజేంద్రమోక్షంలోని గజేంద్ర మకరముల పోరు నెడ వర్ణన "నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలుబడ మ్రక్కం ద్రొక్కుచు, మెండుచెడి బెండుపడి నాఁచు గుల్లచిప్ప తండంబులఁ బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు,"
శ్రీరాముడు సముద్రునిపై అలిగిన వేళ చిరునవ్వుతో దనుర్భాణాలు తీసుకోగానే "గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్."
యదుసాళ్వబలాలు చేసే యుద్దంలో నరాలు నాచులుగా పడి ఉన్నాయిట. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-55-వ., 9-281-క., 10.2-885-సీ.

  220) నాటకాలంకారములు- (){జాతి}[భాష]:- నాటకములు అలంకారములు భాషా శాస్త్ర విశేషములు. పురంజయుడు అభ్యసించిన శాస్త్రీయ అంశములు వదలి వ్యసనభరితములు వెంట పడ్డాడు అని చెప్తూ వీటిని ఉదహరించారు - వంశం - భాష; పద్య సం.(లు) - 6-108-సీ.

  221) నాడి- (){జాతి}[అవయవం]:- నాడి లేదా నాడిక అంటే నరముల కూడలి - వంశం - అవయవం; పద్య సం.(లు) - 2-16-వ., 2-30-వ., 2-89-వ., 2-269-వ., 3-901-క., 3-922-సీ., 7-296-శా.,

  222) నాడి, నాడిక- (){జాతి}[కాలము]:- నాడి లేదా నాడిక అంటే ఒక కాలం ప్రమాణం; కాల మానం వర్ణిస్తూ నాడి చెప్పబడింది. (నాడి కొలిచే విధం = 6 ఫలాలు, (ఇప్పటి లెక్కలో 18 తులాలు, 209.952 గ్రాములు) రాగితో రాగిపాత్ర సిద్ధం చేసుకోవాలి. 4 గురువింద గింజలు బరువు (తులంలో మూడవ వంతు. అనగా 11/3=3.667 గ్రా.) బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన మేకు తయారుచేసి, దానితో ఆ పాత్ర క్రింద రంధ్ర చేయాలి. ఆ రంధ్ర ద్వారా ప్రస్థ (ఘనపరిమాణపు కొలత, ప్రస్థ = 4 మానికలు లేదా 1 కుంచము లేదా 5.1667 లీటర్లు {100 kg బస్తాకు 24 కుంచాలు, 1కేజీ బియ్యం 1.24 లీటర్లు}) నీరు పూర్తిగా క్రిందకు కారడానికి ఎంత కాలం పడుతుందో అది ఒక నాడి.) మూడు త్రసరేణువులు ఒక తృటి, వంద తృటిలు వేధ, మూడు వేధలు ఒక లవం, మూడు లవాలు ఒక నిమేషము, మూడు నిమేషములు ఒక క్షణం, ఐదు క్షణాలు ఒక కాష్ట, పది కాష్టలు ఒక లఘువు, ఏబై లవాలు ఒక నాడి అగును. రెండు నాడికలు ముహూర్తం. - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-346-వ.

  223) నాతి- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నాతి అంటే స్త్రీ - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 6-200-ఉ., 6-224-వ., 8-461-సీ., 10.1-71-సీ., 10.1-75-సీ.

  224) నాథ- (పురుష){జాతి}[మానవ యోని]:- నాథ అంటే ప్రభువు, భర్త, నాయకుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-217-సీ., 2-265-సీ., 2-272-సీ., 4-436-సీ., 3-393-చ.,

  225) నాథతైవత- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నాథదైవత అంటే భర్తనే దేముడుగా చూసుకొనునామె, పతివ్రత - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 7-233-శా

  226) నాదయామాత్యుడు- (పురుష){సంజ్ఞా}[ఏర్చూరి]:- నాదయమాత్యుడు. ఆంధ్రమహాభాగవతం షష్టస్కంధ కర్త సింగయ తాతగారు. శ్రీవత్సగోత్రుడు, ఏర్చూరుకు శాసకుడు అయిన ఎఱ్ఱన ప్రెగ్గడ కుమారుడు వీరన్న. ఆ వీరన్న పుత్రుడు నాదయామాత్యుడు. ఆయన భార్య పోలమ్మ. వారికి కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు కుమారులు వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ భార్య. ఆ దంపతులకు సింగయ మంత్రి, తెలగయ మంత్రి అని ఇద్దరు పుత్రులు. అందు పెద్దవాడైన సింగయ షష్ఠస్కంధం తెలుగించాడు. - వంశం - ఏర్చూరి; తండ్రి - వీరన; భార్య - పోలమాంబ; కొడుకు(లు) - కసువన్న, వీరన్న, సింగన్న; పద్య సం.(లు) - 6-26-సీ., 6-28-క.,

  227) నానావిధపురాలు- (){జాతి}[ప్రదేశము]:- ధ్రువునికి దక్షపుత్రిక ధరణి యందు నానావిధపురాలు కలిగాయి - వంశం - ప్రదేశము; తండ్రి - ధ్రువుడు ; తల్లి - ధరణి; పద్య సం.(లు) - 6-254-వ.

  228) నానావిధాలైననాగులు- (){జాతి}[సర్ప]:- తార్క్ష్యుడను కశ్యపునకు దక్షపుత్రిక కద్రువయందు నానావిధాలైన నాగులు పుట్టాయి - వంశం - సర్ప; తండ్రి - తార్క్ష్యుడు; తల్లి - కద్రువ ; పద్య సం.(లు) - 6-254-వ.

  229) నాభాగసుతుడు- (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- నాభాగసుతుడు అంటే అంబరీషుడు. - వంశం - మనువు వంశం; తండ్రి - నాభాగుడు; పద్య సం.(లు) - 9-126-క.

  230) నాభాగుడు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నాభాగుడు వైవశ్వత మనువు పదిమంది కొడుకులలో ఆరవవాడు. వారు ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు. - వంశం - మనువు వంశం; తండ్రి - వైవశ్వతమనువు; తల్లి - శ్రద్ధాదేవి; పద్య సం.(లు) - 8-412-వ.,

  231) నాభాగుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ నాభాగుడు తండ్రి దిష్టుడు వైవశ్వతమనుపుత్రుడు. ఈ నాభాగుడు తన కర్మవశాత్తు వైశ్యుడుగా అయ్యాడు. ఆ నాభాగుడికి హలంధనుడు పుట్టాడు; అతనికి వత్సప్రీతి, అలా అతని వంశంలో పదహారవ (16)వ వాడు మరుత్తుడు అను చక్రవర్తి కలిగి ప్రద్ధుడయ్యాడు - వంశం - సూర్యవంశం; తండ్రి - దిష్టుడు; కొడుకు(లు) - హలధరుడు; పద్య సం.(లు) - 9-44-వ.

  232) నాభాగుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ నాభాగుడు వైవశ్వత మనువు మనమడు; అంబరీషుని తండ్రి. మనువు కొడుకైన నభగుని కొడుకు. గురుకులంలో ఉండగా సోదరులు ఆస్తి పంచేసుకున్నారు. నాభాగుడు వచ్చి అడిగితే నాన్నగారు చెప్తే ఇస్తాం అన్నారు. నభగుడు అంగీరసుల యాగానికి వెళ్ళ ఆరవ నాటి మంత్రం చెప్పు, వారు యాగశేషం ఇస్తారు అన్నాడు. అలాచేసి ఆ ధనం తీసుకుంటుంటే శివుడు వచ్చి నాగి అని. కావాలంటే మీ తండ్రిని అడుగు అన్నాడు. తిరిగి వచ్చి యాగశేషం శివునికే చెందుతుంది అని తండ్రి చెప్పి, మన్నించమన్నాడు. శివుడు సంతోషించి నాభాగునికే ఆ ధనమంతా ఇచ్చాడు. బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - నభగుడు; కొడుకు(లు) - అంబరీషుడు; పద్య సం.(లు) - 9-75-వ., నుండి 9-79-క. వరకు

  233) నాభావరుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నాభావరుడు భగీరథుని మనుమడు, ఈయన తండ్రి శ్రుతుడు, కొడుకు సింధుద్వీపుడు, మనుమడు అయుతాయువు, మునిమనుమడు ఋతుపర్ణుడు ఈ ఋతుపర్ణుడు నలమహారాజుకు అక్షహృదయవిద్య చెప్పాడు. నలునినుండి అశ్వవిద్య నేర్చుకున్నాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శ్రుతుడు; కొడుకు(లు) - సింధుద్వీపుడు; పద్య సం.(లు) - 9-233-క., 9-234-వ.,

  234) నాభి-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నాభి, నాభివర్షం (కుశద్వీపంలోని వర్షం) దీనికి అధిపతి. ఈ నాభి ప్రియవ్రతపుత్రుడైన హిరణ్యరేతసుని కొడుకు.. కుశద్వీపపతి యైన ఆ హిరణ్యరేతసునికి గల వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు ఏడుగురు కొడుకులలో మూడవ వాడు. వారేడుగురు వారిపేర్లతో కుశద్వీపాన్ని విభజించి ఏర్పరచిన వర్షములను ఏలారు. - వంశం - మనువు వంశం; తండ్రి - హిరణ్య రేతసుడు ; పద్య సం.(లు) - 5.2-64-వ,

  235) నాభి-2 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- నాభి జంబూద్వీప వర్షం ఐన నాభివర్షం లేదా అజనాభం, లేదా భారత వర్షం పేర్లతో ప్రసిద్ధమైన వర్షానికి అధిపతి. ఈ నాభికి భార్య మేరుదేవి యందు ఏకవింశతి(21) అవతారాలలో అష్టమ (8వ) అవతారంగా విష్ణువు అవతరించాడు. ఈ నాభి ప్రియవ్రతుని మనుమడు, జంబూద్వీపాధిపతి ఐన ఆగ్నీధ్రుని కొడుకు. నాభి మేరుపుత్రిక మేరుదేవిని వివాహమాడి, విష్ణుతుల్యుడైన కొడుకును కోరి యాగాలు చేసి, ఋషభుడు అను విష్ణుమూర్తి అవతారుని కన్నాడు. ఆగ్నీధ్రునికి పూర్వచిత్తి యను అప్సరస యందు కలిగిన తొమ్మిదిమంది కొడుకులలో పెద్దవాడు. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు. వీరు తమ నామములు కల జంబూద్విప వర్షములను పాలించారు. మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనేవాళ్ళను వరుసగా వివాహమాడారు. ఈ నాభి బలిచక్రవర్తితో స్నేహం చేసాడు. - వంశం - మనువు వంశం; తండ్రి - అగ్నీధ్రుడు ; తల్లి - పూర్వ చిత్తి; భార్య - మేరు దేవి (నామాంతరం సుదేవి); కొడుకు(లు) - ఋషభుడు (ఉరుక్రముడు); పద్య సం.(లు) - 1-63-వ., 2-139-వ., 5.1-40-వ., 11-35-వ.

  236) నాభివర్షం-1 ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- అజనాభ లేదా నాభివర్షం జంబూద్వీపంలోని వర్షం. దీనికి అధిపతి అగ్నీధ్రుని కొడుకు నాభి, పిమ్మట భరతుడు ఏలుటచే భారత వర్షమను పేరు వచ్చింది.ఈ వర్షంలో మందర, పతంగ పర్వతాలు ఉన్నవి. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.1-40-వ,

  237) నాభివర్షం-2 ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నాభివర్షం కుశద్వీపంలోని వర్షం. దీనికి అధిపతి హిరణ్యరేతసుని కొడుకు నాభి ఈ వర్షంలో కపిలం అను గిరి, శ్రుతనింద అను మహానది ఉన్నాయి. ఇక్కడ ఉండే కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 5.2-64-వ,

  238) నామకరణం- (){సంజ్ఞా}[భాష]:- నామకరణం అంటే పుట్టిన బిడ్డకు పేరుపెట్టట కోసం చేసెడి కార్యక్రమము. మానవునకు జరిపించెడి షోడశకర్మములలో ఐదవది. - వంశం - భాష; పద్య సం.(లు) - 3-610-వ.

  239) నారంగము- (){జాతి}[వృక్ష]:- నారంగము అంటే నారింజ చెట్టు. ఆరోగ్యమునిచ్చునది కనుక నారంగము. [వ్యు. నృ+అంగచ్, నృణాతి నయతి ఆరోగ్యమ్] - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 10.1-1013-ఉ.

  240) నారకులు- (){జాతి}[మానవ యోని]:- నారకులు అంటే నరకములో పడిన వారు, పాతకులు. నరకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు సైతం విష్ణువు నామం తలచుకుంటే అంతులేని సౌఖ్యాలను అందుకుంటారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-549-క., 9-116-ఉ.

  241) నారదీయము- (){సంజ్ఞా}[విద్య]:- నారదీయము అంటే అష్టాదశ మహాపురాణాలలోని నారద పురాణము. అష్టాదశ మహా పురాణాలు ఏవంటే బ్రాహ్మంబు (బ్రహ్మపురాణము), పాద్మంబు (పద్మపురాణము), వైష్ణవంబు (విష్ణుపురాణము), శైవంబు (శివపురాణము), భాగవతంబు (భాగవత పురాణము), భవిష్యోత్తరంబు (భవిష్యోత్తోర పురాణము), నారదీయంబు (నారద పురాణము), మార్కండేయంబు (మార్కండేయ పురాణము), ఆగ్నేయంబు (అగ్ని పురాణము), బ్రహ్మకైవర్తంబు (బ్రహ్మకైవర్త పురాణము), లైంగంబు (లింగ పురాణము), వారాహంబు (వరాహ పురాణము), స్కాందంబు (స్కాంధ పురాణము), వామనంబు (వామన పురాణము), కౌర్మంబు (కూర్మ పురాణము), మాత్స్యంబు (మత్త్య పురాణము), బ్రహ్మాండంబు (బ్రహ్మాండ పురాణము), గారుడంబు (గరుడ పురాణము) అని పదునెనిమిది మహాపురాణంబులు, - వంశం - విద్య; పద్య సం.(లు) - 12-30-వ.

  242) నారదుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- నారదావతారము ప్రథమ స్కంధములో వివరించిన వైష్ణవ అవతారాలలో ప్రధానమైన ఏకవింశ త్యవతారములు (21) అందలి 3 వ. అవతారం.
సరస్వతీతీరంలో తృప్తిచెందని మనసుతో కూర్చున్న వ్యాస మహర్షి వద్దకు, నారదమహర్షి వచ్చి నచ్చచెప్పి భాగవత పురాణం వ్రాయమని ఉపదేశించాడు. నారదుడు పూర్వకల్పంలో దాసీపుత్రునిగా జన్మించాడు.భిక్షుల వలన నారాయణ తత్వం గ్ర్రహించి తరించాడు.
ఋషి, రంగపతితుడైన భీష్ముడిని దర్శించడానికి ధర్మరాజు వెళ్ళినప్పుడు బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వసిష్ఠుడు మొదలైన పెక్కుమంది రాజర్షులు, బ్రహ్మర్షులు తమతమ శిష్యులతో కూడి వచ్చారు. వారిలో ఈయ నొకరు.
రణరంగపతితుడైన భీష్ణుడు దర్మరాజాదులకు శ్రీకృష్ణుని సరిగా ఎఱిగినవారు నారదుడు, కపిలముని మాత్రమే అని తెలిపెను.
విదురగాంధారీధృరాష్ట్రుల నిష్క్రమణం తరువాత విచారిస్తున్న ధర్మరాజునకు, తుంబురునితో కూడి నారదుడు వచ్చి, తత్కాల భవిష్యత్తులో జరుగబోవు కృష్ణనిర్యాణాది ఉత్పాతములు చెప్పి, పిమ్మట ఈ లోకంలో ఉండవలసిన పనిలేదని బోధించాడు.
పరీక్షిత్తు గంగానది ఒడ్డున ప్రాయోపవిష్టుడై ఉన్నాడని విని, వచ్చిన ఋషులలో ఈయన ఒకరు.
పరీక్షిత్తు ప్రాయోపవేశ దీక్షలో ఉండుట విని, ఋషు లందరూ విచ్చేసారు వారిలో నారదుడు కూడ ఉన్నాడు.
శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వచ్చి వసుదేవునిచే క్రతువు చేయించిన మునీశ్వరులలో ఒక మునీశ్వరుడు, శ్రీకృష్ణుడు యాదవుల అడగింప నిర్ణయించుకున్నప్పుడు దర్శించడానికి వచ్చిన వారిలో నారదుడు ఒకరు.
బ్రహ్మదేవుడు నారదునికి హరి మహిమ, సృష్ట్యాదులు, పరమాత్ముని లీలలు, భాగవతం దశ లక్షణాలు మున్నగునవి చెప్పెను.
ఇతడు బ్రహ్మదేవుని కుమారులలో ఒకడు. నైష్ఠికులై గృహస్తులు కాకపోవడం వలన వంశాలు కొనసాగని బ్రహ్మదేవుని పుత్రులలోని వాడు. అలా సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అను ఈ బ్రహ్మదేవుని పుత్రుల వంశాలు కొనసాగలేదు.
భారతవర్షానికి బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. మునులు నారదాది మునులు
నారదుడు బ్రహ్మమానసపుత్రుడు. బ్రహ్మదేవునికి బొటనవ్రేలు నుండి “దక్షుడు”, తొడనుండి “నారదుడు”, నాభి నుండి “పులహుడు”, చెవులనుండి “పులస్త్యుడు”, చర్మంనుండి “భృగువు”, చేతి నుండి “క్రతువు”, ముఖంనుండి “అంగిరసుడు”, ప్రాణంనుండి వశిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి “అత్రి” ఆవిర్భవించారు. ఈవిధంగా బ్రహ్మదేవునికి పదిమంది కుమారులు పుట్టారు.
విష్ణువుమీదకు యుద్దానికి బయలుదేరిన హిరణ్యాక్షునికి దారిలో నారదుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు సముద్రంలో ఉన్నాడు అక్కడకు వెళ్ళు అని చెప్పాడు. అలా వరహాతారుడు హిరణ్యాక్షుని సంహరించడానికి క్షేత్ర నిర్ణయం చేసాడు.
దక్షయజ్ఞ వాటికలో సతీదేవి దేహత్యాగం, ప్రమథగణాలు ఋభునామక దేవతలచే పరాజితులగుట నారదుడు పరమశివునికి తెలిపాడు. వీరభద్రావతారం జరిగింది.
ఐదేళ్ళ బాలుడు ధ్రువునికి, తపోమార్గం, హరిపూజా విధానం, ద్వాదశాక్షరీ మంతోపదేశం చేసిన మహర్షి నారదులవారు.
ప్రచేతసులసత్రయాగంలో ధ్రువుని కీర్తించాడు.
విపరీతంగా యజ్ఞాలుచేస్తున్న ప్రాచీనబర్హికి, నారదుడు పురంజనోపాఖ్యానం చెప్పి, జీవేశ్వర తత్వం ఉపదేశించి, జ్ఞానోపదేశం చేసాడు.
స్వాయంభువమనువు నారదుని అనుమతితో ప్రియవ్రతునికి రాజ్యం అప్పజెప్పి వానప్రస్తానానికి వెళ్ళాడు.
దక్షునికి అసిక్ని యందు పుట్టి ప్రజాసృష్టి కోసం తపస్సుకు వెళ్ళిన హర్యశ్వులకు, శబళాశ్పలకు నారదుడు పునరావృత్తి మార్గం ఉపదేశించాడు.
భారతవర్షంలో ప్రజలు నారదాది మునుల సాంగత్యంతో నారాయణుని సేవిస్తారు
దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినప్పుడు, దేవపూజలో లోపం జరిగినప్పుడు నారదుడు కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన మహాశక్తివంతమైన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న స్తుతులలో ఇది ఒకటి.
మరణమర్మం సూచించే చిత్రకేతోపాఖ్యానంలో చిత్రకేతుమహారాజుకు అంగిరసుడు, నారదుడు వచ్చి ఉపదేశించారు.
భాగవతపురాణం సప్తమస్కంధంలో హిరణ్యాక్షహిరణ్యకశిపుల తపస్సు, ప్రహ్లాదుని చరిత్ర మున్నగు ఉపాఖ్యానములకు వక్త నారదుడు శ్రోత ధర్మరాజు.
గజేంద్రమోక్షణలో తన వెంటన్ సిరి అంటు వచ్చిన వారిలో నారదుడు కూడా ఉన్నాడు.
ఒకమారు నారదుడు వచ్చి కంసునికి తను పూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడని, విష్ణువు దుష్ట రాక్షస సంహారం చేయడానికి దేవకి గర్భాన పుట్టాడని, వ్రేపల్లెలోని యాదవులు అందరూ దేవతలు అని చెప్పాడు.
పోయిన మహాకల్పంలో నారదుడు ఉపబర్హణుడు అను గంధర్వునిగా జన్మించాడు.
కుబేరుని కొడుకులు హయగ్రీవ, నలకూబరులు అను గంధర్వులు నారదుని శాపంతో మద్దిగవ అయి పడి ఉండగా కృష్ణుడు రోలు ఈడ్చుకు వచ్చి చెట్లను కూల్చి వారికి ముక్తి ప్రసాదించాడు.
శ్రీకృష్ణుని ద్వారకకు తోడ్కొని పోవుచున్న అక్రూరుడు దారిలో నదీజలాలలో దివ్యదర్శనాలు పొందాడు. అందులో శ్రీమన్నారయణుని పూజిస్తున్న వారిలో నారదుడు ఉన్నాడు. ఇంకా ప్రహ్లాదుడు,సునందుడు, నందుడు మున్నగువారున్నారు.
కంసాది సంహారం వీక్షించిన నారదుడు చేతులతో తాళాలు వాయిస్తూ ఆనందంగా నర్తించాడు.
యవనునికి కృష్ణుని గురించి చెప్పి ప్రేరేపించినవాడు నారదుడు
నారదుడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడు పదహారువేల కన్యలతో ఒక్కొక్కరికీ ఒక్కొక్క రూపుతో విహరించే వైభవం వీక్షించి పరవశుడు అయ్యాడు.
ఎవరి తలమీద చెయ్యి పెడితే వారు బూడిదైపోవాలని శివుని వరం పొందిన వృకాసురుడు శివుడైతే తొందరగా వరాలిస్తాడని నారదుని అడిగి తెలుసుకున్నాడు.
శ్రీకృష్ణునికి త్రివక్రయందు కలిగిన ఉపశ్లోకుడు నారదునికి శిష్యుడు. సాత్త్వతతంత్రం అను వైష్ణవ స్తృతి కల్పించాడు.
హరిశ్చంద్రుడు పుత్రులు లేక నారదుని ఉపదేశంతో వరుణోపాసన చేసి పుత్రుని పొందాడు.
అపహాస్యం చేయుటచే యాదవులు ముసలం బారిన పడతారని శాపం ఇచ్చిన మునులలో నారదుడు కూడ ఉన్నాడు.
విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వసుదేవునికి నారదుడు చెప్పాడు. - వంశం - దైవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; పద్య సం.(లు) - 1-63-వ., 1-84-వ., 1-132-సీ. 1-208-వ., 1-214-వ., 2-71-మ. నుండి 2-280-వ., వరకు., 1-328-మత్త., 1-499-వ., 3-377-సీ., 3-628-క., 4-104-వ., 4-214-క., 4-236-వ., నుండి 3-256-వ., 4-379-వ.4-740-క. నండి 4-893-క., 5.1-13-ఆ., 5.2-53-సీ., 5.2-55-వ., 6-178-సీ., 6-300-చ., నుండి 6-307-వ., 7-472-వ., 8-98-మ., 9-193-వ., 10.1-53-సీ., 10.1-391-వ. నుండి 10.1-300-క., 10.1-1235-వ., 10.1-1381-క., 10.1-1582-క., నుండి 10.1-1597-సీ., 10.2-598-చ., నుండి 10.2-630-క., 10.2-1239-క, 10.2-1330-వ.,11-11-వ., 11-22-క., 11-79-వ., 12-48-వ.

  243) నారదుడు-2 (పురుష){సంజ్ఞా}[గంధర్వుడు]:- ఇతడు వైశాఖ (మాధవం) మాసంలో సూర్యుని అనుచరులలోని గంధర్వుడు.
సూర్యుడు ఈ మాసంలో అర్యముడు అను పేరుతో, పుంజికస్థలి, పులహుడు, కంజనీరుండు, ప్రహేతి, నారదుండు, ఓజుడు మున్నగువారు అనుచరులుగా కలిగి సంచరిస్తాడు. - వంశం - గంధర్వుడు; పద్య సం.(లు) - 12-41-వ.

  244) నారయ- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- నారయ అనగా ఆంధ్రమహాభాగవతము నందు బహు కఠినమైన ఏకాదశ ద్వాదశ స్కంధములు పూరించిన / రచించిన కవి, బమ్మెఱ పోతనామాత్యుని శిష్యుడు వెలిగందల నారయ. తన స్కంధాంత గద్యములలో "పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ" అని గర్వంగా చెప్పుకున్నది, పోతన భాగవత రచనలో పాలుపంచుకున్న ముగ్గురులో ఇతనొక్కడే. ద్వితీయ స్కంధములో కొంతభాగము నారయ కృతి అంటారు. 2-93-ఉ. నుండి 2-108-క. వరకు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 11-127-గ., 12-54-గ. 2-93-ఉ. నుండి 2-108-క. వరకు.

  245) నారసము- (){జాతి}[పరికరములు]:- నారసము లేదా నారాచము అనగా అమ్ము, బాణము. అచ్చ యినుప బాణము, కృష్ణలోహ బాణము. నల్లని ఇనుప అమ్ము, నరుల ప్రాణములను హరించును కనుక నారసము. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 1-369-చ., 3-477-మ., 6-375-మ., 8-356-క., 9-301-క., 10.1-1562-వ., 10.1-1757-వ., 10.2-890-క.

  246) నారసింహుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నారసింహుడు అంటే నరసింహస్వామి. విష్ణుసేవకులు ఈ నరసింహుని స్వరూపం పరమ అద్భుతమైనది. అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభిస్తుంది
జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు.
మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలలో నాలుగవ అవతారం నారసింహుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-338-ఉ., 7-384-వ., 11-71-వ.

  247) నారాయణకవచము- (){సంజ్ఞా}[విద్య]:- నారాయణ కవచము గొప్ప శత్రుసంహార మంత్ర విద్య. విశ్వరూపుడు ఇంద్రునికి భోదించాడు. ఇంద్రుడు దీనిని ప్రయోగించి వృత్రాసురుని సంహరించాడు. - వంశం - విద్య; పద్య సం.(లు) - 6-293-క. నుండి 6-347-వ.,

  248) నారాయణసరస్సు- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నారాయణసరస్సు అనునది అతి పవిత్రమైన పురాతన తీర్థక్షేత్రము. దక్షునికి అసిక్నియందు కలిగిన హర్యశ్వులు అను పుత్రులు తండ్రి ఆజ్ఞ ప్రకారం సంతానసృష్ఠించుటకోసం నారాయణసరస్సు వద్ద తపస్సు చేయసాగారు. నారదుడు వచ్చి వారికి అపునరావృత్తి మార్గం ఉపదేశించి ప్రజాసర్గం సంకల్పం నుండి మరల్చాడు. పిమ్మట హర్యశ్వుల తమ్ముళ్ళు శబళాశ్వులు కూడా అన్నల మార్గంలోనే నారాయణసరస్సునకు వెళ్ళారు, మరల నారదుడు వచ్చి వారికూడా ఉపదేశం చేసి మరల్చాడు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 6-224-వ., 6-531-వ.

  249) నారాయణస్థానము- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నారాయణస్థానము అంటే విష్ణుమూర్తిలోకం ఐన వైకుంఠము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-39-వ., 1-388-సీ.,

  250) నారాయణాశ్రమము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నారాయణాశ్రమము అతి పవిత్రమైన క్షేత్రము. నరనారాయణులు తపస్సు చేసిన స్థలము. నామాంతరం బదరికాశ్రమము. నారదుడు ధర్మరాజునకు ఆశ్రమ ధర్మాదులు వివరిస్తూ, సాధుపురుషులు ఉండు చోటు, ఇంకా, కురుక్షేత్రము {కౌరవ పాండవులు యుద్ధము చేసిన చోటు}; గయ {గయాసురుని శిరోస్థానమైన పుణ్యప్రదేశము}; ప్రయాగ {గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణీసంగమ స్థానము}; పులహ మహాముని యొక్క ఆశ్రమము; నైమిశారణ్యము; ఫల్గుణీనదీ తీరము; రామేశ్వరము {శ్రీరాముడు సమద్రంపై సేతువు కట్టిన స్థానము}; ప్రభాసతీర్థము; కుశస్థలి; కాశీనగరము; మధురాపట్టణము; పంపా, బిందు సరోవరములు; నారాయణాశ్రమము {నర నారాయణులు తపము చేసిన ప్రదేశము}; పంచవటి {సీతరాములు కొన్నాళ్ళు కాపురమున్న పంచవటిలోని ఒక ప్రదేశము}; కులపర్వతములు {1మహేంద్రము 2మలయము 3సహ్యము 4మాల్యవంతము 5ఋక్షము 6వింధ్యము 7పారియాత్రము}; వైష్ణవాలమాలు; మరియు పరమ భాగవతులూ, వైష్ణవ భక్తులు నివసించే ప్రదేశములు ఇవన్నీ పరమ పుణ్యక్షేత్రాలు. శుభాలను కోరేవారు వాటిని తప్పక సేవించాలి.
రైవతుడు అను మహారాజు తన కూతురు రేవతికి తగిన వరుని సూచించమని అడగటానికి బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళాడు. సమయంకోసం కొద్ది నిమిషాలు ఆగి అడిగాడు. బ్రహ్మదేవుడు మానవుల కాలప్రమాణానికి ఇక్కడి కాలప్రమాణానికి ఉన్న భేదం వలన ఈ వ్యవధిలో 14 చతుర్యుగాలు గడచిపోయాయి. కనుక నీ వారందరు చనిపోయారు. వారి వంశాలు కూడా వినబడుటలేదు. కనుక, వెంటనే భూలోకానికి వెళ్ళి నారాయణుని అంశతో అవతరించి ఉన్న బలరామునికి భార్యగా నీ కూతురును ఇవ్వు అని చెప్పాడు. ఆ ప్రకారం రేవతుడు వివాహంచేసి, నారాయణాశ్రమమయిన బదరికాశ్రమానికి తపస్సుచేసుకోవడానికి వెళ్ళాడు.
కుబేరపుత్రులు మణిగ్రీవుడు నలకూబరుడు అను గుహ్యకులను, వారి దుర్వర్తన చూసిన నారదుడు జంటమద్దులు కండని శపించి బదరికాశ్రమం అను నారాయణాశ్రమానికి వెళ్ళాడు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 7-451-వ., 9-74-వ.,

  251) నారాయణాస్త్రము- (){జాతి}[ఆయుధము]:- ధ్రువుడు గుహ్యకులపై యుద్దానికి వెళ్ళాడు. వారు యుద్దంలో జయింపలేక ధ్రువునిపై మాయలుపన్నారు. అప్పుడు మునులు వచ్చి పలికిన ఆశీర్వచనాలను విని, ధ్రువుడు నారాయణాస్త్రం సంధించాడు. మాయలన్నీ విడిపోయాయి. నారాయణాస్త్రం నుండి వెలువడిన లెక్కలేనన్ని బాణాలు తగిలి గుహ్యకులు వికలాంగులు అయ్యారు. - వంశం - ఆయుధము; పద్య సం.(లు) - 4-347-సీ., నుండి 4-351-చ.,

  252) నారాయణి- (స్త్రీ){సంజ్ఞా}[దేవయోని]:- నారయణి - ఈమె శ్రీకృష్ణుడు తన అవతార సందర్భంలో ఆ మాయాదేవికి ఒసగిన పద్నాలుగు (14) నామములలో ఈమెది ఒకటి. సుపార్శ్వక్షేత్రమున నారాయణి (సర్వులందు విఙ్ఞానరూపము ఉండునామె) - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-61-వ.,

  253) నారాయణుడు-1 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- శ్రీకృష్ణుని, విష్ణువు పూర్ణావతారం కనుక, నరనారాయణులో తరువాత కృష్ణార్జునులుగా అవతరించారు కనుక నారాయణుడని కూడా సంభోధిస్తారు. అలాగే అర్జుని నరుడు అంటారు. కృష్ణుడు చెప్పిన ప్రకారం అర్జునుడు అశ్వత్థామగర్వభంగం చేయడానికి సిద్ధపడుతున్న సందర్భం. - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 1-172-వ., 1-202-వ.,

  254) నారాయణుడు-2 (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- 1.నారములందు వసించు వాడు, శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః, అయనంతస్యతా ప్రోక్తాః స్తేన నారాయణ స్మృత్యః. (విష్ణుపురాణము), 2. నారాయణశబ్ద వాచ్యుడు, వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసముగలవాడు, విష్ణువు,
"వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న తన తపస్సు పండి, తన హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను రచించాలనే కుతూహలం కలిగింది" అని బమ్మెఱ పోతనామాత్యులవారు తన కృతిపతి నిర్ణయంలో సెలవిచ్చారు.
"నారాయణ కథలవలన నెయ్యే ధర్మంబులు దగులువడ వవి నిరర్థకంబులు" అని, "మోక్ష మిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు;" అని సూతుడు శౌనకాదులకు నిర్థారించాడు,
సృష్టి సమస్తం నారాయణ పరము, అధీనము
విష్ణువు ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 1-15-వ., 1-50-సీ., 1-58-వ., 1-61-వ., 1-86-సీ., 2-84-వ., 11-77-వ.,

  255) నారాయణుడు-3 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- భారతవర్షంలోని ఒక మహర్షి, నరనారాయణావతారంలోని ఋషులు ఇద్దరిలో రెండవవారు, వీరే తరువాత అర్జున, కృష్ణులుగా అవతరించారు, నరనారాయణుల తపస్సు భగ్నం చేయడానికి రంభాదులు వచ్చినప్పుడు, నారాయణుడు తొడ గీరగా పుట్టిన అప్సరస ఊర్వశి
భారతవర్షానికి బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. - వంశం - దేవయోని; తండ్రి - ధర్ముడు; తల్లి - మూర్తి ; పద్య సం.(లు) - 1-57-క., 1-63-వ., 1-371-క., 2-124-వ., 2-132-క., 5.2-53-సీ., 5.2-55-వ.,

  256) నారాయణుడు-4 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- అజామిళుడు మరణాసన్న సమయంలో నారాయణ అన్న పదం ఉచ్చరించడం వలన ముక్తి పొందాడు. వీరు అన్ని ప్రమాదాలకు కారణాలైన అభిచార ప్రయోగాలనుండి కాపాడు గాక అని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించిన శ్రీమన్నారాయణ కవచంలో ఉన్న నలభైతొమ్మిది స్తుతులలో ఇది ఒకటి. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-72-క., 6-300-చ., నుండి 6-307-వ.,

  257) నారి-1 (స్త్రీ){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నారి అను స్త్రీరత్నము మేరువు కుమార్తె. కురువర్షాధిపతి కురువు భార్య. జంబూద్వీపపతి అగ్నీధ్రుని కోడలు. ప్రియవ్రతుని కుమారుడు జంబూద్వీపాధిపతి ఆగ్నీధ్రుడు. అతనికి పూర్వచిత్తికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని తొమ్మిది మంది కొడుకులు. వారు వరుసగా మేరు కుమార్తెలైన మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి లను వివాహమాడారు. - వంశం - మనువు వంశం; తండ్రి - మేరువు; భర్త - కురువు ; పద్య సం.(లు) - 5.1-40-వ.

  258) నారి-2 (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నారి అంటే స్త్రీ - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-529-మాలి

  259) నారి-3 (){జాతి}[పరికరములు]:- నారి అంటే వింటినారి, అల్లెత్రాడు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 10.1-1765-వ., 10.2-176-క., 10.2-410-ఉ., 10.2-1085-క.

  260) నారికేళము- ( ){జాతి}[వృక్ష]:- కొబ్బరిచెట్టు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 3-764-ఉ., 4-135-వ., 8-24-వ.,

  261) నారీకవచుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- నారీకవచుడు సూర్యవంశంలోని అశ్మకుని కొడుకు, ఖట్వాంగమహారాజు పితామహుడు. ఇతనికి మూలకుడు అను నామాంతరం కలదు. పరశురాముడు రాజులను సంహరిస్తున్నప్పుడు స్త్రీలు వారి చాటున దాచుటతో బ్రతికాడు కనుక నారీకవచుడు అని. నిర్మూలం అగుచున్న సూర్య వంశం నిలబెట్టిన వాడు కనుక మూలకుడు అను పేర్లు. ఇతనికి విశ్వసహుడు, విశ్వసహునికి ఖట్వాంగుడు పుట్టారు. - వంశం - సూర్యవంశం; పద్య సం.(లు) - 9-252-క., 9-253-వ.

  262) నాలుగష్టలు- (){జాతి}[కాలము]:- నాలుగష్టలు అంటే మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసములందలి కృష్ణపక్షమునందలి అష్టమితిథులు, ఇవి శ్రాద్ధభేదంబులు} - వంశం - కాలము; పద్య సం.(లు) - 7-448-వ.

  263) నాలుగుమోములనలువ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నాలుగుమోములనలువ అంటే చతుర్ముఖబ్రహ్మ. శ్రీమన్నారయణుని బొడ్డుదమ్మి యందు స్వయంభువుడైన (తనంతటనే) చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-8-సీ.

  264) నాల్గుయుగములు, నాలుగయుగములు- (){జాతి}[కాలము]:- నాల్గుయుగములు అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగములు అనేడి చతుర్యుగములు - వంశం - కాలము; పద్య సం.(లు) - 8-433-సీ.

  265) నాళము- ( ){జాతి}[వృక్ష]:- కమలముల కాడ - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 8-44-సీ.,

  266) నాళిని- (){జాతి}[అవయవము]:- పురంజనుని నవద్వార పురానికి నళిని, నాళిని అని రెండు తూర్పు ద్వారాలు ఉన్నాయి. నవద్వారపురం అంటే దేహము, నళినీనాళికలు ముక్కు రంధ్రాలకు సంకేతం. - వంశం - అవయవము; పద్య సం.(లు) - 4-768-వ.,

  267) నావ- (){జాతి}[పరికరములు]:- నావ జలముపై పోవు వాహన విశేషము, తెప్ప, మత్స్యావతారుడు చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో భూరూపమైన నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 1-50-సీ., 1-63-వ., 1-98-వ.,

  268) నాసత్యులు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నాసత్యులు అనగా నాసత్యుడు దస్రుడు అను ఇద్దరు అశ్వనీదేవతలు, దేవవైద్యులు. వృద్ధుడైన చ్యవనమహర్షి భార్య సుకన్యక, నాసత్యులు ఇద్దరను వేడి చ్యవనుడు యౌవనం పొందాడు. వారికి యాగాలలో సోమపానంలో భాగం కలిగించాడు.
పంచపాండవులలో నకుల సహదేవులు పాండురాజునకు రెండవ భార్యయైన మాద్రి యందు, నాసత్యుల ప్రసాదంగా పుట్టారు. - వంశం - దేవయోని; తండ్రి - సూర్యుడు; తల్లి - సంజ్ఞాదేవి (బడబగా); పద్య సం.(లు) - 9-57-వ., 9-673-వ.,

  269) నాస్తికులు- (పురుష){జాతి}[మానవ యోని]:- నాస్తికులు అంటే దేవుడు లేడని నమ్మేవారు, అవతారవైభవాలు వర్ణిస్తూ కలియుగం బ్రాహ్మణులు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు.
యుద్దవగీతలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు "మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు, అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు."
కలియుగంలో పరీక్షిత్తునకు భవిష్యత్తు కాలంలో శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు నాస్తికులు అయిన బ్రాహ్మణులు, సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్భుదము, మాళవ దేశాలకు ప్రభులు అవుతారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-198-మ., 3-255-సీ., 11-91-వ.,12-8-వ.

  270) నాహుషుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- నాహుషుడు అంటే నహుషుని కొడుకైన యయాతి. ఇతను శ్రీహరి గూర్చి యజ్ఢాలు చేసాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - నహుషుడు; పద్య సం.(లు) - 9-562-శా.,

  271) నికషాత్మజుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నికషాత్మజుడు అంటే నికష అను రాక్షసికి పుట్టిన నిరృతి అను దిక్పాలకుడు. ధర్మరాజు రాజసూయానికి వచ్చి చూసిన దేవతలు, దిక్పాలురుతో పాటు నిరృతి కూడా విచ్చేసి గొప్ప యాగమని మెచ్చుకున్నాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 10.2-773-చ.

  272) నికుంచితకరణము- (){జాతి}[నృత్తము]:- నికుంచితకరణము అంటేరాసక్రీడ యందలి అంగహారములోని శిరోవిశేషము వంపబడిన శిరస్సు కలవి. రాసక్రీడా పారిభాషిక పదము.- - వంశం - నృత్తము; పద్య సం.(లు) - 10.1-1084-వ.,

  273) నికుంభ-1 ( ){జాతి}[వృక్ష]:- నికుంభ అంటే దంతి చెట్లు అని నికుంభాసురుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ.,

  274) నికుంభ-2 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నికుంభ అంటే నికుంభాసురుడు అని దంతి చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రాక్షసుల యుద్ధాలు} ఉపమాన పదంగా వాడబడింది. సాగరమథానాయత్తంలో ఇంద్రాదులు అసురుల సాయం అపేక్షించు నప్పుడు, బలి యుద్ధవీరులలో కుంభనికుంభులకు సౌజ్యన్యం కైకొలిపారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 1-39-వ., 8-182-వ.

  275) నికుంభుడు-1 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ఈ నికుంభుడు అసురుడు, రావణాసురుని సేనలో వాడు. రామరావణ యుద్ధంలో రావణాసురుడు కుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ మున్నగు దానవులను పంపాడు. వారిని సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు ద్వంద్వ యుద్ధాలలో సంహరించారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 9-291-వ.,

  276) నికుంభుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ నికుంభుడు సూర్యవంశంలోని దుందుమారుని మనుమడు. దుందురాక్షసుని సంహరించు సమయంలో బ్రతికిబయటపడ్డ ముగ్గురు దుందుమారుడను కువలయాశ్వుని పుత్రులలో హర్యశ్వుని కొడుకు నికుంభుడు, నికుంభుని కొడుకు హర్హిణాశ్వుడు. అతనికి కృతాశ్వుడు పుట్టాడు. వీరి వంశంలోని వాడే మాంధాత. - వంశం - సూర్యవంశం; తండ్రి - హర్యశ్వుడు; కొడుకు(లు) - బర్హిణాశ్వుడు; పద్య సం.(లు) - 9-165-వ.,

  277) నికృతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. నికృతికి తండ్రి - దంభుడు; తల్లి - మాయ; భర్త - లోభుడు; కొడుకు - క్రోధుడు - వంశం - దేవయోని; తండ్రి - దంభుడు; తల్లి - మాయ ; భర్త - లోభుడు; కొడుకు(లు) - క్రోధుడు; కూతురు(లు)- హింస ; పద్య సం.(లు) - 4-215-వ,

  278) నిగమము- (){జాతి}[విద్య]:- నిగమము అంటే వేదం - వంశం - విద్య; పద్య సం.(లు) - 1-12-వ., 1-39-వ., 2-212-మ., 3-220-క., 4-442-సీ., 6-224-వ., 7-361-క., 8-433-సీ.,9-95-క., 10.1-170-ఉ., 10.1474-ఆ., 10.2-534-సీ., 11-72-ససీ.,

  279) నిగమాంతవిదలు- (పురుష){జాతి}[మానవ యోని]:- నిగమాంతవిదులు అంటే వేదాంతపండితులు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 9-680-క.

  280) నిచకుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిచకుడు చంద్రవంశంలోని వాడు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుని తరువాత తరంవాడు. ఆసీమకృష్ణుని కొడుకు. ఈ నిచకుని కాలంలో హస్తినాపురం గంగనదిలో మునిగిపోయింది. కనుక కొశంబి నగరానికి రాజధాని మార్చుకున్నాడు. ఈ నిచకుని కొడుకు ఉప్తుడు, మనుమడు చిత్రరథుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - ఆసీమకృష్ణుడు; కొడుకు(లు) - ఉప్తుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  281) నిజధృతి- ( ){సంజ్ఞా}[నది]:- విశ్వాచార వర్షంలో మహానసం అను సరిహద్దు పర్వతము, నిజధృతి అను నది ఉన్నాయి. - వంశం - నది; పద్య సం.(లు) - 5.2-68-వ.,

  282) నిటలతలాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిటలతలాక్షుడు అంటే నుదుట కన్ను కల శివుడు. అమృతసాధనకోసం సిద్ధం కాడంలో భాగంగా అసురులతో స్నేహం చేసి కలుపుకోండి అని విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలకు చెప్పాడు. ఆ సందర్భంలో శివుని నిటలతలాక్షా అని పలికాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 9-171-క.,.

  283) నిటలాంబకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిటలాంబకుడు అంటే నుదుట కన్ను గల పరమశివుడు. తృతీయస్కంధాంత ప్రార్థనలో నిటలాంబకప్రకటచాపవిఖండన అని అన్నారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-1042-చ., 10.2-324-ఉ., 10.2-406-వ., 10.2-1274-ఉ.

  284) నిటలాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిటలాక్షుడు అంటే నుదుట కన్ను కలవాడు పరమశివుడు. దక్షుడు శివుని శపించాడు అనుటలో నిటలాక్షుడు అని ప్రయోగించారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-47-వ., 10.1-750-క., 10.2-592-క.,

  285) నిమి-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిమి చంద్రవంశం వాడు. పరీక్షిత్తుకు భవిషయత్తు తరాలలోని వాడు. నిమి తండ్రి దూర్వుడు, పితామహుడు నృపంజయుడు. నిమి పుత్రుడు బృహద్రథుడు, మనవడు సుదాసుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దూర్వుడు; కొడుకు(లు) - బృహద్రథుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  286) నిమి-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ సూర్యవంశానికి చెందిన నిమి తరువాతి తరాలలో సీతాదేవి పుట్టింది. సూర్యవంశ మూలపురుషుడైన శ్రాద్ధదేవుని పుత్రుడు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుని నూరుగురు కొడుకులలో వికుక్షి (శశాదుడు), నిమి, దండకుడు ముఖ్యులు. వీరిలో నిమి చక్రవర్తి అయ్యాడు. నిమి పుత్రుడు వైదేహుడు మిథిలానగరాన్ని నిర్మించాడు. అతని వంశపు రాజులను మైథిలులు, వైదేహులు అని అంటారు. ఈ మైథిలిల యందు 22వ తరం సీరధ్వజునికి కొడుకు కుశధ్వజుడు, పుత్రిక శ్రీరాముని భార్య సీతాదేవి.
ఈ నిమి, వశిష్ఠుడు పరస్పరం పడమని శపించుకున్నారు. పిమ్మట వశిష్టుడు ఊర్వశికి మిత్రావరణుల వలన జన్మించాడు. మునీశ్వరులు నిమి దేహాన్ని జాగ్రత్త చేసి, దేవతలను నిమిని బ్రతికించమని వేడారు. కాని నిమి తత్వజ్ఞుడు కనుకఒప్పుకోలేదు. అంతట దేవతలు మానవులు కనురెప్పలు తెఱచినప్పుడు మూసినప్పుడు కనబడు గాక అని అన్నారు. ఆ నిమి కళేబరం మధించగా పుట్టినవాడు జనకుడు... ఇతని తరువాత వారిని జనకులు అనికూడా అంటారు.
నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - ఇక్ష్వాకుడు; కొడుకు(లు) - వైదేహుడు మిథులుడు మిథిలా నగరం నిర్మాత; పద్య సం.(లు) - 9-156-సీ., 9-367-సీ., నుండి 9-370 వరకు, 10.2-1189-వ.,

  287) నిమ్నుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిమ్నుడు సత్రాజితుని తండ్రి. చంద్రవంశంలోని వృష్ణికి సుమిత్రుడు, వానికి యుధాజిత్తు, వానికి శిని, అనమిత్రుడు పుట్టారు. ఆ అనమిత్రునికి పుత్రుడు నిమ్నుడు. నిమ్నునికి సత్రాజితుడు, ప్రసేనుడు అని ఇరువురు పుత్రులు. ఆ సత్రాజితు పుత్రిక శ్రీకృష్ణుని అష్టమహిషలలోని సత్యభామ. - వంశం - చంద్రవంశం; తండ్రి - అనమిత్రుడు; కొడుకు(లు) - సత్రాజిత్తు, ప్రసేనుడు, శిని, ప్రుశ్ని; పద్య సం.(లు) - 9-712-వ.

  288) నిమ్రోచి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- చంద్రవంశంలోని అనువు కొడుకు సాత్వతునకు ఏడుగురు పుత్రులు. వారిలో పెద్దవాడు భుజమానుడు. ఈ భుజమానునకు ప్రథమ భార్యయందు నిమ్రోచి, కంకణ, వృష్ణులు పుట్టారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - భజమానుడు; పద్య సం.(లు) - 9-709-వ.,

  289) నిమ్లోచని- ( ){సంజ్ఞా}[భగణ విషయం]:- వరుణుని పట్టణం నిమ్లోచని. మానసోత్తర పర్వతానికి పశ్చిమాన ఉంటుంది. తూర్పున ఇంద్రుని దేవధాని, దక్షిణమున యముని సంయమని, ఉత్తరమున సోముని విభావరి ఉంటాయి. సూర్యుడు ఈ నాలుగు పట్టణాలలో ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాల భేదాలను కల్పిస్తూ ఉంటాడు. - వంశం - భగణ విషయం; పద్య సం.(లు) - 5.2-81-వ.,

  290) నియతప్రఖ్యాతగాంధారి- (స్త్రీ){సంజ్ఞా}[చంద్రవంశం]:- నియతప్రఖ్యాతగాంధారి అనగా ధృతరాష్ట్రునికి కంటి చూపు లేదు కనుక. కళ్ళకు జీవితాంతం గంతలు కట్టుకుని గడిపిన గొప్ప నియమపాలకురాలు అగు గాంధారి - వంశం - చంద్రవంశం; భర్త - ధృతరాష్ట్రుడు; కొడుకు(లు) - దుర్యోధనాది కౌరవులు వందమంది; కూతురు(లు)- దుస్సల; పద్య సం.(లు) - 1-330-మ.,

  291) నియతి- (స్త్రీ){సంజ్ఞా}[ఋషి]:- ఈ నియతి మేరువు పుత్రిక, విధాత భార్య, ప్రాణుని తల్లి, వేదశిరుని పితామహి, శుక్రుని ప్రపితామహి. భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. అతనికి ఉశన అనే భార్యవల్ల శుక్రుడు జన్మించాడు. - వంశం - ఋషి; తండ్రి - మేరువు; భర్త - ధాత ; కొడుకు(లు) - ప్రాణుడు; పద్య సం.(లు) - 4-26-వ.,

  292) నియుతి- (స్త్రీ){సంజ్ఞా}[దైవయోని]:- ఏకాదశ రుద్రులకు బ్రహ్మదేవుడు నిర్దేశించిన భార్యలలో ఒకామె. రుద్రుడు శివుడు నామం కలిగి భార్య నియుతితో, జలము స్థానంగా కలిగి ఉంటాడు. - వంశం - దైవయోని; భర్త - శివుడు; పద్య సం.(లు) - 3-369-క., 3-370-వ.,

  293) నియోజ్య- (పురుష){జాతి}[మానవ యోని]:- నియోజ్యులు అంటే రాచకార్యముల నిమిత్తం నియమించబడిన వారు. పృథుచక్రవర్తి వంది, మాగధ, సూత, బ్రాహ్మణ, భృత్య, అమాత్య, పురోహిత, పౌర, జానపద, తైలిక, తాంబూలిక, నియోజ్య జనాలు అందరినీ ఉచిత విధానముల ప్రకారం గౌరవించాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-466-వ.

  294) నిరంజన- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . . శో. బ్రహ్మానారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః సర్వం నారాయణః నిష్కళంకో నిరంజనో నిర్వికారో నిరాకారో శుద్ధై కో నారాయణఃనద్వితీయోస్థి (నారయణోపనిషత్తు) - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-279-మ., 4-179-సీ.,

  295) నిరగ్నులు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిరగ్నులు అంటే సప్తవిధాగ్నులలో ఒకరు. వీరు ఏడుగురు ఎవరంటే అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు. ఈ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులు యజ్ఞాలు చేస్తారు. ఈ అగ్నులకు దక్షప్రజాపతి పుత్రిక ఐన స్వధ యందు వయన ధారిణి అని జ్ఞానవిజ్ఞాన పరాయణులూ బ్రహ్మనిష్ఠకలవారూ ఐన ఇద్దరు కన్యలు కలిగారు. అగ్నిదేవునికి దక్షపుత్రికయైన స్వాహాదేవియందు పావకుడు, పవమానుడు, శుచి అని ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురి వలన నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించారు. తాత, తండ్రులుతో కలిపి మొత్తం అగ్నులు నలభైతొమ్మిది మంది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-34-వ.,

  296) నిరతిశయ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-179-సీ.,

  297) నిరమిత్రుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిరమిత్రుడు చంద్రవంశంలోని జరాసంధుని వంశంలోని వాడు. జరాసంధుని మనుమడు మార్జాలికి మనుమడు ఐన అయుతాయువు కొడుకు ఈ నిరమిత్రుడు. ఈయన కొడుకు సునక్షత్రుడు. అతని పిమ్మట 16 మంది వీరి వంశవారిని నవమ స్కంధంలో ఉదహరించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - అయుతాయువు; కొడుకు(లు) - సునక్షత్రుడు; పద్య సం.(లు) - 9-681-వ.

  298) నిరమిత్రుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిరమిత్రుడు పాండవుల వంశంలో పుట్టిన వాడు. పంచపాండవులలోని నకులునికి భార్యరేణుమతి యందు పుట్టినవాడు ఈ నిరమిత్రుడు - వంశం - చంద్రవంశం; తండ్రి - నకులుడు; తల్లి - రేణుమతి; పద్య సం.(లు) - 9-673-వ.

  299) నిరయం- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. నిరయంకి తండ్రి - భయం; తల్లి - మృత్యువు; భర్త - యాతన; - వంశం - దేవయోని; తండ్రి - భయం; తల్లి - మృత్యువు; భర్త - యాతన; పద్య సం.(లు) - 4-215-వ,

  300) నిరయము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నిరయము అంటే నరకము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-641-సీ.,

  301) నిరవద్యుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిరవద్యుడు అంటే విష్ణువు, నిందలేనివాడు కనుక నిరవద్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-279-మ., 3-869-ఉ.,

  302) నిరృతి-1 (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఈ నిరృతికి కొడుకు - దంభుడు (పెంపుడు కొడుకు), అధర్మునకు మృష అను భార్య యందు దంభుడు, మాయ అని కొడుకు, కూతురు. వారిలో దంభుడిని సంతానహీనుడైన నిరృతి దత్తత తీసుకున్నాడు. - వంశం - దేవయోని; కొడుకు(లు) - దంభుడు (పెంపుడు కొడుకు); కూతురు(లు)- మాయ (పెంపుడు కూతురు; పద్య సం.(లు) - 4-215-వ,

  303) నిరృతి-2 (పురుష){సంజ్ఞా}[రాక్షసయోని]:- బ్రహ్మ దేవుని మలద్వారం నుండి పుట్టాడు. ఇతడు రాక్షసుడు. నైరుతి దిక్పాలకుడు. - వంశం - రాక్షసయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; పద్య సం.(లు) - 3-378-సీ.

  304) నిరృతి-3 (){సంజ్ఞా}[మానవ యోని]:- పురంజనోపాఖ్యానంలో నవద్వారకలిత పురానికి పడమటి వాకిళ్ళులో ఒకటి ఆసురి, రెండవది నిరృతి. అందు ఆసురి ద్వారంనుండి దుర్మదసమేతుడై గ్రామక నామక విషయాలు పొందుతాడు, లుబ్దక యుక్తుడై వైశసన మను విషయం పొందుతాడు. ఇవి గుహ్యేంద్రియానికి, గుదములకు ప్రతీకగా వాడబడినవి. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-768-వ.,

  305) నిరృతి-4 (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నిరృతి అష్టదిక్పాలకులలో నైరృతి మూల (దక్షిణపశ్చిమ)ను ఏలెడివాడు, రాక్షసుడు, సృష్టిభేదనం వర్ణిస్తూ బ్రహ్మదేవుని మలద్వారం నుండి పాపాశ్రయుడైన “నిరృతి” జన్మించాడు అని చెప్పారు.
అధర్మునకు మృష అనే భార్యయందు దంభుడు అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు.
పురంజనోపాఖ్యానంలోని పురానికి రాజైన పురంజనుడు నిరృతి అనే పడమటి వాకిలి నుండి లుబ్ధకునితో కూడి వైశసం అనే విషయానికి వెళ్ళుతుంటాడు. ఇందు నిరృతి అనే పడమటి వాకిలి అనగా గుదము, వైశసనము అనగా నరకము మఱియు లుబ్దకుడు అంటే పాయువు.
అర్జునుడు మరణించిన ద్వారకలోని బ్రాహ్మణుని పుత్రులను తీసుకురాడానికి బయలుదేరివెళ్ళి యమ సదనంలో చూసిన పిమ్మట *నిరృతి* మున్నగు దిక్పాలకుల నివాసాలకు ఇంకా అన్నిలోకాలకు వెళ్ళి అన్వేషించాడు. వారి జాడ దొరకలేదు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 3-378-సీ., 4-215-సీ., 4-768-వ., 10.2-1300-క.,

  306) నిర్గుణబ్రహ్మ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిర్గుణబ్రహ్మము అంటే గుణరహితుడైన పరబ్రహ్మ. మహనీయులు విధివిషేధాలు విడనాడి నిర్గుణబ్రహ్మను ఆశ్రయించి, సదా మాధవుని కీర్తిస్తుంటారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-6-తే.

  307) నిర్గుణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిర్గుణుడు అంటే గుణరహితుడైన పరమేశ్వరుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-110-మ., 3-473-వ.,

  308) నిర్జరగంగ- (){సంజ్ఞా}[నది]:- నిర్జరగంగ అంటే దేవగంగ - వంశం - నది; పద్య సం.(లు) - 10.1-951-మ.,

  309) నిర్జరనాథుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిర్జరనాథుడు అంటే దేవతల రాజు ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-359-క.,

  310) నిర్జరనారి- (స్త్రీ){జాతి}[దేవయోని]:- నిర్జరనారి అంటే దేవతాస్త్రీలైన అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1385-క.,

  311) నిర్జరపురి- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నిర్జరపురి అంటే దేవతల పురము. కార్తవీర్యార్జునుని కొడుకులు జమదగ్ని మహర్షి తల నరికి పోయారు. అప్పుడు అతని పుత్రులు "తండ్రీ! కొడుకులం మేం తోడు రాకుండా గుమ్మం దాటి వెళ్లవు. అటువంటి నీవు ఒంటరిగా స్వర్గానికి ఎలా పోయావు. అంటూ విలపించారు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-481-క.

  312) నిర్జరఫలి- (){జాతి}[వృక్ష]:- నిర్జరఫలి అంటే దేవతావృక్షమైన కల్పతరువు - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 10.2-94-క.,

  313) నిర్జరలోకము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నిర్జరలోకం అంటే దేవతలలోకం స్వర్గం. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 2-151-చ., 12-18-వ.,

  314) నిర్జరాంగనలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- నిర్జరాంగనలు అంటే దేవతాస్త్రీలు, అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-302-క.,

  315) నిర్జరారాతి- (పురుష){జాతి}[రాక్షస యోని]:- నిర్జరారాతి అంటే దేవతశత్రువు రాక్షసుడు, హిరణ్యకశిపుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-80-వ.,

  316) నిర్జరారాతిహంత- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిర్జరారాతి హంత అంటే రాక్షసులను సంహరించువాడు, శ్రీరాముడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-481-మాలి., 8-667-సీ., 11-126-మాలి.

  317) నిర్జరులు- (){జాతి}[దేవయోని]:- నిర్జరులు అంటే జర (ముసలితనము) లేని వారైన దేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-72-వ., 7-110-మ., 9-635-వ.,

  318) నిర్జరేంద్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిర్జరేంద్రుడు అంటే దేవేంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-351-శా., 9-308-ఉ.,10.1-679-ఉ.,

  319) నిర్దోషుడు- (పురుష){సంజ్ఞా}[ఋషి]:- నిర్దోషుడు,శౌల్కాయని, బ్రహ్మబలి, పిప్పలాయనుడు వేదదర్శుడు నుండి అధర్వవేదాన్ని నేర్చుకున్నారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 12-30-వ.,

  320) నిర్ద్వంద్వుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నిర్ద్వంద్వుడు అంటే సుఖదుఃఖ శీతోష్ణాది సకల ద్వంద్వాలను అధిగమించినవాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-11-సీ.,

  321) నిర్మలాత్మ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-179-సీ.,

  322) నిర్మోహుడు-1 (పురుష){సంజ్ఞా}[మనువు వంశం]:- ఈ నిర్మోహుడు, విరజస్కుడు ఎనిమిదవ మనువు సూర్యసావర్ణి కొడుకులు, ఆ ఎనిమిదవ మన్వంతరంలో రాజులు అవుతారు. - వంశం - మనువు వంశం; తండ్రి - సూర్యసావర్ణిమనువు; పద్య సం.(లు) - 8-415-వ.,

  323) నిర్మోహుడు-2 (పురుష){సంజ్ఞా}[ఋషి]:- ఈ నిర్మోహుడు భవిష్యత్కాలపు దేవసావర్ణి మన్వంతరంలోని సప్తర్షులలో ఒకడు. . రాబోయే కాలంలో వచ్చే దేవసావర్ణి మన్వంతరంలో సుకర్ములూ, సుత్రాములూ దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడూ, తత్త్వదర్శుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - ఋషి; పద్య సం.(లు) - 8-425-వ.,

  324) నిర్వాక్కు- (){సంజ్ఞా}[మానవ యోని]:- పురంజనోపాఖ్యానంలో పురంజనుడు నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరి సాయంతో గమనం కరణం అనే పనులు చేసేవాడని చెప్పబడింది. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-768-సీ.,

  325) నిర్వాణపదము.- (){జాతి}[విద్య]:- నిర్వాణపదము అంటే ముక్తిపదము - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-943-వ., 6-55-సీ.,

  326) నిర్వాణరుచులు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- ఈ నిర్వాణచరులు రాబోయే పదకొండవ మన్వంతరపు దేవతలలోని వారు. భవిష్యత్తులోది, పదకొండవది అయిన ధర్మసావర్ణి మన్వంతరంలో విహంగములూ, కామగమనులూ, నిర్వాణరుచులూ దేవతలు అవుతారు. వైధృతుడు ఇంద్రుడు అవుతాడు. వరుణుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-421-వ.,

  327) నిర్వాణసంధాయకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతిస్తూ నిర్వాణసంధాయకా అనియూ సంభోదించింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-201-శా.,

  328) నిర్వింధ్య- ( ){సంజ్ఞా}[మహానది]:- ఈ నిర్వింధ్యా నది సమీప అడవిలో అత్రి మహాముని తపస్సు చేసాడు. మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ అంశతో అయనకి భార్య అనసూయ యందు చంద్రుడు, దత్తుడు, దూర్వాసుడు అను పుత్రులను ప్రసాదించారు. భారతవర్షంలోని ప్రసిద్ధమైన పర్వతాలకు పుత్రికలవంటివి అయిన మహానదులలో ఒక నది.
బలరాముడు తన తీర్థయాత్రలో తాపి పయోష్ఠి దర్శించిన పిమ్మట నిర్వింధ్యా నదిని దాటాడు. దండకావనం వెళ్ళి మహిష్మతీ పురంలో కొన్నాళ్ళు ఉన్నాడు - వంశం - మహానది; పద్య సం.(లు) - 4-11-సీ., 5.2-55-వ., 10.2-953-వ.

  329) నిర్వికార- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-179-సీ.,

  330) నిర్వృతి- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిర్వృతి చంద్రవంశలోని రుచిక పుత్రుడైన జ్యాముఖుని తరువాత తరాలలోని ధృష్టి కొడుకు. నిర్వఃతి కొడుకు దశార్హుడు. ఈ దశార్హుడు కుంతీ దేవికి పూర్వజుడు. . - వంశం - చంద్రవంశం; తండ్రి - దృష్టి; కొడుకు(లు) - దశార్హుడు; పద్య సం.(లు) - 9-709-వ.

  331) నిలయము- (){జాతి}[ప్రదేశము]:- నిలయము అంటే ఇల్లు, నివాసము, జనవాసము, పట్టణము. పృథుచక్రవర్తి జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన పెక్కు క్రొత్త నిలయములు ఏర్పరిచాడు. ద్వారకానగర సౌందర్యాన్ని నిరృతి పట్టణము కృష్ణాంగన తో పోల్చబడింది. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-25-క., 4-506-క., 6-282-వ., 10.2-601-వ., 10.2-1021-సీ.,

  332) నిలాయనక్రీడ- (){జాతి}[విద్య]:- నిలాయనక్రీడ ఒక రకమైన బాలుర ఆట. ఇప్పటి పేరు దాగుడుమూతలు - వంశం - విద్య; పద్య సం.(లు) - 10.1-1183-వ.,

  333) నిలింపజనని- (){సంజ్ఞా}[జంతు]:- నిలింపజనని అంటే కామధేనువు దేవతలకు తల్లి వంటిది కనుక - వంశం - జంతు; పద్య సం.(లు) - 10.1-951-మ.,

  334) నిలింపపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిలింపపతి అంటే ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-891-వ.,

  335) నిలింపభర్త- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిలింపభర్త అనగా దేవతలప్రభువు ఇంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-545-ఉ.,

  336) నిలింపవైరి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నిలింపవైరి అంటే దేవతల శత్రువు. రాక్షసులు. హిరణ్యకశిపుడు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-227-ఉ., 8-327-క.,

  337) నిలింపాంగనలు- (స్త్రీ){జాతి}[దేవయోని]:- నిలింపాంగనలు అనగా అప్సరసలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1128-శా.

  338) నిలింపారాతి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నిలింపారాతి అంటే దేవతల శత్రువు. హిరణ్యకశిపుడు అమోఘమైన వరాలు సంపాదిచుకున్నాడు అని చెప్తూ నిలింపారాతి అని ప్రయోగింపబడింది. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-93-వ.,

  339) నిలింపాహితజిష్ణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- కంటిగంటి భవాద్దిదాటగకంటి అనుకుంటూ నిర్యాణానికి సిద్దమవుతు చతుర్బాహుడైన కృష్ణుని దర్శించుకుంటున్న సమయంలో వచ్చిన మైత్రేయుడు కూడా కృష్ణుని సందర్శించాడు అ సందర్భలో వాడిన నిలింపాహితజిష్ణువు అనగా నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-148-మ.,

  340) నిలింపులు- (పురుష){జాతి}[దేవయోని]:- నిలింపులు అంటే దేవతలు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-672-క., 6-359-వ., 7-114-వ.,

  341) నివాతకవచులు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నివాతకవచులు అంటే దృఢమైన కవచము కల రాక్షసులు. దైత్యులలో ఒక తెగవారు. ప్రహ్లాదుని వంశస్థులు. భారతమున వీరిని దానవులు అని చెప్పి ఉన్నది. వీరు అందఱును తుల్యరూపబలప్రభలు కలవారు. వీరిసంఖ్య ముప్పదికోట్లు. సముద్రమధ్యము వాసస్థానముగా చేసికొని దేవతలకు మిక్కిలి బాధకావించుచు ఉండఁగా వీరిని ఇంద్రప్రేరితుఁడై అర్జునుఁడు చంపెను అని పురాణనామచంద్రిక. 1. రసాతలంలో దైత్యులు, దానవులు హిరణ్యపురవాసులు అయిన నివాతకవచులు, కాలకేయులు ఉంటారు. వారు దేవద్వేషులు, మహా సాహసవంతులు, తేజోవంతులు. అయినా శ్రీహరి తేజస్సుకు లొంగి పుట్టలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో రసాతలంలో బ్రతుకుతుంటారు. ఇంద్రదూతి సరమ ఉచ్చరించే మంత్రాలకు బెదురుతూ ఉంటారు.
2. అర్జునుడు ధర్మరాజునకు కృష్ణ నిర్యాణం అనంతరం కృష్ణుని అంతఃపుర స్త్రీలను తీసుకువెళ్తుంటే, కృష్ణుడు తన కోదండం మున్నగునవి వ్యర్థ మైపోయాయి. ఇంతకు మునుపు వీటితోనే కదా కాలకేయ, నివాతకవచాది రాక్షసులను సంహరించాను అని బాధతో చెప్తాడు.
విష్ణుమూర్తి ఆజ్ఞానుసారం ఇంద్రాదులు, సాగరమథన యత్నం కోసం రాక్షసుల సహకారం సంపాదించడానికి, బలిచక్రవర్తి కొలువు చేరారు. అందు పౌలోమ కాలకేయ నివాతకవచాదుల యెడ బాంధవంబు ప్రకటించారు.
దేవతలు దక్కి, తమకు అమృతం దక్కకపోవడంతో బలినాయకత్వంలో నివాతకవచాదులు ఇంద్రునిపైకి యుద్దానికి వెళ్ళారు. వారి వాహనాలు రథాలూ, గుఱ్ఱాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గమృగాలు, గండభేరుండాలు, సవరపుమృగాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను; రాంబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మున్నగు పక్షులను; తిములు, తిమింగలాలు మున్నగు జలచరాలనూ; నరవాహనాలను; రాక్షసాకారాలతో, దేవతాకారాలతో వికారాలైన ఆకారాలు గల జంతువులు. వారి సాధనాలు గొడుగులు, జండాలూ, కవచాలూ, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మున్నగునవి. ఆ యుద్ధంలో నివాతకవచులతో మరుత్తులు పోరారు. - వంశం - రాక్షస యోని; తండ్రి - కశ్యపుడు; తల్లి - దితి; పద్య సం.(లు) - 5.2-119-వ.,1-366-సీ., 8-182-వ., 8-331-వ., 8-334-వ.,

  342) నిశాకరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశాకరుడు అంటే, రాత్రి ప్రకాశించువాడు కనుక, చంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-498-ఉ.,

  343) నిశాచరపుత్రుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- నిశాచరపుత్రుడు అంటే ప్రహ్లాదుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-385-ఉ..,

  344) నిశాచరభేది- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశాచరభేది శ్రీకృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1156-వ.,

  345) నిశాచరసంహారుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశాచరసంహారుడు అంటే విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 7-492-చ.,

  346) నిశాచరాగ్రణి- (పురుష){సంజ్ఞా}[రాక్షస యోని]:- ప్రహ్లాదుడు, చదువుకున్నవాటిలో బాగా నచ్చినది అడిగిన తండ్రి కశిపునికి, సమాధానం చెప్తూ తండ్రిని నిశాచరాగ్రణీ అని సంబోధించాడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 7-142-ఉ.,

  347) నిశాచరుడు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- నిశాచరుడు అంటే రాక్షసుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 2-146-మ., 6-367-చ., 7-76-శా., 7-193-ఉ.,

  348) నిశాచరోగ్రవికల్పుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- నిశాచరోగ్రవికల్పుడు, రాక్షసులను నాశము చేయువాడైన బలరాముడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-358-సీ.,

  349) నిశాటవిపాటనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశాటవిపాటనుడు అంటే రాక్షసులను పడగొట్టువాడు శ్రీకృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-579-క.,

  350) నిశాటుడు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- నిశాటుడు అంటే రాక్షసుడు - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 2-160-క., 2-169-మ., 2-190-చ, 2-205-మ., 3-625-క.,

  351) నిశానాయకుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశానాయకుడు అంటే రాత్రికి విభుడు అంటే చంద్రుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-371-వ.

  352) నిశాపతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిశాపతి అంటే చంద్రుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-966-క.,

  353) నిశీథ- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఈ నిశీథ అనువాడు ధృవుని వంశంవాడు. ఇతడు పుష్పార్ణుడుకి దోష యందు పుట్టిన రెండవ కొడుకు. ధృవుని పుత్రుడైన వత్సరునికి ఆరుగురు కొడుకులు. వారిలో పుష్పార్ణునికి ప్రభ, దోష అని ఇద్దరు భార్యలు. అందు దోషకు ప్రదోష, నిశీథ, వ్యుష్టులనువారు పుట్టారు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - పుష్పార్ణుడు; తల్లి - దోష; పద్య సం.(లు) - 4-390-వ.,

  354) నిశుంభుడు- (పురుష){సంజ్ఞా}[రాక్షసయోని]:- దేవతలకు దక్కి, తమకు అమృతం దక్కకపోవడంతో బలినాయకత్వంలో శుంభ నిశుంభాది అసురులు ఇంద్రునిపైకి యుద్దానికి వెళ్ళారు. వారి వాహనాలు రథాలూ, గుఱ్ఱాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గమృగాలు, గండభేరుండాలు, సవరపుమృగాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను; రాంబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మున్నగు పక్షులను; తిములు, తిమింగలాలు మున్నగు జలచరాలనూ; నరవాహనాలను; రాక్షసాకారాలతో, దేవతాకారాలతో వికారాలైన ఆకారాలు గల జంతువులు. వారి సాధనాలు గొడుగులు, జండాలూ, కవచాలూ, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మున్నగునవి. శుంభ నిశుంభులతో భద్రకాళీదేవి యుద్ధం చేసింది. - వంశం - రాక్షసయోని; పద్య సం.(లు) - 8-331-వ., 8-334-వ.,

  355) నిషంగచయము- (){జాతి}[పరికరములు]:- నిషంగచయము అంటే అమ్ములపొదులు - వంశం - పరికరములు; పద్య సం.(లు) - 6-79-క., 10.2-1292-చ.

  356) నిషధ- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నిషధ ఒక దేశం పేరు. కంసుడు తండ్రి ఉగ్రసేనుని బంధించాడు. తండ్రి ఏలుతున్న యదు, భోజ, అంధక దేశాలు, వసుదేవుని తండ్రికి చెందిన శూరసేనదేశాలు ఏలసాగాడు. యుద్దాలలో ఓడిన యదువులు చాలా మంది నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాళ్వ దేశాలు పట్టిపోయారు. కొంతమంది పగ వీడి కంసుని కొలుస్తూ ఉండిపోయారు. పరీక్షిత్తునకు భవిష్యత్తులోని రాజులలో వైఢూర్యపతులు నిషధ దేశానికి అధిపతులు అవుతారని శుకబ్రహ్మ చెప్పారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.1-56-వ., 12-8-వ.

  357) నిషధ పర్వతం-1 ( ){సంజ్ఞా}[పర్వతం]:- ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం అనే మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. ఇవి తూర్పునుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీని నిడివి నీల శ్వేత శృంగవత్పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు పర్వతాల నడుమ హరివర్షం, కింపురువర్షం, భరతవర్షం అనే మూడు వర్షములు ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-20-వ.,

  358) నిషధ పర్వతం-2 ( ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-30-వ.,

  359) నిషధుడు-1 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిషధుడు కురువు యొక్క నాలుగవ పుత్రుడు. అజమీఢుని మనుమడైన సంవరుణునకు భార్య సుర్యపుత్రియైన తపతి యందు కురువు పుట్టాడు. కురువునకు పరీక్షిత్తు (శుకుని శిష్యునికి పూర్వజుడు), సుధనువు, జహ్నువు, నిషధుడు అని నలుగురు కొడుకులు - వంశం - చంద్రవంశం; తండ్రి - కురువు; పద్య సం.(లు) - 9-659-వ.,

  360) నిషధుడు-2 (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ నిషధుడు శ్రీరాముని మునిమనుమడు. శ్రీరామచంద్రుని పుత్రుడైన కుశుని కొడుకు అతిథి. అతిథి కొడుకు నిషధుడు. ఇతని కొడుకు నభుడు, మనుమడు పుండరీకుడు. జైమిని శిష్యుడైన హిరణ్యనాభుడు, కలాప గ్రామంలో ఉన్న మరువు, భారతయుద్ధంలో అభిమన్యునిచే హతుడైన బృహద్బలుడు మున్నగు వారు వీరి వంశంలోని వారే. - వంశం - సూర్యవంశం; తండ్రి - అతిథి; కొడుకు(లు) - నభుడు; పద్య సం.(లు) - 9-364-వ.,

  361) నిషధుడు-3 (పురుష){సంజ్ఞా}[సూర్య వంశం]:- రాజ్యమోహంతో గర్వాంధులైన రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది అంటూ పేర్కొన్న ఇరవై ఎనిమిది రాజులలో ఇతను ఒకడు. - వంశం - సూర్య వంశం; పద్య సం.(లు) - 12-18-వ.,

  362) నిషాద- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- నిషాద అనునది ఒక దేశం పేరు. ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కనుగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

  363) నిషాదము- (){జాతి}[విద్య]:- నిషాద సంగీత శాస్త్రంలోని సప్తస్వరాలలో ఏడవది. షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అనునవి సప్తస్వరములు. "నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ ధైవతాః, పంచమశ్చేత్యమీ సప్తతంత్రీ కంఠోత్థితాః స్వరాః" [అమరకోశము 1-6-1]} - వంశం - విద్య; పద్య సం.(లు) - 2-188-సీ.,

  364) నిషాదుడు- (పురుష){సంజ్ఞా}[ధ్రువుని వంశం]:- ఈ నిషాదుడు ధ్రువుని వంశంలోని వేనుని కొడుకు. చెడుమార్గాలు పట్టిన అంగరాజుపుత్రుడైన అంగరాజు వేనుని మునులు మరణించమని శపించగా. దేశానికి రాజు కావాలి కనుక తల్లి సునీథి అనుమతితో అతని శరీంరంలోని తొడభాగాన్ని మథించగా నిషాదుడు పుట్టాడు. అతను రాజార్హుడు కాడని, కుడిభుజాన్ని మథించగా నారాయణాంశతో పృథువు, లక్ణీదేవి అంశతో అర్చి జన్మించారు. నిషాదుని వంశంవారు కొండకోనలలో గిరిజనులై తిరుగుతూ ఉన్నారు. - వంశం - ధ్రువుని వంశం; తండ్రి - వేనుడు; పద్య సం.(లు) - 4-433-సీ.

  365) నిషాదులు- (పురుష){జాతి}[మానవ యోని]:- నిషాదులు అంటే అడవి మనుషులలో ఒక జాతి. వీరు వేనుని తొడ మథించగా పుట్టిన నిషాదుని వంశం వారు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 4-433-సీ.

  366) నిషిద్ధాన్నము- (){జాతి}[ఆహారము]:- నిషిద్ధాన్నము అంటే భుజిపం కూడని ఆహారము. ఇది ఎంగిలిపడినది (తినగా మిగిలినది), కాళికాదేవికి పెట్టిన నైవేద్యము, వెంట్రుకలు కుక్క పిల్లి పక్షి క్రిమి చీమాదులచే అపరిశుభ్రమైనది, మాంసాహారము కలిసినది, కళంకులు తెచ్చినది అని పంచవిధ నిషిద్ధాన్నములు - వంశం - ఆహారము; పద్య సం.(లు) - 6-520-ఆ.

  367) నిషుమంతుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నిషుమంతుడు శ్రీకృష్ణునికి పినతండ్రి కొడుకు. వసుదేవుని సోదరుడు దేవశ్రవుడు భార్య కంసవతులకు వీరుడు, నిషుమంతుడు అని ఇద్దరు కొడుకులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - దేవశ్రవుడు; తల్లి - కంసవతి; పద్య సం.(లు) - 9-722-వ.,

  368) నిష్కము- (){జాతి}[ఆహార్యం]:- నిష్కము అనునది పాతకాలపు నాణెము, మాడ అని కొందరు 108 మాడలు అని కొందరు, 10 రూకలు అను వెండి నాణెములు అని కొందరు అంటారు. నారదులవారు శ్రీకృష్ణుని పదహారువేల భార్యలతో విహారాలు చూడడానికి వచ్చినప్పుడు, కంచుకులు అను అంతఃపురకావలివారు ఎలా ఉన్నారంటే. బంగారు నిష్కాలహారాలు మెడలో వ్రేల్లాడుతున్నాయిట. మెరుస్తున్న రవికెలు, తలపాగాలు, చెవులకు కనక కుండలాలు ధరించి ఉన్నారుట. - వంశం - ఆహార్యం; పద్య సం.(లు) - 10.2-605-వ.

  369) నిష్కళంక- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . .
గిరిధారణతో గిరిధరుడు గర్వంభంగం చేసాక ఇంద్రుడు దిగివచ్చి శ్రీకృష్ణుని నిష్కళంక అని కూడ స్తుతించాడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-179-సీ., 10.1-912-ఆ.,

  370) నిష్కించనుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నిష్కించనుడు అంటే నిరిపేద, పోగుపడిన పాపపుణ్యాలు ఏమీ లేనివాడు అని సంకేతార్థము - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-2321-సీ., 10.2-1186-వ.,

  371) నిష్క్రియారంభ- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- దక్షుడు మేషముఖుడై పునరుజ్జీవు డైన సందర్భంలో దక్షాదులతో పాటు బ్రహ్మదేవుడు స్తుతిస్తూ విష్ణువును ఇలా పేర్కొన్నాడు . . నిర్వికార! నిరంజన! నిష్కళంక! నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!. . . - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-179-సీ.,

  372) నిష్ఫలారంభులు- (పురుష){జాతి}[మానవ యోని]:- నిష్ఫలారంభులు అంటే పనికిమాలిన పనులు చేపట్టువారు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 11-91-వ.

  373) నీపము- (){జాతి}[వృక్ష]:- నీపచెట్టు అంటే మంకెన చెట్టు. దేవతలు కైలైసపర్వతం చేరిన సందర్భంలో ఆ పర్వతవర్ణనలో నీప కూడా చెప్పబడింది - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 4-135-వ.,

  374) నీపుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నీపుడు చంద్రవంశరాజు. తండ్రిపారుడు, తాతపృథుసేనుడు, ముత్తాత ప్రాజ్ఞుడు. ఇతనికి వందమంది పుత్రులు. ఇతను శుకుని కూతురైన సత్కృతిని కోరి వివాహమాడాడు. వీరికి బ్రహ్మదత్తుడు పుట్టాడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పారుడు; భార్య - సత్కృతి; కొడుకు(లు) - బ్రహ్మదత్తుడు మఱియు వందమంది పుత్రులు; పద్య సం.(లు) - 9-653-వ., 9-654-ఆ.

  375) నీరచరము- (){జాతి}[జంతు]:- నీరచరము అంటే జలచరము - వంశం - జంతు; పద్య సం.(లు) - 6-205-క.

  376) నీరజగర్భుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజగర్భుడు అంటే విష్ణు నాభి కమలంలో జనించిన బ్రహ్మదేవుడు. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-243-చ. 3-383-మ., 6-500-ఉ.,

  377) నీరజదళనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజదళనేత్రుడు అనగా కలువరేకులవంటి కన్నులు కల కన్నయ్య - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-49-క.,

  378) నీరజనాభుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజనాభుడు అంటే పద్మనాభుడు విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-340-క., 11-106-క.,

  379) నీరజనివాసము- (){జాతి}[ప్రదేశము]:- నీరజనివాసము అంటే సరస్సు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-607-శా.,

  380) నీరజనేత్ర- (స్త్రీ){జాతి}[మానవ యోని]:- నీరజనేత్రి అనగా పద్మములవంటి కన్నులు గల సుందరి - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1276-క.,

  381) నీరజనేత్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిరజనేత్రుడు అంటే పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1041-ఉ.,

  382) నీరజబంధువు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజబంధువు అంటే పద్మబాంధవుడైన సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-219-మ., 7-80-వ.,

  383) నీరజభవుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజభవుడు అంటే విష్ణునాభి పద్మమున జన్మించిన బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 4-509-సీ., 6-489-క.,

  384) నీరజము- (){జాతి}[వృక్ష]:- నీరజము అంటే పద్మము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 3-45-ఉ., 4-418-వ.,

  385) నీరజలోచనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజలోచనుడు పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు. ద్వారకావాసులు కృష్ణుడు దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు బెంగపడుతున్నాం అనునప్పుడు ఇలా వర్ణించబడింది - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-255-ఆ.,

  386) నీరజాక్షి- (స్త్రీ){జాతి}[దేవయోని]:- నీరజాక్షి పద్మములవంటి కన్నులు కల సుందరి. అమృత వితరణకు వచ్చిన మోహినీదేవి - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-305-సీ., 10.2-26-మ.,

  387) నీరజాక్షుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజాక్షుడు అంటే పద్మాక్షుడైన విష్ణుమూర్తి. కుంతీ స్తుతిలో ఇలా వర్ణింపబడింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-189-సీ., 8-387-సీ.,

  388) నీరజాతనయనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరజాతనయనుడు అనగా పద్మాక్షుడైన కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.1-1711-సీ.,

  389) నీరజాతము- (){జాతి}[వృక్ష]:- నీరజాతము అంటే పద్మము - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 10.1-997-సీ.,

  390) నీరజాతేక్షణి- (){సంజ్ఞా}[మానవ యోని]:- నీరజాతేక్షణి కలువకన్నుల సత్యభామ, నరకాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.2-183-సీ.,

  391) నీరజాసనుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నిరజాసనుడు అంటే పద్మము ఆసనముగాగల బ్రహ్మదేవుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 8-737-ఆ.

  392) నీరదము- (){జాతి}[ప్రదేశము]:- నీరదము అంటే నీరునిచ్చునది కనుక మేఘము మబ్బు - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-8-ఉ., 1-30-ఉ.,

  393) నీరదశ్యామాంగుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరదశ్యామాంగుడు అంటే మబ్బుల ఛాయ శరీరఛాయ కలవాడు, విష్ణువు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 5.1-50-క.,

  394) నీరధి- (){జాతి}[ప్రదేశము]:- నీరధి అంటే నీటికి నిధి ఐన సముద్రము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-885-చ., 9-70-సీ.,

  395) నీరరాశి- (){జాతి}[ప్రదేశము]:- నీరరాశి అంటే సముద్రము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 8-554-సీ.,

  396) నీరాగారము- (){జాతి}[ప్రదేశము]:- నీరాగారము అంటే దారినపోవువారికి త్రాగునీటిని దొరకు ప్రదేశము చలివేంద్రము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 7-38-శా.,

  397) నీరాజనము- (){జాతి}[విద్య]:- నీరాజనము అంటే హారతి - వంశం - విద్య; పద్య సం.(లు) - 3-820-వ.,

  398) నీరాటము- ( ){జాతి}[జలచర]:- మొసలి, నీటి యందు చరించునది - వంశం - జలచర; పద్య సం.(లు) - 8-52-క., 8-55-వ., 8-57-శా.,

  399) నీరేజపత్రేక్షణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీరేజపత్రేక్షణుడు అంటే పద్మముల రేకులవంటి న్నులు కలవాడైన విష్ణుమూర్తి. శ్రీనాథనాథా దండకంలో వర్ణన ఇది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-203-దం., 10.1-408-శా.,

  400) నీరేజముఖి- (స్త్రీ){జాతి}[దేవయోని]:- నీరేజముఖి అంటే పద్మమువంటి ముఖము కల అందగత్తె. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-204-క.,

  401) నీరేజహితుడు- (పురుష){జాతి}[దేవయోని]:- నీరేజహితుడు పద్మబాంధవుడు సూర్యుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 10.2-1341-క.,

  402) నీల- ( ){జాతి}[వృక్ష]:- నీల అంటే నీలి చెట్లు లేదా నీలితుప్పలు అని నీలు డనే వానర వీరుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రామసేతువు నిర్మాణం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 1-39-వ., 1-123-వ.,

  403) నీలం- ( ){జాతి}[నిధులు]:- కుబేరుని వద్ద ఉండే నవనిధులలో ఒకటి. ద్వారకకు తరలి వచ్చిన శ్రీకృష్ణునికి సకల లోకపాలకులు కానుకలు సమర్పించారు. వారిలో కుబేరుడు మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను సమర్పించాడు. - వంశం - నిధులు; పద్య సం.(లు) - 6-326-వ., 10.1-1613-వ.,

  404) నీలంపుటరుగులు- (){జాతి}[ప్రదేశము]:- శ్రీరాముని ప్రవేశ సందర్భంలో రాజభవన వర్ణనలో నీలమణులు పొదిగిన అరుగులు ఉన్నాయని వర్ణించారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 9-327-సీ.,

  405) నీలకంఠ- ( ){జాతి}[గగనచర]:- నీలకంఠ అంటే నెమళ్ళు అని శివుడు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} కు ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - గగనచర; పద్య సం.(లు) - 1-39-వ., 8-29-సీ.,

  406) నీలకంఠుడు- ( ){సంజ్ఞా}[దేవయోని]:- నీలకంఠుడు అంటే శివుడు అని నెమళ్ళు అని నానార్ర్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో నారాయణస్థానం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-39-వ., 4-105-శా.,

  407) నీలకంధరుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీలకంధరుడు అనగా శివుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 2-90-ఆ., 4-65-చ.,

  408) నీలగళుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీలగళుడు అంటే నీలకంఠుడు శివుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 1-39-వ., 4-94-ఉ.,

  409) నీలగిరి- ( ){సంజ్ఞా}[పర్వతం]:- భారతవర్షంలోని ప్రసిద్ధమైన అనేక పర్వతాలలో ఒకటి. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-55-వ.,

  410) నీలనగము- (){సంజ్ఞా}[పర్వతం]:- నీలనగము అంటే నీలగిరి పర్వతము - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 1-16-సీ.,

  411) నీలనీరదశ్యామవర్ణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీలనీరదశ్యామవర్ణుడు నల్లని మబ్బులవంటి వంటిఛాయ కలవాడు కృష్ణుడు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 3-145-సీ.,

  412) నీలపర్వతం- ( ){సంజ్ఞా}[పర్వతం]:- మేరుపర్వతానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగవంతం అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతూ నిలిచి ఉన్నాయి. వీని విస్తారము రెండు వేల యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటాయి.
తూర్పు పడమరలలో ఉప్పునీటి సముద్రం వరకూ ఉన్న నీల శ్వేత శృంగవత్పర్వతాలు అనే సరిహద్దు పర్వతాలు క్రమంగా ఒకదాని కంటె ఒకటి పది యోజనాలు తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి.
బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన భద్ర అనే నదీ ప్రవాహం కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా శృంగనగరం మీదుగా మానసోత్తరాలైన కురుభూముల మీదుగా ప్రవహిస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. - వంశం - పర్వతం; పద్య సం.(లు) - 5.2-19-సీ., 5.2-20-వ., 5.2-34-వ.,

  413) నీలము- ( ){జాతి}[మణులు]:- నీలమణులు - ఇవి అష్టమ స్కంధములోని త్రికూట పర్వతములో వర్ణించబడ్డాయి - వంశం - మణులు; పద్య సం.(లు) - 1-256-వ., 6-24-వ., 8-23-సీ., 8-24-వ., 8-25-క.,

  414) నీలలోహితుడుఅనురుద్రుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- బ్రహ్మ దేవుని బొమముడి నుండి రౌద్రరూపుడు నీలలోహితుడు పుట్టాడు. బ్రహ్మదేవుని తన పేరు నివాసాదులు ఏమిటని అడిగగా ఇలా చెప్పాడు. నీలోహితుని ఏకాదశ నామములు - 1 మన్యువు 2 మనువు 3 మహాకాలుడు 4 మహశ్చివుడు 5 ఋతధ్వజుడు 6 ఉరురేతసుడు 7 భవుడు 8 కాలుడు 9 వామదేవుడు 10 ధృతవ్రతుడు 11 నీలలోహితుడు., నీలలోహితుని ఏకాదశ మూర్తు లకు భార్యలు - 1 ధీ 2 వృత్తి 3 అశన 4 ఉమ 5 నియుతి 6 సర్పి 7 ఇల 8 అంబిక 9 ఇరావతి 10 సుధ 11 దీక్ష., నీలలోహితుని ఏకాదశ స్థానములు 1) చంద్రుడు, 2) సూర్యుడు, 3) అగ్ని, 4) వాయువు, 5) జలం, 6) ఆకాశం, 7) భూమి, 8) ప్రాణం, 9) తపస్సు, 10) హృదయం మరియు 11) ఇంద్రియాలు - వంశం - దేవయోని; తండ్రి - బ్రహ్మదేవుడు; పద్య సం.(లు) - 3-367-వ., 3-368-మ., 4-149-సీ.,

  415) నీలవర్ణుడు- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నీలవర్ణుడు అంటే విష్ణమూర్తి. షష్ఠ,స్కాంధారంభ పద్యంలో ఇలా వర్ణించారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-1-శా.,

  416) నీలవేణి- (){జాతి}[మానవ యోని]:- నీలవేణి అంటే నల్లని కురులు కల సుందరి. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 10.1-1030-సీ.

  417) నీలాంబరుడు- (పురుష){సంజ్ఞా}[మానవ యోని]:- నీలాంబరుడు అంటే బలరాముడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 11-118-వ.,

  418) నీలాద్రి- ( ){సంజ్ఞా}[ప్రదేశము]:- నీలాద్రి అంటే నీలగిరి కొండ - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 6-219-సీ., 8-49-సీ.,

  419) నీలుడు-1 ( ){సంజ్ఞా}[వానర]:- నీల అంటే నీలు డనే వానర వీరుడు అని నీలి చెట్లు అని నానార్థాలు ఉన్నాయి. ఈ పదం ప్రథమ స్కంధలో నైమిశారణ్య వర్ణన సందర్భంలో రామసేతువు నిర్మాణం} ఉపమాన పదంగా వాడబడింది. - వంశం - వానర; పద్య సం.(లు) - 1-39-వ., 9-291-వ.,

  420) నీలుడు-2 (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నీలుడు చంద్రవంశంలోని హస్తికొడుకైన అజమీఢునికి భార్య నళిని యందు పుట్టాడు. ఈ నీలునికి కొడుకు శాంతి. శాంతికి సుశాంతి; సుశాంతికి పురుజుడు; పురుజునికి అర్కుడు; అర్కునికి భర్మ్మాశ్వుడు; భర్మ్యాశ్వునకు ముద్గల, అవీనర, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనే ఐదుగురు కొడుకుల జన్మించారు. - వంశం - చంద్రవంశం; తండ్రి - పురుమీఢుడు; కొడుకు(లు) - శాంతి; పద్య సం.(లు) - 9-655-వ.,

  421) నీలోత్పలము- (){జాతి}[వృక్ష]:- నీలోత్పలమంటే కలువ - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 9-666-క.

  422) నుతి - (పురుష){సంజ్ఞా}[ప్రియవ్రతుని వంశం]:- ప్రతిహర్తకు ఈమె భార్య, వీరికి వ్యోముడు, భూముడు పుట్టారు. ఈ ప్రతీహర్త ప్రజలందరికీ బ్రహ్మోపదేశం చేసిన ప్రతీహుని పెద్ద కొడుకుు. ఇతని తమ్ములు ప్రస్తోత, ఉద్గాత. వీరు ముగ్గురు యజ్ఞంచేయడంలో నిపుణులు. - వంశం - ప్రియవ్రతుని వంశం; భర్త - ప్రతిహర్త; కొడుకు(లు) - వ్యోముడు, భూముడు; పద్య సం.(లు) - 5.2-6-వ

  423) నృగుడు- (పురుష){సంజ్ఞా}[సూర్యవంశం]:- ఈ నృగమహారాజు సూర్యంవంశంవాడు. శ్రాద్ధదేవుడను ప్రథమ మనువునకు భార్య శ్రద్ద యందు కలిగిన పదిమంది పుత్రులలో రెండవవాడు. వారు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి. మను పుత్రుడు నృగుని వంశములో సుమతి జన్మించాడు. అతనికి భూతజ్యోతి జన్మించాడు; అతనికి వసువు పుట్టాడు; వసువునకు ప్రతీతుడు పుట్టాడు; ప్రతీతునికి ఓఘవంతుడు పుట్టాడు; అతని పుత్రిక ఓఘవతి అనె ఇంతిని సుదర్శనుడు పెండ్లాడాడు. ఈ నృగమహారాజు దానంచేసిన అనేకానేక గోవులలో ఒక విప్రునికి దానంచేసిన గోవు ర్పించుకు వచ్చి రాజు గోవులమందలో చేరిపోయింది. ఇది తెలియని ఆచన మరొక విప్రునికిచ్చాడు. దీనితో ఆయనకు ఎంత పుణ్యం చేసిఉన్నా కొంత పాపం తగిలింది. దానితో యముడు ఈ పాపక్షయంకోసం భూమిమీదకు వేసాడు. అతడు ఊసరవెల్లి అయి చాలా కాలం ఒక నూతిలో పడి ఉన్నాడు. శ్రీకృష్ణుడు బయటకు తీయడంతో కృష్ణహస్త స్పర్శతో శాపం తీరిపోయింది. ఆయన స్వర్గానికి వెళ్ళాడు. - వంశం - సూర్యవంశం; తండ్రి - శ్రాద్ధ దేవుడు వైవశ్వత మనువు; తల్లి - శ్రద్ధ; కొడుకు(లు) - సుమతి; పద్య సం.(లు) - 9-9-వ., 9-42-వ., 10.1-1181-వ., 10.2-461-శా. నుండి 10.2-478-వ. వరకు

  424) నృచక్షువు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నృచక్షువు చంద్రవంశపు రాజు. పరీక్షిత్తు తరువాతి తరాలలో వాడు. ఇతను సుషేణునికొడుకైన సుపీతుని పుత్రుడు. నృచక్షువునకు సుఖానిలుడు, అతనికి పరిప్లవుడు. అతనికి మేధావి, అతనికి సునయుడు, సునయనునికి నృపండయుడు నృపంజయునికి దూర్వుడు, అతనిక నిమి పుట్టారు - వంశం - చంద్రవంశం; తండ్రి - సుపీతుడు; కొడుకు(లు) - సుఖానిలుడు; పద్య సం.(లు) - 9-679-వ.,

  425) నృపంజయుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నృపంజయుడు చంద్రవంశపు రాజు. పరీక్షిత్తు తరువాతి తరాలలో వాడు. సుషేణునికొడుకైన సుపీతుని పుత్రుడు నృచక్షువు. నృచక్షువునకు సుఖానిలుడు, అతనికి పరిప్లవుడు. అతనికి మేధావి, అతనికి సునయుడు, సునయనునికి నృపండయుడు నృపంజయునికి దూర్వుడు, అతనిక నిమి పుట్టారు - వంశం - చంద్రవంశం; తండ్రి - సునయుడు; కొడుకు(లు) - దూర్వుడు; పద్య సం.(లు) - 9-769-వ.,

  426) నృపతి- (పురుష){జాతి}[మానవ యోని]:- నృపతి అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-16-క.,

  427) నృపాలకుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నృపాలకుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-290-చ.

  428) నృపాలుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నృపాలుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-11-చ.,

  429) నృపుడు- (పురుష){జాతి}[మానవ యోని]:- నృపుడు అంటే రాజు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-226-ఆ.

  430) నృసింహుడు- (పురుష){సంజ్ఞా}[దైవయోని]:- విష్ణువు భక్తప్రహ్లాదుని పాలించడానికి నృసింహావతార మెత్తి హిరణ్యకశిపుని సంహరించెను. విష్ణువు కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. అని కరభాజన ఋషి విదేహరాజుకు చెప్పాడు
నృసింహుడు అంటే నరసింహస్వామి. జంబూద్వీపంలోని హరివర్షానికి అధిపతి నృసింహుడు - వంశం - దైవయోని; పద్య సం.(లు) - 2-145-వ., 5.2-42-సీ., 7-285-వ.,

  431) నృహరి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- నృహరి అంటే నరసింహావతారుడు. దశావతారాలు వర్ణిస్తూ నృహరి అన్నారు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 11-72-ససీ.,

  432) నెత్తము- (){జాతి}[విద్య]:- నెత్తము అంటే పాచికలు, పందెము - వంశం - విద్య; పద్య సం.(లు) - 10.2-294-ఆ.,

  433) నెల- (){జాతి}[కాలము]:- నెల లేదా మాసము అనగా రెండు పక్షములు, 30 రోజులు. మూడు నెలలు ఋతువు, నాలుగు నెలలు కాలము, ఆరునెలలు ఆయనము. పన్నెండు నెలలు సంవత్సరము. ఈ పన్నెండు నెలలకు పేర్లు ఉన్నాయి అవి 1చైత్రము 2వైశాఖము 3జేష్ఠము 4ఆషాడము 5శ్రావణము 6బాధ్రపదము 7ఆశ్వయుజము 8కార్తీకము 9మార్గశిరము 10పుష్యమి 11మాఘము 12ఫాల్గుణము. - వంశం - కాలము; పద్య సం.(లు) - 3-346-వ.,

  434) నెలలబాలకుడు- (){జాతి}[మానవ యోని]:- నెలలబాలకుడు అంటే ఏడాదిలోపు పిల్లవాడు. కృష్ణుడు నెలలబాలకునిగా ఉన్నప్పుడే శకటాసురుని సంహరించాడు. - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 2-176-క.

  435) నేత- ( ){జాతి}[మానవ యోని]:- నేత అంటే నాయకుడు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 1-3-ఉ.,

  436) నేత్రి- (){జాతి}[మానవ యోని]:- నేత (పు) - నేత్రి (స్త్రీ), నాయకురాలు - వంశం - మానవ యోని; పద్య సం.(లు) - 3-467-సీ.,

  437) నేత్రుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఈ నేత్రుడు చంద్రవంశరాజు. యదువు తరువాతి తరాలలోని హేహయుని కొడుకైన ధర్ముని పుత్రుడు. నేత్రుని పుత్రుడు కుంతి. కుంతికి మహిష్మంతుడు, అతనిక భద్రసేనుడు, అతనికి దుర్మదుడు, అతనికి ధనికుడు పుట్టారు ధనికునికి కృతవీర్య, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు అని నలుగురు కొడుకులు. - వంశం - చంద్రవంశం; తండ్రి - ధర్ముడు; కొడుకు(లు) - కుంతి; పద్య సం.(లు) - 9-701-వ.,

  438) నేపాల- ( ){సంజ్ఞా}[ప్రదేశం]:- ఉషాకుమారికి కలలో కనబడిన రాకుమారుని కముగొనుటకు, ఆమె నెచ్చెలి, మంత్రిపుత్రీ అయిన చిత్రరేఖ రాజుల చిత్రాలు అన్నీ వేసింది. అలా వేసిన చిత్రాలలో మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాల ప్రభువులు ఉన్నారు చూడు అని చూపించింది. - వంశం - ప్రదేశం; పద్య సం.(లు) - 10.2-348-ఉ.,

  439) నైమిత్తికప్రళయము- (){జాతి}[కాలము]:- కృత త్రేత ద్వాపర కలి అని నాలుగు యుగములు జరిగిన కాలం యుగచతుష్కము లేదా మహాయుగము లేదా చతుర్యుగము అంటారు. ఒకవెయ్యి యుగచతుష్టయాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అలాగే రాత్రి కూడ ఒకవెయ్యి యుగచతుష్టయాలే. ఇటువంటి రాత్రింబగళ్ళు కలిస్తే బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. అందులో పగలు కలుగుదానిని “నైమిత్తిక ప్రళయం” అంటారు. ఆ బ్రహ్మరాత్రి సమయంలో విధాత లోకాలు అన్నింటినీ తనలో చేర్చుకుని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంతరిస్తుంది దానిని “ప్రాకృత ప్రళయం” అంటారు. ఈ ప్రళయ విషయం వివరిస్తాను విను. పగటిపూట నైమిత్తిక ప్రళయం రాత్రి పూట ప్రాకృత ప్రళయం. ఈ రెండూ కలసి బ్రహ్మదేవునికి ఒక దినము అవుతుంది ఇటువంటివి మూడువందల అరవై అయినప్పుడు బ్రహ్మ కాలమానంలో ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అటువంటివి వంద సంవత్సరాలు జీవనకాలం. ప్రళయములు ప్రథానంగా నాలుగు విధములు అవి నిత్య నైమిత్తిక ప్రాకృతిక, ఆత్యంతిక ప్రళయములు. - వంశం - కాలము; పద్య సం.(లు) - 12-22-వ., 12-24-వ.,

  440) నైమిత్తికము- (){జాతి}[యజ్ఞం]:- నైమిత్తికము నిత్యము అని హోమములలో రెండురకములు ఉన్నాయి. ప్రతిరోజు చేసేది నిత్యం. నిమిత్తం కోసం చేసేది నైమిత్తికము. - వంశం - యజ్ఞం; పద్య సం.(లు) - 1-37-వ., 1-959-సీ.,

  441) నైమిశము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నైమిశము లేదా నైమిశారణ్యము పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము.ఇక్కడే సూతమహర్షి శౌనకాది మహర్షులకు భాగవత పురాణం చెప్పారు. భాగవతమే కాదు అనేక ఇతర పురాణాలు కూడ సూతునిచే ఈ పుణ్యక్షేత్రంలోనే చెప్పబడ్డాయి - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 1-38-క., 1-38-వ., 1-51-వ.,

  442) నైరుతినిలయము- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నైరుతిదిక్కు పాలకుడు నిరృతి. ముఖ్యపట్టణం కృష్ణాంగన. షోడశసహ్సరాంగనా వైభవం నారదుడు ద్వారకకు వచ్చిన సందర్భంలో ద్వారకానగరాన్ని దిక్పాలకుల పట్టణాలతో పోల్చారు. - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 10.2-601-వ.,

  443) నైరృతశ్రేష్ఠులు- (పురుష){జాతి}[రాక్షస యోని]:- బాహుబలంలో పేరుపడ్డ నైరృతులు సూర్యుని రథం వెనుక భాగాన్ని నెట్టుతూ ఉంటారు. - వంశం - రాక్షస యోని; పద్య సం.(లు) - 12-41-వ., నుండి 12-45-వ., వరకు

  444) నైరృతి- (పురుష){సంజ్ఞా}[దేవయోని]:- వృత్రాసుర సంహారఘట్టంలో దేవదానవ యుద్ధం జరుగుతు న్నప్పుడు ఇంద్రుని వైపు పాల్గొన్నవారిలో ఒకరు - వంశం - దేవయోని; పద్య సం.(లు) - 6-363-వ.,

  445) నైర్గుణ్యము- (){జాతి}[విద్య]:- నైర్గుణ్యము అంటే నిర్గుణత్వము, త్రిగుణాతీతము. కార్యకారణభావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడిన ద్వైతభ్రాంతి కారణమని, ఆ ద్వైతభ్రాంతికి శరీరం కారణమనీ, ఆ శరీరానికి లింగం కారణమనీ, ఆ లింగానికి గుణాలు కారణమనీ, ఆ గుణాలకు ప్రకృతి కారణమమనీ గ్రహించాడు. “అహం బ్రహ్మాస్మి” అనే జ్ఞానంతో ప్రకృతి విలీనమైపోతుందని. ప్రకృతి నశించిపోవటమే గుణారాహిత్యమనీ, గుణరాహిత్యమే పురుషుడు తిరిగి స్థూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని - వంశం - విద్య; పద్య సం.(లు) - 1-38-వ.,

  446) నైశ్స్రేయస్సు- (){సంజ్ఞా}[ప్రదేశము]:- నైశ్రేయస్సు అంటే వైకుంఠములోని ఉద్యానవనము - వంశం - ప్రదేశము; పద్య సం.(లు) - 3-506-చ.,

  447) న్యగ్రోధము- (){జాతి}[వృక్ష]:- న్యగ్రోధము అంటే జువ్విచెట్టు - వంశం - వృక్ష; పద్య సం.(లు) - 3-344-వ., 5.2-20-వ.,

  448) న్యగ్రోధుడు- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- శ్రీకృష్ణునికి అష్టమహిషిల యందు కలిగిన పుత్రులలో పద్దెనిమిది మంది ప్రసిద్దులయ్యారు. వారు 1.ప్రద్యుమ్నుడు, 2.అనిరుద్ధుడు, 3.దీప్తిమంతుడు, 4.భానుడు, 5.సాంబుడు, 6,బృహద్భానుడు, 7.మధుడు, 8.మిత్రవిందుడు, 9.వృకుడు, 10.అరుణుడు, 11.పుష్కరుడు, 12.దేవబాహుడు, 13.శ్రుతదేవుడు, 14.సునందుడు, 15.చిత్రబాహువు, 16.వరూధుడు, 17.కవి, 18.న్యగ్రోధుడు. - వంశం - చంద్రవంశం; తండ్రి - కృష్ణుడు; పద్య సం.(లు) - 10.2-1330-వ.

  449) న్యగ్రోధుడు,- (పురుష){సంజ్ఞా}[చంద్రవంశం]:- ఇతడు కంసుని ఎనమిది మంది తమ్ముళ్ళలో పెద్దవాడు. ఉగ్రసేనునికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, సుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అని తొమ్మండుగురు కొడుకులు. న్యగ్రోధుడు రెండవ కొడుకు. కంస వధానంతరం, బలరామ కృష్ణుల చేతిలో చనిపోయారు, - వంశం - చంద్రవంశం; తండ్రి - ఉగ్రసేనుడు; పద్య సం.(లు) - 9-714-వ.,., 10.1-1382-శా.,