ద్విపదభాగవతం - కల్యాణకాండ : సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాఁడు వేటకుఁ బోవుటయు
వనజాక్షునకు నీక వంచించిరత్న
మనుజునికిచ్చిన నాప్రసేనుండు
నామణి ధరియించి యశ్వంబునెక్కి
కామించి యడవి కొక్కఁడు వేఁట వెడలి
మృగముల నొంప నమ్మేదినీవరుని
మృగరాజు చంపి యామిషశంక నతని
మెడనున్న రత్నమర్మిలిఁ గొంచు కొండ
పడలోని కరుగంగ భల్లూకవిభుఁడు
యాకేసరినిఁ ద్రుంచి యామణిఁ గొంచుఁ
బ్రాకటంబుగ మహాభవనంబు సొచ్చె.
అంతసత్రాజిత్తుఁ డనుజుఁడు రామి
కెంతయుఁ జింతించి యిచ్చలో వగచె.