ద్విపదభాగవతం - కల్యాణకాండ : రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట
కలఁగి మ్రాన్పడి నిల్చు, కళవళంబందుఁ
బెలుకుఱులోఁ దాఱు పెదవులుఁ దడపుఁ
బలుక కూరకనుండుఁ బలుమాటలాడు
నిలువనేరక వ్రాలు నిట్టూర్పు వుచ్చు
నంతయు హరిఁ జేర్చు నంతరంగమున
సంతాపమొదవంగఁ జర్చించి చూచు;
“నక్కట! యెక్కడి కరిగెనో! విప్రుఁ
డెక్కడఁ బోయనో! ఏలకోతడసె!
హరికి యిక్కడివార్తలందెనో! నడుమ
దిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ!
ఈ కార్య మెఱిఁగింప నిందిరావిభుఁడు
కైకొనకుండునో! కడువేడ్కతోడ
వచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ!
నెడమకన్నును జన్ను నెడమభుజంబు
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.”
అని యిచ్చనూహింప నంబుజోదరుఁడు
చనుదెంచి సీరితో సైన్యంబుతోడ
నాపురోద్యానంబు నందొప్ప విడిసి
భూపాలతనయకింపుగఁ దనరాకఁ 80
జెప్పి వుత్తెంచినఁ జెన్నార విప్రుఁ
డప్పొలంతుకఁ గాంచి హరివచ్చెననుడు
హరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను
గరుపార నవ్విప్రుఁ గని యిట్టులనియె,
“పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుడఁవు
పరమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ!
ప్రాణవల్లభుఁడైనఁ బద్మాక్షుఁ దెచ్చి
ప్రాణంబుఁ గాచితి పలుకులిం కేల!“
అనిపల్కి యతనికి నందంద మ్రొక్కి
కనకాంబరములిచ్చి ఘనతతో ననిచె.