ద్విపదభాగవతం - కల్యాణకాండ : పదియాఱువేల గోపికలను శ్రీకృష్ణుఁడు పెండ్లియాడుట
రాజీవనేత్రుఁడు రమణీయముర్తి
నరకునింటికి నేఁగి నరసిద్ధసాధ్య
సుర యక్ష గంధర్వ సుదతులఁ దెచ్చి 620
యతఁడొకపరి పెండ్లియాడెడు వేడ్క
జతనంబు సేసిన జలజాతముఖుల
వెలఁదులఁ బదియాఱు వేలనూఱ్వురను
జలజోదరుఁడు జూచి సంతసంబందె.
ఆకన్యకలచూపు లబ్జాక్షుమేన
దాఁకొని చెంగల్వదండలై యొప్పె;
జలజాక్షురూప మా జలజాతముఖులు
తలలెత్తి యందంద తమకించి చూడ
దినకరోదయబింబ దీప్తమౌ కంజ
వనము చందంబున వదనంబులొప్పె;
పొలఁతుల నందలంబులఁ బెట్టి శౌరి
పొలుపార ద్వారకాపురికిఁ బుత్తెంచె.
వరుణుని ఛత్రంబు వరుణునికిచ్చె;
సురదంతి హయమును సురపతికిచ్చె;
ధనపతి నిధుల నాతనికిచ్చి వుచ్చె;
వనజోదరుఁడు భక్తవత్సలుఁడంత
నగణిత ప్రీతిమై నభయంబులిచ్చి
భగదత్తు నప్పురి పట్టంబుగట్టి