ద్విపదభాగవతం - కల్యాణకాండ : మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁడోదార్చుట
యన్నాతిఁ గనుగొని యంబుజోదరుఁడు
సరభసంబున లేచి సతినల్లనెత్తి
కరముఁ గౌఁగిటఁ జేర్చి కన్నీరుఁదుడిచి
చెక్కిలి నొక్కెత్తి చికురముల్ దుఱిమి
యక్కటికముతోడ నక్కాంత కనియె.
“నవ్వులాటకు నన్న నామాట కింత
నివ్వెరపడి వ్రాల నీకేల యింతి?
ఎలనాగ! నీచిత్త మెఱిఁగెడి కొఱకు
పలికితిగాని నా ప్రాణంబు నీవ! 700
పరమసాధ్వివి నీవు భయభక్తులందు
నెరసులేకున్ని నే (నెఱి భాగ్యశాలి)
ఇమ్ముల ననుఁబాయ కే ప్రొద్దునుండు
నమ్మహాలక్ష్మి నీవంభోజనయన!”
అని పల్కి శయ్యపై నల్లనఁజేర్చి.
యనునయంబున దేర్చి యబలకుఁ దార్చి
సరసరతిక్రీడ సంతుష్టుఁ జేసి
పరమపావనమూర్తి పంకజోదరుఁడు
కందర్పకోటి సంకాశలావణ్యుఁ
డిందిరావిభుఁడు లోకైకశరణ్యుఁ
డారసి యందఱి కన్నిరూపముల
సౌరతిక్రీడల సతతంబుఁ దేల్చె.