ద్విపదభాగవతం - కల్యాణకాండ : భూదేవి శ్రీకృష్ణుని బ్రార్ధించుట
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిహ్న!
భానువత్సంకాశ! భక్తలోకేశ!
కంబుచక్రగదాశి ఘనశార్ఙహస్త!
అంబుజనాభ! పీతాంబరాభరణ!
విశ్వవిశ్వంభర! విశ్వైకజనక!
శాశ్వత! సర్వజ్ఞ! సర్వలోకేశ!
నీలామనోనాథ! నిఖిలాండనాథ!
[ఒకే పాదమున్నది]
ఉరురజోరూపుమైఁ బుట్టింతు జగముఁ
బరమ! సత్వస్థితిఁ బాలింతు వీవ
తామసరూపుమై దండింతు వీవ
నీమేన జనియించు నిఖిలభూతములు 610
నవని యప్పులునభమగ్ని వాయువులు
రవిసుధాకరులాత్మ రాజీవభవులుఁ
సకలేంద్రియంబులు సకలశక్తులును
సకలంబు నీరూపు చర్చించి చూడ!
పూతాత్మ! శ్రీకృష్ణ! పురుహూతవంద్య!
నీ తత్వమెఱుఁగంగ నేనెంతదాన?
నరకుండు నీ దయ నాకుద్భవించు
వరపుత్రుఁడీతఁడు వరశక్తి పేర్మి
దేవతాద్రోహియై తెగియె నీచేత
దైవీక మెవరికిఁ దప్పింపరాదు!
కావున నితనికి గలిగె నీలోక
మేవిధంబున ధన్యుఁడిది లెస్సయయ్యె!
దురితారి! వానిపుత్రుఁడు భగదత్తుఁ
గరుణించి నీవ యిక్కడ ప్రతిష్టింపు”,
మని మ్రొక్కి ధరణి జయాంకమై బఱఁగు
వనమాల మురవైరి వక్షంబునందు
పూజించి వీడ్కొని భూదేవి చనియె.