ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నృగుని శాపవృత్తాంతము
సాంబుఁడులోనుగా సకలకుమాళ్లు
నంబుధీతీరవిహారణ్యభూమి
మృగయానురక్తులై మెలఁగుచుఁ దప్పి
తగ నిఱ్ఱికందువఁ దడయక వెదకి
యొకనూతిలో నొక్క యూసరవల్లి
వికలమైపడియుండ వెఱఁగంది చూచి
“యెన్నడు పొడగాన మిట్టిగాత్రంబు
నిన్ని వన్నెలుగల యీనరటంబు
కటకటా! ఈ కూపగతమైన” దనుచుఁ
బటుశక్తి నందఱుబట్టి యీడ్వఁగను
వెడలకయుండిన వెన్నునితోడ
కడువేగఁజెప్ప నక్కడికేఁగుదెంచి
కూపగతంబైన కృకలాసకంబు
శ్రీపతి వీక్షించి చేతను దివియ
నది దివ్యపురుషుఁడై నంబుజోదరుని
పదపంకజములకు భక్తి మ్రొక్కుటయు
హరిజూచి పలికె “పుణ్యాత్మ! నీకిట్టి
సరటజన్మం బేల సమకూరె?” అనుఁడు - 10
“అనఘాత్మ! నృగుఁడ నిక్ష్వాకువంశజుఁడ
బెనుపడ సంపదఁబేర్చినవాఁడఁ
దారకంబులు వృష్టిధారలు నిసుక
వారాసితరగలు వడినెన్న వచ్చు
గాని నే విప్రసంఘములకు నిచ్చు
ధేనుసంఖ్యలు గణతింపఁగఁజాల
నొకపుణ్యదినమున నొకవిప్రవరున
కొకగోవునిచ్చిన యురక యాకుఱ్ఱి
క్రమ్మర నామంద గలసిన నెఱుఁగ
కమ్మొద వొక బ్రాహ్మణాఢ్యుని కొసఁగ
మును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుఁడు
తనకుఱ్ఱి తప్పినఁ దడవుచు వచ్చి
యావిప్రునింటిలో నేపారుచున్న
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి
“యేమి కాఱులు చెప్పెదీకుఱ్ఱి నాకు
భూమీశ్వరుఁడు ధారపోసినవాఁడు
రాజుచే మును పరిగ్రహముఁగన్నాఁడ
యీజగంబెఱుఁగు నా యిది కుఱ్ఱియగుట
ధరణీశుకడకుఁబోదము ర” మ్మటంచు;
నిరుపురు నాకడనేతెంచి నన్ను - 20
దీవించి యిద్దఱుఁ దెఱగెల్లఁ జెప్ప
భావించి రెండవ బ్రహ్మణుఁజూచి
వేవిరపడి మీకు వివరింపనేల
యీవిప్రునకు మొన్నయిచ్చిన కుఱ్ఱి
తొఱఁగంది వచ్చినా దొడ్డిలోనున్న
యెఱుఁగక నిచ్చితి యీతప్పుసైచి
వెలయ నీకుఱ్ఱి యీ విప్రునకిమ్ము
నులియకఁ గొనిపొమ్ము నూఱుధేనువుల
ననవుఁడు నవ్విప్రుఁ డనలంబువోలెఁ
గనలచుఁ బరుషవాక్యముల నిట్లనియె
“ద్విజునకిచ్చిన సొమ్ము వీడ్పడ నిచ్చు
కుజనుండు దుర్గతిఁగూలు పెక్కేండ్లు
దరఁ బ్రతిగ్రహధనత్యాగి దుర్ఘటము;
పరగంగ ధనమీని పతి జంబుకంబు
నగుదురిట్లెఱిఁగియు నన్యాయమాడఁ
దగదయ్య నాకిచ్చి ధర్మచారిత్ర!”
ఎన్ని చెప్పిన కుఱ్ఱినీనంచు నతఁడు
గ్రన్నన దనయింటికడకుఁ గొంపోవ
యీవిప్రవరుఁజూచి యిట్లంటి “నీకు
యీవట్టి మొదవేల? ఇదెనీకు లక్ష - 30
గోవుల నిచ్చెదఁ గొని నీవు కరుణ
కావవే నన్ను దుర్గతిఁదోయ” కనుఁడు
“ధారుణీశ్వర! నాకుఁ దగ దొంగటాలు
ధారవోసెద వేట దానంబు నీవు
కుఱుమట్టు పొడవును కొమ్మలుగలిగి
తెఱగగు చన్నులు తీరైనతోఁక
చక్కదనము నొక్కచక్క మేయుటయుఁ
నెక్కడవిడచిన నిల్లుచేరుటయుఁ
గ్రేపులు బిలుచునర్మిలిని మాశిశువు
లేప్రొద్దు వేడిన నీడనిచ్చుటయు
కడుసాదునై లక్ష్మిగతి నింటిలోన
నుడుగక నీధేనువుండిన జాలు;
యిదిదప్పిపోయిన యింటివారెల్ల
మదిలోన మలమల మఱుఁగుచున్నారు;
యీకుఱ్ఱినాకు నీవీ వోవలేని
యేకాఱులును జెప్ప కిట్లొండు మాట
నాడితి కృకలాసమై యుండు” మనుచు
నాడి బ్రాహ్మణుఁడు శాపంబిచ్చె నంత;
వడవడ వణకుచు వడినేఁగి యతని
యడుగులపైఁబడి యతనితో నంటి 40
“నీకష్టజన్మంబు నేనోర్వజాలఁ
జేకొని నన్ను రక్షింపవే” యనిన
“హరి లోకరక్షణార్థమై కృష్ణుఁడనఁగఁ
బరగు నాతని కరస్పర్శమాత్రమున
నీకష్ట శాపంబు నీఁగి నీపుణ్య
లోకంబునొందు సుశ్లోక! పొ” మ్మనిన
“తడయక యీకష్టతను బొంది యిందుఁ
బడనిపాటులఁబడి పద్మాయతాక్ష!
వేదాంతవేద్యులు వెదుకంగలేని
నీదివ్యచరణ సన్నిధిగంటి మంటి
పనివినియెదనో కృపారసపూర్ణ!”
అనిచెప్పి కృష్ణున కందంద మ్రొక్కి
కనకవిమాన సంకలితుఁడై నృగుఁడు
చనియె దివ్వులుకొల్వ జంభారిపురికి
అతఁడు వోయినఁ జూచి యద్భుతంబంది
శతదళనేత్రుఁ డచ్చటివారి కనియె.
“హాలాహలాభీలమగు వహ్నికంటెఁ
గ్రాలును విప్రవర్గపుకోపవహ్ని
వారల సొమ్ములెవ్వరు హరించినను,
దారుణలీల బాధలఁ బెద్దగాల - 50
మలమటఁబొంది కీటాదులైపుట్టి
పొలిసిపోదురు కులంబులు గూలిపోవు
నదిగాన విప్రుల యర్థమీభంగి
మదిఁ జూడవలయు నెమ్మదిఁ గోరువారు”
అనుచు పుత్రులు దాను నరిగి మురారి
తనమందిరమున సంతసలీల నుండె.