ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని నాగలిమొనచే లేవనెత్తుట
“అకట! గురుస్థానమని నిన్నుఁజూడ
మెకమెకపడు మందమేళముల్ తగునె?
3-14 ఒకనిఁ గొల్చిన వార లుర్విలో మీరు!
ఆదిగర్భేశ్వరు లగు కౌరవులకు
యాదవులకు వియ్యమందంగఁ దగునె?
మిమ్మేలురాజును మీరును నాకు
నెమ్మి యీడొనరింప నెంతటి వారు!
హరి మంచితనమున నన్నియు నొప్పె
జరగుట సల్లాపసహజభోజనము
సలిపి మన్నించినఁ జనవున మీరు
కలసి వర్తింతురుగాక యేనాట
నెక్కడి బాంధవంబిక? మాకు మీకు
ఫక్కి వోనాడఁగఁ బనిలేదు వేగ
విచ్చేయు” మను కురువిభుఁ జూచి సీరి
చిచ్చులో నెయ్యిఁబోసిన భంగి మండి!
“కాలుఁడు ప్రేరేపఁ గానక యిట్లు
ప్రేలెదవేల? నీ పెంపెల్లఁ బొలియ
వరుస నెఱుంగక వదరెదుగాక
హరికి నీకును నేది యంతర మోరి! - 300
ఎవ్వరు నాకు మీ రెందఱున్నారు?
ఎవ్వరుగలరు నీకీబారి గడప!
నీ బలంబులు నిన్ను నీ పట్టణంబు
నాబాలవృద్ధమై యమునలోవైతు!”
అని పేర్చి దర్పించి హలదండమెత్తి
ఘనరౌద్రలయకాలకాలుఁడో యనఁగ
కరిపురికోట నాఁగటి వాత గ్రుచ్చి
భరమున నుంకించి పటుశక్తిఁ దివియ;
నది యొడ్డగిలి పడ నఖిలమానవులు
బెదరి నిల్వఁగలేకఁ పృథివిపై వ్రాల
భీతిల్లి సంధులు పృథివి వేచఱువ
నాతురారావంబు నందంద చెలఁగ
నాంబికేయుఁడు విని హలిచందమెఱిఁగి
సాంబుని విడిచి లక్షణసమేతముగఁ
దోకొని సకలబంధులుఁ దన్ను గొలువ
నాకౌరవేశ్వరుఁ డాపగాతనయు
విదురుల మాట నిర్విణ్ణుఁడై వినుచు
బదరుచు నేతెంచి బలభద్రుఁగాంచి
3-14 ఒకే పాదమున్నది