ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నారదుని మాటలను విని శ్రీకృష్ణుఁడుద్ధవాచార్యుని యభిప్రాయము నడుగుట
బనివినియద” నంచుఁ బద్మాక్షు వీడు
కొని నారదుఁడు బోవ గోవిందుడంత
నయ్యుద్ధవునిఁ జూచి యంతరంగమున
నెయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె.
నీతియు ధర్మంబు నేర్పును హితవుఁ
జాతుర్యమును గల సత్యసంధుడవు;
కడఁకతోఁగార్యంబుఁ గనుచోట మాకుఁ
గడునొప్పు మీరలె కన్నులు బుద్ధి”
యనుటయు నుద్ధవుఁడంబుజోదరునిఁ
గనుఁగొని నమ్రుఁడై కడునొప్పఁ బలికె.
“ఇందిరాధీశ! నీవెఱుఁగని కృత్య
మెందును గలదె నన్నిలఁ బెద్దఁజేసి
మన్నించి యడిగెద మార్గంబుఁ దెలియ
విన్నవించెద నర్థి విను”మని పలికె.
“పరమబంధుఁడు నీకు పాండవాగ్రజుఁడు
సురుచిరంబుగ రాజసూయంబు సేయఁ
దలఁచినయట్టి యధ్వరకృత్యమునకుఁ
గలఁకువ లేకుండఁ గాచి రక్షింపు!
ప్రాణంబుతోడ జరాసంధుఁడుండ
స్థాణునకును గావ శక్యంబు గాదు! - 470
వాని నేగతినైన వధియింపకున్న
పూను జన్నంబు సంపూర్ణంబు గాదు.
ఘనబలాఢ్యుఁడు గాన కదనంబులోనఁ
జెనకి యెవ్వనికి నిర్జింపఁగా నరిది
యనిలజార్జునులతో నాపురికేఁగి
చని విప్రవరులయాచందమై వేడి
మల్లయుద్ధంబున మరి భీముచేత
నెల్లభంగులవాని యేపడగింపు
మాతఁడు దీరిన నఖిలరాజులకుఁ
“బ్రీతియౌ పగదీరుఁ బెంపొందు నీకుఁ
దగ జరాసంధుచేతను బద్ధులైన
జగతీశ్వరులఁ బ్రోవఁ జనుటయే లెస్స.”