తృతీయాశ్వాసము : హిమవద్గిరి వర్ణనము
3-30-వ.
అని యానతిచ్చిన మహామునులు నరుంధతీ సమేతులై పరమేశ్వరునకు సాష్టాంగదండప్రణామంబులాచరించి వీడ్కొని పరమానందంబున నత్యంత శుభసూచకంబులు పొడగాంచుచుం దుహినశిఖరంబునకుఁ బ్రయాణంబు చేసి పోవుచున్న, నతిదూరంబున.
టీక :-
పొడగాంచు = కనిపించు; తుహినము = హిమము.
భావము :-
అలా అని శివుడు ఆనతీయగా మహామునులు, అరుంధతీదేవితో కలసి పరమేశ్వరునకు సాష్టాంగ నమస్కారము చేసి వీడ్కొని పరమానందముతో శుభశకునాలు కనిపిస్తుండగా హిమశిఖరానికి ప్రయాణమై వెళుతుండగా చాలా దూరములో…..
31-సీ.
మింటిచుక్కలతోడ మేలమాడుచు నున్న
ఘనమేఘసంఘంబు గలుగుదాని
భూరి తపోవన భూమీరుహంబులు
కమలాకరంబులు గలుగు దాని
గంధర్వ ఖేచర గణ విమానంబులు
గప్పినరత్నశృంగముల దాని
శుక పిక శారికానికర ధ్వనులచేత
నతిరమణీయమై యలరు దాని
3-31.1-ఆ.
సిద్ధ దంపతులు వశీకృతకాములై
సానుతలము లందు సరస మాడఁ
జెలువుమిగులుదాని శీతాచలేంద్రంబుఁ
గరమువేడ్కతోడఁ గనిరిమునులు.
టీక :-
మిన్ను = ఆకాశము; మేలమాడు = పరాచికాలాడు; భూమీరుహము = వృక్షము; కమలాకరము = సరస్సు; శృంగము = శిఖరము; శుకము = చిలుక; పికము = కోయిల; శారిక = గోరువంక; నికరము = సమూహము; సాను = శిఖరము; చెలువు = అందము; కరము = అత్యంతము.
భావము :-
ఆకాశంలోని నక్షత్రాలతో వేళాకోళాలాడుతున్న గొప్ప మేఘసమూహాలు యున్నట్టియు, తపోభూములు, వృక్షములు, పద్మ సరోవరాలు యున్నట్టియు, గంధర్వ ఖేచర గణముల దివ్య విమానములు కప్పివేసిన రత్నశిఖరాలు కలదియు, చిలుకల, కోయిలల, గోరువంకల సమూహాల ధ్వనులచేత రమణీయముగా ఒప్పునట్టిదియు, సిద్ధ దంపతులు కామవశులై పర్వత శిఖరములందు సరసమాడుతూ చాలా ఆనందంగా యున్నట్టియు హిమపర్వతమును అత్యంత వేడుకతో మునులు చూశారు.
3-32-వ.
మఱియును.
భావము :-
ఇంకనూ.
3-33-చ.
సలలిత కామధేనువులఁ జందన కల్పమహీరుహంబులన్
లలిత తరంగిణీతటములంగరుడామరసిద్ధకన్యలన్
విలసిత సూర్యకాంతముల విస్పురితేందుశిలాతలంబులన్
చెలువగు భూధరేంద్రమును శీతనగేంద్రముఁ గాంచి సంయముల్.
టీక :-
లలిత = మనోజ్ఞమైన; మహీరుహము = వృక్షము; తరంగిణి = నది; తటము = ఒడ్డు; విలసిత = ప్రకాశింపబడిన; విస్ఫురిత = విస్తరించబడిన; భూధరేంద్రము = పర్వతము.
భావము :-
మనోజ్ఞమైన కామధేనువులు; చందనాది వృక్షములు; అందమైన నదీతీరముల వద్ద గరుడ, అమర, సిద్ధ కన్యలు; సూర్యకాంత మణులూ; విస్తరించబడిన చంద్రకాంత శిలలూ కలిగి ప్రకాశించే హిమవత్పర్వతమును మునులు దర్శించి….
3-34-వ.
తమలో నిట్లని తలంచిరి.
భావము :-
ఆ హిమవత్పర్వమును దర్శించిన మునులు తమలో తాము ఇలా అనుకున్నారు.
3-35-సీ.
“వేదంబు లాతని వెదకి కానఁగ లేని
గంగాధరుండు తాఁ గరుణ మెఱసి
మనల నాఢ్యుల జగన్మాన్యులఁ బూజ్యుల
నాత్మలో రప్పింప యర్ధితోడ
నగవల్లభునియింటి కరిగి యాతఁడుకన్న
కూఁతురు పార్వతీకోమలాంగి
తనకుఁగా నడిగి రండని ప్రీతిఁబుత్తెంచు
చున్నాఁడు యీ భూధరోత్తముండు
3-35.1-ఆ.
ఎంత పుణ్యుఁ డగునొ యిట్లొప్పునే యీతఁ
డెంత ధన్యుఁ డగునొ యెంతభక్తి
చేసినాఁడొ తొల్లి శివునకు బాపురే!”
యనుచుఁగీర్తి చేసి రాదిమునులు
టీక :-
ఆఢ్యులు = శ్రేష్ఠులు; మాన్యులు = గౌరవనీయులు.
భావము :-
“వేదాలు వెతికినా కనబడని గంగాధరుడు దయతో లోకంలో గౌరవనీయులైన, శ్రేష్ఠులైన, పూజ్యులైన మనలను మనసులో తలచుటద్వారా పిలిచి రప్పించాడు. పర్వతరాజింటికి వెళ్ళి అతని కుమార్తె యైన పార్వతిని తనకొరకు యడిగి రమ్మని ప్రీతితో మనలను పంపుతున్నాడంటే ఆ పర్వతరాజు ఎంత పుణ్యాత్ముడో! ఎంత ధన్యుడో! పూర్వము శివుని ఎంత భక్తితో కొలిచాడో! బాపురే”! అంటూ సప్తఋషులు కీర్తించిరి.
3-36-వ.
అని మఱిమఱి కీర్తించు నమ్మహామునులు ప్రాలేయాచలంబు డాయంబోయి మహీధ్రవల్లభుమందిరంబు వీక్షించి ఖేచరత మాని భూచరులై యతని పెద్దమొగసాల నిలచి యున్న సమయంబున.
టీక :-
ప్రాలేయాచలము = హిమాలయము; ఖేచరత = ఆకాశంలో గమనము.
భావము :-
ఇలా కీర్తిస్తూ, ఆ మహామునులు హిమవత్పర్వత సమీపానికి వెళ్ళి హిమవంతుని మందిరము కనుగొని ఆకాశంగమనం మాని భూమిపై నడచుకుంటూ వెళ్ళి అతని వాకిట ముందు నిలిచిరి.
3-37-చ.
అనఘులు, దీర్ఘదేహు, లుదయార్కనిభుల్, విమలాత్మకుల్, మృగా
జినధరు, లగ్నితేజులు, విశిష్టతరాకృతు, లార్యు, లంబుజా
సనసము, లాదిసంయములు, సప్తఋషుల్ చనుదెంచి యున్నవా,
రనిహిమశైలభర్త ఫణిహారులచే విని నిత్య భక్తి తోన్.
టీక :-
అనఘులు = పాపము లేనివారు, పుణ్యులు; అర్కుడు = సూర్యుడు; మృగము = లేడి; సంయములు = ఇంద్రియములను అణచినవారు, ఋషులు; ఫణిహారులు = ద్వారపాలకులు.
భావము :-
పుణ్యాత్ములు, పొడగరులు, ఉదయసూర్యునితో సమానమైనతేజస్సు కలవారు, పరిశుద్థాత్ములు, లేడి చర్మము ధరించినవారు, అగ్నితో సమానమైన తేజస్సు కలవారు, విశిష్టమైన రూపము కలవారు, ఆర్యులు, బ్రహ్మదేవునితో సమానమైనవారు, పురాణ ఋషులు యైన సప్తర్షులు విచ్చేసా రని హిమవంతుడు ద్వారపాలకుల ద్వారా వినినవాడై భక్తితో....