తృతీయాశ్వాసము : చంద్రోదయ వర్ణనము
3-122-సీ.
మఱిఁగిన విరహుల మానంబు లెడలించి
యిరవైన చీఁకటియిండ్ల కనిపి
మఱిఁగోకముల నెల్ల మఱువులుగాఁదోలి
నీలోత్పలంబుల మేలుకొలిపి
వెలయఁ జకోరకావలికి విందులు వెట్టి
నీరజాతంబుల నిద్ర పుచ్చి
వనధులనుబ్బించి వలరాజనెగయించి
మందమారుతము కానంద మొసఁగి
3-122.1-ఆ.
తనదు తెలుపుచేతఁ దలకొని నిఖిలంబు
తెలుపుఁ గాఁగఁ దూర్పుదిక్కు నందుఁ
జల్లదనముచూపి జగములన్నింటికి
మామ యనఁగఁ జందమామ వొడిచె.
టీక :-
ఎడలించు = నశింపచేయు; కోకము = చక్రవాకము; మఱువు = చాటు; నీలోత్పలము = నల్ల కలువ; వెలయించు = అలరించు; నీరజాతము = పద్మము; వనధులు = సముద్రాలు; ఎగయించు = పైకెత్తు.
భావము :-
విరహముతో మరిగిన మనసులను బయటపెట్టించి తగిన చీకటి యిండ్లలోకి పంపి, చక్రవాకములన్నింటిని చాటుగా తోలి, నల్ల కలువలను మేల్కొలిపి, అలరించి వెన్నెల పులుగులకు విందులు చేసి, పద్మములను పడుకోబెట్టి, సముద్రాలను పొంగించి, మన్మథుని ఎగదోసి, చిరుగాలికి ఆనందాన్ని అందించి, తన తెలుపుచేత సర్వమూ తెలుపు కాగా చల్లదనము అందిస్తూ లోకాలన్నింటికి మామ అయిన చందమామ తూర్పు దిక్కున ఉదయించాడు.