ప్రథమాశ్వాసము : దాక్షాయణి దేహంబుఁ దొఱఁగుట
1-160-సీ.
అనుచు మహేశ్వరి యమరులు బెగడంగఁ
పుణ్యతనువు తరుణి పొందె నపుడు.
శంకర శ్రీపాదపంకజ యుగళంబుఁ
దన మనస్సరసిలోఁ దనర నిలిపి
వెలుఁగు మూలాధార వేదిపై శివయోగ
వహ్ని మేల్కొలిపి యవ్వలను మిగిలి
తనుఁ దాన చింతించి తరణి చంద్రుల వడి
నరుగంగనీక ఘోరాగ్నిఁ దెచ్చి
1-160.1-ఆ.
యందు నిల్చి దివ్య మగు తన మైదీఁగె
రాజహంసగమన రాజవదన
పరమయోగశక్తి భస్మంబుగాఁ జేసి
పుణ్యతనువు తరుణి పొందె నపుడు.
టీక :-
బెగడు = భయపడు;; భద్రాసనము = యోగ విద్యలో ఒక ఆసనం. మోకాళ్ల వద్ద కాళ్లను మడత వేసి, కుడి మడమ కుడి పిరుదు క్రిందికీ, ఎడమ మడమ ఎడమ పిరుదు క్రిందికీ వచ్చే విధంగా కూర్చొనుట. రాజపీఠము; యుగళము = జత(రెండు);; తనర = పూర్తిగా;; వెలుగు = జ్వలించు;; వేది= యజ్ఞ వేదిక; వహ్ని = అగ్ని;;;తరణి = సూర్యుడు; మైదీగె = తనూలత (శరీరము); రాజవదన = చంద్రుని వంటి ముఖము గలది;; భస్మము = బూడిద;; తనువు =శరీరము;; తరుణి = స్త్రీ.
భావము :-
అలా అంటూ, మహేశ్వరి దేవతలు భయపడుచుండగా భద్రాసనములో ఆసీనురాలు అయింది. శంకరుని పాదపద్మములను తన మనస్సు అనే సరోవరంలో సంపూర్ణంగా సంస్థాపించుకుంది. మూలాధార చక్ర స్థానమునందు శివయోగంలో అగ్నిని రగుల్కొలిపింది. ఇటునిటూ పోనీకుండా చివరి పట్టులో తనను తానే లక్షించుకొని, ఘోరమైన ఆ యోగాగ్నిని తెచ్చి తన దేహంలో నిలిపింది. అలా రాయంచ నడకల చిన్నది, చంద్రముఖి ఐన ఉమాదేవి, తన సుకుమారమైన దేహాన్ని ఆ పరమయోగశక్తిలో బూడిద చేసింది. పిమ్మట ఆమె పుణ్యవంతమైన సూక్ష్మదేహాన్ని పొందినది.
1-161-చ.
తులువగు దక్షు నింట మఱి తోఁచిన వేఁడిమి మంచుకొండలోఁ
దొలువకపోవ దన్న క్రియఁ దోయజలోచన గౌరి లోలయై
లలితలతావరాంగసవిలాసిని యై కొమరాలు నై విని
ర్మలగతి నేఁగెఁ గొండలకు రా జగు కొండకు మంచుకొండకున్.
టీక :-
తులువ = కుత్సితుడు(చెడ్డవాడు); తోయజలోచన = నీటి నుండి పుట్టిన పద్మముల వంటి కన్నులు కలది; దొలుచు = దొరలించు; లలిత = మనోజ్ఞమైన; లతావరాంగి = తీగవంటి సుకుమారమైన అంగములు కలది; విలాసిని = స్త్రీ; కొమరాలు = యవ్వనవతి.
భావము :-
దుష్టుడైన దక్షుని యింట పుట్టిన వేడి మంచుకొండలో తిరుగక మానదు అన్నట్లు. ఆ తోయజలోచన, గౌరి బాల వలె అందమైన తీగవంటి సుకుమారమైన అవయవములు గల స్త్రీగా యువతిగా శుద్ధ నిర్మల స్థితిలో కొండలకు రాజైన మంచుకొండ వద్దకు వెళ్ళింది.
1-162-వ.
అంతఁ దత్ప్రకారంబు వీక్షించి దక్ష మఖమంటపంబున సుఖాసీనులై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీత చిత్తు లైరి; మూర్తిమంతంబు లైన మంత్రంబులు తంత్రంబులు చాలించె; పాప కర్ముం డగు దక్షుని నిందించి బ్రహ్మ తన లోకంబునకుఁ బోయె; మఱియుఁ దక్కిన వార లందఱు తమతమ నివాసంబులకుం జనిరి తత్సమయంబున.
టీక :-
తత్ప్రకారము = ఆ విధంగా; వీక్షించి = చూసి; మఖ = యజ్ఞము; మహాభీతచిత్తులు = చాలా భయముతో కూడిన మనస్సు కలవారు; మూర్తిమంతము = ఘనమైన; నిందించు = దూషించు (తిట్టు); చనుట = వెళ్ళుట; తత్సమయము = ఆసమయంలో.
భావము :-
ఆ విధంగా జరిగిన దానిని చూసి దక్షుని యాగ మంటపమున సుఖంగా కూర్చుని యున్న బ్రహ్మదేవుడు, విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతలంతా చాలా భయపడ్డారు. ఘనమైన ఆమంత్ర, తంత్రములను ఆపివేశారు. పాపాత్ముడైన దక్షుని నిందించి బ్రహ్మ తనలోకమునకు వెడలిపోయెను. ఆసమయంలో మిగిలినవారంతా తమతమ నివాసములకు వెళ్ళిపోయారు.