సభలు సమావేశాలు : 2017 ఫిబ్రవరి బమ్మెర
తెలుగుల పుణ్యపేటికి తెలుగు మహిళల భక్తి నివాళి - చరణి భాగవత ఆవిష్కరణ
2017 ఫిబ్రవరి 18వ తారీఖున. . . తెలుగు మహిళలు శ్రీమతి పింగళి రాధగారు వారి మిత్రురాలు
తెలుగుల పుణ్యపేటి, తెలుగు జాతీయ మహా కవి, ప్రజా కవి, బమ్మెర పోతనామాత్యుల వారికి భక్తి పూర్వక కృతజ్ఞతా భావముతో పోతనామాత్యుల వారి జన్మస్థలమైన తెలంగాణా రాష్ట్రము, వరంగలు జిల్లా, పాలకుర్తి మండలమునకు చెందిన బమ్మెర గ్రామము దర్శించారు. అక్కడ వారు కవీశ్వరుని పూజించిన వివరాలు:-
పాలకుర్తి పట్టణము నందలి నరసింహస్వామి గుడి వద్ద గల పాల్కుర్కి సోమనాథ కవి విగ్రహానికి నమస్కరించుకున్నారు.
అక్కడకు ఒక కిలోమీటరు దూరంలో గల బమ్మెర గ్రామములోని తెలుగు జాతీయ మహాకవి పోతన స్మారక శిల (సమాధి) వద్ద, స్మారక మందిరం నందలి విగ్రహాల వద్ద పూజలు చేసారు.
పోతన దున్నిన పొలమును, వాడిన వ్యవసాయ బావి మున్నగువాటిని దర్శనం చేసుకుని ప్రణామాలు సమర్పించారు.
పోతన స్మారక మందిరంలోనూ, స్మారక శిల వద్దా పరమ భక్తి శ్రద్దలతో పూజలు చేసారు. తెలుగు భాగవతం వారి ఆండ్రాయిడు అనుకూల చరణి భాగవతాన్ని ఆవిష్కరించారు, పోతరాజు గారికి శ్రీమతి రాధ ఆ ఆండ్రాయిడు చరణి భాగవతం నుండి "గజేంద్ర మోక్షం" లోని పద్యాలు; "మందార మకరందమున.. ." పద్యం రాజోపచారముగా గాన సమర్పణ గావించారు. తితిదేవారి పోతన భాగవత గ్రంథాన్ని, నూతన వస్త్రాలను నివేదించారు.
ఆ తెలుగు మహిళలకు సాటి తెలుగు వారిగా అభినందన సమేత కృతజ్ఞతాభివాద శతములు.
బమ్మెర గ్రామరైతు ఒకరు వచ్చి ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించారు, ఆ రైతుశ్రేష్ఠునికి ధన్యవాదములు.
- భాగవత గణనాధ్యాయి.