బమ్మెర పోతన : పోతన శ్రీనాథుల సీసాలు
సీసపద్యము.
శ్రీ భీమనాయక శివనామధేయంబు
చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి
చూడంగ నేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి
చే నింప నేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మ విద్యాదాత యౌదల
విరులు పూన్పగ నేర్చు కరము కరము
తేటగీతి.ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు
నర్థి దిరుగంగ నేర్చిన యడుగు లడుగు
లంబికానాయకధ్యానహర్షజలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు
ఈ పద్యం చదవగానే తెలుగువారికి "7-169-సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు" అనే పోతన గారి పద్యం గుర్తుకువస్తుంది.పై పద్యం శ్రీనాథుడు వ్రాసినది.
రెండు పద్యాలూ భక్తిభావ వ్యంజకాలే.కానీ శ్రీనాథుడు చెప్పే పద్ధతిలో రాజసం రాణిస్తున్నది.పోతన కవిత్వం లోపారవశ్యం లాస్యం చేస్తున్నది.వస్తుతత్వం ఒకటే అయినా కవి వ్యక్తిత్వాన్ని బట్టి కవితలలో భేదం కనిపిస్తుంది.సీసపద్య పాదాలను సమవిభక్తం చేసి పూర్వార్థం లో భీమేశ్వరాకృతిని సమాన ఘటనం తో సాక్షాత్కరింప చేసి ఆ మూర్తిని అర్చించాలని ఆదేశిస్తున్నట్లు వున్నది శ్రీనాథుని సీసం.