పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-590-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? ర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

టీకా:

కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; కలుగవే = పొందలేదా ఏమి; గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = ఔన్నత్యమును; పొందరే = చెందలేదా ఏమి; వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరిని = సంపదలను; మూటగట్టుకొని = కూడగొట్టుకొని; పోవంజాలిరే = తీసుకుని పోగలిగేరా, లేదు; భూమి = నేలపైన; పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు; ప్రీతిన్ = కోరి; యశః = కీర్తి; కాములు = కోరువారు; ఐ = అయ్యి; ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; ఈ = ఇప్పటి; కాలమున్ = కాలమునందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు వంశమువాడు, శుక్రుడు}.

భావము:

శుక్రాచార్యా! పూర్వ కాలంలో కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.
బలిచక్రవర్తి రాక్షసరాజైనా సత్యసంధుడు, తనువు నశ్వరతను, సిరుల యస్థిరతను ఎరిగిన జ్ఙాని; కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయం చెప్తున్నాడు.