పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : నముచి వృత్తాంతము

  •  
  •  
  •  

8-382-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సిద్ధించెన్ సురలార! మీ కమృతమున్; శ్రీనాథ సంప్రాప్తులై
వృద్ధిం బొందితి రెల్ల వారలును; విద్వేషుల్ మృతిం బొంది; రీ
యుద్ధం బేటికి? నింకఁ జాలుఁ; బనిలే దోహో పురే" యంచు సం
ద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్యవంశాగ్రణీ!"

టీకా:

సిద్ధించెన్ = సమకూరినది; సురలార = దేవతలు; మీ = మీ; కున్ = కు; అమృతమున్ = అమృతము; శ్రీనాథ = నారయణుని; సంప్రాప్తులు = ఆశ్రయముదొరికినవారు; ఐ = అయ్యి; వృద్ధిన్ = అభివృద్ధిని; పొందితిరి = పొందిరి; ఎల్లవారలను = మీరు అందరు; విద్వేషుల్ = శత్రువులు; మృతిన్ = మరణమును; పొందిరి = పొందిరి; ఈ = ఈ; యుద్ధంబున్ = పోరు; ఏటికిన్ = ఎందులకు; ఇంకన్ = ఇంక; చాలును = చాలించండి; పని = అవసరము; లేదు = లేదు; ఓహో = భళీ; పురే = బాగు; అంచున్ = అనుచు; సంబద్ధ = తగిన; ఆలాపములు = మాటలు; ఆడి = పలికి; మాన్చెన్ = మానిపించెను; సురలన్ = దేవతలను; పాండవ్యవంశాగ్రణీ = పరీక్షిన్నరేంద్రుడ.

భావము:

ఓ పాండవ వంశంలో ఉత్తముడవయిన పరీక్షిన్మహారాజా! “ఓ దేవతలారా! మీకు అమృతం లభించింది కదా. మీరు అందరూ చక్కగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించి బాగుపడ్డారు. మీ శత్రువులు నశించిపోయారు. బాగు బాగు. ఇంక యుద్ధంతో పని లేదు, ఆపేయండి” అంటూ నచ్చజెప్పి నారదుడు యుద్ధం ఆపించాడు.