పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-239-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది గావున, గురుశుశ్రూషయు సర్వలాభసమర్పణంబును సాధుజన సంగమంబును నీశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని యందలి ప్రేమయు నారాయణ గుణ కర్మ కథా నామకీర్తనంబును వైకుంఠ చరణకమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబును మొదలయిన విజ్ఞానవైరాగ్య లాభసాధనంబు లైన భాగవతధర్మంబులపై రతి గలిగి సర్వభూతంబుల యందు నీశ్వరుండు భగవంతుం డాత్మఁ గలండని సమ్మానంబు జేయుచుఁ గామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులం గెలిచి యింద్రియవర్గంబును బంధించి భక్తి చేయుచుండ నీశ్వరుం డయిన విష్ణుదేవుని యందలి రతి సిద్ధించు.
^[భాగవతుల దశ ధర్మాలు]

టీకా:

అదిగావున = అందుచేత; గురు = గురువును; శుశ్రూషయున్ = సేవించుట; సర్వ = సమస్తమైన; లాభ = ప్రయోజనములను; సమర్పణంబును = ఈశ్వరార్పణచేయుట; సాధు = సాదువులైన; జన = వారి; సంగమంబునున్ = చేరిక, చెలిమి; ఈశ్వర = భగవంతుని, విష్ణుమూర్తి; ప్రతిమ = విగ్రహమును; సమారాధనంబును = చక్కగా కొలచుట; హరి = విష్ణు; కథా = కథల యందు; తత్పరత్వంబును = తదేక నిష్ఠ గలిగి యుండుట; వాసుదేవుని = విష్ణుని {వాసుదేవుడు - వ్యు. వాసుదేవః – సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, విష్ణువు, శ్రీకృష్ణుడు}; అందలి = ఎడల; ప్రేమయున్ = ప్రేమ; నారాయణ = విష్ణుని {నారాయణుడు - వ్యు. నారం విజ్ఞానం తదయనమాశ్రయో యస్యసః నారాయణః, రిష్యతే క్షీయత యితరః రిజ్క్షయే ధాతుః సనభవతీతి నరః అవినాశ్యాత్మాః, నరసమూహమున నివాసము గలవాడు, హరి}; గుణ = గుణములను; కర్మ = వర్తనములను; కథా = కథలను; నామ = నాములను; సంకీర్తనంబును = స్తోత్రము, పాడుట; వైకుంఠ = విష్ణుని {వైకుంఠుడు - వైకుంఠవాసి, వికుంఠ యను నామె పుత్రుడు, హరి}; చరణ = పాదము లనెడి; కమల = పద్మముల; ధ్యానంబును = ధ్యానించుట; విశ్వంభర = విష్ణుని {విశ్వంభరుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; మూర్తి = స్వరూపమును; విలోకన = చక్కగాగాంచుట; పూజనంబును = భజించుట; మొదలయిన = మున్నగునవి; విజ్ఞాన = ఉత్తమ జ్ఞానము; వైరాగ్య = విషయవైముఖ్యము; లాభ = లభింపజేసెడి; సాధనంబులు = సాధనములు; ఐన = అయిన; భాగవత = భాగవత తత్త్వము యొక్క; ధర్మంబుల్ = ధర్మముల; పైన్ = మీద; రతి = మిక్కిలి మక్కువ; కలిగి = ఉండి; సర్వ = సమస్తమైన; భూతంబుల = జీవుల; అందున్ = లోను; ఈశ్వరుండు = హరి {ఈశ్వరుడు - సర్వ లోక నియామకుడు, విష్ణువు}; భగవంతుండు = హరి {భగవంతుడు - గుణషట్కములైన 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు కలిగి పూజనీయ మైనవాడు, విష్ణువు}; ఆత్మ = తన ఆత్మలో; కలండు = ఉన్నాడు; అని = అని; సమ్మానంబు = గౌరవించుట; చేయుచున్ = చేయుచు; కామ = కోరిక; క్రోధ = కోపము; లోభ = పిసినారితనము; మోహ = అజ్ఞానము; మద = గర్వము; మత్సరంబులన్ = మాత్యర్యములను; గెలిచి = జయించి, స్వాధీనముచేసికొని; ఇంద్రియవర్గంబును = అంతరింద్రియ బాహ్యేంద్రియములను; బంధించి = వాని యిచ్చచొప్పున పోనీయక; భక్తి = భక్తి; చేయుచుండన్ = చేయుచుండగా; ఈశ్వరుండు = నారాయణుని; విష్ణుదేవుని = నారాయణుని; అందలి = అందు; రతి = ప్రీతి; సిద్ధించు = కలుగును.

భావము:

కాబట్టి, 1) గురువులకు సేవ, 2) సమస్తమైన ఫలితాన్ని భగవంతునికి సమర్పణ, 3) సజ్జనులతో స్నేహం, 4) విష్ణుదేవుని విగ్రహారాధన, 5) శ్రీహరి కథల శ్రవణం, 6) వాసుదేవ మనన, 7) నారాయణ సంకీర్తన, 8) విష్ణు పాద ధ్యానం, 9) హరి దర్శనం మరియు 10) పూజ మున్నగునవి భాగవత ధర్మాలు. ఇవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. ఈ భాగవత ధర్మాలు మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మ స్వరూపంతో సర్వ ప్రాణికోటిలోను ఉన్నాడని తెలుసుకుని మనం వాటిని ఆచరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం (అరిషడ్వర్గాలు) అను వాటిని జయించి, ఇంద్రియ చాపల్యం అరికట్టాలి. ఆ విధంగా భక్తితో పూజిస్తే భగవంతుడైన విష్ణుభక్తి సిద్ధిస్తుంది.