పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-142-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు వేదమార్గంబు విడిచి పాషాండమార్గంబు లాచరించు పురుషుని నసిపత్రవనంబు నందు యమకింకరులు తఱట్ల నడచుచుఁ బరిహసించుచుం దోలునెడ నా యసిపత్రంబు లిరుగెలంకుల శరీరంబుఁ ద్రెంచుచుండ నడుగడుగున బిట్టు మొఱపెట్టుచుండ బాధించుచుండుదురు.

టీకా:

మఱియున్ = ఇంకను; వేద = వేదములందు విధించిన; మార్గంబున్ = దారిని; విడిచి = వదలివేసి; పాషాండ = వేదమార్గ దూరమైన; మార్గంబులన్ = విధానములను; ఆచరించు = ఆచరించెడి; పురుషుని = మానవుని; అసిపత్రవనంబున్ = అసిపత్రవనము {అసిపత్రవనము - అసి (కత్తులే) పత్ర (ఆకులు)గా కలిగిన వనము, నరకవిశేషము}; అందున్ = లో; యమకింకరులు = యమదూతలు; తఱట్ల = కొరడాలచేత; అడచుచు = మోదుచు; పరిహసించుచున్ = అవమానించుచు; తోలున్ = తరముచున్న; ఎడన్ = సమయములో; ఆ = ఆ; అసిపత్రంబులు = కత్తుల ఆకులు; ఇరు = రెండ (2); కెలంకులన్ = వైపులను; శరీరంబున్ = దేహ భాగములు; త్రెంచుచుండన్ = తెంపి వేయుచుండగా; అడుగడుగునన్ = ప్రతి అడుగు నందు; బిట్టు = మిక్కిలి; మొఱపెట్టుచుండన్ = హాహాకారములు చేయుచుండగ; బాధించుచుండుదురు = బాధపెడుతుందురు;

భావము:

ఇంకా వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుణ్ణి అసిపత్రవనం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ కత్తుల చెట్ల నడుమ ఇరుప్రక్కల కత్తుల వంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతూ ఉంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు.