చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము
- ఉపకరణాలు:
"సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక-
మునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల-
మును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగం బగు వేదమును విప్ర-
గణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ-
డై భూతపతి దైవ మగుచు నుండు
- ఉపకరణాలు:
నందు మీరలు భస్మజటాస్థిధార
ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు" ననుచు
శాప మొనరించె నా ద్విజసత్తముండు.
టీకా:
సకల = సమస్తమైన; వర్ణ = వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర}; ఆశ్రమ = ఆశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్య 2గృహస్త 3వానప్రస్త 4సన్యాస}; ఆచార = ఆచారముల {ఆచారములు - 1విధి 2నిషేధములు అని ద్వి విధములు}; హేతువు = కారణమైనది; లోకమున్ = జగమున; కున్ = కు; మంగళ = శుభకరమైన; మార్గమునున్ = విధానము; సనాతనము = శాశ్వతము పురాతనము; పూర్వ = పూర్వకాలపు; ఋషి = ఋషుల; సమ్మతము = అంగీకారము కలది; జనార్దన = విష్ణువే; మూలమును = మూలాధారముగ కలది; నిత్యమును = శాశ్వతమును; శుద్ధమును = పరిశుద్ధమైనదియును; శివంబున్ = శుభకరమైనదియును; ఆర్య = పూజ్యుల; పథా = మార్గమునకు; అనుగంబున్ = అనుగుణమైనదియును; అగు = అయిన; వేదమునున్ = వేదమును; విప్ర = బ్రాహ్మణుల; గణమున్ = సమూహమంతటిని; నిందించిన = శపించిన; కారణమున = కారణమువలన; ఏ = ఏ; శివదీక్ష = శివదీక్ష; అందేని = లోనైనా; మధ్యమపూజ్యుడు = మధ్యమ పూజ్యుడు {మధ్యమ పూజ్యుడు - మధ్యముడైన పూజ్యుడు, మధ్యమ పురుషలో పూడింపబడువాడు, మధ్యమ స్వరంలో (వ్యాకరణ శాస్త్రంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి నాలుగు విధాలైన వాక్ రూపాలలో ఒకటి) పూజింపబడువాడు}; ఐ = అయ్యి; భూతపతి = శివుడు {భూతపతి - సమస్త భూతములకు నాథుడు, శివుడు}; దైవము = దేవుడు; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; అందున్ = వానిలో.
మీరలు = మీరు; భస్మ = విభూది; జట = జటలుగట్టినశిరోజములు; అస్థి = ఎముకలు; ధారణములున్ = ధరించుటలుతో; తగి = కలిగి; మూఢ = మూర్ఖపు; బుద్ధులు = బుద్ధులు; నష్టశౌచులు = పోయిన శుచిత్వము కలవారు; ఐ = అయ్యి; నశింతురు = నాశనమైపోతారు; పాషండులు = పాషండులు; అగుచున్ = అవుతూ; అనుచున్ = అంటూ; శాపము = శాపమును; ఒనరించెన్ = ఇచ్చెను; ఆ = ఆ; ద్విజ = బ్రాహ్మణులలో {ద్విజుడు - రెండు జన్మలుగలవాడు, బ్రాహ్మణుడు}; సత్తముండు = శ్రేష్ఠుడు.
భావము:
సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మధ్యమ పూజ్యు డగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.