చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన
- ఉపకరణాలు:
అరయఁగ నే ధరామర పదాంబుజరేణువు లర్థిఁ దాల్చి య
ప్పరమ పురాణ పూరుషుఁడు బ్రాహ్మణదేవుఁడు నైనయట్టి యీ
శ్వరుఁడు సదానపాయినిని సాగరకన్యను సర్వలోక వి
స్ఫురిత పవిత్రకీర్తియును బొంది విభూతిఁ దనర్చెఁ గావునన్.
టీకా:
అరయగన్ = పరిశీలించినచో; ఏ = ఎట్టి; ధరామర = బ్రాహ్మణుల; పద = పాదములు అనెడి; అంబుజ = పద్మముల కంటిన; రేణువులన్ = ధూళిరేణువులను; అర్థిన్ = కోరి; తాల్చి = ధరించి; ఆ = ఆ; పరమ = అత్యంత; పురాణ = పాతకాలపు; పూరుషుండు = వ్యక్తి; బ్రాహ్మణ = వేదార్థమైనట్టి; దేవుడు = హరి; ఐనయట్టి = అయినట్టి; ఈశ్వరుడు = హరి; సదా = ఎల్లప్పుడు; అనపాయినిని = విడువని యామెను; సాగరకన్యను = లక్ష్మీదేవిని {సాగర కన్య - సాగరునికి పుట్టినామె, లక్ష్మి}; సర్వ = సకల; లోక = లోకములలోను; విస్ఫురిత = విస్తరించిన; పవిత్ర = పుణ్యవంతమైన; కీర్తియును = యశస్సు; పొంది = పొంది; విభూతిన్ = వైభవముతో; తనర్చెన్ = అతిశయించెను; కావునన్ = కనుక.
భావము:
పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణులను దైవాలుగా భావిస్తాడు. బ్రాహ్మణుల పాదపద్మ పరాగాలను ప్రీతితో ధరిస్తాడు. అందుచేత తనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవిని, సర్వలోకాలలో పరివ్యాప్తమై ప్రకాశించే పవిత్ర కీర్తిని అందుకొని ఆయన విరాజిల్లుతున్నాడు.