తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు
- ఉపకరణాలు:
ఘన మందరగిరి పరివ
ర్తన నికషోజ్జ్వలిత కనకరత్నాంగదముల్
దనరార లోకపాలకు
లను గలిగిన బాహు శాఖలను దలఁపఁదగున్.
టీకా:
ఘన = గొప్పదియైన; మందర = మందరము అనెడి; గిరి = పర్వతము; పరి = వద్ద; వర్తన = తిరుగుతుండుటచే; నికష = సానపెట్టబడి; ఉజ్జ్వలిత = మెరుస్తున్న; కనక = బంగారు; రత్న = రత్నములు పొదిగిన; అంగదముల్ = నగలతో; తనరారన్ = అతిశయిస్తున్నట్టి; లోకపాలకులనున్ = లోకపాలకులను; కలిగిన = మోసెడి, కాపాడెడి; బాహు = చేతులు అనెడి; శాఖలను = కొమ్మలను; తలంపగన్ = సంస్మరించుట; తగున్ = చేయవలయును.
భావము:
సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగిన లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి.