తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట
- ఉపకరణాలు:
ఘనసార రుచి వాలుకా సముదంచిత-
సైకతవేదికాస్థలము నందు
యమనియమాది యోగాంగ క్రియానిష్ఠఁ-
బూని పద్మాసనాసీనుఁ డగుచు
హరిపాదసరసీరుహన్యస్త చిత్తుఁడై-
బాహ్యేంద్రియవ్యాప్తిఁ బాఱఁదోలి
సకలవిద్వజ్జన స్తవనీయ సముచితా-
చార వ్రతోపవాసములఁ గ్రుస్సి
- ఉపకరణాలు:
యున్న పుణ్యాత్ము విగతవయోవికారు
వినుతసంచారు భువనపావనవిహారు
యోగిజనగేయు సత్తతిభాగధేయు
నాశ్రితవిధేయు మైత్రేయు నచటఁ గాంచె.
టీకా:
ఘనసార = కర్పూరపు పలుకులు; రుచిన్ = ప్రభ, కాంతి; వాలుకా = ఇసుకరేణువులచే; సముదంచిత =చక్కగా ఒప్పుతున్న; సైకత = ఇసుక; వేదికా = తిన్నెలపైని; స్థలమున్ = ప్రదేశము; అందున్ = లో; యమ = యమము; నియమ = నియమము; ఆది = మొదలైన; యోగ = యోగము యొక్క {అష్టాంగయోగ మార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8)}; అంగ = అంగ; క్రియా = క్రియల; నిష్ఠన్ = నిష్ఠను; పూని = వహించి; పద్మాసనా = పద్మాసనముతో {పద్మాసనము - పద్మము వంటి ఆకారము కల (విశిష్టమైన) ఆసనము}; ఆసీనుడు = కూర్చున్నవాడు {ఆసనము - యోగక్రియాచరణాదులకై ప్రత్యేక ఆకారములలో అవయవములను ఉంచుకొనుస్థితి}; అగుచున్ = అవుతూ; హరి = కృష్ణుని; పాద = పాదములు అను; సరసీరుహ = పద్మముల యందు {సరసీరుహము - నీట పుట్టినది, పద్మము}; న్యస్త = లగ్నముచేసిన; చిత్తుడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; బాహ్య = వెలుపలి {బాహ్యేంద్రియములు - వెలుపలి కన్ను మొదలగు పంచేంద్రియములు}; ఇంద్రియ = ఇంద్రియముల; వ్యాప్తిన్ = ప్రవర్తనను; పాఱఁదోలి = పోగొట్టి; సకల = సమస్త; విద్వజ్జన = విద్వాంసులచే; స్తవనీయ = స్తుతింబడుటకు; సముచిత = తగినట్టి; ఆచార = ఆచారములు; వ్రత = వ్రతములతోను; ఉపవాసములన్ = ఉపవాసములతోను; క్రుస్సి = చిక్కి;
ఉన్న = ఉన్నట్టి; పుణ్యాత్ము = పుణ్యాత్ముని; విగత = విడిచిన; వయస్ = వయస్సు యొక్క; వికారు = వికారములుకలవానిని; వినుత = కీర్తింపబడుతూ; సంచారు = సంచరిస్తున్నవానిని; భువన = లోకములను; పావన = పవిత్రముచేయుటకై; విహారు = విహరించువానిని; యోగి = యోగులు ఐన; జన = జనులచే; గేయు = కీర్తింపబడువానిని; సత్ = ఉత్తముల; తతి = సమూహములకు; భాగధేయు = భాగ్యమైనవానిని; ఆశ్రిత = ఆశ్రయించిన వారికి; విధేయుడు = అనుకూలమైనవానిని; మైత్రేయున్ = మైత్రేయుని; అచటన్ = అక్కడ; కాంచెన్ = చూసెను.
భావము:
స్నానానంతరం విదురుడు ఎదురుగుండా యోగిజన స్తవనీయుడూ, సాధుజన భాగధేయుడూ, శ్రితజన విధేయుడూ అయిన మైత్రేయుణ్ణి చూచాడు. ఆ మహనీయుడు కప్పురము కుప్పపోసినట్లున్న, ఒనానొక ఇసుక తిప్పమీద పద్మాసనాసీనుడై ఉన్నాడు. ఆయన యమ నియమాదులతో కూడిన అష్టాంగ యోగాన్ని నిష్ఠాగరిష్ఠుడై ఆచరిస్తున్నవాడు. శ్రీకృష్ణుని చరణ సరోజాలపై చిత్తం లగ్నం చేసి ఉన్నవాడు. ఇంద్రియాలను వశం చేసుకొనిన వాడు. సమస్త విద్వాంసులకు సంస్తవనీయమైన సదాచారాలతో, వ్రతాలతో, ఉపవాసాలతో, ఆ మహాముని శరీరం సన్నబడిన దేహం కలవాడు. ఆయనలో వార్ధక్యలక్షణాలు ఏమీ కన్పించటం లేదు. ఆటువంటి పుణ్యజీవనుడూ, భువనపావనుడూ అయిన మైత్రేయుడు విదురుని ముందు సాక్షాత్కరించాడు.