తృతీయ స్కంధము : మైత్రేయునిఁ గనుగొనుట
- ఉపకరణాలు:
కని డాయనేఁగి మోదం
బునఁ దత్సరిదమల పులిన భూములఁ దగ నా
దినశేషము నివసించెను
వనజోదరపాదపద్మవశమానసుఁడై
టీకా:
కని = చూసి; డాయన్ = డగ్గరకు; ఏగి = వెళ్ళి; మోదంబునన్ = సంతోషముతో; తత్ = ఆ; సరిత్ = నది యొక్క; అమల = నిర్మలమైన; పులినభూములన్ = ఇసకతిన్నెలందు; తగన్ = అలా; ఆ = ఆ; దినశేషము = రాత్రి {దినశేషము - ఆనాటికి మిగిలిన సమయము, రాత్రి}; నివసించెను = ఉండెను; వనజోదర = కృష్ణుని {వనజోదరుడు - వనము (నీటి)లో జ (పుట్టిన) (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; పాద = పాదములు అను; పద్మ = పద్మములకు; వశ = వశమైన; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి.
భావము:
అలా దర్శనమిచ్చిన యమునా నదిని విదురుడు ఉద్ధవుడు సమీపించారు. విదురుడు ఆ నదిలోని అందమైన తెల్లని ఇసుక తిన్నెల మీద ఆనందంగా ఆసీనుడైనాడు. పద్మోదరుడైన ఆ శ్రీకృష్ణుని పాదపద్మాల స్మరణ యందు లగ్మమైన మనస్సు కలవాడై ఆ దినమంతా గడిపాడు.