తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు
- ఉపకరణాలు:
"పాండునృపాల నందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్
భండనభూమిలో గెలిచి పాండుర శారదచంద్రచంద్రి కా
ఖండయశః ప్రసూన కలికావళిఁ గౌరవరాజ్యలక్ష్మి నొం
డొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండగన్.
టీకా:
పాండు = పాండు; నృపాల = రాజు యొక్క; నందనులు = పూత్రులు; బాహు = భుజ; బలంబునన్ = బలము వలన; ధార్తరాష్ట్రులన్ = దుర్యోధనాదులను {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని కొడుకులు, దుర్యోధనాదులు}; భండన = యుద్ధ; భూమి = రంగము; లోన్ = లోపల; గెలిచి = జయించి; పాండుర = తెల్లని; శారద = శరదృతువు నందలి; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల వంటి; అఖండ = అంతులేని; యశః = కీర్తి యనే; ప్రసూన = పుష్పముల; కలిక = మొగ్గల; ఆవళిన్ = వరుసతో; కౌరవ = కురువంశపు; రాజ్య = రాజ్యము యొక్క; లక్ష్మిన్ = సంపదను; ఒండొండ = ఒక్కొక్కటిగ; అలంకరింపుచు = అలంకరిస్తూ; జయ = జయము యొక్క; ఉన్నతిన్ = గొప్పదనముతో; రాజ్యమున్ = రాజ్యమును; చేయుచు = పాలించుచు; ఉండగన్ = ఉండగా.
భావము:
పాండురాజు కుమారులైన ధర్మరాజు మున్నగు వారు బాహువిక్రమంతో ధృతరాష్ట్రుని కొడుకులైన దుర్యోధనుడు మున్నగు కౌరవులను రణరంగంలో జయించారు. స్వచ్ఛమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండకీర్తిని ఆర్జించారు. అలా యశస్సు అనే పూలమొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈవిధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలన సాగించారు.