తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు
- ఉపకరణాలు:
మాయజూదంబు పన్ని దుర్మార్గవృత్తిఁ
బుడమిఁ గొని యడవులకుఁ బో నడువ నచటఁ
దిరిగి వారలు సమయంబు దీర్చి యేఁగు
దెంచి తమ యంశ మడిగినఁ బంచి యిడక.
టీకా:
మాయ = మోసముతో కూడిన; జూదమున్ = జూదమును; పన్ని = కుట్రచేసి; దుర్మార్గ = చెడుదారి పట్టిన; వృత్తిన్ = పద్ధతులతో; పుడమిన్ = రాజ్యమును; కొని = లాక్కొని; అడవులు = అరణ్యముల; కున్ = కి; పోన్ = పోవునట్లు; నడువ = గెంటివేయగా; అచటన్ = అక్కడనుండి; తిరిగి = మరల; వారలు = వారు; సమయంబు = గడువును; తీర్చి = తీర్చి; ఏగుదెంచి = వచ్చి; తమ = తమ యొక్క; అంశమున్ = పాలు; అడిగినన్ = అడుగగా; పంచి = పంచి; ఇడక = ఇవ్వక.
భావము:
కౌరవులు మాయా జూదంలో అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని లాక్కొన్నారు. వారిని అడవులకు వెళ్ళగొట్టారు. పాండవులు ఒడంబడిక ప్రకారం గడువు ముగిశాక తిరిగివచ్చి తమకు రావలసిన రాజ్యభాగాన్ని అడిగితే ఇవ్వలేదు.