పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : రాజుల యుత్పత్తి

  •  
  •  
  •  

12-8-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తి యై, వసుమతీచక్రం బవక్రుండై యేలు నంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి బౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, వానికి దిలకుండు, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికిఁ నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతని కి యజ్ఞశీలుండు, నా భవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశత్రుండు, వానికి విజయుం, డ వ్విజయునికిఁ జంద్రబీజుం డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూటయేఁబదియాఱు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరులేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంక వంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చి యుండెద; రటమీఁద యవను లెనమండ్రు, బర్బరులు పదునల్గురు, దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూటతొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతం బైన వత్సరంబులు మత్సరంబున నేలెద ; రా సమయంబునఁ, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁ దద్భ్రాతయగు యశోనందుండుఁ బ్రవీరకుండు వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయించి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైఢూర్య పతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధదేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్రదేశవాసు లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ జేసి, బలపరాక్రమవంతు లైన క్షత్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యాగంగా ప్రయాగ పర్యంతం బగు భూమినేలఁ గలండు; శూద్రప్రాయు లగు రాజులును, వ్రాత్యులును, బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్భుద మాళవ దేశాధిపతు లయ్యెదరు, సింధుతీరంబులఁ జంద్రభాగా ప్రాంతంబులఁ గాశ్మీరమండలంబున మేధావిహీనులై మ్లేచ్ఛాకారు లగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతులఁ వధియింప రోయక, పరధన పరస్త్రీపరు లై, రజస్తమోగుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై హరి చరణారవిందమకరంద రసాస్వాదులు గాక తమలో నన్నోన్య వైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁ బ్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున.

టీకా:

మఱియున్ = పిమ్మట; కణ్వ = కణ్వుల; వంశజుండు = వంశస్థుడు; అగు = ఐన; సుశర్ముండు = సుశర్మ; అను = అనెడి; రాజు = రాజు; ఉదయించినన్ = కలుగగా; వానిన్ = అతనిని; హింసించి = చంపి; తత్ = అతని; భృత్యుండు = సేవకుడు; అంధ్ర = ఆంధ్ర; జాతీయుండు = జాతివాడు; అయిన = అగు; వృషలుండు = శూద్రుడు; అధర్మ = ధర్మవిరుద్ధమైన; మార్గ = మార్గమున; వర్తి = సంచరించువాడు; ఐ = అయ్యి; వసుమతీచక్రంబున్ = భూమండలమును; అవక్రుండు = అవక్రవిక్రమముగలవాడు; ఐ = అయ్యి; ఏలున్ = పాలించును; అంతన్ = అప్పుడు; వాని = అతని; అనుజుండు = సోదరుడు; కృష్ణుండు = కృష్ణుడు; అను = అనెడి; వాడు = అతను; రాజు = రాజు; ఐ = అయ్యి; నిలుచున్ = నిలబడును; ఆ = ఆ యొక్క; మహామూర్తి = గొప్పవాని; కిన్ = కి; శాంతకర్ణుండును = శాంతకర్ణుడు; వాని = అతని; కిన్ = కి; పౌర్ణమాసుండును = పౌర్ణమాసుడు; వాని = అతని; కిన్ = కి; లంబోదరుండును = లంబోదరుడు; వాని = అతని; కిన్ = కి; శిబిలకుండున్ = శిబిలకుండు; అతని = వాని; కిన్ = కి; మేఘస్వాతియున్ = మేఘస్వాతి; వాని = అతని; కిన్ = కి; దండమానుండును = దండమానుడు; వాని = అతని; కిన్ = కి; హాలేయుండు = నాగలిపట్టువాడు; అగు = ఐన; అరిష్టకర్మయున్ = అరిష్టకర్మ; వాని = అతని; కిన్ = కి; తిలకుండు = తిలకుడు; అతని = వాని; కిన్ = కి; పురీషసేతుండును = పురీషసేతుడు; వాని = అతని; కిన్ = కి; సునందనుండునున్ = సునందనుడు; ఆ = ఆ యొక్క; రాజ = రాజులలో; శేఖరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; వృకుండును = వృకుడు; వృకున్ = వృకుని; కున్ = కి; జటాపుండునున్ = జటాపుడు; జటాపున్ = జటాపుని; కున్ = కి; శివస్వాతియు = శివస్వాతి; వాని = అతని; కిన్ = కి; అరిందముండున్ = అరిందముడు; ఆ = ఆ; భూమీశున్ = రాజున; కున్ = కు; గోమతియునున్ = గోమతి; వాని = అతని; కిన్ = కి; పురీమంతుండునున్ = పురీమంతుడు; అతని = వాని; కిన్ = కి; దేవశీర్షుండును = దేవశీర్షుడు; వాని = అతని; కిన్ = కి; శివస్కందుండునున్ = శివస్కందుడు; అతని = వాని; కిన్ = కి; యజ్ఞశీలుండున్ = యజ్ఞశీలుడు; ఆ = ఆ; భవ్యున్ = యోగ్యుని; కున్ = కి; శ్రుతస్కందుండు = శ్రుతస్కందుడు; వాని = అతని; కిన్ = కి; యజ్ఞశత్రుండున్ = యజ్ఞశత్రుడు; వాని = వాని; కిన్ = కి; విజయుండున్ = విజయుడు; ఆ = ఆ; విజయున్ = విజయుని; కిన్ = కి; చంద్రబీజుండున్ = చంద్రబీజుడు; అతని = వాని; కిన్ = కి; సులోమధియున్ = సులోమధి; ఇట్లు = ఈ విధముగ; పెక్కండ్రు = అనేకమంది; ఉదయించి = కలిగి; నన్నూటయేబదియాఱు = నాలుగువందల ఏభైయ్యారు (456); హాయనంబులున్ = సంవత్సరాలు; ధాత్రిన్ = భూమండలమును; పాలించెదరు = ఏలెదరు; అంతన్ = పిమ్మట; ఆభీరులు = ఆభీరవంశస్థులు; ఏడ్వురున్ = ఏడుగురు (7); గర్దభులు = గర్దభవంశస్థులు; పదుండ్రును = పదిమంది (10); కంక = కంక; వంశజులు = వంశస్థులు; పదాఱుగురు = పదహారుమంది (16); మేదినీభారంబున్ = రాజ్యాధికారమును; తాల్చి = ధరించి; ఉండెదరు = ఉంటారు; అటమీద = పిమ్మట; యవనులు = యవనులు; ఎనమండ్రు = ఎనిమిదిమంది (8); బర్బరులున్ = బర్బరులు; పదునల్గురు = పద్నాలుగుమంది (14); దేశాధీశులు = ప్రభువులు; ఐ = అయ్యి; ఏలెదరు = పరిపాలించెదరు; మఱియున్ = తరువాత; పదుమువ్వురు = పదమూడుమంది (13); గురుండులునున్ = గురుడులు; పదునొకండ్రు = పదకొండుమంది (11); మౌనులునున్ = మౌనులు; వేయుందొమ్మన్నూటతొమ్మిది = పందొమ్మిదొందలతొమ్మిది (1909); హాయనంబులున్ = సంవత్సరాలు; గర్వ = గర్వముతో; అంధులు = కన్నూమిన్నూకాననివారు; అయి = అయ్యి; ఏలెదరు = పాలిస్తారు; అటమీద = పిమ్మట; ఆ = ఆ; మౌన = మౌన; వంశజులు = వంశమువారు; అగు = ఐన; పదునొకండ్రు = పదకొండుమంది (11); త్రిశతియుతంబు = మూడుందలుపాటి; ఐన = అయిన; వత్సరంబులు = సంవత్సరాలు; మత్యరంబునన్ = క్రోధబుద్ధితో; ఏలెదరు = పాలిస్తారు; ఆ = ఆ; సమయంబునన్ = కాలమునకు; కైలకీలులు = కైలకీలులు; అను = అనెడి; యవనులు = యవనులు (అరబ్బీలు); భూపతులు = ప్రభువులు; అగుదురు = ఔతారు; అంతన్ = పిమ్మట; భూతనందుండు = భూతనందుడు; నవభంగిరుండు = నవభంగిరిడు; శిశునందుండు = శిశునందుడు; తత్ = అతని; భ్రాత = తమ్ముడు; అగు = ఐన; యశోనందుండు = యశోనందుడు; ప్రవీరకుండు = ప్రవీరకుడు; వీరలు = అనువీరు; వీరులు = శూరులు; ఐ = అయ్యి; షడుత్తరశత = నూటారు(106); హాయనంబులున్ = సంవత్సరాలు; ఏలెదరు = పాలించెదరు; అంతన్ = ఆ తరువాత; ఆ = ఆ; రాజుల్ = రాజుల; కున్ = కు; పదుమువ్వురు = పదమూడుమంది (13); కుమారులు = కొడుకులు; ఉదయించి = పుట్టి; అందున్ = వారిలో; ఆర్గురు = ఆరుమంది (6); బాహ్లిక = బాహ్లిక; దేశా = దేశములకు; అధిపతులు = ప్రభులు; అయ్యెదరు = ఔతారు; కడమ = మిగిలిన; ఏడ్వురును = ఏడుమంది (7); కోసలా = కోసలదేశమునకు; అధిపతులు = ప్రభువులు; అయ్యెదరు = ఔతారు; అంతన్ = పిమ్మట; వైడూర్యపతులు = వైడూర్యపతులు; నిషధా = నిషధదేశానికి; అధిపతులు = ప్రభువులు; ఐ = అయ్యి; ఉండెదరు = ఉంటారు; పురంజయుండు = పురంజయుడు; మగధ = మగధ దేశానికి; దేశాధిపతి = ప్రభువు; ఐ = అయ్యి; పుట్టి = జనించి; పుళింద = పుళింద; యదు = యదు; మద్ర = మద్ర; దేశవాసులు = ప్రజలు; అగు = ఐన; హీనజాతి = తక్కువకులపు; జనులు = ప్రజలు; బ్రహ్మఙ్ఞాన = ఆత్మఙ్ఞానము; హీనులు = లేనివారు; ఐ = అయ్యి; హరిభక్తి = విష్ణుభక్తి; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; వారి = వారల; కిన్ = కు; ధర్మోపదేశంబు = ధర్మాన్ని ఉంపదేశించుట; చేసి = చేసి; నారాయణభక్తి = విష్ణుభక్తి; నిత్యంబున్ = నిత్యమై; ఉండునట్లు = ఉండేలాగ; చేసి = చేసి; బల = అధికసైన్యాలు; పరాక్రమవంతులు = శౌర్యములు కలవారు; ఐన = అగు; క్షత్రియ = రాజుల; వంశంబుల్ = వంశాలని; అడంచి = అణచివేసి; పద్మావతీ = పద్మావతీ అనెడి; నగర = పట్టణంనుండి; పరిపాలకుండు = రాజ్యమునేలువాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; గంగా = గంగానది; ప్రయాగ = ప్రయాగ పట్టణము; పర్యంతంబు = వరకుగలది; అగు = ఐన; భూమిన్ = భూభాగమును; ఏలంగలండు = పాలిస్తాడు; శూద్ర = శూద్రులు, నీచజాతివారు; ప్రాయులు = వంటివారు; అగు = ఐన; రాజులును = ప్రభువులు; వ్రాత్యులునున్ = సంస్కారరహితులు {వ్రాత్యుడు - ఉపనయనాది సంస్కారములు లేని ద్విజుడు, సంస్కారరహితుడు}; పాషండులును = నాస్తికులు, వేదబాహ్యులు; అగు = ఐన; విప్రులును = బ్రాహ్మణులు; కలిగి = ఐ ఉండి; సౌరాష్ట్ర = సౌరాష్ట్రము; అవంతి = అవంతి; ఆభీర = ఆభీరము; అర్బుద = ఆర్బుదము; మాళవ = మాళవము; దేశ = దేశములకు; అధిపతులు = ప్రభువులు; అయ్యెదరు = ఔతారు; సింధు = సింధునదీ; తీరంబులన్ = పరివాహకప్రదేశాలలో; చంద్రభాగ = చంద్రభాగానది; ప్రాంతంబులన్ = పరిసరప్రాంతములలో; కాశ్మీర = కాశ్మీరు; మండలంబునన్ = దేశమునందు; మేధావిహీనులు = తెలివితక్కువవారు; ఐ = అయిన; మ్లేచ్ఛాకారులు = అనాచారరూపులు; అగు = ఐనట్టి; రాజులు = ప్రభువులు; భూభాగంబుల్ = రాజ్యములను; ఏలుచు = పాలిస్తూ; ధర్మ = ధర్మపాలన; సత్య = సత్యశోధన; దయ = కరుణా; హీనులు = లేనివారు; ఐ = అయ్యి; క్రోధ = క్రౌర్యము; మాత్సర్యంబుల = మచ్చరములతో; స్త్రీ = ఆడవారిని; బాల = పిల్లలను; గో = గోవులను; ద్విజాతులన్ = విప్రులను; వధియింపన్ = చంపుటకు; రోయక = వెనుదీయక; పరధన = తనదికానిసంపదలందు; పరస్త్రీ = తనదికానిస్త్రీలందు; పరులు = ఆసక్తికలవారు; ఐ = అయ్యి; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణములందు; రతులు = తగిలివర్తించువారు; ఐ = అయ్యి; అల్ప = నీచ; జీవులు = ప్రాణులు; ఐ = అయ్యి; అల్ప = చిన్న; బలులు = బలములుగలవారు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి; చరణ = పాదములనెడి; అరవింద = పద్మముల; మకరందరస = తేనెలను; ఆస్వాదులు = అనుభవించువారు; కాక = కాకుండపోయి; తమ = వారి; లోన్ = లో; అన్యోన్య = ఒకరిపైనొకరు; వైరానుబంధులు = పగలుపెంచుకొన్నవారు; ఐ = అయ్యి; సంగ్రామ = యుద్ధ; రంగంబులన్ = భూములలో; హతులు = ప్రాణాలుకోల్పోయినవారు; అయ్యెదరు = ఔతారు; ఆ = ఆ; సమయంబునన్ = కాలమునందు; ప్రజలు = లోకులు; తత్ = అట్టి; శీల = వర్తనలు; వేషభాష = వేషభాషలు; ఆదులన్ = మున్నగువానిని; అనుసరించి = ప్రకారమే; ఉండెదరు = ఉంటారు; కావున = కనుక.

భావము:

అటుపిమ్మట, కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతని భృత్యుడు, ఆంధ్ర జాతీయుడు అయిన వృషలుడు అధర్మమార్గంలో అతనిని వధిస్తాడు. రాజ్యాన్ని చేపట్టి అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని పిమ్మట, అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, నాగలి పట్టేవాడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కంధుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కంధుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని క్రమంగా అనుభవిస్తారు. వారందరు కలిసి పరిపాలించే కాలం నాలుగువందలయేభైఆరు సంవత్సరములు.
ఆ తరువాత నాభీరవంశం వారు ఏడుగురు, గర్దభవంశం వారు పదిమంది, కంకవంశం వారు పదహారుమంది రాజ్యభారాన్ని ధరించి పరిపాలిస్తారు. అటు పిమ్మట ఎనిమిదిమంది యవనులు, పదునాలుగురు బర్బరులు ప్రభువులు అవుతారు. అటు తరువాత గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది ప్రభులు అవుతారు. గురుండులు గర్వంతో కన్నూమిన్నూ కానకుండా పంతొమ్మిదివందలతొమ్మిది ఏళ్ళు పరిపాలన సాగిస్తారు. అటు పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడువందల సంవత్సరాలపాటు క్రోధబుద్ధితో పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు భూపాలన చేస్తారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటఆరు ఏళ్ళు పాలకులు అవుతారు. ఆ రాజుకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లిక దేశానికి అధిపతులు అవుతారు. మిగిలిన ఏడుగురు కోసల దేశానికి అధిపతులు అవుతారు.
అపుడు వైడూర్యపతులు నిషధదేశానికి ఏలికలు అవుతారు. పురంజయుడు మగధదేశ ప్రభువుగా ప్రభవిస్తాడు. పుళిందులూ, యదువంశస్థులూ మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మజ్ఞాన హీనులూ హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యాలు కలిగిస్తాడు. శక్తిశౌర్యసమన్వితులైన క్షత్రియుల వంశాలను తొక్కిపెట్టి పద్మావతీనగరం రాజధానిగా చేసుకుని గంగనుంచి ప్రయాగవరకూ ఉన్న భూమిని పరిపాలిస్తాడు.
శూద్రప్రాయులైన రాజులు, సంస్కారరహితులు, నాస్తికులు అయిన బ్రాహ్మణులు, సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, అర్భుదము, మాళవము అనే దేశాలకు ప్రభులు అవుతారు. సిందుతీరంలోను, చంద్రభాగ పరిసరాలలోను, కాశ్మీరదేశంలోను, మ్లేచ్ఛ రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలు ఉండవు. ధర్మము, సత్యము, దయ ఉండవు. పెచ్చరిల్లిన క్రోధ మాత్సర్యాలతో స్త్రీలనూ బాలకులనూ గోవులనూ బ్రాహ్మణులనూ వధించడానికి సైతం వెనుతీయరు. పరధనాశక్తి, పరవనితాశక్తి కలిగి రజోగుణంలోనూ తమోగుణంలోనూ మునిగి అల్పాయువులు, అల్పబలులు అవుతారు. శ్రీవిష్ణు పాదపద్మ మకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరాలు పెంచుకుని యుద్ధాలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ కాలంలోని ప్రజలు కూడ వారి వేషభాషలను శీలవృత్తులను అనుకరిస్తారు.