పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కవి సంభాషణ

  •  
  •  
  •  

11-41-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము.

టీకా:

మఱియున్ = ఇంకను; సకల = సమస్తమైన; జంతు = జీవ; సంతానంబు = జాతుల; కంటెన్ = కంటెను; మానుష = మానవునిగా; ఆకారంబున్ = జన్మము; ఒందుట = పొందుట; దుర్లభంబు = కష్టము; అంత = దాని; కంటెన్ = కంటెను; నారాయణ = హరి; చరణ = పాద; యుగళ = ద్వయమును; స్మరణ = ధ్యానించుట యందు; పరాయణులు = ఆసక్తి కలవారు; అగుట = ఔట; దుష్కరంబు = మరీకష్టము; కావునన్ = కనుక; ఆత్యంతికంబు = అత్యుత్తమమైనది; అగు = ఐన; క్షేమంబున్ = క్షేమమును గురించి; అడుగవలసె = అడగవలసి వచ్చినది; పరమేశ్వరుండు = భగవంతుడు; ప్రపత్తి = శరణాగతి {ప్రపత్తి - నీవేతప్ప వేరు దిక్కు లేదనుట}; నిష్ఠులు = నిష్ఠ కలవారి; కున్ = కి; సారూప్యంబు = తనరూపమే; ఎట్లు = ఏ విధముగ; ఒసంగున్ = ఇచ్చును; ఆ = ఆ; తెఱంగు = విధమును; ఆనతిండు = చెప్పండి; అనిన = అని అడగగా; విని = విని; విదేహ = విదేహుడు అను; భూపాలున్ = రాజు; కున్ = కి; హరి = విష్ణుమూర్తి; కథ = గాథలు అనెడి; అమృత = అమృతమును; పాన = తాగి; అతి = మిక్కిలి; పరవశులు = పరవశంపొందినవారు; ఐన = అయిన; ముని = ఋషుల; సమాజంబు = సమూహము; అందున్ = లోని; కవి = కవి; అను = అనెడి; మహానుభావుడు = గొప్పవాడు; ఇట్లు = ఇలా; అని = అని; చెప్పన్ = చెప్పుట; తొడంగె = మొదలెట్టెను; అరిషడ్వర్గంబు = అరిషడ్వర్గము {అరిషడ్వర్గము - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము అను ఆరు గుణములుశత్రు సమూహము వంటివి}; అందున్ = వాటిలో; ఈషణత్రయంబు = ఈషణత్రయము {ఈషణత్రయము - 1దారేషణ 2ధనేషణ 3పుత్రేషణ మూడు కోరికలు తగులములు}; చేతన్ = వలన; తగులుపడి = చిక్కుకుపోయి; మాత్సర్య = మాత్సర్యముతో; యుక్త = కూడిన; చిత్తుండు = మనసు కలవాడు; అగునట్టి = ఐన; వాని = వాడి; కిన్ = కి; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; అచ్యుత = శ్రీహరి; పాద = పాదములనెడి; అరవింద = పద్మములను; భజనంబు = భక్తి; సంభవించు = కలుగును; విశ్వంబును = జగత్తు; ఆత్మయు = ఆత్మా; వేఱు = వేరు; కాన్ = అయినట్లు; భావించు = అనుకొనెడి; వాని = అతని; కిన్ = కి; భీరుత్వంబు = భయము, బెదురు; ఎట్లు = ఏ విధముగ; లేదు = లేకుండాపోవును; అవిద్యా = అవిద్య అనెడి; అంధకార = చీకటిలో; మగ్నులు = మునిగినవారి; కున్ = కి; హరి = విష్ణు; చింతనంబు = భక్తి; ఎట్లు = ఎలా; సిద్ధించున్ = లభించును; అట్టి = అటువంటి; నరుండు = మానవుడు; తొంటి = పూర్వపు; కళేబరంబు = శరీరాన్ని; విడిచి = వదలిపెట్టి; పరతత్వంబు = పరమపదాన్ని; ఏ = ఏ; భంగిన్ = విధముగా; చేరున్ = అందుకొనగలడు; ముకుళీకృత = ముసుకున్న; నేత్రుండు = కళ్లుకలవాడు; అయిన = ఐన; నరుండు = మానవుడు; మార్గ = దోవలో; భ్రమణంబునన్ = తిరుగుటలో; తొట్రుపాటుపడి = తూలిపోతు; చను = వెళ్ళెడి; చందంబునన్ = విధముగా; విఙ్ఞాన = విఙ్ఞానముచేత; విమల = శుద్ధమైన; హృదయ = మనసులోని; భక్తిభావనా = భక్తిభావనకు; వశంబు = కూడినది; లేకున్న = లేకపోతే; పరమపదంబు = మోక్షము; వీరి = వీరి; కిన్ = కి; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; కలుగును = లభించును; అని = అని; అడిగితివి = అడిగావు; కావునన్ = కనుక; చెప్పెదన్ = తెలియజెప్పెదను; సావధానుండవు = శ్రద్ధకలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము.

భావము:

అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటె మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను.