పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : శ్రీకృష్ణ నిర్యాణంబు

  •  
  •  
  •  

11-122-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.

టీకా:

అనుచున్ = అనుచు; ఆ = ఆ యొక్క; దారుకుండు = దారుకుడు; నిర్వేదన = దుఃఖములో; పరుండు = మునిగినవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; విన్నవించెన్ = అనెను; యాదవ = యాదవసైన్యము అనెడి; సముద్రంబు = సముద్రము; అడంగె = నశించినది; బంధు = బంధువులు; గురు = గురువులు; మిత్ర = మిత్రులు ఐన; జనంబులు = వారు; అక్కడక్కడన్ = చెల్లాచెదురై; పోయిరి = పోయారు; ద్వారక = ద్వారకానగరము; కున్ = కు; పోయి = వెళ్ళి; సుహృత్ = హితులైన; జనంబులు = వారి; తోడన్ = తోటి; ఏమందును = ఏమిచెప్పను; అని = అని; పలుకు = అనుచున్న; సమయంబునన్ = సమయమునందు; దివ్య = దివ్యమైన; ఆయుధంబులును = ఆయుధాలు; దివ్య = భవ్యమైన; రథ = రథము; రథ్యంబులు = గుఱ్ఱములు; అంతర్ధానంబునొందెన్ = మాయమైపోయెను; నారాయణుండు = కృష్ణుడు; వాని = అతని; తోన్ = తోటి; అక్రూర = అక్రూరుడు; విదురుల = విదురుడుల; కున్ = కు; ఈ = ఈ; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = సమస్తము; చెప్పుము = తెలుపుము; సవ్యసాచిన్ = అర్జునుని {సవ్యసాచి - రెండు చేతులతో బాణములు వేయగలవాడు, అర్జునుడు}; కని = కలిసి; స్త్రీ = స్త్రీలను; బాల = పిల్లలను; గురు = పెద్దలను; వృద్ద = ముసలి ఐన; జనంబులన్ = వారిని; కరిపురంబు = హస్తినాపురమున; కున్ = కు; కొని = తీసుకొని; చనుము = పొమ్ము; అనుము = అనిచెప్పు; పొమ్ము = ఇకనీవు వెళ్ళు; అనినన్ = అని చెప్పగా; వాడును = అతను; మరలి = వెనుదిరిగి; చని = వెళ్ళి; కృష్ణుని = కృష్ణుని; వాక్యంబులున్ = మాటలను; సవిస్తారంబుగా = వివరముగా; చెప్పెన్ = చెప్పెను; అట్లు = అలా; చేయున్ = చేసెడి; ఆలోనన్ = సమయమునకు; ద్వారకానగరంబున్ = ద్వారకానగరము; పరిపూర్ణ = పూర్తిగా నిండిన; జలంబు = నీరు కలది; ఐ = అయ్యి; మునింగెన్ = ములిగిపోయెను; అంతన్ = తరువాత; ఎంతవారికి = ఎంతటివారికైనను; చనన్ = వెళ్లుటకు; రాక = శక్యముకాకుండ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ యొక్క; పరమేశ్వరుండును = కృష్ణుడు; శతకోటి = నూరుకోట్ల; సూర్య = సూర్యులకుసమానమైన; దివ్య = దివ్యమైన; తేజః = తేజస్సుతో; విభాసితుండు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; వెడలి = బయలుదేరి; నారద = నారదుడు; ఆది = మొదలగు; ముని = మునుల; గణంబులును = సమూహములు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మున్నగు; దేవతలును = దేవతలు; జయజయ = జయజయ అనెడి; శబ్దంబులన్ = రవములతో; తోడన్ = కూడా; కదిలి = బయలుదేరి; రాన్ = రాగా; నిజ = తన; పదంబున = లోకమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను; ఆ = ఆ ప్రసిద్ధుడైన; నారాయణ = కృష్ణుని; విగ్రహంబు = స్వరూపము; జలధి = సముద్రపు; ప్రాంతంబునన్ = ప్రదేశమునందు; జగన్నాథున్ = జగన్నాథుని; స్వరూపంబు = స్వరూపముకలది; ఐ = అయ్యి; ఉండెను = ఉండెను; అని = అని; శుకుండు = శుకుడు; పరీక్షిన్నరేంద్రున = పరీక్షన్మహారాజున; కున్ = కు; చెప్పెను = చెప్పెను; అని = అని; చెప్పి = చెప్పి.

భావము:

అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది.
అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.