పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అవధూత సంభాషణ

  •  
  •  
  •  

11-101-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము; మిథిలా నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు; దానివలనం గొంత పరిజ్ఞానంబుఁ గంటి? నదెట్లనిన నమ్మానిని ధనకాంక్ష జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొనిచని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మ సుఖంబు సేయునతండె భర్త యని చింతించి నారాయణు నిట్లు చింతింప నతని కైవల్యంబు సేరవచ్చు నని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారం బని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిసి ముక్తురాలయ్యె నని యెఱింగించి.

టీకా:

ఇందుల = దీని; కున్ = కి; పురాతన = ప్రాచీన; వృత్తాంతంబు = కథ; కలదు = ఉన్నది; సావధాన = శ్రద్ధగా ఉన్న; చిత్తుండవు = మనస్సుకలవాడవు; ఐ = అయ్యి; వినుము = వినుము; మిథిలానగరంబునన్ = మిథిలానగరములో; పింగళ = పింగళ; అను = అనెడి; గణికా = వేశ్యలలో; రత్నంబు = ఉత్తమురాలు; కలదు = ఉన్నది; దాని = ఆమె; వలనన్ = వలన; కొంత = కొంత; పరిఙ్ఞానంబున్ = విఙ్ఞానమును; కంటిన్ = పొందాను; అది = అది; ఎట్లు = ఎలా; అనినన్ = అంటే; ఆ = ఆ; మానిని = యువతి; ధన = డబ్బు మీది; కాంక్షన్ = వాంచ; చేసి = వలన; ఆత్మ = తన; సఖుని = ప్రియుణ్ణి; మొఱంగి = మోసపుచ్చి; ధనంబున్ = డబ్బులు; ఇచ్చు = ఇచ్చెడి; వానిన్ = వాడిని; చేకొని = మరిగి; నిజ = తన; నికేతన = ఇంటి; అభ్యంతరంబున్ = లోపలి; కున్ = కి; కొని = తీసుకొని; చని = వెళ్ళి; రాత్రి = రాత్రులందు; నిద్ర = నిద్ర; లేకుండుచు = పోకుండ; పుటభేదన = పట్టణపు; విపణి = వ్యాపార; మార్గంబులన్ = వీథులలో; పర్యటనంబు = తిరుగుట; సలుపుచున్ = చేస్తూ; నిద్రా = నిద్రకి; ఆలస్యభావంబునన్ = జాగుజరుగుటచేత; జడనుపడి = నీరసపడిపోయి; అర్థా = ధన; ఆపేక్షన్ = కాంక్షకు; తగిలి = తగుల్కొని; తిరిగి = తిరిగి తిరిగి; అలసి = అలసిపోయి; ఆత్మన్ = తనకు; సుఖంబు = సౌఖ్యములు; చేయున్ = చేసెడి; అతండె = అతనుమాత్రమే; భర్త = భర్త; అని = అని; చింతించి = ఆలోచించుకొని; నారాయణున్ = విష్ణుమూర్తిని; ఇట్లు = ఈ విధముగ; చింతింపన్ = స్మరించినచో; అతని = అతని; కైవల్యంబు = పరమపదమును; చేరవచ్చును = చెందవచ్చును; అని = అని; విచారించి = తర్కించుకొని; నిజ = తన; శయనస్థాన = పడకటిల్లు; ఆదికంబున్ = మొదలైనవాటిని; వర్జించి = విడిచిపెట్టి; వేగిరంబ = తొందరలోనే; వాసుదేవ = వాసుదేవుని; చరణ = పాదములనెడి; అరవింద = పద్మములకు; వందన = నమస్కరించవలెనని; అభిలాషిణి = కోరుకొనునామె; ఐ = అయ్యి; దేహంబు = శరీరము; విద్యుత్ = మెరుపు; ప్రకారంబు = వంటిది; అని = అని; చింతించి = తర్కించుకొని; పరమతత్త్వంబు = పరమాత్మ; అందున్ = అందు; కీలుకొలిపి = లగ్నముచేసి; ముక్తురాలు = మోక్షముపొందినామె; అయ్యెన్ = అయినది; అని = అని; ఎఱింగించి = తెలియజెప్పి.

భావము:

దీనికొక ప్రాచీన కథ ఉంది. శ్రద్ధగా విను. మిథిలానగరంలో పింగళ అనే వేశ్యామణి ఉంది. ఆమె వలన కొంత పరిఙ్ఞానాన్ని పొందాను. ఎలాగ అంటే, ఆ వనిత డబ్బుమీది ఆశతో తన ప్రియుడిని మోసపుచ్చి ధనమిచ్చే మరొక విటుడిని మరిగింది. వాడిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలేకుండా ఊర్లమ్మట, వీధులమ్మట విహరించింది. నిద్ర లేకపోవటం వలన బాగా నీరసించింది. ధనకాంక్షతో తిరిగితిరిగి అలసిపోయింది. చివరకు ఆత్మసుఖం కలిగించేవాడే భర్త అని గ్రహించుకుంది. నారాయణుడిని కనుక ఇలా చింతిస్తే కైవల్యాన్ని చెందగలను కదా, అని విచారించింది. తన శయన గృహాన్ని, సమస్త సంపదలను త్యజించింది. వాసుదేవుడి పాదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై, శరీరం మెరుపులా అశాశ్వతమైన దని నిశ్చయించుకుంది. పరతత్వం మీద మనస్సు లగ్నంచేసుకుని, ముక్తురాలైంది. అని శ్రీకృష్ణుడు వివరించాడు.