దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు
- ఉపకరణాలు:
అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.
టీకా:
అట్లు = ఆ విధముగ; కృష్ణుండు = కృష్ణుడు; వారలన్ = వారిని; చూచు = చూడవలెనని; వేడ్కన్ = కుతూహలముతో; నిజ = తన; స్యందనన్ = రథముపై; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు; వామదేవ = వామదేవుడు; అత్రి = అత్రి; కృష్ణ = కృష్ణద్వైపాయనుడు; రామ = పరశు రాముడు; అసిత = అసితుడు; అరుణ = అరుణుడు; దివిజగురు = బృహస్పతి; కణ్వ = కణ్వుడు; మైత్రేయ = మైత్రేయుడు; చ్యవనలును = చ్యవనులు; నేనునున్ = నేను; మొదలైన = మొదలగు; మునులున్ = ఋషులు; అనుగమింపన్ = అనుసరించుచుండగా; చనుచున్ = వెళ్తూ; తత్తత్ = ఆయా; దేశ = దేశ మందలి; నివాసులు = ఉండువారు; అగు = ఐన; ఆనర్తక = ఆనర్తకము; ధన్వ = ధన్వము; కురు = కురు; జాంగల = జాంగలము; వంగ = వంగ; మత్స్య = మత్స్య; పాంచాల = పాంచాల; కుంతి = కుంతి; మధు = మధు; కేకయ = కేకయ; కోసలాది = కోసల; ఆది = మున్నగు; భూవరులు = రాజులు; వివిధ = నానావిధములైన; వస్తు = వస్తువుల; ప్రచయంబున్ = పెద్దసమూహములను; కానికలు = బహుమతులుగ; ఇచ్చి = ఇచ్చి; సేవింపన్ = కొలువగా; గ్రహ = శుక్రాది గ్రహముల; మధ్య = నడుమ; గతుండు = ఉండువాడు; ఐ = అయ్యి; దీపించి = ప్రకాశించెడి; సూర్యునిన్ = సూర్యుడిని; పోలి = సరిపోలి; ఆ = ఆ దివ్యమైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; మందస్మిత = చిరునవ్వు కల; సుందర = అందమైన; వదన = ముఖము అను; అరవిందుడు = పద్మము కలవాడు; అగుచున్ = ఔతు; వారలన్ = వారిని; కరుణన్ = దయారసము వలన; అర్ద్ర = తడియైన; దృష్టిన్ = చూపులతో; చూచి = చూసి; యోగక్షేమంబులు = కుశలప్రశ్నలు; అరసి = అడిగి; సాదర = ఆదరపూర్వకమైన; భాషణంబులన్ = మాటలతో; ఆదరించుచున్ = మన్నించుచు; కతిపయి = అనేక; ప్రయాణంబులన్ = ప్రయాణములతో; చనిచని = వెళ్ళి; విదేహనగరంబున్ = విదేహనగరమును; డాయన్ = దగ్గరకు; చనుటయున్ = వెళ్ళగా; ఆ = ఆ; బహుళాశ్వుండు = బహుళాశ్వుడు; ఆ = ఆ దివ్యమైన; మాధవున్ = కృష్ణుని; రాకన్ = వచ్చుటను; విని = విని; మనంబునన్ = మనసునందు; హర్షించుచున్ = సంతోషించుచు; వివిధ = నానావిధములైన; పదార్థంబులున్ = వస్తువులు; కానికలుగాన్ = కానుకలుగా; కొని = తీసుకొని; తానునున్ = అతను; శ్రుతదేవుండును = శ్రుతదేవుడు; ఎదురుగాన్ = ఆహ్వానించుటకు ఎదురు; చనుదెంచి = వచ్చి; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:
శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలానగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖ్యులూ వెళ్ళారు. వారిలో నేనూ ఉన్నాను. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. గ్రహాలనడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసంచేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణంచేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శ్రుతదేవునితోపాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు...