దశమ స్కంధము - ఉత్తర : సకలరాజుల శిక్షించుట
- ఉపకరణాలు:
ఆ తఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్ మృగ
వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న
ట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబులతోడఁ గూడి ని
ర్ధూత కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్.
టీకా:
ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; భూరి = మిక్కుటమైన; బాహుబల = భుజబలము కలవారు; ఐన = అయిన; విరోధి = శత్రు; నరేశ్వరుల్ = రాజులు; మృగ = జంతు; వ్రాతములు = జాలములు; ఒక్క = ఒక్క; పెట్టన్ = సారిగా; మృగరాజ = సింహపు {మృగరాజు - మృగములలో మిక్కిలి పరాక్రమము కలది, సింహము}; కిశోరము = పిల్ల; పైన్ = మీదకి; ఎదిర్చిన = దాడిచేసిన; అట్ల = విధముగా; ఆతురులు = ఆతురత కలవారు; ఐ = అయ్యి; చతుర్విధ = చతురంగములతో; సమగ్ర = సంపూర్ణమైన; బలంబుల్ = సైన్యములతో; తోడన్ = తోటి; కూడి = కలిసి; నిర్ధూత = పూర్తిగాతొలగిన; కళంకుడు = దోషములు కలవాడు; ఐన = అయిన; నవతోయజనేత్రునిఁ = కృష్ణుని {నవ తోయజ నేత్రునడు - నవ (అప్పుడే పూసిన) తోయజ (పద్మములవంటి) నేత్రుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; చుట్టుముట్టినన్ = తాకి కమ్ముకోగా.
భావము:
ఆ తరుణంలో మహా బాహుబల విక్రములు అయిన ఆ రాజులందరూ చతురంగబలాలతో కూడి ఒక్కపెట్టున వనమృగాలు మృగేంద్రుని ఎదిరించిన రీతిగా నిర్మలుడు అయిన శ్రీకృష్ణుడిని చుట్టుముట్టారు.