దశమ స్కంధము - ఉత్తర : లక్షణ ద్రౌపదీ సంభాషణంబు
- ఉపకరణాలు:
పాంచాలితో మద్రపతిసుత యిట్లను-
"సంగీతవిద్యా విశారదుండు
నారదుచేతి వీణాస్వనకలిత మై-
నట్టి గోవింద కథామృతంబు
దవిలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు-
నొంది మోదించుచు నుండునంత
దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని-
సదుపాయ మొక్కటి మదిఁ దలంచి
- ఉపకరణాలు:
చదల నెబ్భంగి నైన గోచరము గాక
వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు
మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత
వారి కై నను దివ్వ మోవంగరాని.
టీకా:
పాంచాలి = ద్రౌపది; తోన్ = తోటి; మద్రపతిసుత = లక్షణ {మద్రపతిసుత - మద్రదేశ రాజు యొక్క పుత్రిక, లక్షణ}; ఇట్లు = ఈ విధముగ; అను = చెప్పెను; సంగీత = సంగీత; విద్యా = విద్య యందు; విశారదుండు = మిక్కిలి నేర్పరుడు; నారదు = నారదునియొక్క; చేతి = చేతిలోని; వీణ = మహతి అను వీణ {మహతి - నారదుని వీణ}; ఆస్వన = ధ్వనితో; కలితము = కూడిన; ఐనట్టి = అయిన; గోవింద = కృష్ణుని; కథా = కథ అనెడి; అమృతంబున్ = అమృతమునందు; తవిలి = ఆపేక్ష కలామెను ఐ; ఏన్ = నేను; క్రోలి = ఆస్వాదించి; చిత్తమున్ = మనస్సునందు; తన్మయత్వంబు = తన్మయత్వము; ఒంది = పొంది; మోదించుచున్ = సంతోషించుచు; ఉండున్ = ఉన్నట్టి; అంతన్ = సమయమునందు; దుహితృ = కూతురి ఎడల; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; మత్ = నా యొక్క; గురుడు = తండ్రి; తాన్ = అతను; అది = ఆ విషయము; విని = విని; సత్ = మంచి; ఉపాయము = ఉపాయము; ఒక్కటి = ఒకదానిని; మదిన్ = మనసునందు; తలంచి = ఆలోచించి.
చదలన్ = ఆకాశమునందు; ఏ = ఎలాంటి; భంగిన్ = విధముగా నైనను; అగోచరము = కనబడనిది; కాకన్ = అగునట్లు; వారి = నీటి; మధ్యము = నడుమ; లోన్ = అందు; అభివ్యాప్తిన్ = ప్రతిఫలించుటచేత; తోచు = కనబడెడి; మత్స్యయంత్రంబున్ = మత్స్యయంత్రమును; కల్పించి = ఏర్పరచి; మనుజులు = మానవులు; ఎంత = ఎంతగొప్ప; వారి = వారల; కిన్ = కి; ఐననున్ = అయినప్పటికి; తివ్వన్ = ఇవతలికిలాగుటకు; మోవంగన్ = యత్నించుటకు; రాని = శక్యముకాని.
భావము:
“మద్ర రాజు పుత్రిక లక్షణ పాంచాల రాజు పుత్రి ద్రౌపదితో ఇలా అన్నది, “నారదుడు సంగీత విద్యలోనూ, తన మహతీ వీణాలాపనలలోనూ మహాపండితుడు. సతత గోవిందనామ పారాయణుడు. అట్టి మహతీ స్వన మాధుర్యంతో కూడిన నారదుడు చేసే ముకుందుని కధాసుథలు తనివితీరా గ్రోలి పరవశించేదానిని. కూతురుపై ఎంతో వాత్యల్యం గల వాడు నా తండ్రి, ఈ విషయం తెలిసి నా మనసు గ్రహించాడు. నా వివాహానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకాశంలో కంటికి కానబడని విధంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటుచేసి, క్రింద ఉన్న నీటిలో అది ప్రతిబింబించేలాగ ఏర్పాటు చేయించాడు. ఎవరైనా సరే చేపను ఆ నీటిలోని ప్రతిబంబం ద్వారా తప్ప కనిపెట్ట లేరు.