పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకపంచకమున కరుగుట

  •  
  •  
  •  

10.2-1044-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంత్యారట్ట, కేరళాది భూపతులును; మఱియుం దక్కిన రాజవరులును హితులును; నంద గోపాది గోపాలురును; గోపికాజనంబులును; ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, గాంధారీ, కుంతీ, పాండవ, తద్దార నివహ, సంజయ, విదుర, కృప, కుంతిభోజ, విరాట, భీష్మక, నగ్నజి, ద్ద్రుపద, శైబ్య, ధృష్టకేతు, కాశిరాజ, దమఘోష, విశాలాక్ష, మైథిల, యుధామన్యు, సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగాననేకులు నుగ్రసేనాది యాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ.

టీకా:

మున్న = అంతకు ముందు; చనుదెంచి = వచ్చి; ఉన్న = ఉన్నట్టి; మత్స్య = మత్స్యము; ఉశీనర = ఉశీనరము; కోసల = కోసలము; విదర్భ = విదర్భము; కురు = కురువు; సృంజయ = సృంజయము; కాంభోజ = కాంభోజము; కేకయ = కేకయము; మద్ర = మద్రము; కుంతి = కుంతి; ఆరట్ట = ఆరట్టము; కేరళ = కేరళము; ఆది = మున్నగు; భూపతులు = దేశాధిపులును; మఱియున్ = ఇంకను; తక్కిన = మిగిలిన; రాజ = రాజ; వరులును = ఉత్తములు; హితులును = ఆప్తులు; నంద = నందుడు అను; గోపా = గోపాలుడు; ఆది = మున్నగు; గోపాలురును = యాదవులు; గోపికా = గోపస్త్రీల; జనంబులును = సమూహములు; ధర్మరాజ = ధర్మరాజుతో; అనుగతులు = కూడవచ్చినవారు; ఐ = అయ్యి; వచ్చిన = వచ్చినట్టి; భీష్మ = భీష్ముడు; ద్రోణ = ద్రోణుడు; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుడు; గాంధారీ = గాంధారీ; కుంతీ = కుంతీ; పాండవ = పాండవులు; తత్ = వారి; దార = భార్యల; నివహ = సమూహములు; సంజయ = సంజయుడు; విదుర = విదురుడు; కృప = కృపాచార్యుడు; కుంతిభోజ = కుంతిభోజుడు; విరాట = విరాటుడు; భీష్మక = భీష్మకుడు; నగ్నజిత్ = నగ్నజిత్తు; ద్రుపద = ద్రుపదుడు; శైబ్య = శైబ్యుడు; ధృష్టకేతు = ధృష్టకేతు; కాశిరాజ = కాశిరాజు; దమఘోష = దమఘోషుడు; విశాలాక్ష = విశాలాక్షుడు; మైథిల = మైథిలుడు; యుధామన్యు = యుధామన్యుడు; సుశర్మలును = సుశర్మలు; సపుత్రకుండు = పుత్రులతో కూడినవాడు; ఐన = అయిన; బాహ్లికుండును = బాహ్లికుడు; మొదలుగా = మొదలైన; అనేకులును = పెక్కుమంది; ఉగ్రసేన = ఉగ్రసేనుడు; ఆది = మున్నగు; యాదవ = యాదవవంశపు; ప్రకరంబులన్ = సమూహములను; పూజలన్ = సేవించుటలతో; తృప్తులన్ = సంతృప్తి చెందినవారిగా; చేసినన్ = చేయగా; వారునున్ = వారుకూడ; ప్రముదిత = మిక్కిలి సంతోషించిన; ఆత్ములు = మనస్సులు కలవారు; ఐరి = అయ్యారు; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.

భావము:

వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగు వారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆరట్ట, కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులూ; శ్రేయోభిలాషులు; నందగోపాది గోపాలకులూ; ధర్మరాజుతో కలసివచ్చిన భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సతీ సమేతులైన పాండవులు; సంజయుడు, విదురుడు, కృపాచార్యులు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు, శైబ్యుడు, ధృష్టకేతుడు, కాశిరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, యుధామన్యువు, సుశర్మలును; పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు; మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ సమయంలో....