పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకపంచకమున కరుగుట

  •  
  •  
  •  

10.2-1039-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న, గద, సాంబ, సుచంద్ర, శుక, సారణానిరుద్ధ, కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; నిష్కర్ములు = కర్మాతీతులు; ఐన = అయిన; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణులు; లోక = లోకము నందలి; ధర్మా = ఆచారములను; అనుపాలన = అనుసరించు టందు; ప్రవర్తనులు = మెలగువారు; ఐ = అయ్యి; ద్వారకానగర = ద్వారకాపట్టణము; రక్షణంబున్ = రక్షణ; కున్ = కొరకు; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు; గద = గదుడు; సాంబ = సాంబుడు; సుచంద్ర = సుచంద్రుడు; శుక = శుకుడు; సారణా = సారణుడు; అనిరుద్ధ = అనిరుద్ధుడు; కృతవర్మ = కృతవర్మ; ఆది = మున్నగు; యోధ = వీర; వరులన్ = ఉత్తములను; నియమించి = అనిపి; తామున్ = వారు; అక్రూర = అక్రూరుడు; వసుదేవ = వసుదేవుడు; ఉగ్రసేనా = ఉగ్రసేనుడు; ఆది = మొదలగు; సకల = సమస్తమైన; యాదవులున్ = యాదవులును; కాంతా = భార్యలతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; స్రక్ = పూలదండలు; చందన = గంధము; ఆభరణ = భూషణములు; వస్త్ర = బట్టలు; ఆదులు = మున్నగునవి; ధరియించి = ధరించి; శోభన = శుభకరమైన; ఆకారంబులన్ = స్వరూపముల; తోడన్ = తోటి; పుష్పకవిమానంబుల = పుష్పకవిమానములను; అనన్ = అన్నట్లు; పొలుచు = ఉండెడి; అరదంబులను = రథములను; మేఘంబులన్ = మేఘములను; అనుకరించు = పోలెడి; గజంబులను = ఏనుగులను; మనః = మనసుతో సమానమైన; వేగంబులు = వేగములు కలవి; ఐన = అయిన; తురగంబులన్ = గుఱ్ఱములను; ఎక్కి = ఎక్కి; వియచ్చరులన్ = దేవతలను {వియచ్చరులు - వియత్ + చరులు (శ్చుత్వ సంధి), ఆకాశ గమనులు, దేవతలు}; పురుడించు = సరిపోలెడి; పురుషులున్ = పురుషులు; తమ్మున్ = వారిని; సేవింపన్ = కొలుచుచుండగా; చని = వెళ్ళి; ఆ = ఆ; పుణ్య = పవిత్రములైన; తీర్థంబులన్ = జలము లందు; అవగాహనంబు = స్నానములు; చేసి = చేసి; ఉపవసించి = ఉండి; అనంతరంబ = పిమ్మట.

భావము:

బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. పిమ్మట....