దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట
- ఉపకరణాలు:
ఈ పురుషోత్తమున్, జగదధీశు, ననంతుని, సర్వశక్తుఁ, జి
ద్రూపకు, నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్,
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?"
టీకా:
ఈ = ఆ దివ్యమైన; పురుషోత్తముని = పురుషశ్రేష్ఠుని; జగదధీశున్ = సర్వలోకాలకధీశుని; అనంతుని = మేరలేనివానిని; సర్వశక్తున్ = సమస్తమైన శక్తులు కలవానిని; చిద్రూపకున్ = ఙ్ఞానస్వరూప మైనవానిని; అగ్రపూజన్ = అగ్రపూజతో; పరితోషితున్ = సంతోషించినవానిగా; చేయన్ = చేసినచో; సమస్త = ఎల్ల; లోకముల్ = లోకములు; వేన్ = శీఘ్రమే; పరితుష్టిన్ = పూర్ణతృప్తిని; పొందున్ = పొందుతాయి; పృథవీవర = రాజా; కావునన్ = కాబట్టి; నీవు = నీవు; కృష్ణునిన్ = కృష్ణుడిని; శ్రీపతిన్ = లక్ష్మీపతిని; పూజచేయుము = పూజింపుము; ఎడచేయక = ఆలస్యము చేయకుండ; మాటలు = మాటలు; వేయున్ = అనేకములు; ఏటికిని = ఎందుకు.
భావము:
ఓ రాజా! పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.”