దశమ స్కంధము - ఉత్తర : నాగ్నజితి పరిణయంబు
- ఉపకరణాలు:
చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.
టీకా:
చేలము = వస్త్రమును; చక్కన్ = చక్కగా బిగించి; కట్టుకొని = కట్టుకొని; చిత్ర = వింతలైన; గతిన్ = గమనములతో; వడిన్ = వేగముగా; ఏడు = ఏడు (7); మూర్తులు = రూపములు పొందినవాడు; ఐ = అయ్యి; బాలుడు = చిన్నపిల్లాడు; దారు = చెక్క; రూపములన్ = బొమ్మలను; పట్టెడు = పట్టుకొను; కైవడిన్ = రీతిగా; పట్టి = పట్టుకొని; వీరశార్దూలుడు = కృష్ణుడు {వీరశార్దూలుడు - వీరులలో పులి వంటి వాడు, కృష్ణుడు}; గ్రుద్ది = పిడికిటి పోటులు వేసి; నేలన్ = నేలమీద; పడద్రోసి = పడగొట్టి; మహా = మిక్కిలి; ఉద్ధతిన్ = గొప్పదనముతో; కట్టి = బంధించి; ఈడ్చెన్ = ఈడ్చెను; భూపాలకులు = రాజులు; ఎల్లన్ = అందరు; మెచ్చన్ = మెచ్చుకొనగా; వృషభంబులన్ = ఆంబోతులను; పర్వత = కొండలను; సన్నిభంబులన్ = సరిపోలువానిని.
భావము:
శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్రరీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి ఏడు వృషభాలను పట్టుకుని గ్రుద్ది, క్రుమ్మి, అవలీలగా నేల మీదకు కూలద్రోసి, కట్టి ఈడ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు.