పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియుని పూర్వకథ

  •  
  •  
  •  

10.1-709-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది కారణంబుగాఁ గాళియుం డా మడుఁగు జొచ్చియున్న, గో మనుజ రక్షణార్థంబు కృష్ణుం డతని వెడలించె; నిట్లు దివ్య గంధాంబర సువర్ణ మణిగణ మాలికాలంకృతుండయి, మడుఁగు వెడలివచ్చిన మాధవుం గని, ప్రాణలాభంబులం బొందిన యింద్రియంబులం బోలె, యశోదారోహిణీ సమేతలయిన గోపికలును, నంద సునందాదులయిన గోపకులును మూర్ఛలం బాసి, తేఱి తెప్పఱిలి, లేచి పరమానందంబులం బొందిరి; బలభద్రుండు తమ్ముని యాలింగనంబుఁ జేసె; నప్పుడు.

టీకా:

అది = దాని; కారణంబుగాన్ = నిమిత్తముచేత; కాళియుండు = కాళీయుడు; ఆ = ఆ ప్రసిద్ధమైన; మడుగున్ = మడుగును; చొచ్చి = చేరి; ఉన్నన్ = ఉండుటచేత; గో = గోవులను; మనుజ = మానవులను; రక్షణా = కాపాడుట; అర్థంబున్ = కోసము; కృష్ణుండు = కృష్ణుడు; అతనిన్ = అతనిని; వెడలించెన్ = వెడలగొట్టెను; ఇట్లు = ఈ విధముగ; దివ్య = బహుగొప్ప; గంధ = పరిమళ లేపనములు; అంబర = వస్త్రములు; సువర్ణ = బంగారపు; మణి = రత్నాల; గణ = సమూహముచేత; మాలిక = హారములచేతను; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; అయి = ఐ; మడుగున్ = మడుగునుండి; వెడలివచ్చిన = బయటకు వచ్చిన; మాధవున్ = కృష్ణుని; కని = చూసి; ప్రాణలాభంబులన్ = తిరిగి దక్కిన ప్రాణములు; పొందిన = పొందినట్టి; ఇంద్రియంబులున్ = ఇంద్రియముల; పోలెన్ = వలె; యశోదా = యశోదాదదేవి; రోహిణీ = రోహిణీదేవిలతో; సమేతలు = కూడినవారు; ఐన = అయిన; గోపికలును = గోపికాస్త్రీలు; నంద = నందుడు; సునంద = సునందుడు; ఆదులు = మొదలగువారు; అయిన = ఐన; గోపకులును = గొల్లలు; మూర్ఛలన్ = బాధా పరవశు లగుట; పాసి = తొలగి; తేఱి = తేరుకొని; తెప్పఱిల్లి = స్తిమితపడి; లేచి = పైకిలేచి; పరమానందంబులన్ = మిక్కిలి సంతోషములను; పొందిరి = పొందిరి; బలభద్రుండు = బలరాముడు; తమ్మునిన్ = తమ్ముడిని; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసెన్ = చేసెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

అందుచేత, కాళీయుడు ఈ మడుగులో ప్రవేశించి ఉంటున్నాడు. కృష్ణుడు గోవులను గోపాలకులను రక్షించడానికి, అతనిని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. ఈ విధంగా దివ్యగంథాలు, వస్త్రాలు, మణిహారాలు అలంకరించుకుని మాధవుడు మడుగులో నుంచి బయటకు వచ్చాడు. అలా మడుగు నుండి వచ్చిన కృష్ణుని చూడగానే ఇంద్రియాలకు ప్రాణాలు వచ్చినట్లు ఆ బృందావనంలోని ప్రజలు అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. యశోద రోహిణుల తోపాటు గోపికలు; నందుడు, సునందుడూ మొదలైన గోపకు లందరూ మూర్ఛల నుంచి తేరుకుని తెప్పరిల్లి లేచి పరమానందం పొందారు. బలరాముడు తమ్ముడిని కౌగలించుకున్నాడు.