పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియుని పూర్వకథ

  •  
  •  
  •  

10.1-708-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్ను సౌభరి యను ముని యీ హ్రదంబునఁ-
పము జేయుచు నుండ రణిలోన
నాఁకలిగొని పన్నగాంతకుఁ డొకనాడు-
నుదెంచి యందుల లచరేంద్రు
నొడిసి భక్షించిన నున్న మీనము లెల్ల-
ఖిన్నంబులై వగఁ గ్రిస్సి యున్నఁ
జూచి యా మునిరాజు శోకించి కోపించి-
రుడుఁడు నేడాది గాఁగ నిందుఁ

10.1-708.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జొచ్చి మీనంబులను మ్రింగఁజూచెనేనిఁ
చ్చుఁగావుత మని యుగ్రశాప మిచ్చెఁ
గాళియుం డొక్కఁడా శాపథ నెఱుంగు
నితర భుజగంబు లెవ్వియు నెఱుఁగ వధిప!

టీకా:

మున్ను = పూర్వము; సౌభరి = సౌభరి; అను = అనెడి; ముని = ఋషి; ఈ = ఈ యొక్క; హ్రదంబునన్ = మడుగునందు; తపమున్ = తపస్సు; చేయుచుండన్ = చేయుచుండగా; ధరణి = భూలోకము; లోనన్ = అందు; ఆకలిగొని = ఆకలేసి; పన్నగాంతకుడు = గరుడుడు {పన్నగాంతకుడు - పన్నగము (పాము) లకు అంతకుడు (యముని వంటి వాడు), గరుడుడు}; ఒక = ఒకానొక; నాడున్ = దినమున; చనుదెంచి = వచ్చి; అందులన్ = దానిలో; జలచరేంద్రున్ = చేపలరాజును; ఒడిసి = ఒడుపుగాపట్టుకొని; భక్షించినన్ = తినివేయగా; ఉన్న = మిగిలిన; మీనములు = చేపలు; ఎల్లన్ = అన్ని; ఖిన్నంబులు = దుఃఖించుచున్నవి; ఐ = అయ్యి; వగన్ = విచారముతో; క్రిస్సి = చిన్నబోయి; ఉన్నన్ = ఉండగా; చూచి = కనుగొని; ఆ = ఆ యొక్క; ముని = మునులలో; రాజు = శ్రేష్ఠుడు; శోకించి = బాధపడి; కోపించి = ఆగ్రహించి; గరుడుడు = గరుత్మంతుడు; నేడు = ఈదినము; ఆదిగాగాన్ = మొదలుకొని; ఇందున్ = దినిని; చొచ్చి = ప్రవేశించి.
మీనంబులను = చేపలను; మ్రింగన్ = తినవలెనని; చూచెనేని = యత్నించినచో; చచ్చుగావుతము = మరణించుగాక; అని = అని; ఉగ్ర = భయంకరమైన; శాపమున్ = శాపమును; ఇచ్చెన్ = పెట్టెను; కాళియుండు = కాళీయుడు; ఒక్కడు = ఒకడుమాత్రమే; ఆ = ఆ; శాప = శాపము యొక్క; కథన్ = వృత్తాంతమును; ఎఱుంగున్ = తెలిసి ఉండెను; ఇతర = అన్యములైన; భుజగంబులు = పాములు; ఎవ్వియున్ = ఏవికూడ; ఎఱుంగవు = ఎఱుగవు; అధిప = మహారాజ.

భావము:

పూర్వము సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు ఒకనాడు ఆకలివేసి, ఈ మడుగు దగ్గరకు వచ్చాడు. ఇందులో ఉన్న చేపలరాజును పట్టుకుని చంపి తిన్నాడు. మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఏడుస్తూ ఉంటే, ఆ మహర్షి వాటి శోకం చూసి, చాలా బాధపడ్డాడు. అతడు కోపంతో “ఈ నాటి నుండి గరుత్మంతుడు వచ్చి ఇందులో ఉన్న చేపలను మ్రింగడానికి ప్రయత్నించా డంటే వెంటనే చచ్చిపోతాడు” అని భయంకరమైన శాపం ఇచ్చాడు. కాళీయుడు ఒక్కడికే ఈ శాపం గురించి తెలుసు. మిగిలిన పాములకు తెలియదు.