పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నాగకాంతలు స్తుతించుట

  •  
  •  
  •  

10.1-687-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుం డీతఁడు మంచివాఁ డనుచుఁ జెప్పన్ రాము క్రూరుండు దు
శ్శీలుండౌ నవు నైన నేము సుభగశ్రీఁ బాసి వైధవ్య దు
ష్టాలంకారముఁ బొంద నోడెద మనాథాలాప మాలింపవే?
చాలున్ నీ పద తాండవంబు; పతిభిక్షం బెట్టి రక్షింపవే?

టీకా:

బాలుండు = అమాయకుడు; ఈతడు = ఇతను; మంచివాడు = యోగ్యుడు; అనుచున్ = అని; చెప్పన్ = చెప్పుటకు; రాము = వచ్చిన వారము కాము; క్రూరుండు = చెడ్డమనసు కలవాడు; దుశ్శీలుండున్ = చెడు నడవడిక గలవాడు; ఔనవున్ = అవును; ఐనన్ = అయినప్పటికి; నేము = మేము; సుభగ = అయిదవతనమను; శ్రీన్ = సంపదను; పాసి = తొలగి; వైధవ్య = వైధవ్యము అనెడి; దుష్ట = చెడ్డ; అలంకారమున్ = అలంకారమును; పొందన్ = పొందుటకు; ఓడెదము = భయపడుచున్నాము; అనాథ = నీవు తప్ప దిక్కులేనివారి; ఆలాపమున్ = వేడ్కొనుటను; ఆలింపవే = వినుము; చాలున్ = ఇక చాలును; నీ = నీ యొక్క; పద = అడుగుల; తాండవంబు = లయబద్ధ ప్రక్షేపములు; పతిభిక్షన్ = భర్త అనెడి భిక్షను; పెట్టి = అనుగ్రహించి; రక్షింపవే = కాపాడుము.

భావము:

ఈ కాళీయుడు అమాయకుడు, మంచివాడు అనడం లేదు. నిజమే! ఇతడు క్రూరుడు, దుష్టుడు. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని అసహ్య రూపాలతో ఉండే వైధవ్యం పొందలేము. మేము అనాథలము. మా దీనాలాపాలను మన్నించు. ఇక నీ పాదతాడనాలు చాలించు. పతిభిక్ష పెట్టి మమ్ము పాలించు!