పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ధేనుకాసుర వధ

  •  
  •  
  •  

10.1-630-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గోపికలు సాదరంబుగం జూడ వ్రీడాహాస వినయంబులం జూచుచుం గ్రీడాగరిష్ఠుండైన ప్రోడ గోష్ఠంబు ప్రవేశించె; నంత రోహిణీ యశోదలు కుఱ్ఱలవలని మచ్చికలు పిచ్చలింప నిచ్చకువచ్చిన ట్లయ్యై వేళల దీవించిరి; వారును మజ్జనోన్మర్దనాదు లంగీకరించి, సురభి కుసుమ గంధంబులు గైకొని, రుచిర చేలంబులు గట్టికొని, రసోపపన్నంబు లయిన యన్నంబులు గుడిచి, తృప్తు లయి, మంజులశయ్యల సుప్తులై యుండి; రందు.

టీకా:

ఇట్లు = ఇలా; గోపికలు = గోపస్త్రీలు; సాదరంబుగన్ = మన్ననతో; చూడన్ = చూచుచుండగా; వ్రీడా = సిగ్గుచేతను; హాస = నవ్వులచేతను; వినయంబులన్ = అణకువలతో; చూచుచున్ = చూస్తూ; క్రీడా = క్రీడించు టందు; గరిష్ఠుండు = గొప్పవాడు; ఐన = అయిన; ప్రోడ = బహు సమర్థుడు; గోష్ఠంబున్ = మంద యందు; ప్రవేశించెన్ = చేరెను; అంతన్ = ఆ తరువాత; రోహిణీ = రోహిణీదేవి; యశోదలు = యశోదాదేవి; కుఱ్ఱల = కుమారుల; వలని = ఎడలి; మచ్చిక = మోహములు; పిచ్చలింపన్ = అతిశయింపగా; ఇచ్చకు వచ్చినట్లు = అత్యధికముగా (ఇష్టం వచ్చినట్టు); అయ్యై = ఆయా; వేళలన్ = సమయము లందు; దీవించిరి = ఆశీర్వదించిరి; వారును = వారుకూడ; మజ్జన = స్నానములు చేయించుట; ఉన్మర్దన = గంధం పూతలు పూయుటలు; ఆదులు = మున్నగునవి; అంగీకరించి = గ్రహించి; సురభి = మంచివాసన కలిగిన; కుసుమ = పూలు; గంధంబులున్ = గంధములు; కైకొని = స్వీకరించి; రుచిర = పరిశుద్దమైన; చేలంబులున్ = బట్టలు; కట్టికొని = కట్టుకొని; రస = షడ్రస {షడ్రసములు - 1కషాయము (వగరు) 2మధురము (తీపి) 3లవణము (ఉప్పు) 4కటువు (కారము) 5తిక్తము (చేదు) 6ఆమ్లము (పులుపు)}; ఉపపన్నంబులు =పూర్ణములు; అయిన = ఐన; అన్నంబులు = ఆహారములు; కుడిచి = భుజించి; తృప్తులు = తృప్తిచెందినవారు; అయి = అయ్యి; మంజుల = మృదువైన; శయ్యలన్ = పక్కలమీద; సుప్తులు = నిద్రించినవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; అందున్ = ఆ తరువాత.

భావము:

ఇలా గోపికలు తనను ప్రేమతో చూస్తూ ఉంటే లీలా పాటవ మూర్తి కృష్ణమూర్తి వారిని సిగ్గుతోనూ, చిరునవ్వుతోనూ, వినయంతోనూ చూస్తూ గొల్లపల్లెలో ప్రవేశించాడు. అప్పుడు రోహిణి యశోదలు కుమారుల యందలి ప్రేమ పొంగిపొరలగా మనసుతీరా వారిని దీవించారు. బలరామకృష్ణులు నలుగుపెట్టి తలంటు పోయించుకున్నారు. చక్కని సువాసనలు వెదజల్లే పూవులను గంధాలను అలంకరింప జేసుకున్నారు. అందమైన దుస్తులు తొడగి కొన్నారు. ఎన్నో రుచులతో రసవంతమైన భోజనం తిన్నారు. తృప్తిగా భుజించిన తరువాత సుఖమైన శయ్యలపై నిద్రపోయారు. అంతట. . .