పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : ఆలకదుపుల మేప బోవుట

  •  
  •  
  •  

10.1-597-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యెడఁ గృష్ణుం డొక్కనాడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు జేయ, మ్రోల నాలకదుపుల నిడుకొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, కుసుమ మకరంద నిష్యంద పానానం దేందిందిర కదంబంబును, గదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును, గులవిరోధరహిత మృగపక్షిభరితంబును, భరితసరస్సరోరుహపరిమళమిళిత పవనంబును నైన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె.

టీకా:

ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; కృష్ణుండు = శ్రీకృష్ణమూర్తి; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; రేపకడ = ఉదయము; లేచి = నిద్రలేచి; వేణువున్ = మురళిని; పూరించి = ఊది; బలభద్ర = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; గోప = గొల్ల; కుమారులు = పిల్లలు; తన్నున్ = అతనిని; బహు = అనేక; వారంబులు = మార్లు; కైవారంబులు = స్తుతించుటలు; చేయన్ = చేయగా; మ్రోలన్ = ముందర; ఆల = ఆవుల; కదుపలన్ = మందలను; ఇడుకొని = ఉంచుకొని; నిరంతర = ఎల్లప్పుడును; ఫల = పండ్లు; కిసలయ = చిగుళ్ళు; కుసుమంబులును = పూలు కలది; కుసుమ = పూలనుండి; నిష్యంద = కారుతున్న; మకరంద = పూదేనె; పాన = తాగుటచేత; ఆనంద = సంతోషించుచున్న; ఇందిందిర = తుమ్మెదల; కదంబంబును = గుంపు కలది; కదంబ = కడిమిచెట్టు; ఆది = మున్నదు; నానా = అనేక రకముల; తరు = చెట్లు; లతా = తీగల యొక్క; గుల్మ = పొదల యొక్క; సంకులంబును = సందడి కలది; కుల = జాతి; విరోధ = వైరము; రహిత = లేనట్టి; మృగ = జంతువులచేత; పక్షి = పక్షులచేత; భరితంబును = నిండి ఉన్నది; భరిత = నిండైన; సరస్ = సరస్సు లందలి; సరోరుహ = తామరపూల యొక్క {సరోరుహము - సరస్సునందు పుట్టునది, తామరపూవు}; పరిమళ = సువాసనతో; మిళిత = కూడిన; పవనంబును = గాలి కలది; ఐన = అయినట్టి; వనంబున్ = అడవిని; కని = చూసి; అందున్ = దానిలో; వేడుకన్ = వినోదముగా; క్రీడింపన్ = విహరించవలెనని; నిశ్చయించి = అనుకొని; వెన్నుండు = విష్ణువు, కృష్ణుడు; అన్న = సోదరుని; కిన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా ఉండగా ఒక రోజు, కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేసాడు. గోపకుమారులు అందరూ వెంటనే మేలుకుని లేగల మందలను తోలుకుని కృష్ణుడి వద్దకు చేరారు. బలరాముడు, కృష్ణులతో కలసి గోపబాలకులు తనను పదేపదే పొగడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అవ్ని ఋతువులలోనూ పళ్ళు పూలు చిగుళ్ళు లభిస్తాయి. పూవులలో తేనెలు పొంగిపొరలుతూ ఉంటే ఆ తీయతేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక రకాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు, ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సుల లోని నీళ్ళు చక్కని తామర పూల పుప్పొడి పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారు అయిన బలరాముడితో ఇలా అన్నాడు.