పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట

  •  
  •  
  •  

10.1-545-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండ సుకుమారంబైన శరీరముతోడ నేలఁ జాగిలంబడి మణిగణ సుప్రకాశంబు లైన తన కిరీటశిఖరప్రదేశంబు లా కుమారుని పాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజల పూరంబుల నతని యడుగులు గడిగి మఱియును.

టీకా:

కని = చూసి; సంభ్రమించి = హుషారుచెంది; విరించి = బ్రహ్మదేవుడు; రాయంచన్ = హంస వాహనమునుండి; డిగ్గనుఱికి = దుమికి దిగి; కనక = బంగారపు; దండ = కడ్డీవలె మెరిసెడి; సుకుమారంబు = కోమలము; ఐన = అయినట్టి; శరీరము = దేహము; తోడన్ = తోటి; నేలన్ = భూమిపైన; సాగిలపడి = సాష్టాంగనమస్కారము చేసి; మణి = రత్నాల; గణ = సమూహములచే; సు = మంచి; ప్రకాశంబులు = మెరిసిపోయెడివి; ఐన = అయిన; తన = అతని యొక్క; కిరీట = కిరీటముల; శిఖర = పైవైపుకొనల; ప్రదేశంబులు = భాగములు; ఆ = ఆ యొక్క; కుమారుని = బాలుని; పాద = పాదములు అనెడి; పద్మంబులు = పద్మములు; మోవన్ = తాకునట్లుగ; మ్రొక్కి = నమస్కరించి; తోరంబులు = అధికములు; అగు = ఐన; ఆనంద = ఆనందమువలన కలిగిన; బాష్పజల = కన్నీటి; పూరంబులన్ = ప్రవాహములచే; అతని = అతని; అడుగులు = అడుగులను; కడిగి = కడిగి; మఱియును = ఇంకను.

భావము:

కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దభాలున క్రిందికి దూకాడు. బంగారు శలాకు వలె రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిలపడ్డాడు. ఎన్నోమణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగ మ్రొక్కేడు. ఆనందబాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని పాదాలు కడిగాడు. ఆపైన. . .