పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట

  •  
  •  
  •  

10.1-530-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మందం గల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై
యెందుం బోవరు; లేవ రిప్పుడును; వేఱే చేయ నా కన్యు లొం
డెందున్ లేరు; విధాతలుం బరులు; వీ రెవ్వార లెట్లైరొకో?
యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్.

టీకా:

మందన్ = గుంపుగా; కల్గిన = ఉన్నట్టి; వత్స = దూడలు; బాలకులు = పిల్లలు; నా = నా యొక్క; మాయా = మాయ అనెడి; గుహా = గుహ యందుల; సుప్తులు = మునిగినవారు; ఐ = అయ్యి; ఎందున్ = ఎక్కడికిని; పోవరు = వెళ్ళలేరు; లేవరు = మేలుకొనలేరు; ఇప్పుడును = ఇప్పటికి కూడ; వేఱే = ఇంకొకలా; చేయన్ = చేయుటకు; నా = నా; కున్ = కు; అన్యులు = సాటివారు; ఒండు = ఇంకొకరు; ఎందున్ = ఎక్కడను; లేరు = లేరు; విధాతలున్ = సృష్టికర్తలు; పరులు = అన్యులు; వీరు = వీరు; ఎవ్వారు = ఎవరు; ఎట్లు = ఎలా; ఐరి = కలిగిరో, పుట్టిరో; ఒకో = ఏమో; ఎందున్ = ఎక్కడనుండి; ఏతెంచిరొ = వచ్చితిరో ఏమో; కృష్ణు = కృష్ణుని; తోన్ = తోపాటు; మెలగు = వర్తించెడి; వారు = వాళ్ళు; ఏడయ్యెడిన్ = ఎలా కలిగారు, ఏడాది అయిపోయింది; నేటికిన్ = ఇవాళ్టికి.

భావము:

ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో?